My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 08, 2007

నేటి తెలుగులో సంధి స్వరూపం

వాక్యమధ్యంలో పదాలను విసంధిగా రాయడం మంచిది.దానివల్ల పాఠకునికి శబ్ద మూలరూపం తెలుస్తుంది. ఈ విధంగానే క్రియా శబ్దాల విషయంలో కూడ విసంధిగా రాయడంవల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.మూలరూపంతో పదాలను వాక్యమధ్యంలో రాయటమే నేడు ప్రచురంగా కనిపిస్తుంది.కాబట్టి శబ్దానికి ఏకరూపాన్ని ప్రచారంలోకి తేవడం ఆధునిక ప్రయోజనాల దృష్ట్యా చాలా ముఖ్యం.

రెండు అక్షరాలమధ్య సంహిత- అంటే సంధి ఏర్పడే పట్టులను గూర్చి సంస్కృత వైయాకరుణులు ఈ విధంగా నిర్వచించారు

'సంహేతైక పదేనిత్యా/ నిత్యాధాతూప సర్గయో:/
నిత్యా సమాసే/ వాక్యేతు సా వివక్షామపేక్షతే/

పై విధి సంస్కృత భాషకు సంబంధించిందైనా, తెలుగు భాషకు గూడా చాలావరకు వర్తిస్తుంది.

[1]సంహేతైక పదేనిత్యా:
ఏకపదంలో అక్షరాలకు మధ్య సంధి నిత్యంగా జరుగుతుంది.
పుట్టి+ఎడు = పుట్టెడు
మూడు+అవ+మూడవ
గోరు+అంత=గోరంత
నిర్ణయ+ఇంచు=నిర్ణయించు
నిర్జి+ఇంచు=నిర్జించు

[2]నిత్యాధాతూప సర్గయో:/
సాధారణంగా తెలుగు ధాతువులన్ని 'ఉ ' అనే అచ్చుతో అంతమవుతాయి.కాబట్టి ధాతువులకు క్రియా ప్రత్యయాలు చేరేటప్పుడు ఆ ప్రత్యయాలు అచ్చులను ఆదిలో కలిగి ఉంటే ఉత్వసంధికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. పూర్వ పరాచ్చులు రెండింటి స్థానంలో పరాచ్చు ఆదేశంగా వస్తుంది.
ఇచ్చు+ఎను=ఇచ్చెను
కొట్టు=ఎను=కొట్టెను
చదువుతు+ఉన్నాను=చదువుతున్నాను
కొట్టు+ఇంచు=కొట్టించు
చేయు+ఇంచు=చేయించు
చదువు+ఇంచు=చదివించు
కొట్టు+అక=కొట్టక
తిట్టు+అక=తిట్టక

ఇక సంస్కృత పదాలతోబాటు ఉపసర్గలు(prefixes) కూడా తెలుగులోకి వచ్చాయి.కాబట్టి తత్సమ పదాల్లో సంస్కృతంలో లాగే ఉపసర్గలను శబ్దాలకు చేర్చేప్పుడు సంధి కార్యం నిత్యంగా జరుగుతుంది.
ప్రతి+ఏక=ప్రత్యేక
అభి+ఉదయం=అభ్యుదయం
సు+అగతము=స్వాగతము
అను+ఏషన=అన్వేషణ

[3]నిత్యా సమాసే/
సమాసంలోని పదాలమధ్య సంధి నిత్యంగా జరుగుతుంది.
చింత+ఆకు=చింతాకు
ఇల్లు+ఆలు=ఇల్లాలు
పీత+అంబరుడు=పీతాంబరుడు
రామ+ఆజ్ఞ=రామాజ్ఞ
సూర్య+ఉదయం=సూర్యోదయం

[4]వాక్యేతు సా వివక్షామపేక్షతే/
రచయిత తన ఇష్టాన్ని అనుసరించి వాక్య మధ్యంలో పదాలను విడివిడిగా రాసుకోవచ్చు. లేకుంటే పదాలకు మధ్య సంధినియమాలను పాటించనూవచ్చు.
ఉదాహరణకు ఈ కింది వాక్యాన్ని చూడండి.
'ఒకడు పరీక్షలో ఉత్తీర్ణుడు అయినాడు అనుకొందాం.'
ఈ వాక్యాంలోని పదాలకు మధ్య సంధి చేస్తే ఇలా ఉంటుంది:
'ఒకడు బరీక్షలో నుత్తీర్ణుడయినాడనుకొందాం. '
పై వివరణవల్ల తేలిందేమిటంటే వాక్య మధ్యంలో రెండు పదాలను కలిపి సన్నిహితంగా ఉచ్చరించడంగాని,రెండు శబ్దాలమధ్య కొంచెం కాలం ఆగి ఉచ్చరించడంగాని రచయిత ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. సన్నిహితంగా ఉచ్చరిస్తే సంధి కార్యం జరుగుతుంది. పదాలను వ్యవధానంగా ఉచ్చరిస్తే సంధి రాదు.కాని వాక్య మధ్యంలో పదాలను విడివిడిగా రాయడంవల్ల చాలా ఉపయోగం ఉంది.

ఇంగ్లీషు భాషలో 'MIRROR ' అనే మాట వాక్యంలో ఎక్కడైనా 'MIRROR' గానే వాడుతున్నాము.కాని తెలుగులో ' అద్దం ' అనే మాటను వాక్యారంభంలో ' అద్దం ' - అని రాస్తాము.కాని వాక్యమధ్యంలో ద్రుత ప్రకృతికం (నకారం అంతంలో ఉండే శబ్దాలు) తరువాత 'నద్దం ' అని రాస్తాము. అలాగే సంధి రాని చోట 'య్ 'ని ఆగమం చేసి 'యద్దం ' అని రాస్తాం. సామాన్య పాఠకుడు దీని మూల రూపం ఏదో తెలియక తికమక పడతాడు.కాభట్టి వాక్యమధ్యంలో పదాలను విసంధిగా రాయడం మంచిది.దానివల్ల పాఠకునికి శబ్ద మూలరూపం తెలుస్తుంది. ఈ విధంగానే క్రియా శబ్దాల విషయంలో కూడ విసంధిగా రాయడంవల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. 'ఉంది '- అనే క్రియా శబ్దాన్ని ద్రుతప్రకృతికం(నకారం అంతంలో ఉండే శబ్దాలు) తరువాత 'నుంది '- అని, కళల(అచ్చు అంతంలో ఉండే శబ్దాలు)పై సంధి రాని చోట 'యుంది ' -అని రాయకుండా, 'ఉంది '- అని వాక్యమధ్యంలో రాయడం సబబు.అలాగే 'వ్ 'ఆగమం చేసి 'వుంది '- అని రాస్తే, పాఠకుడు మూలరూపం తెలియక తికమక పడతాడు.మూలరూపంతో పదాలను వాక్యమధ్యంలో రాయటమే నేడు ప్రచురంగా కనిపిస్తుంది.కాబట్టి శబ్దానికి ఏకరూపాన్ని ప్రచారంలోకి తేవడం ఆధునిక ప్రయోజనాల దృష్ట్యా చాలా ముఖ్యం.
("చక్కని తెలుగు రాయడ మెలా?" డా.వి.లక్ష్మణరెడ్డి,ఎమెస్కో, 1992)
-----------------------------------------------------------

Labels:

0 Comments:

Post a Comment

<< Home