My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, June 04, 2007

పెద్దలూ బహుపరాక్!

అబ్బాయో అమ్మాయో పుట్టారన్న సంతోషం వారు పుట్టినప్పుడు కాక ఆ పిల్లలు పెరిగి పెద్దవారై, ప్రయోజకులై మంచిపేరు తెచ్చుకున్నప్పుడే తల్లిదండ్రులకు కలుగుతుందని అనుభవజ్ఞులు చెబుతారు. తమకు సంతానభాగ్యం కలగగానే వారిని జాగ్రత్తగా క్రమశిక్షణతో పెంచి ఎలా వృద్ధిలోకి తీసుకురావాలా అనే తల్లిదండ్రులు నిరంతరం ఆలోచిస్తుంటారు. అందుకోసం ఎన్నో ప్రణాళికలు ఊహల్లో సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పిల్లల పెంపకం అంత తేలికైన పనేమీ కాదు. తామొకటి తలిస్తే పిల్లలు మరొకలా తలవటం, తామొకటి చేయమంటే పిల్లలు మరొకటి చేసి తల్లిదండ్రులకు తలనొప్పులు కలిగించటం మామూలే. నయానో, భయానో పిల్లలను మంచిమార్గంలో నడిపించాలని తల్లిదండ్రులు నిత్యం తాపత్రయపడుతూనే ఉంటారు. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఇటువంటి మూగ పోరాటాలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. కృష్ణుడంతటివాడు తన చిలిపి పనులతో, అల్లరితో యశోదను విసిగించినవాడే. ''కలికి నీవు రావె చక్కని కంబుకంఠి రావె, మలయజ గంధి రావే నీవో మదన జనని రావె, ముద్దుగుమ్మ రావే నీవో మోహనాంగిరావే'' అని ఒకర్ని ఒకరు పిల్చుకొంటూ... గోపకాంతలు అంతా కలిసి యశోద దగ్గరకు వచ్చి ''వినవమ్మ యశోదమ్మ నీ వర తనయుడు చేసేటి దుడుకు పనులు, పట్టి విచారించబోతె భారత బాగోతమాయెను ఎట్లనే ఇక ఎట్లనే, యశోదమ్మ ఎట్లనే'' అంటూ ఫిర్యాదు చేస్తారు. కృష్ణుని అల్లరి కట్టించాలని యశోద రకరకాలుగా ప్రయత్నిస్తుంది. రోటికి కట్టివేస్తే ఆ రోలును ఈడ్చుకుపోయి మద్దిచెట్లను కూలుస్తాడు. బండికి కట్టివేస్తే ఆ బండి గుట్టు బయటపెట్టి శకటాసురుణ్ని సంహరిస్తాడు. మన్నుతిన్నావా అని అడిగితే తన నోట్లోనే విశ్వరూప సందర్శనం చేయిస్తాడు. చిన్నికృష్ణుని అల్లరి పనులన్నీ భాగవతంలోని మధుర సుధారస ధారలే. అందుకే అన్నారు దాశరథి- ''అసలు బతుక్కి ఆనందపు పొలిమేర పసితనం కాక మరేముంది చెప్పండి'' అని.
చదువు దగ్గరకొచ్చేసరికి కొంతమంది పిల్లలు మొరాయిస్తుంటారు. సామ దాన భేద దండోపాయాలుపయోగించి పిల్లలకు నాలుగు ముక్కలు నేర్పాలని ఉపాధ్యాయులు, నేర్పించాలని తల్లిదండ్రులూ ఆరాటపడుతూనే ఉంటారు. ''చక్కనైన బుద్ధి, చదువు రావలెనన్న నెప్పుడైన గొట్టి చెప్పవలయు'' అన్నది పాతకాలం సిద్ధాంతం. ''చక్కనైన బుద్ధి చదువు వచ్చు గాన, నెప్పుడైన గొట్టి చెప్పనేల'' అనేది ఇప్పటివారి అభిప్రాయం. ప్రహ్లాదుడు తాను కోరినవిధంగా చదువుకోవటం లేదని ఆగ్రహించిన హిరణ్యకశిపునితో- ''ఈ పాపని జదివింతుము నీ పాదములాన యింక నిపుణతతోడం గోపింతుము, దండింతుము కోపింపకుమయ్య దనుజకుంజర వింటే'' అంటారు చండామార్కులవారు. ఎంత కోపించినా దండించినా తనకు నచ్చిన చదువేకాని గురువులు చెప్పిన చదువు ఒంటపట్టించుకోకపోవటమే ప్రహ్లాదోపాఖ్యానంలోని విశేషం. పూర్వం ఒంటిమీద దెబ్బలు పడితేకాని చదువు బుర్రలోకెక్కదని గురువులు భావించేవారు. చిలకమర్తివారు సృష్టించిన గణపతి స్వయంగా బడి పెట్టదలచి ముందుగా, ''కాలవయొడ్డునకు బోయి మంచి యీత బెత్తములు రెండు, మూడు విరిచి యాకులూడదీసి నున్నగా జేసి యొకటి చేతబుచ్చుకొని బడికి వచ్చి'' కూర్చున్నాడట! బెత్తం దాస్తే పిల్లలు పాడైపోతారనేది అతని నమ్మకం. ఈ రోజుల్లో అటువంటి నమ్మకాలకు కాలం చెల్లిపోయింది.

'మొక్కయి వంగనిదే మానై వంగుతుందా' అని సామెత. పిల్లలకు క్రమశిక్షణ నేర్పేటప్పుడు తల్లిదండ్రులు తరచూ ఈ సామెత ప్రయోగిస్తుంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మంచి అలవాట్లు నేర్పాలనే తాపత్రయంతో ఒక్కొక్కసారి తిడతారు, కొడతారు. చదువు దగ్గరకొచ్చేసరికి 'దండం దశగుణం భవేత్' అనే నమ్మకం చాలామంది ఉపాధ్యాయులకు ఉంటుంది. పిల్లలను కొట్టనిదే చదువురాదని, దండిస్తేతప్ప పిల్లలు దోవలోకి రారని కొంతమంది భావిస్తుంటారు. ఆ నమ్మకంతోటే బెత్తానికి పనిచెబుతుంటారు. ఇటువంటివారి ఆటలికముందు సాగేట్లు లేవు. పిల్లలను హింసించటాన్ని నిషేధిస్తూ కేంద్రప్రభుత్వం ఓ బిల్లు తేవాలని సంకల్పించింది. ముసాయిదా బిల్లును మహిళా శిశుసంక్షేమశాఖ రూపొందించింది. ఆ బిల్లు చట్టరూపం దాలిస్తే పిల్లలను దండించే తల్లిదండ్రులకు శిక్షలు తప్పవు. మనవాళ్ళేకదా అని అబ్బాయినో అమ్మాయినో ఓ చెంపదెబ్బ కొడితే బిల్లు ప్రకారం కనీసం మూడేళ్ళ జైలుశిక్ష విధించవచ్చు. గరిష్ఠ శిక్ష ఏడేళ్ళ దాకా ఉంటుంది. పిల్లల్ని శారీరకంగాను; కోప్పడటం, తిట్టటం వంటి చర్యలతో మానసికంగాను హింసించటాన్ని నిరోధించటానికి బిల్లులో పలు శిక్షలు ప్రతిపాదించారు. లైంగికపరమైన వేధింపులతో సహా బాలలపై జరిగే హింసల గురించి స్పష్టమైన వివరాలను ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. చెంపమీద కొట్టడం, కాలితో తన్నడం, బెత్తంతో కొట్టడం వంటివన్నీ భౌతిక హింసకిందికి వస్తాయి. అనవసరంగా కోప్పడటం, తిట్టడం, మందలించడం వంటివన్నీ మానసిక హింసకిందికి వస్తాయి. పిల్లలను నగ్నంగా ఫొటోలు తీయడం, పిల్లలచేత పెద్దవారు తమ శరీర భాగాలను తడిమించుకోవటం వంటివన్నీ లైంగిక పరమైన హింస కిందికి వస్తాయి. అలాగే బాలికల పట్ల విచక్షణ కనబరచడం, వారికి సరైన ఆహారం పెట్టకపోవటం వంటివీ హింసగానే పరిగణిస్తారు. ముసాయిదా బిల్లును పరిశీలన కోసం న్యాయశాఖకు పంపారు. ఈ బిల్లు చట్టమైతే పాఠశాలలో ఉపాధ్యాయులూ పిల్లల్ని కొట్టేముందు ఆలోచించాల్సిందే. ఉల్లంఘిస్తే మూడేళ్ళ జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ఇటువంటి చట్టాలు అమెరికావంటి దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్నాయి. మనదేశంలో మాత్రం ఇప్పుడే ఇటువంటి ప్రయత్నాలు మొదలయ్యాయి.
(Eenadu:22:04:07)
_____________________________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home