వానా వానా వందనం...

వర్షర్తువు- సాహిత్యవర్ణనలకి అద్భుతమైన కొలువు. కవిసమయాలకి అందమైన నెలవు. 'కురిసేదాకా అనుకోలేదు- శ్రావణమేఘమని, తడిసేదాకా అనుకోలేదు- తీరని దాహమని' అని ఆశ్చర్యపడిన సినీకవి వేటూరి నుండి వెనక్కువెళ్ళేకొద్దీ- జాబితా ఆదికవి వాల్మీకి దాకా విస్తరిస్తుంది. 'అసలు శ్రావణమాస మధ్యమ్మునందు కురిసితీరాలి వర్షాలు. కొంచెకొంచెమేని, రాలాలి తుంపరులుయేని. కాని ఉక్క ఏ మాత్రము ఉండరాదు' అని కృష్ణశాస్త్రి కోరుకున్నారు. మనిషి స్వార్థాన్ని నిలదీస్తూ 'ఇక్కడ కురిసిన వర్షం ఎక్కడి మేఘానిది?' అని ప్రశ్నించారు జయప్రభ. పింగళి కాటూరి కవుల 'తొలకరి', ఇస్మాయిల్ 'రాత్రి వచ్చిన రహస్యపువాన' వంటివి యువతరం స్మృతిపథంలోని లేతచినుకులు- అనుకుంటే, వాల్మీకి కిష్కింధాకాండ. నన్నెచోడుడి 'కుమారసంభవం'.. వంటివి రసజ్ఞుల గుండెల్లో స్వాతి చినుకులు. పరమశివుని కోసం పార్వతి తపస్సు చేస్తుంటే- ఆమె పాపిట రాలిన వర్షబిందువు కిందకి జారి, నాభిదాకా ప్రయాణించిన వైనాన్ని వర్ణిస్తూ చెప్పిన- స్థితాఃక్షణం... నాభిం ప్రథమోద బిందవః శ్లోకంలో ఆమె స్థిరదీక్షా భంగిమను కాళిదాసు వర్ణించిన తీరు- రసజ్ఞతకు అమృత జీవధార. కాళిదాసుదేనని చాలామంది భావిస్తున్న ఘటకర్పర కావ్యంలో 'మేఘావృతం నిశి న భాతి నభో వితారం'... శ్లోకం వ్యంగ్యార్థపు చినుకుల్లోంచి రూపుదిద్దుకున్న స్వాతిముత్యం. కృష్ణదేవరాయల వర్షర్తువర్ణనమైతే ఒక దట్టమైన జడివాన. కృష్ణరాయల కవిత్వమే ఒక గొప్ప వర్షర్తువు- అన్నారొక భావుకపట్టభద్రుడు. వర్షర్తువు సాహిత్యాటవికి వసంతరుతువు. సాహిత్యపు విందులలో రుచికరమైన ఆధరువు.
వర్షం కురిసి వెలిసింది. మబ్బులు తెల్లబడ్డాయి. వాటి మధ్య ఒక సంధ్యారుణ రేఖ మెరిసింది. అదెలా ఉందో తెలుసా? చేతికి గాయమై, కట్టుకట్టినప్పుడు- చుట్టూ తెల్లగా ఉండి మధ్యలో ఎర్రగా ఉంటుందికదా! అలా ఉందన్నారు వాల్మీకి మహర్షి. అతి ప్రాచీనకావ్యంలో అధునాతన అభివ్యక్తిని ప్రదర్శించినది- వాల్మీకి అయితే, ఆధునిక కావ్యంలో ప్రాచీన వైదిక పరిమళాన్ని పరిచయం చేసినవారు శేషేంద్ర. అదే నిజానికి వర్షాల ప్రయోజనం కూడా! కవులంతా సౌందర్యాన్ని వర్ణించగా, వేదం మాత్రం వర్షం ప్రయోజనాన్ని ప్రకటించింది. గ్రీష్మకాలే దావాగ్ని నా దగ్ధప్రదేశే, అచిరకాలే వర్షర్తౌ వృష్టి పతనేన- భూయస్యః కోమల యుక్తాశ్చ ఓషధయః ప్రజాయన్తే!- గ్రీష్మరుతువులో దావాగ్ని కారణంగా దగ్ధమైన ప్రదేశాలన్నింటా వర్షాలు పడ్డాక కోమలమైన ఔషధీ లతలు, రోగనివారణా మూలికలు పూర్వంకన్నా అధికసంఖ్యలో పుట్టుకొస్తాయని వేదం చెప్పింది. ఇదీ వర్షం బాపతు పరమ ప్రయోజనం. భూమి తాలూకు పరమ సార్ధక్యం. రుతు పరిణామానికి ధన్యత అదే! దీన్ని దృష్టిలో పెట్టుకునే శేషేంద్ర ఆ పరిణామక్రమానికి ప్రణామాలు చేశారు- ఒక కవితలో... 'వర్షం వెళ్ళిపోయింది- మబ్బుల రథాలెక్కి/ జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు/ భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయట పెట్టి/ మొదటవచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది... కృతజ్ఞతతో...' అన్నారాయన. దీన్ని ఆకళించుకుంటే వర్షకళ లక్ష్యం బోధపడుతుంది. వానా వానా వందనం అని ఎందుకు మొక్కాలో తెలుస్తుంది.
(ఈనాడు, సంపాదకీయం, 08:06:2008)
_____________________________
Labels: Life/telugu
0 Comments:
Post a Comment
<< Home