My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, April 28, 2013

1122- భార'తీయదనం'


ఒకటి, రెండు, మూడు... గణితం. మూడు, రెండు, ఒకటి... వివాహ జీవితం! మూడుముళ్లతో ఇద్దర్నీ ఒక్కటి చేసే పెళ్ళి- ఆనందం 'జల్లులై కొల్లకొల్లలై/ పెల్లుబికి వెల్లివిరియ'జేసే పవిత్ర క్రతువు. అది అంకురారోపణంతో మొదలై నక్షత్రదర్శనందాకా కొనసాగి కన్యాదానం, కల్యాణ హోమం, జీలకర్ర- బెల్లం, మంగళసూత్రధారణం, పాణిగ్రహణం, తలంబ్రాలు, సప్తపది కలుపుకొని నవవిధ ప్రధాన శోభితం. విష్ణుపురాణ సంబంధిత నాయికా నాయకులు నర్మద, పురుకుత్సుల పరిణయ రమణీయత ప్రబంధ కవి స్మితశ్రీ అవలోకించినట్టు 'అగరు ధూపంబులు గగన భాగంబెల్ల/ సౌరభమ్ములు నింపి స్వాగతించె/ పట్టువస్త్రములపై పన్నీరు జిల్కింప/ సౌగంధికాపూర్ణ సౌఖ్యమిచ్చె'. ఎదుర్కోలు ఆహ్లాదభరితమనీ, ప్రాంగణమంతటా మోగిన మంగళవాద్యాలతో పెండ్లివేదిక సందడించిందనీ ఆ గళ సారాంశం. కమనీయ రీతిన సాగిన గోదా రంగనాథుల మనువూ నిత్య మననీయమే. దేవి గళాన శ్రీవారు మంగళసూత్రం కట్టడంతోనే- అక్కడంతా నవోత్సవం, మహోత్సాహం. 'నెలతయు పతియును కరముల/ నలవరచిరి కంకణంబు లన్యోన్యంబున్' అంటూ దాంపత్యబంధ ఘనతను ఆవిష్కరించారా కావ్యకర్త. ఆది దంపతులు గౌరీశంకరులది సత్య సనాతనత్వం, అర్ధనారీశ్వర సముదాత్త తత్వం. ధన్య చరితులు జానకీరాముల మది నిత్య ఏకాత్మకం. వారిది సముల్లసిత సౌభాగ్య సహిత మహిత మనోజ్ఞ జీవనం. చందనాల చల్లదనం, మకరందాల తియ్యదనం, సకల కళల చక్కదనం సమస్తం... ఆ ఆదర్శ జంటల సొంతం.

'నేను' నుంచి 'మన'లోకి రస హృదయాల్ని అలవోకగా తరలించుకుపోయే బహుచక్కటి ముచ్చట మనువొక్కటే. ఆ సరసమయ సామ్రాజ్యంలో ఆలూమగలిద్దరిదీ సమ భాగస్వామ్యం. ఆ క్రీడానంద జగతిలో నాటికీ నేటికీ ఏనాటికీ ఉభయులదీ ఘన విజయం. 'చిత్తచోరా! శ్రీయుతాకారా!' అని శ్రీకృష్ణుణ్ని ప్రస్తుతించిన రుక్మిణి ఆయనకు 'సోగకన్నుల రాణి, సౌభాగ్యవాణి, జీవిత కల్యాణి'. ప్రణయ పరిణయాల్లో విజయవిలాస యానం సాగించిన సుభద్రార్జునులదీ మహదానంద అనుభవమే. గిరికా వసురాజులది అనురాగోదయ వృత్తాంతమైతే, ధూర్జటి సందర్శించిన ఇందుమతీ వివాహ వైభవం నవనవానంద రసోదయం. మూడు పువ్వులూ ఆరు కాయలుగా రోజులు దొర్లిపోయేలా వేదికమీద ధ్వనిస్తాయి పెళ్ళినాటి ప్రమాణాలు. అంతకుముందు- తేనె, పెరుగు, బెల్లం కలగలిపిన మధుర పదార్థ సేవనం వరుడి నోటినీ మనసునూ తీపి చేస్తుంది. ఎదుర్కోలు వేళ, వధూవరుల ఉభయపక్షాల సమక్షంలో పానకమూ మధురాతిమధురమే. వరుడి కాళ్లు కడిగి జరిపే కన్యాదానం అతడి ధర్మకామార్థ సిద్ధికి మూలం. ప్రమాణాల్ని అతిక్రమించనంటూ ఆ అల్లుడు ముమ్మార్లు మామకు చేసే వాగ్దానమే సర్వ వేదోక్తం. ఇల్లంటే అనురాగాల నిలయమని, కుటుంబమంటే అనుబంధాల సమాహారమని చాటే ఆ వైనం కవి స్వరం పలికినట్టు 'యుగయుగాల జాతికి ఉజ్జీవనం/ జగజగాల జ్యోతికి సంభావనం'. భిన్నరుచులను మమేకం చేసేందుకే బెల్లమూ జీలకర్రా. కార్యక్రమ ఆరంభంలోనే 'బరువు కాదు- ఇది బాధ్యత' అన్నట్టు గంపలో వధువును తెచ్చి పెళ్ళిపీట దరికి చేరుస్తారు మేనమామలు. వధువు తల్లికి రక్తసంబంధ సోదరులైన మేనుమామలే వారు. వధువుకు వరుడు తాళికట్టే తరుణంలోనూ 'పెళ్ళంటే నూరేళ్ల పంట' అంటూ మంగళవాద్య ధ్వనులు. నూతన దంపతులపైన బంధుమిత్రాదులు కురిపించే అక్షతలు అ-క్షతాలు. పెద్దల దీవనలు కోరుతూ ఆ భార్యాభర్తలు నడిచే ఏడడుగులూ ఏడేడు జన్మల అనుబంధాలకు సూచికలు. వారు దర్శించే నక్షత్రమంత కాంతిప్రభ జీవితమంతా నిండి, కవిశ్రీ గీత మాధురిలా 'మమతామయివై సృష్టికి/ సమరస భావమ్ము నేర్పు సౌజన్యముతో/ రమణీయ రాగరంజిత/ సుమనోరథమెక్కి రమ్ము శోభనమూర్తీ' అని ఆహ్వానిస్తుంది.

చిలిపి నవ్వులూ కొంటె చూపులూ సరసాలూ మురిపాలూ పెళ్ళిరోజుకే పరిమితాలు కావు. పద్మరాగాల్లా, కుంద ప్రసూనాల్లా, ఇంద్రనీలాల్లా, పుష్పవర్షాల్లా శాశ్వత శోభితాలవి. లోకోత్తరులూ రాజవంశీకులైన సుచంద్ర, చంద్రికల పెళ్ళిఘట్టాన్ని స్మరణకు తెచ్చుకుంటే 'ఒకరి దరహాసం మరొకరికి మధుమాసం, ఒకరి చరణం మరొకరికి శశికిరణం'. అభినవ తార ఒకరైతే, రసమయ కాంతిధార మరొకరు. జడ అల్లి, బొట్టుపెట్టి, గంధంపూసి, వజ్రమాలిక వేసి- పెళ్ళికూతుర్ని చేశారామెను. రత్నాల పతకం, ముత్యాల బాసికం, కెంపుల ఉంగరం, రవ్వల భుజకీర్తితో అలంకరించారు అతణ్ని. అక్కడి ఆ అందాలూ ఆనందాలకు పరిమితులంటూ ఉంటాయా? అటువంటి భావగాఢతే పెద్దన రచనలో 'వలపుల సమత, తలపుల తనూలత'గా రూపుదిద్దుకుంది. భారతీయ వివాహ సంస్కారంలో, జంటతో చేయించే ప్రతి పనికీ ఓ అంతరార్థమూ ఓ పరమార్థమూ ఉంటాయి మరి. అందుకు ఎంతగానో స్పందించినందునే జపాన్ యువతి, యువకుడు భాగ్యనగరికొచ్చి మరీ తెలుగు సంప్రదాయ రీతిలో ఇటీవల పెళ్ళాడారు. చీర, ఉత్తరీయం అంచుల్ని కలిపి వేసిన ఆ బ్రహ్మముడితో ఇద్దరి జీవితాలూ హాయిహాయిగా తీయతీయగా చూపరుల కనుల పంటగా ముడివడ్డాయి. ఇక్కడి సంస్కృతి అపురూపమని, పెళ్ళిముస్తాబు అపూర్వమనీ మురిసిపోయారా ఇద్దరూ. మనసున మల్లెల మాలలూగించిన వారి ఆ అనుభవాల్ని చూసిన, విన్న ఎవరికైనా భారతీయతకు నమోస్తుతి చేయాలనిపించదూ


(ఈనాడు ,సంపాదకీయం , 31:03:2013)
____________________________________

Labels: , , , ,

0 Comments:

Post a Comment

<< Home