తల్లిచాటు బిడ్డలు

బుచ్చమ్మను ముగ్గులోకి దింపడానికి కన్యాశుల్కం నాటకంలో గిరీశం ప్రయోగించిన ఠస్సా - ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం' అన్న సామెతకు అతికినట్లుగా సరిపోతుంది. అందులో కూడా సంతాన ప్రసక్తే ముఖ్యమైన అంశం. 'మాటవరసకు మనం పెళ్లాడతాం అనుకుందాం... మనకు చిన్ని పిల్లలు పుడతారు. నేను కుర్చీ మీద కూచుని రాసుకుంటూంటే వచ్చి వాళ్లు నా చెయ్యి పట్టుకు లాగి, 'నాన్నా ఇది కావాలి. అది కావాలి' అంటారు. మీరు బీరపువ్వులాగా వొంటి సరుకులు పెట్టుకుని, చక్కగా పసుపూ కుంకం పెట్టుకుని మహాలక్ష్మిలాగా పెత్తనం చేస్తూ ఉంటే, ఒక పిల్ల ఇటువైపు వచ్చి మెడ కౌగిలించుకునీ, ఒక పిల్ల అటువైపు వచ్చి మెడ కౌగిలించుకొనీ, అమ్మా ఇది కావాలి, అమ్మా అది కావాలి' అని అడుగుతారు. వాళ్లకి సరుకూ సప్పరా చేయించాలి...''- అదేదో సినిమాలో కాశ్మీరం నుంచి కొబ్బరిబొండాం అంటాడే ఆ స్థాయిలో గిరీశం బుచ్చమ్మను స్వప్న జగత్తులోకి ఎత్తేస్తాడు. మాయ మబ్బుల్లో తేలిపోతూ- కాబోయే పెళ్లి, పుట్టబోయే పిల్లలు, వాళ్లకు చేయబోయే సంబరాలు తలచుకుంటూ, బుచ్చమ్మ చులాగ్గా బోల్తాపడుతుంది. ఇప్పటి ఆధునిక యువతి బుచ్చమ్మ లాంటి వెర్రి వెంగళాంబ కాదు. ''మేఘ సందేశం ముందా, కుమారసంభవం ముందా'' అన్న పాతతరం చమత్కారాల్లోని హెచ్చరికల్ని ఒంటపట్టించుకుని, మేఘ సందేశాలను గిరిజా కల్యాణాలదాకా నడిపించిన తరవాతే కుమారసంభవానికి తెరతీస్తున్నారు. ఫిబ్రవరి 14 వేలెంటైన్స్ డే, (ప్రేమికుల దినం) నుంచి సరిగ్గా తొమ్మిది నెలలు తిరిగేసరికి నవంబర్ 14 బాలల రోజు వస్తుందన్న వాస్తవం స్పష్టంగా తెలుసుకుని మసలుకుంటున్నారు.
అలాంటి తెలివైన స్త్రీల చేతుల్లో పిల్లల భవిష్యత్తు పదిలంగా ఉంటుందని ఇటీవలి శాస్త్ర పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ హైఫాకు చెందిన శాస్త్రవేత్తలు మానవ సంబంధాలపై విస్తృతమైన పరిశోధనలు చేసి 'తల్లిచాటు బిడ్డలే సర్వ స్వతంత్రులు' అని తేల్చిచెప్పారు. 'సాధారణంగా తల్లిదండ్రుల నుంచి వేరుపడి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా, వారి జీవితాల్లో పెద్ద ఆనందాలేమీ ఉండవు... అదే తల్లిదండ్రులతో కలసి ఉండి, జీవితంలో స్థిరపడినవారికి మాత్రం తమ ఆనందాల్ని పంచుకునే వీలుంటుంది' అని ఆ బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ ఇరిట్ యానిర్ మైకు గుద్ది మరీ చెబుతున్నారు. ''నా వలె ఈతడు శాస్త్రపండితుడు కాదు. నిత్యదర్శకుడునూ కాదు. వీనికెటుల ఇట్టి గొప్ప జ్ఞానమబ్బె''నని ఆశ్చర్యపడుతున్న కౌశికుడికి మహాభారతంలో ధర్మవ్యాధుడు ''జననుత! వీరు నా జననియు జనకుండు సూవె, వీరలకు శుశ్రూష సేసి, ఇట్టి పరిజ్ఞాన మేను ప్రాప్తించితిన''ని వినయంగా జవాబిచ్చి, జ్ఞానబోధ చేస్తాడు. ప్రవరుడు తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ వారినెలా సేవించుకునేవాడో పెద్దన వివరించారు. మన ప్రాచీన వాంగ్మయం ఇలా తల్లిదండ్రులతో సహజీవనం చేసిన కొడుకుల సౌభాగ్యాన్ని గొప్పగా వర్ణిస్తుంది. ''తల్లిదండ్రులతో కలిసి ఉండటం, వారితో కలిసి భోజనం చేయడం, మాట్లాడటంవల్ల పిల్లలు తమలోని భావాల్ని పెద్దలతో పంచుకునే వీలుంది... క్లిష్ట పరిస్థితుల్లో వారికి తల్లిదండ్రుల అండ లభిస్తుంది... ఫలితంగా వారు మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ పనిచేసినా తల్లిదండ్రులతో నిర్భయంగా చర్చించే వీలు వారిలో స్వతంత్ర భావాల్ని తీసుకువస్తుంది'' అని డాక్టర్ ఇరిట్ యానిర్ స్పష్టంగా చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే పెళ్లి అనగానే వేరు కాపురాలు పెట్టి రకరకాలుగా దాంపత్య సుఖ జీవనసారం గ్రోలడం ఎలాగని తీవ్ర పరిశోధనలు జరిపిన తరాలన్నీ- ఇప్పుడు పిల్లల్ని పెంచడం ఎలాగన్న విషయంపై దృష్టిని కేంద్రీకరించవలసిన సమయం వచ్చిందనిపిస్తుంది. ఇటీవలి పోకడలు గమనిస్తే కనడం ఎలాగనేకన్నా పెంచడం ఎలాగనే దానిపైనే శ్రద్ధ పెరిగినట్లు తోస్తోంది. పెంపకం సరిగ్గా లేకుంటే 'కనిపించుట లేదు' అనే ప్రకటనల స్థానంలో ''కని-పెంచుట లేదు'' అనేవి చోటుచేసుకుంటాయని కొత్తతరం గుర్తించడం శుభ పరిణామం!
(Enadu,16:12:2007)
____________________________________
Labels: Life/ children / telugu
0 Comments:
Post a Comment
<< Home