My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, August 31, 2008

'ప్రాయ'స్నేహితులు!

ప్రాయం అనేమాటకు వయసు అనే అర్థంగాని, అన్నివయసులకీ ఆ మాట నప్పదు. ప్రాయమనేసరికి జిగి, బిగి కలగలసిన పడుచుదనం స్ఫురిస్తుంది. శరీరంలోకి పడుచుదనం ప్రవేశించడం నిజంగా ఒక ఉత్సవం. బతుక్కి తిరనాల. అందుకే ప్రాయంలోకి ప్రవేశించే కుర్రాళ్ళంతా గెడ్డాలు, మీసాలు త్వరగా వచ్చేయాలని ఆత్రపడతారు. తాము యువకులమయ్యామని ప్రపంచం గుర్తించడంకోసం నిక్కర్లలోంచి లుంగీల్లోకి మారతారు. అలాగే ఆడపిల్లలకీ గౌనుల్లోంచి పరికిణీల్లోకి మారడం మధురమైన అనుభూతి. శరీరంలో వచ్చే మార్పులు వారి మొహాలకు సిగ్గును పులిమి, మురిపాన్ని జోడిస్తాయి. అలా వయసు వాయనాలను అందుకున్న సుభద్ర మేనిసొగసులను విజయ విలాసంలో చేమకూర వేంకటకవి ముచ్చటగా చిత్రించాడు. 'ప్రాయపుటెక్కునన్‌...' అని మొదలుపెట్టి ఆ కొత్త యౌవన సోయగాలు ఎవరిని ఆకర్షించవంటూ 'ఏ ఎడ ఇంపుకావు, నవీన వయోవిలాసముల్‌?' అని ప్రశ్నించాడు. వాటిని 'నడమంత్రపు కలిమి'గా శ్లేషించాడు. అంతేకాదు- అర్జునుని అమాంతం పడకగదికి ఎత్తుకుపోయి, అతని బ్రహ్మచర్య దీక్షను భగ్నంచేసిన ఉలూచి వలపుఠేవను వర్ణిస్తూ, 'కులుకుగుబ్బల ప్రాయంపు కోమలి- అట వలచి వలపింపదే ఎంతవానినైన!' అంటూ వయసు మహిమను ప్రశంసించాడు. చేమకూర పద్యాలకు సౌష్ఠవం అందించిన 'ప్రాయం' పదప్రయోగం- 'పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటిదండాలు' సినీ గీతానికి కావ్యసౌరభం చేకూర్చింది. 'ప్రాయమింతకు మిగుల గైవ్రాలకుండ... కాశికాఖండమును తెనుగుచేసెదను' అని శ్రీనాథుడు దీక్షపూనాడు. 'వయస్‌' అంటే పక్షి అనే అర్థం కూడా ఉంది. పడుచు వయసు మనిషి ప్రతిభకు రెక్కలిస్తుంది. గరుత్మంతుణ్ని చేస్తుంది.

దీన్ని గ్రహించడంలో ముఖ్యంగా తల్లిదండ్రులు విఫలమవుతారు. 'ఢిల్లీకి రాజు అయినా, తల్లికి బిడ్డడే' అని సామెత. రామాయణం అంతా మథించినా, సూర్యమండలందాకా ఎగిరి రెక్కలు కాలి, వింధ్యపర్వతంపై కూలిపోయిన సంపాతి గుర్తుంటాడేగాని, పర్వతాన్ని పెళ్ళగించుకుని వచ్చిన హనుమంతుడి సామర్థ్యం తమ పిల్లల్లో ఉంటుందని వారు నమ్మలేరు. పిల్లలు స్వేచ్ఛగా రెక్కలు విప్పార్చి, నింగిలోకి దూసుకుపోతామంటే వారు అడ్డుకుంటారు. ప్రాయం చాలా ప్రమాదకరమైనదని వారి భయం. పాఠశాల నుంచి కళాశాలకు మారే వయసును సావాసాలు ప్రభావితం చేస్తాయి. శైశవానికి యౌవనానికి మధ్య వయసును వ్యసనాలు బలంగా ఆకర్షిస్తాయి. కాశీఖండంలో గుణనిధిని వయస్సే చెడగొట్టింది. 'అవినయ నిధానమగు నీ నవయౌవన, శైశవముల నడిమి వయసునన్‌ గవిసెడు వ్యసన ఉద్రేకంబు అవగాఢము(లోతైనది) దీని మానవయ్య తనూజ!' అని తల్లి మొత్తుకుంది. దీన్ని గ్రహించిన మన పెద్దలు చక్కని పరిష్కారం చెప్పారు. 'పిల్లవాడికి అయిదేళ్లు వచ్చేదాకా చక్రవర్తిలా లాలించండి. ఆపై పదేళ్లు క్రమశిక్షణతో పనిపాటలు నేర్పండి. పదహారు వస్తే ఇక వాడు పిల్లవాడు కాడు... మీ స్నేహితుడు. స్నేహంగా దగ్గరకు తీసుకుని, చక్కని సలహాలిస్తూ మంచిదారిలో నడిపించండి' అని హితవు పలికారు. తల్లిదండ్రులు మిత్రులైనప్పుడు పిల్లల పడుచుదనం ప్రతిభకు కొలువు అవుతుంది. సృజనకు నెలవు అవుతుంది. జాతికి పరువు అవుతుంది.

'పద్దెనిమిది, పాతిక మధ్య వయసు పెద్దరికానికి బాటలు వేస్తుంది. ఈ సమయంలో ఎన్నో స్వాభావిక గుణాలు, మైలురాళ్లు, పరిమితులు వాటంతట అవే అలవడతాయి. ఆశ్చర్యపరచే విజయాలు, ఆకస్మిక పరాజయాలు మనిషికి పరిణతిని సాధించిపెడతాయి' అంటున్నారు అమెరికాకు చెందిన వయోజనుల అభివృద్ధి ప్రాజెక్టు నాయకుడు రే సింప్సన్‌. ఇటీవల ఆయన నేతృత్వంలో జరిగిన అధ్యయనం ప్రకారం పాతికేళ్లు వస్తేనేగాని పరిపక్వత, సంపూర్ణ అవగాహన కలగడంలేదు. మన సమాజం పద్దెనిమిదేళ్లకు వయోజనుడిగా గుర్తించి ఓటుహక్కును కల్పిస్తోంది. స్త్రీలకైతే, అది పెళ్ళికి తగిన వయసు అంటోంది. పెద్దరికం మాత్రం ఇరవైఏళ్ళ తరవాతే అంటున్నారు డాక్టర్‌ సింప్సన్‌. 'ముసలివాళ్ళు ప్రతిదాన్నీ నమ్ముతారు. నడివయస్కులు ప్రతిదాన్నీ అనుమానిస్తారు. యువకులు ప్రతిదాన్నీ తెలుసుకుంటారు' అన్నాడు ప్రముఖ రచయిత ఆస్కార్‌ వైల్డ్‌. అలా తెలుసుకోవడానికి ఆలోచన అవసరం. ఆలోచనాశక్తిని పెంపొందించడం, పిల్లల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడం పెద్దల బాధ్యత. అరికట్టడం కాదు, వారి ఆలోచనలను సరిదిద్దడం మన విధి. 'చెట్లు బతుకుతున్నాయి, జంతువులు పక్షులు బతుకుతున్నాయి. కాని అద్భుతమైన ఆలోచనాశక్తితో నిండుగా జీవించే మనిషిదే- అసలైన బతుకు' అంది యోగవాసిష్ఠం. అలాంటి ఆలోచనాపరుడు గెలీలియో తన పద్దెనిమిదో ఏట పెండ్యులం సిద్ధాంతం ప్రకటించాడు. అలెగ్జాండర్‌ ఇరవయ్యో ఏట అధికారం చేపట్టాడు. వాషింగ్టన్‌ తన ఇరవైమూడోఏట దేశానికి రాయబారి అయ్యాడు. మన పిల్లలూ ఆ వయసులోనే విజేతలు కాగలరు- మనం సహకరిస్తే!
(ఈనాడు, సంపాదకీయం, 10:08:2008)
______________________________

Labels:

0 Comments:

Post a Comment

<< Home