My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, August 28, 2013

1263-The Telugu navala

My recent item on the early Tamil novel (Miscellany, August 12) had reader Saraswathi Rao wondering whether or not Sri Ranga Raja Charitra by Narahari Gopala Krishnamma Chetty was the first Telugu novel. No authority on the subject, I did some checking around and discovered that it had been written in 1872, was dedicated to Lord Mayo, and had been described by the Fort St. George Gazette as being “ apparently the first attempt ever made… at novel writing in Telugu prose.” The author was at the time the Deputy Collector of Kurnool District and undertook the work in response to a notice by Lord Mayo, the then Governor-General, that had appeared in the Bengal Gazette .
The notice had stated that a work of fiction featuring the customs and rituals of the Bengalis would be rewarded. Lord Mayo saw this as a means of getting the British administrators, who till then had only to learn the language, better acquainted with the customs of the people. Krishnamma Chetty decided to do this on behalf of the Telugu people of Madras Province. He called it a “navina prabandham”, emphasising that it was an original story — not a translation — and re-emphasising that it was ‘new’. Set in the 15th Century, it tells the story of Sri Ranga Raju of the Vijayanagar dynasty and describes the customs and rituals prevalent at the time. These customs have not changed at all, Chetty points out in criticism. Was this then an attempt to urge society to change as well as break caste taboos, wonders a later commentator.

What intrigued me in this commentary, however, was the use of the term navala , the word used in Telugu today, I’m told, for ‘novel’. Kasibhatta Brahmayya Sastry, a scholar, is quoted as saying, “In English, the word ‘novel’ has come out of ‘nav’ which means ‘new’. It is not clear that this ‘nav’ is related to ‘nava’ of Sanskrit. Therefore, ‘navala’ means that (literary form) which has new features — navan visesan lati grihnati iti navala. In English too the word bears the same meaning. Therefore, I am using here the word ‘navala’ for this (literary form) instead of attempting to coin another Sanskrit word.”
Sastry’s use of ‘navala’ came in a commentary he wrote c.1900 on the second Telugu novel, Raja Sekhara Charitra by Kandukuri Veeresha Lingam, which was serialised in 1878 in the author’s own journal, Viveka Vardhani . The word has apparently stuck since then.
No doubt, there’ll be more on this, one of these days, from readers.

(S.Muthiah, Madras Miscellany, Metroplus, Chennai, The Hindu, 26:08:2013)
_____________ __________________

Labels: , , , , , ,

Friday, August 23, 2013

1254-సాహితీ మాలతీ.. మనకిక లేరు!




అక్షర చైతన్య శీలి... కన్నుమూశారు. అశేష పాఠక 'హృదయనేత్రి'.. వీడ్కోలంటూ వెళ్లిపోయారు. 'ప్రమదావనం' శీర్షికతో తెలుగు పత్రికా ప్రపంచాన్ని మహిళల దిశగా అడుగులేయించిన కలం.. నిశ్చలమైంది.ఎప్పటికప్పుడు కొంగొత్తగా ఎగసిపడ్డ 'పాత-కొత్త కెరటాల' పాళీ.. ప్రాణధారను కోల్పోయింది. లాలనగా, తార్కికంగా, గద్దింపుగా 'అడగండి చెబుతా!' అన్న పెద్దరికం... మాటయినా అడగకుండా సెలవు తీసుకుంది.

తెలుగు సాహిత్యానికి తనదైన సుగంధాలద్ది బుధవారం నేలరాలిన మాలతీ... సాహితీ, వ్యక్తిగత జీవనం ఆద్యంతం చైతన్యశీలంగానే సాగింది. 'పఠనం ఒక తీరని దాహం. ఆ దాహం ఎప్పటికైనా తీరుతుందో లేదో..!' అంటుండేవారు మాలతీచందూర్. నిజానికి ఆమె తుదిశ్వాస వరకు ఆ దాహం తీరలేదనే చెప్పాలి. ఆమె తన ప్రాణాపాయకర 'కణితి' గుర్తించిన తర్వాత కూడా తన శీర్షిక కోసం పుస్తకాలతో నెచ్చెలిమి నెరపుతూనే ఉన్నారు. మాలతీగారి రచనా ఔన్నత్యానికి పుస్తకపఠనం ఒక ఎత్తయితే.. చందూర్ జీవనభాగస్వామ్యం మరొక ఎత్తు!! ఇవి రెండూ కలిసే తనను మంచి రచయిత్రిగా చేశాయని అంటారు మాలతీ... ఆమెకే సాధ్యమైన నిరాడంబరతతో. కానీ పుస్తకపఠనాలు, పరిచయాలే ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయా? అంటే కాదనే అంటారు ఆమెతో కాస్త పరిచయం ఉన్నవాళ్లెవరైనా. మాలతీచందూర్‌లో సహజంగానే ఉన్న ఓ అన్వేషణా దృక్పథం, ఎన్నడూ ప్రతికూల భావాలు దరిచేరనీయని నిబ్బరం, గొప్పదనం ఎక్కడున్నా వెదికిపట్టి వెంబడించే చైతన్యశీలత.. ఆమె సహజగుణాలు. వాటికి పుస్తకపఠనం, చందూర్ జీవనభాగస్వామ్యం గోడచేర్పుగా అమరాయి.

రవ్వదుద్దులు...
నూజివీడులో ఆమె ఎప్పుడూ మగరాయుడిలాగే అల్లరి చేస్తూనే ఉండేవారట. 80 ఏళ్లు పైబడ్డాక కూడా ఆ చలాకీతనం చెక్కు చెదరలేదు. సున్నితమైన హాస్యం ఆమెను వీడలేదు. నూజివీడులో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాక మేనమామ చందూర్ ఇంటికి వెళ్లారు. మావయ్యతో కలిసి సాహితీసభలకు వెళుతుండేవారు. 1945-46లోనే తొలిసారిగా విశ్వనాథ, కృష్ణశాస్త్రి, గాయకుడు ఎంఎస్ రామారావు, చలం పరిచయమయ్యారు. సాహిత్యమండలి తరపున వేసిన శశాంక నాటకాల్లో అనూరాధ పాత్ర కూడా పోషించారు. అప్పట్లో క్రమం తప్పకుండా చదువుతున్న ఆనందవాణి పత్రికలో తన తొలికథ 'రవ్వల దుద్దులు' రాశారు. అమ్మ జ్ఞానాంబ మాలతీ బాధ్యత పూర్తిగా మామయ్యకే అప్పగించి.. పెళ్ళి చేశారు. పెళ్ళయాక మద్రాసు వచ్చారు. అక్కడే పెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారు. మద్రాసు మహానగరంలో స్వాతంత్య్రం వచ్చాక రిజిస్టర్ అయిన తొలి వివాహం ఆ దంపతులదేనంటారు! ఆకాశవాణిద్వారా ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు ఆ కుటుంబానికి పరిచయమయ్యారు. ఆయన ప్రోత్సాహంతో తొలిసారి ఆకాశవాణిలో టాల్‌స్టాయ్‌పై 15 నిమిషాలు ప్రసంగించారు. ప్రపంచ సాహిత్యంపై ఆమె వేసిన తొలి అడుగు అది. పాతకెరటాలకు ఒకరకంగా అప్పుడే బీజం పడింది. పాతకెరటాలు, కొత్తకెరటాల ద్వారా ఆమె 350 ప్రపంచ పుస్తకాలను పరిచయం చేశారు.

47 ఏళ్లపాటు 'ప్రమదావనం'!
1952లో ఆంధ్రప్రభలో ప్రమదావనం శీర్షిక ప్రారంభించిన కొత్తల్లో దానికి కనీస స్పందన కరవైంది. మాలతీ అందులో 'లేడీస్ హోమ్' కోణం ప్రవేశపెట్టి.. వైవిధ్య పుంతలు తొక్కాక తిరుగులేకుండా పోయింది. 47 ఏళ్లపాటు నిరాఘాటంగా సాగి తెలుగు పత్రికా ప్రపంచంలో రికార్డు సృష్టించిన శీర్షిక అది. ఆ శీర్షికలోని సమాధానాలు చదివి ఐఏఎస్‌లుగా మారినవారున్నారు. 'చంపకం-చెదపురుగులు'తో ఆమె తొలినవల. 'హృదయనేత్రి' కేంద్ర సాహిత్య అకాడమీ అందుకుంది. శతాబ్ది సూరీడు, ఆలోచించు వంటి 30 నవలలు రాశారు. '1970-80ల నాటి న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగినులు.. ఇలా అన్నివృత్తుల మహిళలనూ మానవీయ పాత్రలుగా మలచిన రచయిత్రి అప్పట్లో మరొకరు లేరు. తన జీవితాన్ని అంతే క్రమశిక్షణగా, ప్రణాళికాబద్ధంగా, నిరాడంబరంగా మలచుకున్న నిజకథానాయిక ఆమే'నంటారు ప్రముఖ రచయిత్రి ఓల్గా. సెన్సార్ బోర్డు సభ్యురాలిగా తమిళం నేర్చుకుని శివశంకరి(ఒక మనిషి కథ), జయకాంతన్(కొన్ని సమయాల్లో కొందరు మనుషులు), సుజాతా రంగరాజన్, పుదుమైపిత్తన్‌లాంటివారిని తెలుగు పాఠకులకు దగ్గర చేశారు. 'మాలతీ అనువాదంతోనే తెలుగుదేశంలో నాకు ఎంతోమంది అభిమానులు వచ్చారు. ఇక్కడి సాహితీవేత్తలతో పరిచయం ఏర్పడింది. ఎంత గొప్ప రచయిత్రో అంత మంచి స్నేహశీలి తను. మాలతీ స్నేహం మరిలేదనంటే ఎలా నమ్మను?!' అని 'ఈనాడు'తో ఆవేదన వ్యక్తంచేశారు తమిళరచయిత్రి శివశంకరి. 

(ఈనాడు , 22:08:2013)
_________________________________

Labels: , , , , , , , ,

Thursday, December 29, 2011

పుస్తకమే రెక్కల గుర్రం


తెలుగు లోగిళ్లలో తొట్టతొలిగా చిట్టి బాలలచేత పుస్తకం పట్టించినప్పుడు ఒప్పజెప్పించే పద్యం, 'తల్లీ! నిన్ను దలంచి'. బుద్ధి, మనసు కలిసి ఉండే హృదయపీఠంమీద కొలువై ఉన్న చదువులమ్మను- దోషరహితమైన సుస్పష్ట శబ్ద సౌందర్యాన్ని, సుదూర కాలతీరాల వరకు జగన్మోహనంగా వ్యాప్తిచేసే శక్తియుక్తులు ప్రసాదించమని చేసే ప్రార్థన అది. వాగీశ్వరి హస్తభూషణం పుస్తకం. 'తలవాకిటను మెలగు ఆ చెలువ'ను విద్యాధిదేవతగా ఆరాధించే సంస్కృతి భారతీయులది. పుస్తకం, విత్తం, కన్య- వరసగా ధర్మార్థ కామ ప్రతీకలు మనకు. కన్యావిత్తాలు కొందరికే సొంతం. పుస్తక విజ్ఞానం అందరికీ చెందే ఆస్తి. చర్మ చక్షువులతో చూడ సాధ్యంకాని మహితాత్ముల మనోభావాలను, జీవితానుభవాలను ముందుతరాలకు అందజేసే ఉత్తమ సాధనం పుస్తకమే. వ్యాసపీఠంమీద రామాయణం ఉన్నదంటే వాల్మీకి ఆత్మ మనముందు కూర్చుని ధర్మప్రబోధం చేస్తున్నట్లే లెక్క. గీతాపఠనం కొనసాగిస్తున్నప్పుడు సాక్షాత్ ఆ జగద్గురువు ప్రత్యక్షమై జీవితం మీది మన విశ్వాసాలను పెంచుతున్నట్లే. కరుణశ్రీ భావించినట్లు 'కలువలు పూచినట్లు/ చిరుగాలులు వీచినట్లు/ తీవలు తలలూచినట్లు/ పసిపాపలు చేతులూచినట్లు/ ఆత్మలు పెనవేసినట్లు' కవితలు సృజిస్తుంటారు కదా కాళిదాసునుంచి కృష్ణశాస్త్రులదాకా! 'గ్రంథాలు ఆత్మబంధువులు' అంటారు గుంటూరు శేషేంద్రశర్మ. పుస్తకంలో మునిగిన మనిషి పుట్టలో మునిగిన ముని అని ఆరుద్ర చమత్కారం. మనసును సానబెట్టుకొనే చందనపు చెక్క- గ్రంథం. 'గ్రంథ నిలయంబు శారద కనకపీఠి/ గ్రంథ నిలయంబు కవుల శృంగారవీటి/ గ్రంథ నిలయంబు మోక్ష సద్గతికి చీటి' అన్న నాళం కృష్ణారావు గ్రంథాలయ సూక్తి నూటికి నూరుపాళ్లు నిజం.

విశాల విశ్వాన్ని ఓ పుస్తకాల గదిగా కుదించాలన్నా, పుస్తకాల గదిలోనే ఓ విశాల విశ్వాన్ని సృజించాలన్నా అక్షరానికే సాధ్యం. అది త్రేతాయుగంనాటి రాముణ్ని కలియుగ దేవుడిగా మారుస్తుంది. తెలుగు త్యాగయ్యను తమిళుల ఆరాధ్యుడిగా తీరుస్తుంది. కంచెర్ల గోపన్న చెరసాల చీకటి శోకాన్ని రామదాసు కీర్తనలుగా వెలిగించినా, హాలుని గాథాసప్తశతి ఘనతను కథలుగా మనకు ఇప్పుడు వినిపించినా ఆ గొప్పతనమంతా అచ్చక్షరానిదే. గ్రంథస్థ వ్యవస్థే లేకపోతే వేమన వేదాంతం బ్రౌన్ దొరదాకా పాకేదా! అన్నమయ్య పద సంపద ఈ మాత్రమైనా జాతికి దక్కేదా! పరదార కామన, అధికార లాలస, సాధుజన పీడన సర్వనాశనానికి కారణభూతాలన్న ధర్మసూక్ష్మం- రామాయణ, భారత, భాగవతాదులుగా రాయబట్టేగదా నీతులుగా నిలబడింది! హరిశ్చంద్రుని చరిత్రే గాంధీజీని సత్యాగ్రహిగా మార్చింది. గాంధీజీ సత్యప్రయోగాలే మార్టిన్ లూథర్ కింగ్ పోరుకు ప్రేరణ. చదువు ప్రాముఖ్యమేమిటో హిరణ్యకశిపుని నోటే చెప్పించాడు మహాకవి పోతన. విద్యాగంధం లేక జనుషాంధుల్లాగా ఉన్న కొడుకులను విష్ణుశర్మ అనే పండితుడికి అప్పగిస్తాడు 'నీతిచంద్రిక'లోని సుదర్శన మహారాజు. పరవస్తు చిన్నయసూరి భావించినట్లు మంచిపుస్తకం- 'పలు సందియముల దొలచును/ వెలయించు నగోచరార్థ విజ్ఞానము, లో/కులకు అక్షి'. సందేహం లేదు. ఒకప్పుడు విద్యావంతుల ఇంట ఓ పుస్తకాల గదీ తప్పనిసరి. వివాహాది శుభకార్యాల్లో పుస్తకాలు చదివించడం సదాచారంగా ఉండేది. ఇలా- గతంలో గ్రంథపఠనమంటే ఒక సంస్కార చిహ్నం.

కొన్నేళ్లక్రితందాకా పాఠశాలల్లో పిల్లలకు పుస్తకాలే బహుమానాలుగా దక్కేవి. వాటి స్థానాన్ని ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా 'ఎలక్ట్రానిక్ నోట్‌బుక్' ల్లాంటి ఆధునిక పరికరాలు ఆక్రమిస్తున్నాయి. సాంకేతికత ఎంత పురోభివృద్ధి చెందుతున్నా, పుస్తకం స్థానం ఏ ఈ-పరికరం పూడ్చలేనిది. టీవీ, చలనచిత్ర మాధ్యమాలు ఎంత శక్తిమంతమైనా- పుస్తకంలా 'వ్యక్తిగతం' కాలేవు. అమ్మలా బిడ్డకు మంచిమాటలు నేర్పించగలిగేది, బొమ్మల పుస్తకమే! తండ్రినుంచి దండన భయం ఉండొచ్చు. ఏ దండనా లేకుండా మంచిదారి చూపించగలిగేదీ పుస్తకమే! రోమన్ సేనాపతి మార్కస్ అరీలియస్ యుద్ధ ఆందోళనల మధ్య సాంత్వన కోసం శిబిరంలో పుస్తకం పట్టుకుని కూర్చునేవాడు. ఎన్ని రాచకార్యాలున్నా రాయలవారు విధిగా విద్వద్గోష్ఠులు నిర్వహించేవారు. తాళపత్ర గ్రంథాలను తులసిదళాలంత పవిత్రంగా భావించిన తరాలు మన తాతలవి. ఇప్పుడా 'పుస్తకాల పిచ్చి' పిచ్చిపుస్తకాల స్థాయికి దిగజారుతుండటమే దిగులు చెందాల్సిన అంశం. అమెరికన్ రచయిత ఎమిలీ డికెన్సన్ శ్లాఘించినట్లు, పుస్తకం- 'మానవాత్మను మనోవేగంతో స్వప్నలోకాలన్నీ తిప్పి తీసుకురాగల రెక్కల గుర్రం'. ఆ అపూర్వ అనుభవాన్ని పసిపిల్లలనుంచి దూరం చేస్తున్న కంప్యూటర్ సంస్కృతి మీద గోథెన్‌బర్గ్ విశ్వవిద్యాలయంవారు పరిశోధనలు సాగిస్తున్నారు. ఆధునిక పరికరాల వినియోగం అతిగా ఉన్న అమెరికా, స్వీడన్ దేశాల బాలలు మేధోపరిజ్ఞాన రంగంలో బాగా వెనకబడిపోతున్నారన్నది వారి తాజా పరిశోధనల ఫలితం. పుస్తక పఠనంమీద అధికంగా ఆధారపడిన ఇటలీ, హంగరీ దేశాల పిల్లల ప్రజ్ఞ- అభివృద్ధి చెందిన దేశాల బాలబాలికల ప్రతిభాపాటవాలకన్నా చాలా ముందంజలో ఉందని పరిశోధకబృంద నాయకురాలు ప్రొఫెసర్ మోనికా రోజెన్ నిర్ధారించారు. మితిమీరిన సాంకేతిక వినియోగ వ్యసన సంస్కృతినుంచి అచ్చక్షరాల సంస్కృతిని తిరిగి అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కన్యాశుల్కం గిరీశంలాగా 'బయింగ్ బుక్స్... బార్బేరియస్!' అని ఈసడించుకుంటే- మనిషి కథ అడ్డం తిరగడం ఖాయం!

(ఈనాడు, ఆదివారం సంపాదకీయం, ౧౮:౧౨:౨౦౧౧ )
______________________________

Labels: ,

Sunday, January 18, 2009

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

CBRaoగారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి పైఓ మంచి చర్చకు వారి బ్లాగుదీప్తి ధార ను వేదిక చేసి, ఇన్నయ్య, విశ్వనాథ, కొత్త సత్యనారాయణ చౌదరి, కవి రాజు , జాషువా మొ//వారల గురించి మంచి సమాచారం రాబట్టారు/ ఇచ్చారు కూడా.

నేను మాటి మాటికీ చదివే తెలుగు పుస్తకాలలో ఒకటి,విశ్వనాథవారి వ్యాఖ్యాన సహిత పద్య సంకలనం- "సాహిత్య సురభి" [1986, S.A.S & Co, Hyderabad].
దీనిని గురించి విశ్వనాథవారి మాటలలోనే:
".....................ఇవి సుమారు 300 పద్యములు. యిందులో నెక్కువ పద్యములు పూర్వము దేశములో వేలమందికి కంఠగతములై యుండెడివి. నా చిన్నప్పుడు నే నెరుగుదును.
కొన్ని పద్యములు ధర్మమును చెప్పును. కొన్ని సామాన్యార్థమును చెప్పును. కొన్నింటిలో లోతైన వేదాంతార్థములుండును. కొన్నింటిలో శాస్త్రార్థమూండును. కొన్నిటిలో సాహిత్యపు లోతులుండును. ఇవి రకరకాలైన పద్యములు.
ఈ మూడువందల పద్యములు మాటి మాటికి చదువుచున్నచో వ్రాసిన వ్యాఖ్యానములు తెలిసికొన్నచో ప్రతివాడును సామాన్యమైన ఆంధ్రభాషావేత్తయగును......అతడు కవుల కవిత్వమును విని కావ్యములు చదివి తనకు తెలియలేదన్న దుస్స్థితిలో నుండడు......................"
_______________________________________

Labels: ,

Saturday, September 13, 2008

పుస్తక సమీక్ష

సరదా 'నీతి'
సినీ రంగం రంగుల ప్రపంచం. ఓ సినిమా తీయాలంటే ఎన్నో వ్యయప్రయాసలు. తెరవెనుక మరెన్నో 'మతలబులు'! వాటన్నింటినీ 'ఇనగా ఇనగా ఒక వూరు...' అంటూ వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు రావి కొండలరావు. ఒక ధనవంతుడు తన కుమార రత్నంతో సినిమా తీయాలనుకుంటాడు. ఆ పని చేసేందుకు ఓ మహాశయుడు తోడవుతాడు. ఈయన 'చిత్రలాభము' గురించి తన అనుభవాలు జోడించి చిత్రోపదేశం చేయడం వెుదలెడతాడు. ఆ తరవాత చిత్రభేదము, చిత్రఖేదము, చిత్రవోదము... ఇలా సాగుతుందీ (సి)నీతి చంద్రిక. కథనం వ్యంగ్యమైనా కథ మాత్రం వాస్తవం!
(సి)నీతి చంద్రిక
రచన: రావి కొండలరావు; పేజీలు: 72; వెల: రూ.35/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- భరద్వాజ్‌
------------------------------------------------------
ఆంగ్లసాహిత్య పరిచయం
మాలతీచందూర్‌ శైలిలో ఆత్మీయత పాలెక్కువ. ఎవరో బాగా ఎరిగినవారు కబుర్లు చెబుతున్నట్టు చకచకా సాగిపోతుంది. మనది కాని సాహిత్యం గురించి, మనది కాని వాతావరణం గురించి చెబుతున్నప్పుడూ ఆదే ప్రవాహం. దాదాపు మూడు దశాబ్దాలుగా 'పాత కెరటాలు' శీర్షికతో ఆమె 'స్వాతి' మాసపత్రికలో నెలనెలా విశ్వసాహిత్యంలోని ఒక ఇంగ్లిషు నవలని పరిచయం చేస్తున్నారు. వాటినే ఇప్పుడు రెండు సంకలనాలుగా తీసుకొచ్చారు. జెన్‌ట్రెహె 'మదర్‌ సుపీరియర్‌' నుంచి ఆర్థర్‌హెయిలీ 'ఎయిర్‌ పోర్ట్‌' దాకా దాదాపు యాభై నవలల్ని సంక్షిప్తంగా పరిచయం చేశారు. ఆంగ్ల సాహిత్యం గురించి ఎంతోకొంత తెలుసుకోవాలనుకునే తెలుగు పాఠకులు చదివితీరాల్సిన పుస్తకాలివి.
మాలతీ చందూర్‌ నవలా మంజరి-1; పేజీలు: 232; వెల: రూ.125/-
మాలతీ చందూర్‌ నవలా మంజరి-2; పేజీలు: 240; వెల: రూ.125/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- అభి (ఈనాడు, 07:09:2008)
___________________________________

Labels: ,

Tuesday, June 03, 2008

పలుకు తేనెల తల్లీ


నిఘంటువుతో నిగారింపు
డాక్టర్‌ యు.ఎ.నరసింహమూర్తి
(రచయిత విజయనగరంలోని మహారాజ బోధనాభ్యసన కళాశాలలో యు.జి.సి. పరిశోధకులు)
___________________________________________________
లిపి, నాగరక వ్యవహారం, సాహిత్యం ఉన్న ప్రతి భాషకు నిఘంటువు అవసరం. ఈ స్థితిలో ఉన్న ప్రపంచ భాషలన్నింటికి నిఘంటువులున్నాయి. నిఘంటువు అనేది ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరు, ఏదో ఒకవిధంగా రాసి పడేసే పుస్తకం కాదు. మారుతున్న కాలంలో ఎదురయ్యే అవసరాలన్నింటిని తీర్చడానికి ఎప్పటికప్పుడు ఎలా అవసరమైతే అలా, ఎవరికి వీలైతే వారు సమర్థతతో, విజ్ఞతతో నిఘంటు నిర్మాణం చేస్తూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో పుట్టి బాగా వ్యాప్తిలోకి వచ్చిన కొత్త పదాలను పదబంధాలను, భావనలను, వాడుకలను జత చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంగ్లిషు, నిఘంటువుల సరికొత్త ప్రచురణలు వెలువడుతూ ఉండటం మనకు తెలుసు. ఒక్క ఇంగ్లిషు అనే కాదు, ఏ భాషలోని నిఘంటువులైనా సమకాలీన భాషా సమాజపు అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని ధరించవలసి ఉంది.

కాలం ఆధునికతలోంచి ఉత్తరాధునికతలోకి ప్రవహిస్తోంది. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం దినదినానికి కొత్త ముఖాన్ని మార్చుకుంటోంది. కొత్త శాస్త్రాలు, భావనలు, పరిభాషలు, సంజ్ఞలు పుట్టుకొస్తున్నాయి. అవన్నీ ఏ భాషలో ఉంటే అది సంపన్న భాష అవుతోంది. కొత్త నీటికి చేపలు ఎగబాకినట్లు విద్యార్థులు, విద్వాంసులు ఆ భాషను నేర్చుకోవడానికి ఎగబడుతున్నారు. మామూలు జనమంతా ఆ భాషనే వేదంగా భావించి మిథ్యా ప్రతిష్ఠ కోసం వెంపర్లాడుతున్నారు. ఈ స్థితి మారాలంటే, ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మన భాషలో అందరకూ అందుబాటులోకి రావాలంటే ఆ శాస్త్రాలు, భావనలు, పరిభాషలు, సంజ్ఞలు తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందుకు సరికొత్త నిఘంటు నిర్మాణం అవసరం.

సంస్కృతంలోలాగే తెలుగులో కూడా పూర్వం పద్య నిఘంటువులుండేవి. వాటికి కాలదోషం పట్టి మూలనపడ్డాయి. కొంచెం అటూఇటూగా తెలుగులో ఆధునిక నిఘంటు నిర్మాణం ఆరంభమై రెండు శతాబ్దాలు కావస్తోంది. ఎన్నిరకాల ఆధునిక నిఘంటువులున్నాయో దాదాపుగా అన్నిరకాల నిఘంటువులూ తెలుగులో వచ్చాయి. తొలిదశలో తెలుగు నిఘంటు నిర్మాణానికి పూనుకొన్న పాశ్చాత్యులు నిఘంటువుల్లో సాహిత్య భాషతోపాటు సామాన్య ప్రజల వాడుక భాషకు కూడా స్థానం కల్పించారు. ఆ స్ఫూర్తి ఆనాటి నుంచి కొనసాగి ఉంటే, మన పండితులు అప్పటి నుంచి సాహిత్య భాషతోపాటు సామాన్య జనుల వాడుక భాషకు కూడా ప్రామాణ్యాన్ని కల్పించి నిఘంటువులకెక్కించి ఉంటే తెలుగు భాషలోని పదజాలం సురక్షితమై ఉండేది. మన పండితులు కావ్య ప్రయోగంలోని దేశ్య భాషను మాత్రమే నిఘంటువులకు ఎక్కించారు. ఆ కారణంగా మన భాషకెంతో నష్టం కలిగింది. అచ్చ తెనుగు నిఘంటువులు కృతక భాషకు ప్రామాణ్యాన్ని కల్పించాయి. సంప్రదాయ పండితులు కూర్చిన, సమకూరుస్తున్న నిఘంటువులు అసమగ్రమైనవని భావించి తెలుగు అకాడమీ వంటి సంస్థలు- కొన్ని దశాబ్దాల కిందటి నుంచి 'మాండలిక పదకోశాలు', 'వృత్తి పదకోశాలు' వంటి ప్రయోజనకరమైన కొత్త నిఘంటువులు నిర్మించడానికి పూనుకున్నాయి. ఆశయశుద్ధి ఉన్నంతగా ఆచరణ శుద్ధి లేని కారణంగా ఈ ప్రయత్నం ఇంకా పూర్తిగా ఫలవంతం కాలేదు. ఇంతకంటే దయనీయమైన స్థితి ఇంకొకటుంది. తెలుగువారికి ఇతర భాషా నిఘంటువులను ఉపయోగించడం తెలుసుకానీ తెలుగులో కొన్ని నిఘంటువులున్నాయని, వాటిని ఉపయోగించవలసిన అవసరం ఉందని వారు ఎన్నడూ అనుకోరు.

ప్రతిమాటకు ఒక చరిత్ర ఉంటుంది. ఆమాట పుట్టుపూర్వోత్తరాలు, స్వరూప స్వభావాలు, అర్థ పరిణామ దశలు, పతనం- ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే నిఘంటువు ఉండాలి. ఆధునిక నిఘంటు నిర్మాణంలో- పరిణత బుద్ధులైన విద్వాంసులు మాత్రమేకాక విద్యార్థులు, పల్లెలలో అడవులలో కొండలలో నివసించే ప్రజలు కూడా మాటా-మాటా కలిపి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సమకాలీనంగా తామరతంపరగా వృద్ధి పొందుతున్న శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ప్రధానంగా రెండు రకాలుగా ఉంది. వీళ్లు- వాళ్లు అనే తేడా లేకుండా దైనందిన వ్యవహారంలో ప్రజలకందరకు తప్పనిసరిగా అవసరమయే విజ్ఞానం ఒకటి. కళ, సాంకేతిక, విద్య, వైజ్ఞానిక, వాణిజ్యాది రంగాలలో ప్రత్యేక శ్రద్ధతో నిష్ణాతులు కాగోరే వారికి ఉపయోగపడే విజ్ఞానం మరొకటి. అంటే, ఒకటి సర్వసామాన్యమైన విజ్ఞానం. రెండవది ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడే విజ్ఞానం. ఈ రెండు రంగాలలోను ఇప్పుడు పెనుమార్పులు సంభవిస్తున్నాయి. వీటికి సంబంధించిన భావనలు, పరిభాషలు, సంజ్ఞలు కొత్తగా రూపొందించుకొనేటప్పుడు ఇందులో కొంత భాగమైనా అందరికీ అందుబాటులో ఉండే భాషలో ఉండాలి. అందరికీ ఉపయోగపడే నిఘంటవును తయారుచేసినపుడు పండితుడు తన అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వకూడదు, సామాన్య విద్యార్హతగల వారి అవగాహన స్థాయికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిభాష తత్సమ పదమా, దేశ్యపదమా అనే కాక సరళంగా, సుభోదకంగా ఉందా, లేదా అని ఆలోచించాలి. నూతన పరిభాషా కల్పనలో ఇంకొక అతివాదం కూడా ఉంది. ఆంగ్ల పరిభాషను యథాతథంగా ఉపయోగించడమే సరియైనదని, ప్రతి పదాన్ని తెలుగులోకి మార్చుకోవడం చాదస్తమని ఆ అతివాదులంటారు. ఏ సంజ్ఞలను, పరిభాషలను, మూలభాష నుంచి యథాతథంగా గ్రహించాలి? ఏవి అనువదించుకోవాలి? వేటికి కొత్తపదాలు సృష్టించుకోవాలి? అనే విచక్షణతో నిఘంటు నిర్మాణం చేయాలి కానీ ''తాఁబట్టిన కుందేటికి మూడే కాళ్లు'' అనే పిడివాదం ఇక్కడ పొసగదు. ఒక పండితుణ్ణి 'ఫ్త్లె ఓవర్‌' అన్న మాటను తెలుగులోకి మార్చమంటే, ''గగనపథం'' అంటాడు. అదే ఒక గ్రామీణుడ్ని అడిగితే ''పైదారి'' అంటాడు. ఇందులో ఏది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందో నిఘంటుకారుడు నిర్ణయించుకోవాలి. నిఘంటు నిర్మాణానికి ఒక పండిత వ్యవస్థతో పాటు ఒక గ్రామీణ వ్యవస్థ కూడా అవసరం. గ్రామీణుల నుంచి సేకరించిన పదజాలాన్ని క్రమబద్ధం చేసి పండితులు నిఘంటు నిర్మాణం చేయాలి. ఇది ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. ప్రయోజనం లక్ష్యంగా సాగే యజ్ఞం. అధునాతనమైన ఒక నిఘంటువు అవసరాన్ని గుర్తించి ఇప్పుడు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తులు ఎవరికివారుగా నడుం కడుతున్న సమయమిది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సి.ఎస్‌.టి.టి. (కమీషన్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ టెక్నలాజికల్‌ టెర్మినాలజీ) అన్న సంస్థ ఇప్పటికే వివిధ శాస్త్రాలకు సంబంధించి కొన్ని లక్షల పరిభాషలను సృష్టించింది. ఏ విషయానికైనా జాతీయస్థాయిలో ఒకే పరిభాష వాడుకలోకి రావాలనే లక్ష్యంతో ఈ సంస్థ కృషి చేస్తోంది. నిఘంటువులపై హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం ఇటీవల ఒక జాతీయ సదస్సును నిర్వహించింది. ఆధునిక అవసరాలను తీర్చే సమగ్రం, అధునాతనం అయిన తెలుగు నిఘంటు నిర్మాణం కోసం వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యుల నుంచి పరిశోధన పత్రాలను సేకరించి ప్రకటించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భాషాభివృద్ధి పీఠం వారు ఒక జాతీయ సదస్సును నిర్వహించి, దేశంలోని విద్వాంసులను ఆహ్వానించి వివిధ విషయాలకు సంబంధించిన నిఘంటు నిర్మాణంలో ఎన్నో అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ ఓ ముఖ్య విషయాన్ని గమనించాలి. జాతీయస్థాయిలో ఒకరు, ప్రాంతీయస్థాయిలో ఒకరు ఒకే అంశానికి రెండు పరిభాషలను కల్పించడం వల్ల వ్యవహారంలో క్లేశం ఏర్పడుతుంది. ఆ క్లేశాన్ని నివారించడానికి నిఘంటు నిర్మాతల మధ్య ఒక అవగాహన, ఒక సమన్వయ ధోరణి ఉండాలి.

అధునాతన అవసరాలను తీర్చేందుకు కొత్త నిఘంటువును తయారుచేయాలనుకొనే వారు సోదర భాషల పట్ల దృష్టి మళ్లించాలి. తమిళులు ఆధునిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో ఏ భాషలో ఏ కొత్త పరిభాష వచ్చినా వెనువెంటనే దానికొక తమిళ పదాన్ని సృష్టిస్తారు. ఎక్కువ సందర్భాలలో అది అనువాదం కాక కొత్తగా సృష్టించిన పదమై ఉంటుంది. కాఫీ, టీ వంటి పదాలకు కూడా తమిళ పదాన్ని సృష్టించడం అతివాదమని, ఆ చాదస్తాన్ని మనం తలకు రుద్దుకోకూడదని కొందరు భావిస్తున్నారు. అందువల్ల మనం వెనుకపడతామని వారి విశ్వాసం. కానీ అది సరికాదు. చైనాలో రోదసీ విజ్ఞానానికి అధినేతగా పనిచేస్తున్న ఆచార్యురుడికి ఇంగ్లిషు రానేరాదని, ఆ విజ్ఞానాన్నంతటినీ అతడు మాతృభాష నుంచే అధ్యయనం చేశారని ఒక ఆచార్యుడు చెప్పగా విన్నాను. ఆ దృష్టితో చూసినప్పుడు సాధ్యమైనంత వరకు మనం తెలుగులో కొత్త పరిభాషలను కల్పించుకోవడమే మంచిదని విజ్ఞులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైతే మనం తమిళులను మార్గదర్శకులుగా గ్రహించాలి. తెలుగులో మనం కొన్ని పరిభాషలను సృష్టించుకోవడం సాధ్యం కాకపోయినట్లయితే వాటిని మనం మన సోదరభాషలైన తమిళ, కన్నడ, మళయాళల భాషల నుంచి అరువు తెచ్చుకోవడానికి వెనుకాడకూడదు. అవి మన భాషా కుటుంబానికి చెందినవి, క్రమంగా ఆ పరిభాషలు మనభాషలో కలిసిపోయి ఒక సహజ సౌందర్యాన్నీ, సామరస్యాన్నీ సాధిస్తాయి. అధునాతన నిఘంటువు- విద్యా, వైజ్ఞానికాది ఇతర రంగాల వారి కంటే పత్రికల వారికి, దృశ్యమాధ్యమానికి ఎంతో అవసరం. అందుచేత అధునాతన నిఘంటు నిర్మాణానికి వారు సంఘటిత కృషి చేయాలి. ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు చేపట్టిన కార్యక్రమాలు నత్తనడక నడుస్తాయని, అవి పూర్తి కావడానికి ''ఏండ్లును పూండ్లును పట్టు''నని మన అనుభవంలో ఉన్న విషయం. కాబట్టి అధునాతన అవసరాలను తీర్చడానికి ఈ రంగంలో కర్తవ్యనిష్ఠ, బాధ్యత, క్రమశిక్షణ, అంగబలం, అర్థబలం - అన్నింటికీ మించి విచక్షణ జ్ఞానంగల ప్రభుత్వేతర సంస్థలు అకుంఠిత కృషి జరపవలసి ఉంది. తెలుగు భాషా సాహిత్యాలకు గౌరవాదరాలు తగ్గి అవి క్షీణదశలో ఉన్న ప్రస్తుత స్థితిలో మన తెలుగు భాషను ఇతర భాషా సమాజాలతో సమాన గౌరవంకలదానిగా చేయడానికి ఈ నిఘంటు నిర్మాణం ఎంతో అవసరం.
(ఈనాడు,07:04:2008)
---------------------------------------------------

Labels: ,

Sunday, November 25, 2007

పుస్తక సమీక్ష

అమూల్యమైన సమాచారం

విస్తృతమైన పరిశోధానానుభవంతో అనేక ప్రాంతాలు తిరిగి దేవదాసీ వ్యవస్థకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందించేందుకు జరిగిన ప్రయత్నం ఈ పుస్తకం. ప్రతి మాటా, పేర్కొన్న ప్రతి సందర్భం ప్రత్యక్ష వీక్షణమే అన్న తృప్తిని పాఠకులకు మిగిల్చేందుకు రచయిత్రులు పడ్డ తపన అణువణువునా కన్పిస్తుంది. దేవదాసీల జీవనంలోని చికటికోణాల ఆవిష్కరణ మనసులను ద్రవింపజేస్తుంది. చరిత్రను, ముఖ్యంగా స్త్రీ సంబంధ అంశాలపై నిత్యం కృషి చేసేవారి ఊహకు కూడా అందని విషయాలను ఇందులో చేర్చారు. దేవదాసీల కోణంలో మహిళల లైంగికత్వం మీద ఉండే కంట్రోళ్లను ఛేదించుకుని బయటకు వచ్చేందుకు జరిగిన పోరాటాలను చెప్పారు. వేశ్యలుగా, కులసతులుగా విభజించి వారిని సమాజం ఎలా నిర్వచించిందో చెబుతూ సాహిత్యంలో ఆ అంశం ప్రతిఫలించిన పరిస్థితులను ఉదాహరణలతో వివరించారు. ఆనాటి సాంఘిక, ఆర్థిక, సామాజిక కోణాలను చారిత్రక, మానవశాస్త్ర దృక్పథంతో చెబుతూ, దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకోసం సాంఘిక, నైతిక సంస్కరణలు తెచ్చేందుకు ముత్తులక్ష్మీరెడ్డి పడ్డ ఆరాటాన్ని పేర్కొన్నారు. సమగ్రచర్చకు దారులుతెరిచే పుస్తకమిది.

దేవదాసీ వ్యవస్థ
రచన: వకుళాభరణం లలిత, మల్కాపల్లి ప్రమీలారెడ్డి
పేజీలు: 423; వెల: రూ.150/-
ప్రతులకు: అస్మిత రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ విమెన్‌,
రోడ్‌ నం.6, ఈస్ట్‌మారేడ్‌పల్లి, సికింద్రాబాద్‌.

- తిరునగరి శ్రీనివాస్‌
__________________________________________
ఉర్దూ చరిత్ర

అత్యంత సన్నిహితమైన ఉర్దూ భాషా సాహిత్యాలను తెలిపే పుస్తకాలు తెలుగులో తక్కువే. అడపాదడపా జరిగిన కృషి అందుబాటులో లేని తరుణంలో సదాశివ 'ఉర్దూ సాహిత్యం' వచ్చింది. ప్రణాళికాబద్ధం కాకపోయినా ఉర్దూ భాషా సాహిత్యాల ఆవిర్భావ వికాసాల వివరాలెన్నో ఉన్నాయి. అమీర్‌ఖుస్రూ నుంచి హైదరాబాదీల వరకు సంప్రదాయం నుంచి ఆధునికం దాకా నవలా కథానికా ఇతర ప్రక్రియల వివరాలతో సహా ఉర్దూ సాహిత్య ప్రపంచాన్ని స్థూలంగా ఆవిష్కరించిన సాహిత్యచరిత్ర గ్రంథమిది. మతాతీతంగా మహత్తు చూపిన నజీర్‌ కవిత్వాన్ని అనువదించినా మీర్జాగాలిబ్‌ గజళ్ల అందచందాలను వివరించినా వెుహమ్మద్‌ ఇక్బాల్‌ను విశ్లేషించినా అధికారంతోపాటు అనునయంతో సదాశివ రచన ఆప్తవాక్యంలా సాగింది. ఉటంకించిన కవిత్వానికి దాదాపు అన్ని చోట్లా తన అనువాదం కూడా యిచ్చి సదాశివ గొప్ప సేవ చేశారు. ముఖ్యంగా సాహిత్యకారులంతా చదవాల్సిన పుస్తకం.

ఉర్దూ సాహిత్యం;
రచన: డా.ఎస్‌.సదాశివ
పేజీలు: 207; వెల: రూ.100/-
ప్రతులకు: తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌, సందేశ్‌భవన్‌
ఛత్తాబజార్‌, హైదరాబాద్‌-2.
- స.నా.మ.
(Eenadu, 25:11:2007)
_________________________________

Labels: ,

Tuesday, November 20, 2007

మహనీయుడి చరిత్ర

పకోడీ మీద పద్యం చెప్పినా, 'భరతఖండంబు చక్కని పాడియావు' అని ఆంగ్లేయుల మీద ధ్వజమెత్తినా చిలకమర్తికే చెల్లింది. పద్యం, నాటకం, నవల ఇత్యాది అన్ని సాహితీప్రక్రియల్లోనూ ఆయనది అసాధారణ ప్రజ్ఞ. మచ్చుకు 'గయోపాఖ్యానం', 'గణపతి' చాలు. ఈ తొలి తెలుగు జాతీయోద్యమ కవి, సంఘసంస్కర్త 1944లో వెలువరించిన 'స్వీయచరిత్రము' పునర్ముద్రించిన ప్రాచి పబ్లికేషన్స్‌ వారిని అభినందించాల్సిందే. '...రాత్రులు నేను దీపముముందర తలపెట్టుకొని, కన్నులకు పుస్తకము మిక్కిలి దగ్గరపెట్టుకొని యైదారుపంక్తులు చదువ ప్రయత్నించుచుండెడివాడను' అంటూ, తనను అంధత్వం ఎలా బాధించిందో, లెక్కలతో పడిన చిక్కులేమిటో, అప్పులతో వచ్చిన తిప్పలేమిటో, రెండో ప్రతి రాసుకునే అలవాటు లేక ఎన్ని పద్యాల్ని పోగొట్టుకున్నారో వెల్లడించారు చిలకమర్తి. 'పశువులు మన యింట నుండవచ్చును. కుక్కలుండవచ్చును. కాని పంచములు మట్టుకు మన గృహావరణములోనికి రాగూడ'దా? అని ప్రశ్నించిన ఆయన ఆత్మకథ అప్పటి(ఇప్పటి అనకూడదా!) ఆంధ్రదేశ పరిస్థితులను కళ్లముందుంచుతుంది. భాష నేటితరానికి కొరుకుడుపడుతుందా... అన్నది కొట్టేయాల్సిన విషయం కాకపోయినా, ఇష్టంగా చదివితే అందులోని మాధుర్యాన్ని రుచిచూడవచ్చు. స్వీయచరిత్రము;

రచన: చిలకమర్తి లక్ష్మీనరసింహము;
పేజీలు:
410;
వెల: రూ.125/-
ప్రతులకు: ప్రాచి పబ్లికేషన్స్‌, 3-3-859/1/ఎ,
రెండో అంతస్తు, కాచిగూడ, హైదరాబాద్‌-27.

- షేర్‌షా(Eenadu, 18:11:2007)
_____________________________________________________

(http://www.avkf.org/BookLink/view_subjects.php?current_number=166)
_____________________________________________________

Labels: ,

Sunday, October 28, 2007

సమాజానికి అద్దం

'సాహిత్యంలో సమాజం ప్రతిబింబించాలి. అదీ సహజంగా వాస్తవికంగా ఉండాలి. అప్పుడే ఆ సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. స్ఫూర్తిగా నిలుస్తుంది'... సరిగ్గా ఈ అభిప్రాయంతో అల్లుకున్నవే ఇనాక్‌ సృజించిన కథానికా సంపుటులు 'కట్టడి', 'కొలుపులు'. భిన్న పత్రికల్లో విభిన్న సందర్భాల్లో ప్రచురితమైన ఈ కథానికలన్నీ సమాజంలో కనిపించే సమస్యల్నీ సంఘర్షణనీ ఎత్తి చూపించేవే. పోలింగుబూత్‌కు వచ్చి ఓటు వేయలేనివారి నిస్సహాయస్థితిని 'సగం ప్రజాస్వామ్యం'లో, బాలకార్మిక సమస్యని 'లేబరోళ్లు'లో, ఆడపిల్లని కనే తీరతాను అన్న యువతి ధైర్యాన్ని 'పిల్లని కంటాను'లో చూడవచ్చు. నిమ్నకులాలు, బడుగుల సమస్యల్ని తాకిన 'కులవృత్తి', 'పోలే', 'విముక్తి'... వంటివన్నీ ఈ కోవకు చెందినవే. 'మా అమ్మే'లో మనవరాలిని తల్లిగా భావించిన తాతనీ, 'రాధారాధన'లో యువతీయువకుల మధ్య ఉన్న ఆకర్షణనీ, 'తాతా కారు కావాలి'లో పిల్లల ఆటవస్తువుల్లో వచ్చిన మార్పునీ సున్నితంగా సృజించారు. సంభాషణా శైలి ఎక్కడా ఆగదు. కవితాత్మకంగా హాయిగా సాగిపోతుంది.
కట్టడి;
పేజీలు: 214; వెల: రూ.74/-
కొలుపులు;
పేజీలు: 185; వెల: రూ.69/-
రచన: ఆచార్య కొలకలూరి ఇనాక్‌
ప్రతులకు: జ్యోతి గ్రంథమాల, 4/282, న్యూ సర్వోదయనగర్‌
మీర్‌పేట, హైదరాబాద్‌-500 079.
- సాహితి
(Eenadu, 28:10:2007)
_____________________________

Labels: ,

తెలుగు ఆత్మకథా వైభవం

తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలకు ఆద్యుడైన కందుకూరి వీరేశలింగం పంతులు ఆత్మకథకూ బాటలు పరిచి, 'స్వీయచరిత్రము' వెలువరించారు. 1911లో తొలిభాగం, ఆ తర్వాత నాలుగేళ్లకు రెండో భాగం అచ్చయ్యాయి. 'ఈ స్వీయచరిత్రము నందు వీరేశలింగ మహాశయుని జీవిత కథయేగాక యా కాలమందలి యాచారములు, కట్టుబాటులు, న్యాయస్థానములు వ్యవహారములు, దేశస్థితి వెుదలైనవెన్నో తేటతెల్లముగఁ దెలియును. అందుచేత నిది ఆంధ్రదేశము యెుక్క సాంఘిక చరిత్రమని చెప్పవచ్చును' అంటారు ఆ పుస్తకం గురించి చిలకమర్తి లక్ష్మీనరసింహం. కందుకూరి బాటలో నడిచి, సంఘసంస్కర్తగా, గ్రంథకర్తగా ప్రసిద్ధులైన చిలకమర్తి కూడా తన ఆత్మకథను 'స్వీయచరిత్రము' పేరుతో రాశారు.

పోరాట నేపథ్యం ఉన్నవాళ్లు ఆత్మకథలకు ఎక్కువగా శ్రీకారం చుట్టారనిపిస్తుంది. గదర్‌ పార్టీ యోధుడు దరిశి చెంచయ్య 'నేనూ నా దేశం', దాశరథి కృష్ణమాచార్య 'యాత్రాస్మృతి', ఆయన సోదరుడు దాశరథి రంగాచార్య 'జీవనయానం', కాళోజీ నారాయణరావు 'నా గొడవ' పేరొందిన ఆత్మకథలే. తన అంత్యక్రియలు ఎలా జరగాలో కూడా వివరంగా రాసిపెట్టిన రావి నారాయణరెడ్డి 'నా జీవనపథంలో' స్వాంతంత్య్రానంతరం తెలంగాణ పోరాట కొనసాగింపు విషయమై కమ్యూనిస్టుల మధ్య ఏర్పడిన విభేదాలను చక్కగా వెల్లడిస్తుంది. నల్లా నరిసింహులు 'తెలంగాణ సాయుధపోరాటం- నా అనుభవాలు' ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఓ వీరుడి కథను తలపిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు, సేవాగ్రామ్‌లో గాంధీజీతోపాటు రెండేళ్లు గడిపిన ఎం.ఎస్‌.రాజలింగం 'స్వీయచరిత్రము', 'బాపు-నేను' పుస్తకాలు రాశారు.

ఉద్యమాలతో సంబంధం లేకుండా రచనలో ఉన్న మాధుర్యాన్ని బట్టి తిరుమల రామచంద్ర 'హంపీ నుంచి హరప్పా దాకా', శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 'అనుభవాలు జ్ఞాపకాలు' గొప్ప ఆత్మకథలుగా పేరొందాయి. ఆత్మ చరిత్రాత్మ చరిత్రాత్మక నవలగా తన 'అనంతం' వెలువరించారు మహాకవి శ్రీశ్రీ. 'ఆత్మకథను, స్వీయచరిత్రగా రాసుకున్న తెలుగువాళ్ల సంఖ్య పూర్వం చాలా తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ. సంస్కృత కవులు ఆత్మస్తుతీ పరనిందలకు పాల్పడలేదు గాని తెలుగు కవులు కుకవినింద మానలేదు... ఇదంతా కాలప్రభావం కావచ్చు. పూర్వ మార్గాన్ని అనుసరించటానికే ప్రయత్నిస్తాను' అని చెప్పుకున్న బూదరాజు రాధాకృష్ణ 'విన్నంత కన్నంత' రాసుకున్నారు. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు 'నా జీవితయాత్ర', రాష్ట్ర తొలి స్పీకర్‌ అయ్యదేవర కాళేశ్వరరావు 'నా జీవిత కథ', రాష్ట్ర తొలి రాజకీయ కార్టూనిస్ట్‌ ‌ ‌ రాంభట్ల కృష్ణమూర్తి 'సొంత కథ', రచయిత వేగుంట వోహన్‌ప్రసాద్‌ 'బతికిన క్షణాలు' పేర్లతో ఆత్మకథలు విడుదలచేశారు.

'ఆత్మచరితము' వెలువరించిన ఏడిదము సత్యవతి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలి తెలుగు మహిళ. దీని రచనా కాలం 1934. మతం, సంఘం, దురాచారాలను నిరసించి, హేతుబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. నటి భానుమతి 'నాలో నేను' అంటూ తన గురించి చెప్పుకున్నారు. ఇంకా సినీ కళాకారుల్లో ధూళిపాల, పద్మనాభం, డి.వి.నరసరాజు విడుదల చేశారు. '...నా జీవితంలో పాఠకులకు ఆసక్తికరం కాని విషయాలు- ఘట్టాలు- చాలా వుంటాయ్‌. అవన్నీ వ్రాసి- వాళ్లను విసిగించడం ఏం న్యాయం? విసిగిస్తే- వాళ్లు తిట్టరు- కొట్టరు! పుస్తకం మూసేసి- అవతల పెడతారు!... అందువల్ల... అనవసర విషయాలు వదిలేసి చదివేవాళ్లకు- ఆసక్తికరమని నాకు అనిపించినవి మాత్రమే వ్రాయదల్చుకున్నాను' అన్నారు నరసరాజు.
(Eenadu, 28:10:2007)
___________________________

Labels: ,

Sunday, October 21, 2007

దేవుడు...నిజమా?భ్రమా?

మతం, పవిత్ర గ్రంథాల పేరిట కొనసాగుతున్న అబద్ధాలను ప్రశ్నిస్తూ రిచర్డ్‌ డాకిన్స్‌ రాసిన పుస్తకం 'ది గాడ్‌ డెల్యూజన్‌'. 'దేవుడి భ్రమలో' పేరిట ఇన్నయ్య అనువదించిన దీనిలో దేవుడి ఉనికికి సంబంధించిన అభిప్రాయాలు, నమ్మకాలు, మతం, నీతి, వ్యాపార రీతి తదితర అంశాలను చర్చించారు. 'క్రైస్తవ మతాన్ని మేధావులైన సుప్రసిద్ధులలో అధిక సంఖ్యాకులు నమ్మరు. కాని బహిరంగంగా ఆ విషయాన్ని దాచిపెడతారు. ఆదాయాలు పోతాయని వారికి భయం' అంటారు బెట్రాండ్‌ రస్సెల్‌. మతం, విజ్ఞానంపై కేంబ్రిడ్జ్‌లో టెంపుల్టన్‌ సంస్థ ఓ సమావేశాన్ని నిర్వహించి ఎంపికచేసిన సైన్స్‌ జర్నలిస్టులకు లక్షన్నర డాలర్ల చొప్పున చెల్లించిన వైనాన్ని డాకిన్స్‌ తప్పుబట్టారు. ఆ సంస్థ డబ్బు శాస్త్రీయరంగాన్ని చెడగొడుతోందంటూ నిరసన వ్యక్తం చేశారు. నిరంతరం కొనసాగుతుండే ఈ చర్చనీయాంశాలపై డాకిన్స్‌ ఓ వెబ్‌సైట్‌(వ్వ్వ్.రిచర్ద్దవ్కిన్స్.నెత్)నూ నిర్వహిస్తున్నారు.
దేవుడి భ్రమలో;
రచన: రిచర్డ్‌ డాకిన్స్‌
అనువాదం: ఇన్నయ్య;
పేజీలు: 325; వెల: రూ.200/-
ప్రతులకు: అక్షర, ప్లాట్‌ నం.46
శ్రీనగర్‌ కాలనీ, హైదరాబాద్‌.
- వెంకట్‌
(Eenadu, 21:10;2007)
___________________________________

Labels: ,

Sunday, October 07, 2007

పుస్తక సమీక్ష

సుప్రసిద్ధ పాతిక
'బాధల ముళ్లు గుచ్చుకుని బతుకు పచ్చి గాయమై'నా సాహితీ సేద్యాన్ని కొనసాగించిన సహవాసి మిగిల్చి వెళ్లిన చివరి ఫలం 'నూరేళ్ల తెలుగు నవల'. కావ్యాలు, ప్రబంధాల మత్తు వదిలించి, వాస్తవికత కొరడాతో పాఠకులను నిద్రలేపిందని నవలకు పేరు. ఏ అవలక్షణాలను ఈసడించి ఈ ప్రక్రియ వెుదలైందో అందులోనూ అవి జొరబడినై. లేదంటే ఈ వందేళ్లుగా రాసినవన్నీ ఉత్తమ నవలలే కావాలి. కోకొల్లలుగా ఉత్పత్తి అవుతున్న వాటికి భిన్నంగా, ఉరిమి, చిల్చి, చెండాడి... తన తరం పాఠకులనే కాదు, రాబోయే తరాలనూ ప్రభావితం చేయగలిగే రచనలను 'తెలుగునాడి'లో పరిచయం చేస్తూ వచ్చారు సహవాసి. నవలను తెలుగునేలకు ఆహ్వానించిన కందుకూరి 'రాజశేఖర చరిత్ర'తో వెుదలై, మట్టివాసనతో గుబాళించే వాసిరెడ్డి సీతాదేవి 'మట్టిమనిషి'తో ముగిసే ఈ పుస్తకంలో మాలపల్లి, వేయిపడగలు, మైదానం, చివరకు మిగిలేది, అసమర్థుని జీవయాత్ర, చదువు, అల్పజీవి, ప్రజలమనిషి, పెంకుటిల్లు, బలిపీఠం, మైనా, అంపశయ్య, హిమజ్వాల లాంటి పాతిక ఆణిముత్యాలనూ ఆయా రచయితల జీవితవిశేషాలనూ అందించారు. 'వెన్న పడుతుండగా పగిలిపోయిన చల్లకుండ కళ్ల ముందు ఆడుతుంది' అని బాధపడ్డారు దుర్భర దారిద్య్రంతో మూడు పదుల వయసులోనే కన్నుమూసిన మంచి-చెడూ రచయిత 'శారద'ను తలుచుకుంటూ. 'వస్తు, శిల్పాలు రచనలో చాలా సన్నిహితంగా కలిసిపోవటం ఉన్నత విలువలు కలిగిన సాహిత్య లక్షణం...' అంటారు బాపిరాజు 'నారాయణరావు' పరిచయంలో. ఇది అన్ని పుస్తకాలకూ వర్తించే వ్యాఖ్య. తెలుగు నవలా సముద్రంలో ఒక్కసారీ మునకలేయని వారికి, ఏం చదవాలో సూచించే దిక్సూచి ఈ పుస్తకం. ఆ అలవాటు ఉన్నవారికి కొత్త వెలుగులు చూపించే దీపపు కాంతి.
నూరేళ్ల తెలుగు నవల(1878-1977);
రచన : సహవాసి
సంపాదకుడు : డి.వెంకట్రామయ్య;
పేజీలు : 230; వెల : రూ.100/-
ప్రతులకు : నవోదయ, కాచిగూడ, హైదరాబాద్‌-27.
- షేర్‌షా
(EenaaDu, 07:10:2007)
______________________________________

Labels: ,

Wednesday, September 19, 2007

హాస్యం



Title: Haasya Prapancham
Author: Maacherla Radhakrishnamurthy
Year of Publication: 2006
(http://www.avkf.org/BookLink/view_subjects.php?current_number=36)
-----------------------------------------

Labels: ,

Sunday, September 09, 2007

సాహిత్యం

సహృదయైుక వేద్యం
నన్నయ నాటి నుంచి నేటివరకు ఉన్న పద్యరత్నాలను ఏర్చి కూర్చిన సమాహారమిది. ఈ తరహాలో 'ప్రాచిన పద్యమంజరి' ఇత్యాదులు సాహితీలోకంలో సుప్రసిద్ధాలే. ఇది వాటికంటే భిన్నం. ఈ సంకలనంలో ఒక క్రమాన్ని పాటించకపోయినా ఒక సమన్వయ సూత్రంతో సంపుటీకరణ సాగింది. కవిత్రయ పద్యవిన్యాసం, శతక సాహితీ సౌరభం, పోతన కవితా సుధా మాధుర్యం, ఆంధ్ర పంచకావ్య కవితా వైభవం ఆపై చమత్కార పద్యమంజరి, ఇంకా ఇతిహాస, పురాణ, ప్రబంధాది కవితా ప్రక్రియల లాక్షణికత... ఈ సంవిధానంతోనే చక్కని క్రమపరిణామ రామణీయకత్వాన్ని సంతరించుకుంది. ప్రబంధ సాహిత్యానికి బీజావాపనం చేసిన కుమారసంభవ కర్త నన్నెచోడ కవిని గ్రంథకర్త విస్మరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వేయి సంవత్సరాల పైబడ్డ పద్యం నవరసాలకు ఆకరమనీ మరో వెయ్యేళ్ళయినా తెలుగు ప్రజల రసనాగ్రాలపై నర్తిస్తుందనీ ఈ కృతికర్త విశ్వాసం. పద్యం మీద అభిమానమే కాదు అభినివేశం ఉందనడానికి వాటి వైశిష్ట్యాన్ని విశ్లేషించడమే నిదర్శనం.
పద్యం- రసనైవేద్యం;
రచన: దోరవేటి
పేజీలు: 140; వెల: రూ.80/-
ప్రతులకు: విశాలాంధ్ర ప్రధాన శాఖలు.
- చారి
-------------------------------------------------------
వడగట్టిన కథలు
యడ్లపాటి వేంకట సుబ్బారావు స్మారక పోటీకి వచ్చిన కథలలో నుంచి 76 కథలను 'రచన' పత్రికలో ప్రచురించారు. అందులో ఇరవై ఆరింటిని 'కథావాహిని-2007' పేరుతో సంకలనంగా వెలువరించారు. రెండుసార్లు వడపోతకు నిల్చినవి మంచిస్థాయికి చెందినవి కావడం సహజం. తాగేనీళ్ళకు సైతం తప్పని పేదలతిప్పలు, పనికి ఆహారపథకం తీరు, సాయం కోరితే ఎదురైన పోలీసు జులుం, ఆడామగా మధ్య స్నేహంలోని వెలుగు, వెర్రితలలు వేస్తున్న క్రికెట్‌ వ్యావోహం... వెుదలైన ఇతివృత్తాల చుట్టూ అల్లిన కథలివి. రచయితలందరూ చేయితిరిగిన కథకులే. కథాశిల్పం బాగా తెలిసినవారే. బాధామయ జీవులపై రాసిన కథలలో గాఢత, క్లుప్తత, నైశిత్యం ఆకట్టుకుంటాయి. కాగా సంపన్నవర్గాలూ ఎగువ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యం ఉన్న కథలలో పాఠకులకు కొత్తకోణాన్నో సమస్యల లోతునో సాహసంతో చూపిన సందర్భాలు తక్కువగా ఉండటానికి బహుశా పోటీ దృష్ట్యా గీసుకున్న పరిధి ఒక కారణం కావచ్చు.
కథావాహిని-2007;
సంచాలకుడు: 'రచన' శాయి
పేజీలు: 254; వెల: రూ.130/-
ప్రతులకు: వాహిని బుక్‌ట్రస్ట్‌
1-9-286/3, విద్యానగర్‌, హైదరాబాద్‌-44.
- జి.రా.
-------------------------------------------------------
'కాలమ్‌' చెల్లనిది
సామాజిక సమస్యల్ని తక్కువ నిడివిలో, తేలిక పదాల్లో, సరదాగా అందించిన ఫీచర్ల సమాహారమే ఈ పుస్తకం. ప్రతి కాలమ్‌ చిన్నచిన్న పదాల్లో ఆలుమగల మధ్య అల్లరిగా సాగే సంభాషణతో వెుదలవుతుంది. అది చదివి నవ్వుకుంటుండగానే 'మమతానుబంధాలే కదా మనుగడ మీద ప్రేమను పెంచుతాయి' వంటి వాక్యాలు హలో చెప్పి ఆకట్టుకుంటాయి. ఆఖరు పేరాగ్రాఫ్‌లో అనుకోని మలుపు. భార్యాభర్తల సంభాషణ అనూహ్యంగా సమాజం, రాజకీయాలు, అవినీతి, అత్యాచారం వైపు మరలుతుంది. సమస్యలు తెరమీదికొస్తాయి. వాటిపై చకచకా చెణుకులు పడతాయి. ఇక్కడ రచయిత కనబరిచే అన్వయశక్తి, చేసే వ్యాఖ్యానం ఆసక్తికరంగా ఉంటుంది. చదివింపజేస్తుంది. ఓ దిన పత్రికలో వారం వారం వచ్చినవే అయినా ఈ పుస్తకం 'కాలమ్‌' చెల్లనిది.
కనకమహాలక్ష్మి సింహాచలం
రచన: కెవియస్‌ వర్మ (ఫీచర్స్‌)
పేజీలు: 118; వెల: రూ.40/-
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి అన్ని శాఖలు.
- భద్రగాయత్రి
------------------------------------------------
(Eenadu, 09:09:2007)
------------------------------------------------

కొత్తతరం కోసం
తెలుగులో వెుదటి వరసలో నిలిచే హాస్యనవల 'బారిష్టర్‌ పార్వతీశం'. కథానాయకుడు పార్వతీశం ఇంగ్లండుకు ప్రయాణమవుతూ పళ్ళు తోముకోవటానికి కచ్చిక పొడీ, నాలుక గీసుకోవటానికి తాటాకు ముక్కలూ మర్చిపోకుండా తీసుకువెళ్ళే 'ముందుచూపు'న్న వ్యక్తి. సృష్టించిన రచయిత పేరును మించిపోయి ప్రాచుర్యం పొందిన సజీవ పాత్ర. హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ 'మన మంచి పుస్తకాలు' సిరీస్‌లో భాగంగా ఈ నవలను సంక్షిప్త రూపంలో అందించటం మంచి ప్రయత్నం. దీనివల్ల కొత్తతరం పాఠకులకు సారం తెలుస్తుంది; కొందరికైనా మూల రచనలను చదవాలనే ఆసక్తి ఏర్పడుతుంది.
బారిష్టర్‌ పార్వతీశం
రచన: వెుక్కపాటి నరసింహశాస్త్రి
తిరిగి చెప్పిన కథనం: సహవాసి
పేజీలు: 88; వెల: రూ.40/-
ప్రతులకు: హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌
ప్లాట్‌ నం: 85, గుడిమల్కాపూర్‌
హైదరాబాద్‌-67.
- సీహెచ్‌.వేణు
---------------------------------------------
మాటల పేటి
బాలగంగాధరరావు కలం నుంచి జాలువారిన ఆణిముత్యం 'మాటతీరు'. మనం నిత్యంవాడే వందలాది మాటల వెనకగల చరిత్రనూ అవి లోక వ్యవహారంలో స్థిరపడిన విధానాన్నీ చదువుతుంటే అబ్బురం అన్పిస్తుంది. ప్రతిమాటకూ వెనక ఇంత పురాణం ఉందా అని ముక్కున వేలేసుకుంటాం. ఆంగ్లపదం 'టవల్‌' క్రమంగా మన తెలుగు 'తువ్వాలు'గా మారిందంటే ఔరా అనుకుంటాం. సంస్కృతపదం 'యువన్‌' నుంచి 'జవాను' మాట వచ్చిందంటే నివ్వెర పోతాం. ఇలా ఒకటేంటి? కొడుకు, కోడలు, కూలి-నాలి, ఏండ్లు-పూండ్లు వంటి రెండొందల పైచిలుకు సాధారణ పదాల వెనకగల అసాధారణ విషయాల్ని విప్పిచెప్పారు రచయిత. భాషాజిజ్ఞాసువులకి ఇదెంతో ఉపయుక్తం అనడంలో సందేహం లేదు.
మాటతీరు;
రచన: యార్లగడ్డ బాలగంగాధరరావు
పేజీలు: 176; వెల: రూ.80/-
ప్రతులకు: జయంతి, విశాలాంధ్ర,
నవోదయ, నవయుగ పుస్తకకేంద్రాలు.
- చంద్రప్రతాప్‌
------------------------------------
(Eenadu, 26:08:2007)
-------------------------------------

Labels: ,

Wednesday, August 29, 2007

"సంకేత పదకోశం"

"త్రిలోకాలు, త్రికరణశుద్ధి, దుష్టచతుష్టయము, పంచప్రాణాలు, పంచాంగము, పంచద్రావుడులు, పంచమహాపాతకాలు, సప్తసముద్రాలు, సప్తర్షులు, అష్టదిగ్గజాలు, నవధాన్యాలు, దశావతారాలు, షోడశోపచారాలు, అష్టాదశ పురాణాలు", ఈవిధంగా అంకెలతో కూడిన మాటలు తెలుగువారి నోట మాటి మాటికి వినబడుతుంటాయి. త్రికరణలంటే ఏమిటి? పంచాంగానికి ఆ పేరు ఎలా వచ్చింది? సప్తర్షులు ఎవరు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఇలా అంకెలతో కూడిన మాటలకు నిలయమే- "సంకేత పదకోశం".దీని సంపాదకులు సంస్కృత పండితులూ,కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయ విశ్రాంత ఉపాధ్యక్షులూ ఐన ఆచార్య రవ్వా శ్రీహరి గారు.

"సంకేత పదకోశం" అనే ఈ పుస్తకం సంఖ్యలతో ప్రారంభమయ్యే అయా శాస్త్రపదాల వివరణనిచ్చే ఒక చిన్న సంఖ్యాపద నిఘంటువు. దీనిలో వేద వేదాంగాలు, దర్శనాలు (అవైదీకమైన జైన, బౌద్ధ,చార్వాక దర్శనాలు కూడా),వ్యాకరణము,తర్కము,మీమాంస,జ్యోతిషము,అలంకారము,
పురాణేతిహాసాలు,సంగీతము, ఆయుర్వేదము, అర్థశాస్త్రము మొ// శాస్త్రములకు చెందిన 2400 పదాలకు వివరణమియ్యబడ్డాయి.సంకేత పదాలను 'ఏక ' అనే పదం నుంచి, మన సంప్రదాయం ప్రకారం 'అష్టోత్తరశతం ' వరకు ఈకోశంలో చేర్చారు.
ఇదో మంచి సంప్రదింపు గ్రంథము.

కోశ వివరాలు:
"సంకేత పదకోశము"
సంపాదకులు-ఆచార్య రవ్వా శ్రీహరి
రెండవ ముద్రణం 2002
పతంజలి పబ్లికేషన్స్
హైదరాబాదు
వెల రూ.125
----------------------------------------------------------------

Labels: ,

Sunday, August 19, 2007

వేదం ...జీవన నాదం!



ఎందుకు రాశానంటే...
(దాశరథి రంగాచార్య)
న్నయకూ పోతనకూ తిక్కనకూ దొరకని అదృష్టం నాకు దక్కింది.వేదాల్ని తెలుగులోకి అనువదించే మహద్భాగ్యం నాకే దక్కింది. అంతటి బృహత్యార్యంలో నాకు సాయపడిందెవరూ లేరు. నేనే కాయితం కొనుక్కొని పెన్సిల్‌ కొనుక్కొని రాశాను. ఒకటా రెండా! ఐదువేల పేజీలు. ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాల్నీ కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే. అంతేకాదు, వేదాలకు వ్యాఖ్య చేసిన సాయణాచార్యులు మన ఆంధ్రుడే. ఇది తెలుగువారి అదృష్టం.
'ఎవరు పడితే వారు వేదం చదవకూడదు' ...ఒక అపోహ....ఇదెందుకొచ్చిందీ అంటే, ఒక వర్గానికి ఇది ఉపాధి. అందులో వాళ్ల ఆధిపత్యం పోతుందని భయం.
కానీ అదంతా తప్పు. వేదం అంటే జ్ఞానం కదా, అది ఒకరి అధీనంలో ఉండడమేమిటి? జ్ఞానానికి అడ్డుగోడలేమిటి? దాన్నెవరు పిడికిట్లో పట్టుకోగలరు? ఇది అందరికీ అందవలసింది... అనుకొని వేదాల్ని అనువదించడం వెుదలుపెట్టాను. సరే... వేదాలకు అనువాదం చేస్తున్నాననగానే బోలెడంత ప్రచారం జరిగింది. దాంతో చాలామంది 'నువ్వు వేదం అనువాదం చెయ్యెుద్దు, నాశనమైపోతావు' అని భయపెట్టేవారు. రాత్రిపూట ఫోన్లొస్తే తీయడానికి కూడా మా కమల భయపడిపోయేది. నా ఇంటి ముందు ఎవడో ఆత్మహత్య చేసుకుంటానంటూ వీరంగం వేశాడు. ఏదైనా మంచిపని చెయ్యాలన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు కదా! అయినా నేను చేయాలనుకున్నది చేశాను. ఊహూ! ఆ భగవంతుడే నాతో చేయించాడు. వెుత్తం పదివేల మంత్రాలు. వాటన్నిటినీ చదివి మనసులో ఉంచుకొని దర్శించి తెలుగులోకి అనువదించడమంటే మాటలా! అప్పటి నా అవస్థ ఇదీ...
ముందర కూచుంటాను. మహారణ్యంలోకి పోయినట్టుంటుంది. పెద్దపులులూ సింహాలూ ఎలుగుబంట్లూ... మనమేం చెయ్యగలం అనిపిస్తుంది. నిమిషం కళ్లుమూసి తెరిస్తే అదే అడవి ఉద్యానంలా కనిపిస్తుంది. అందులో నెమళ్లుంటాయి. కుందేళ్లుంటాయి. కోయిలలుంటాయి. అదే నాకు అర్థమైందని అర్థం. నేను రాస్తుంటే నా కలం వెంబడి ఏదో వెలుగుపాయ వస్తున్నట్టు కనిపిస్తుంది. మన ప్రయత్నం చెల్లదు దానికి. అంతా రాశాక నా అనువాదం చదివితే నాకే ఆశ్చర్యమనిపించింది... స్వరం కూడా ఉన్నదందులో! రాసింది వచనమే అయినా స్వరం ఎలా వచ్చిందో తెలియదు. నేను కావాలని చేసిందయితే కాదు. నా శ్రమ ఫలించింది. 'ఎవరు కొంటారు సార్‌ వేదం... రెండు మూడు వేల కాపీలు పోతే ఎక్కువ' అన్నారు. కానీ వేదానువాదం ప్రచురితమవుతున్నదని తెలియడం ఆలస్యం... ప్రచురణ మొదలవక ముందే 2వేల పుస్తకాలకు ఆర్డరొచ్చింది. అంటే... రూ.30లక్షలు అడ్వాన్సు!. పుస్తకం మార్కెట్లో విడుదలైన రోజున బారులు తీరి నుంచొని మరీ కొన్నారా పుస్తకాన్ని. 'తెలుగువాళ్లూ పుస్తకం కొంటారు' అని ఓ పేరున్న పత్రికలో ఆ అరుదైన సంఘటనపై ఓ వ్యాసం కూడా వచ్చింది. ఆ స్పందన చూసి పుస్తక విక్రేతలే ఆశ్చర్యపోయారు. ప్రజల్లో వేదం పట్ల అంత ఆసక్తి ఉంది. లేకపోతే ఎవరు కొంటారు? ఒక సంవత్సరంలో రూ.50లక్షల టర్నోవర్‌ ఎందుకు అవుతుంది? ఇప్పుడు కనీసం 20వేల మంది ఇళ్లల్లో వేదం ఉన్నది. అదీ నేను అనువాదం చేసింది. అది నాకెంతో సంతోషం.
(చూడండి:- http://uni.medhas.org/unicode.php5?
file=http%3A%2F%2Fwww.eenadu.
net%2Fhtm/weekpanel1.asp)

(Eenadu, 19:08:2007)
------------------------------------------

Labels: ,

Thursday, July 26, 2007

"శత వసంత సాహితీ మంజీరాలు"

(ప్రచురణ: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ భవనం,విజయవాడ-520 010, సం.2002, రూ.250/-)

1999నాటికి మిలీనియం హడావిడి ప్రారంభమైంది.'ఇరవయ్యో శతాబ్దికి వీడ్కోలు చెపుతూ, కొత్త సహస్రాబ్దికి స్వాగతం చెపుతూ వున్న ఈ సంధి సమయంలో, గడిచిపోతున్న ఈ శతాబ్దంలోని గణించదగ్గ శతాలను ఎన్నటం పరిపాటయ్యింది. అలాగే, ఈ శతాబ్దిలో తెలుగులో వచ్చిన పుస్తకాలలో ప్రతి తెలుగువాడు చదువవలసిన 100 పుస్తకాల జాబితా తయారు చేయడానికి, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ లో కృష్ణదేవరాయ ఆచార్య పదవిలో ఉన్న ప్రసిద్ధ తెలుగు విమర్శకుడు, రచయిత శ్రీ వెల్చేరు నారాయణ రావు సారథ్యంలో కొందరు సాహితీ ప్రియులు ఈ క్రింది 100 పుస్తకాలను ఎంపిక చేశారు.' చూడండి:

ఈమాట » ఈ శతాబ్దపు రచనా శతం
అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా 'వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాలు ' అని ఎంపిక చేసిన పుస్తకాల జాబితా విడుదల చేఎసింది. చూడండి (నా బ్లాగ్ పోస్టింగ్ 16:07:2007 "తెలుగులో వంద గొప్ప పుస్తకాలు ") :
తెలుగులో వంద గొప్ప పుస్తకాలు


పై జాబితాల ఆధారంగాను,సాహితీ ప్రముఖుల సలహాలమేరకు, గత వంద సంవత్సరాలలో, 20వ శతాబ్దిలో వెలువడిన వంద వెలుగు చారికల్లాంటి ఉత్తమ పుస్తకాలను పరిచయం చేసే విలువైన వ్యాస సంపుటి ఈ "శత వసంత సాహితీ మంజీరాలు".

ఈ "శత వసంత సాహితీ మంజీరాలు" విజయవాడ ఆకాశవాణికేద్రం నుంచి,జూలై,1999- మే,2002 ల మధ్య , ధారావాహికంగా ప్రసారమైన ప్రసంగ వ్యాసాలు.దీని సంపాదకులు ప్రయాగ వేదవతి,నాగసూరి వేణుగోపాల్ గార్లు.

ఈవంద పుస్తకాలలో కవిత్వానికి సంబంధించి-26,
నాటికలు, నాటకాలు-13,
నవలలు-24,
కథలు-8,
సాహిత్య విమర్శలు-13,
స్వీయ చరిత్రలు-6,
ఇతరాలు-10 ఉన్నాయి.
ఆయా పుస్తకాల ముఖపత్రాల చాయాచిత్రాలు,ఆయా రచయతల, కవుల చాయాచిత్రాలూ ఉన్నాయి.

**********

కవిత్వం(26):

తృణకంకణం(1913), రాయప్రోలు సుబ్బారావు
బసవరాజు అప్పారావు గేయాలు(1921), బసవరాజు అప్పారావు
కృష్ణపక్షం(1925), కృష్ణశాస్త్రి
పిరదౌసి(1932), జాషువా
సౌందర నందము(1932), పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు
రాణా ప్రతాపసింహ చరిత్ర(1934), దుర్భాక రాజశేఖర శతావధాని
పానశాల(1935),దువ్వూరి రామిరెడ్డి
వైతాళికులు(1935), ముద్దుక్రిష్ణ
ఎంకిపాటలు(1935), నండూరి వెంకతసుబ్బారావు
దీపావళి(1937), వేదుల సత్యనారాయణ శాస్త్రి
రాష్ట్రగానము(1938), తుమ్మల సీతారామమూర్తి
ఫిడేలు రాగాల డజన్(1939), పఠాభి
శ్రీ శివభారతము(1943), గడియారం వేంకట శేషశాస్త్రి
నగరంలో వాన(1944), కుందుర్తి ఆంజనేయులు
మగువమాంచాల(1947), ఏటుకూరి వెంకటనరసయ్య
విజయశ్రీ(1948), కరుణశ్రీ
త్వమేవాహం(1949), ఆరుద్ర
మహాప్రస్థానం(1950), శ్రీరంగం శ్రీనివాసరావు
ఆంధ్రపురాణము(1954), మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి
నూతిలో గొంతుకలు(1955), ఆలూరి బైరాగి
పెన్నేటి పాట(1956), విద్వాన్ విశ్వం
కర్పూర వసంత రాయలు(1957), సి.నారాయాణ రెడ్డి
శివతాండవం(1961), పుట్టపర్తి నారాయణాచార్యులు
అగ్నిధార(1961), దాశరథి
అమృతం కురిసిన రాత్రి(1968), తిలక్
ఆధునిక మహాభారతం(1985), గుంటూరు శేషేంద్ర శర్మ

*******

నాటికలు, నాటకాలు(13):

గయోపాఖ్యానం(1890), చిలకమర్తి లక్ష్మీనరసింహం
ప్రతాపరుద్రీయము(1897), వేదం వెంకటరాయశాస్త్రి
కన్యాశుల్కం(1897), గురుజాడ అప్పారావు
పాండవోద్యోగ విజయాలు(1907), తిరుపతి వేంటకవులు
వరవిక్రయం(1923), కాళ్ళకూరి నారాయణ రావు
రాజమన్నారు నాటికలు(1930), పి.వి.రాజమన్నారు
మా భూమి(1947), సుంకర వాసి రెడ్డి
కొత్త గడ్డ(1947), నార్ల వెంకటేశ్వరరావు
ఎన్.జీ.ఓ(1949), ఆత్రేయ
విషాధ సారంగధర(1957), ధర్మవరం కృష్ణమాచార్యులు
కీర్తిశేషులు(1960), భమిడిపాటి రాధాకృష్ణ
ఆశఖరీదు అణా(1964), గోరాశాస్త్రి
త్రిపురనేని రామస్వామి నాటకాలు(1978), త్రిపురనేని రామస్వామి

********

నవలలు(24):

మాతృమందిరం(1918), వేంకట పార్వతీశ్వర కవులు
గణపతి(1920), చిలకమర్తి లక్ష్మీనరసిహం
మాలపల్లి (సంగవిజయం) (1922), ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు
బారిష్టర్ పార్వతీశం(1924), మొక్కపాటి నరసింహశాస్త్రి
మైదానం(1928), గుడిపాటి వెంకటచలం
నారాయణ రావు(1934), అడివి బాపిరాజు
ఓబయ్య (1936), వేలూరి శివరామశాస్త్రి
వేయి పడగలు(1939), విశ్వనాధ సత్యనారాయణ
చదువు(1946), కొడవటిగంటి కుటుంబరావు
చివరకు మిగిలేది (ఏకాంతం) (1946), బుచ్చిబాబు
అసమర్ధుని జీవయాత్ర (1946), గోపీచంద్
మృత్యుంజయులు(1947), బొల్లిముంత శివరామకృష్ణ
అతడు-ఆమె(1950), ఉప్పల లక్ష్మణ రావు
కీలుబొమ్మలు(1951), జి.వి. కృష్ణారావు
అపస్వరాలు(1955), శారద (నటరాజన్)
అల్పజీవి(1956), రావి శాస్త్రి
కాలాతీతవ్యక్తులు(1958), డాక్టర్ శ్రీదేవి
పాకుడు రాళ్ళు(1965), రావూరి భరద్వాజ
కొల్లాయి గట్టితేనేమి(1965), మహీధర రామమోహన రావు
జానకి విముక్తి(1977), రంగనాయకమ్మ
మరీచిక(1979), వాసిరెడ్డి సీతాదేవి
ప్రజల మనిషి(1985), వట్టికోట ఆళ్వారు స్వామి
అనుక్షణికం(1985), వడ్డెర చండీదాస్
చిల్లరదేవుళ్ళు(1987), దాశరధి రంగాచార్య:

**************

కథలు(8):

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు(1915), శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
కాంతం కథలు(1925), మునిమాణిక్యం
మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు(1930), మల్లాది రామకృష్ణ శాస్త్రి
మా గోఖలే కథలు(1941), మాధవపెద్ది గోఖలే
విలోమ కథలు(1976), నగ్నముని
అమరావతి కథలు(1978), సత్యం శంకరమంచి
గాలివాన(1984), పాలగుమ్మి పద్మరాజు
అత్తగారి కథలు(1996), భానుమతీ రామకృష్ణ

**************

సాహి త్య విమర్శలు(13):

కవిత్వతత్త్వ విచారం(1914), కట్టమంచి రామలింగారెడ్డి
నేటికాలపు కవిత్వం(1928), అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు
వేమన(1928), రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ
నవ్యాంధ్ర సాహిత్య వీధులు(1942), కురుగంటి సీతారామాచార్యులు
ఆంధ్ర సాహిత్య చరిత్ర(1954), పింగళి లక్ష్మీకాంతం
ఆరుయుగాల ఆంధ్ర కవిత(1958), ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
సమగ్ర ఆంధ్ర సాహిత్యం(1967), ఆరుద్ర
సాహిత్యంలో దృక్పథాలు(1968), ఆర్.ఎస్.సుదర్శనం
శివభారత దర్శనము(1971), సర్దేశాయి తిరుమల రావు
సారస్వత వివేచన(1976), రాచమల్లు రామచంద్రా రెడ్డి
తెలుగు జానపదగేయ సాహిత్యము(1986), బిరుదురాజు రామరాజు
అర్థశతాబ్దపు ఆంధ్ర కవిత్వం(1994), శ్రీపాద గోపాలకృష్ణమూర్తి
అక్షర తూణీరం(1995), కె.వి.రమణారెడ్డి

************

స్వీయ చరిత్రలు(6):

కందుకూరి స్వీయచరిత్రం(1919), కందుకూరి వీరేశలింగం
నా జీవితయాత్ర(1941), టంగుటూరి ప్రకాశం పంతులు
నేను-నా దేశం(1952), దరిశి చెంచయ్య
ఇదీ నా గొడవ(1953), కాళోజీ నారాయణ రావు
అనుభవాలూ-జ్ఞపకాలూనూ(1955), శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
నా స్మృతిపథంలో(1957), అచంట జానకిరాం

******************

ఇతరాలు(10):

శారద లేఖలు(1934), కనుపర్తి వరలక్ష్మమ్మ
లోవెలుగులు(1937), ముట్నూరి కృష్ణారావు
ఆంధ్రుల సాంఘిక చరిత్ర(1949), సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్రుల చరిత్ర,సంస్కృతి(1951), ఖండవల్లి లక్ష్మీరంజనం,బాలేందు శేఖరం
రస రేఖలు(1965), సంజీవ్‌దేవ్
బుడుగు(1957), ముళ్ళపూడి వెంకట రమణ
ఊహాగానం(1975), తెన్నేటి హేమలత
సాక్షి(1913), పానుగంటి లక్ష్మీఎనరసింహారావు
వదరుబోతు(1935), పప్పూరి రామాచార్యులు
కొత్తపాళి(1955), తాపీ ధర్మా రావు


********************

ప్రస్తుత పాఠకులకు చాలామందికిఈ పుస్తకాలతో పరిచయముండకపోవచ్చు.ఈ స్పీడ్ యుగంలో పుస్తకాలన్నింటినీ చదివే సమయమూ, ఓపికా ఉండకపోవచ్చు. అలాంటివారికి ఆయా పుస్తకాల పరిచయం, కనీసం ఈ సమీక్షల ద్వారానైనా కలుగుతుంది.

కొని దాచుకోదగ్గ ఒక అపురూపమైన సంకలనం ఇది.



---------------------------------------------

Labels: ,

Monday, July 16, 2007

తెలుగులో వంద గొప్ప పుస్తకాలు

వెయ్యేళ్ళ తెలుగు సాహితీ ప్రస్థానం పిల్ల కాలువలా మొదలై, నదీ ప్రవాహమై, సాగరమై, సుసంపన్నమై మైలురాళ్ళను నెలకొల్పుతూ ముందుకు సాగుతూ ఉన్నది.అటువంటి సాగరతుల్యమైన సాహిత్యం నుంచి 'గొప్ప వంద పుస్తకాలు ఇవే ' అని తేల్చి చెప్పడం కష్టసాధ్యమైన పని. రచయితలు కొందరు విడి విడిగా ఇటువంటి ప్రయత్నంచేసారు. వాటిని గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు., కాని ఆంధ్రజ్యోతి దినపత్రిక 1999 దిసెంబర్ లో ముద్రించిన జాబితాను ఇక్కడ పొందుపర్చుతున్నాము. అప్పట్లో ఆంధ్రజ్యోతి సాహిత్యవేదికను చూస్తున్న సీనియర్ జర్నలిస్టు, రచయిత పొనుగోటి కృష్ణారెడ్డి తెలుగులో వచ్చిన గొప్ప వంద పుస్తకాలను ఎంపిక చేయడానికి ఓ మంచి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు, కవులు, విమర్శుకులు, మేధావులు,పుస్తక ప్రియులనుంచి గొప్ప వంద పుస్తకాలకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరిపారు.వారిలో 44 మంది రచయితలు తమ అభిప్రాయాలను పంపారు. ఈ అభిప్రాయాల ప్రాతిపదికగా రూపొందించి, అంధ్రజ్యోతిలో ప్రచురించిన జాబితాను వరుసక్రమంలో ఇక్కడ ఇచ్చాము. ఈ జాబితా ఎంపికలోనూ అనేక పరిమితులున్నాయని, ఇదే సమగ్రమైన జాబితా అని చెప్పడానికి సాహసించడం లేదని అప్పట్లో సంపాదకులు ప్రకటించారు. అభిప్రాయ సేకరణలో పాల్గొన్న రచయితల వ్యక్తిగత అభిరుచి, వారికి ఉండే పరిమితుల కారణంగా కొన్ని ప్రముఖ రచనలకు ఇందులో స్థానం లభించకపోయివుండవచ్చు. అంతమాత్రం చేత ఆ రచనల ప్రాధాన్యం తగ్గిపోదు. ఆంధ్రజ్యోతి అప్పట్లో వంద గొప్ప కథలను కూడ విడిగా ఎంపిక చేసింది.అందువల్ల గొప్ప వంద పుస్తకాల జాబితాలో కథల సంపుటాల గురించిన ప్రస్తావన చేయలేదు.


1] కన్యాశుల్కం:-గురుజాడ అప్పారావు

2] మహాప్రస్థానం: - శ్రీశ్రీ

3] ఆంధ్రమహాభారతం:-కవిత్రయం

4] మాలపల్లి (సంగవిజయం):-ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు

5] చివరకు మిగిలేది (ఏకాంతం):-బుచ్చిబాబు

6] అసమర్ధుని జీవయాత్ర :-గోపీచంద్

7] దేవరకొండ బాలగంగాధర తిలక్:-అమృతం కురిసిన రాత్రి

8] కాలాతీతవ్యక్తులు:-డాక్టర్ శ్రీదేవి

9] వేయి పడగలు:-విశ్వనాధ సత్యనారాయణ

10] పింగళి సూరన:- కళాపూర్ణోదయం

11] సాక్షి:-పానుగంటి లక్ష్మినరసింహారావు

12] గబ్బిలం:-జాషువా

13] వసుచరిత్ర:-భట్టుమూర్తి

14] అతడు ఆమె::-ఉప్పల లక్ష్మనరావు

15] అనుభవాలు జ్ఞాపకాలు:-శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

16] ఆముక్తమాల్యద:- శ్రీకృష్ణదేవరాయలు

17] చదువు:-కొడవటిగంటి కుటుంబరావు

18] ఎంకి పాటలు:-నండూరి సుబ్బారావు

19] కవిత్వ తత్త్వ విచారము:- డాక్టర్ సి ఆర్ రెడ్డి

20] వేమన పద్యాలు:-వేమన

21] కృష్ణపక్షం:-కృష్ణశాస్త్రి

22] మట్టిమనిషి:-వాసిరెడ్డి సీతాదేవి

23] అల్పజీవి:-రావి శాస్త్రి

24] ఆంధ్రుల సాంఘిక చరిత్ర:-సురవరం ప్రతాప రెడ్డి

25] ఆంధ్ర మహాభాగవతం:-పోతన

26] బారిష్టర్ పార్వతీశం:-మొక్కపాటి నరసింహశాస్త్రి

27] మొల్ల రామాయణం:-ఆతుకూరి మొల్ల

28] అన్నమాచార్య కీర్తనలు:-అన్నమాచార్య

29] హంపీ నుంచి హరప్పాదాకా:-తిరుమల రామచంద్ర

30] కాశీయాత్రా చరిత్ర:-ఏనుగుల వీరాస్వామయ్య

31] మైదానం:-చలం

32] వైతాళికులు:-ముద్దుకృష్ణ

33] ఫిడేలు రాగాల దజను:-పఠాభి

34] సౌందర నందము:-పింగళి, కాటూరి

35] విజయవిలాసం:-చేమకూర వేంకటకవి

36) కీలుబొమ్మలు:-జీ.వీ. కృష్ణారావు

37] కొల్లాయి గడితేనేమి:-మహీధర రామమోహనరావు

38] మ్యూజింగ్స్:-చలం

39] మనుచరిత్ర:-అల్లసాని పెద్దన

40] పాండురంగ మహత్యం:-తెనాలి రామకృష్ణ

41] ప్రజల మనిషి:-వట్టికోట ఆళ్వారు స్వామి

42] పాండవోద్యోగ విజయములు:-తిరుపతి వేంకటకవులు

43] సమగ్ర ఆంధ్ర సాహిత్యం:-ఆరుద్ర

44] దిగంబర కవిత:-దిగంబర కవులు

45] ఇల్లాలి ముచ్చట్లు:-పురాణం సుబ్రమన్య శర్మ

46] నీలిమేఘాలు:-సంపాదకత్వం:వోల్గా

47) పానశాల:-దువ్వూరి రామిరెడ్డి

48] శివతాండవం:-పుట్టపర్తి నారాయాణాచార్యులు

49) అంపశయ్య:-నవీన్

50] చిల్లర దేవుళ్ళు:-దాశరథి రంగాచార్య

51] గణపతి:-చిలకమర్తి లక్ష్మీనరసింహం

52] జానకి విముక్తి:-రంగనాయకమ్మ

53] స్వీయ చరిత్ర:-కందుకూరి

54] మహోదయం:-కె.వి.రమణారెడ్డి

55] నారాయణరావు:-అడవి బాపిరాజు

56] విశ్వంభర:-డాక్టర్ సి.నారాయణరెడ్డి

57] దాశరథి కవిత:-దాశరథి

58] కథాశిల్పం:-వల్లంపాటి వెంకటసుబ్బయ్య

59] నేను-నా దేశం:-దర్శి చెంచయ్య

60] నీతి చంద్రిక:-చిన్నయ సూరి

61] పెన్నేటి పాట:-విద్వాన్ విశ్వం

62] ప్రతాపరుద్రీయం:-వేదం వెంకటరాయశాస్త్రి

63] పారిజాతాపహరణం:-నంది తిమ్మన

64] పల్నాటి వీర చరిత్ర:-శ్రీనాథుడు

65] రాజశేఖర చరిత్ర (వివేక చంద్రిక):-కందుకూరి వీరేశలింగం పంతులు

66] రాధికా సాంత్వనము:-ముద్దుపళని

67] స్వప్న లిపి:-అజంతా

68] సారస్వత వివేచన:-రాచమల్లు రామచంద్రారెడ్డి

69] శృంగార నైషధం:-శ్రీనాథుడు

70] ఉత్తర రామయణం;-కంకంటి పాపరాజు

71] విశ్వదర్శనం:-నండూరి రామమోహనరావు

72] అనుక్షణికం:-వడ్డెర చండీదాస్

73] ఆధునిక మహాభారతం:-గుంటూరు శేషేంద్ర శర్మ

74] అడవి ఉప్పొంగిన రాత్రి:-విమల

75] చంఘీజ్ ఖాన్:-తెన్నేటి సూరి

76] చాటుపద్య మంజరి:-వేటూరి ప్రభాకర శాస్త్రి

77] చిక్కనవుతున్నపాట:-జి.లక్ష్మీనరసయ్య, త్రిపురనేని స్రీనివాస్

78] చితి-చింత:-వేగుంట మోహనప్రసాద్

79] గద్దర్ పాటలు:-గద్దర్

80] హాంగ్ మి క్విక్:-బీనాదేవి

81] ఇస్మాయిల్ కవిత:-ఇస్మాయిల్

82] కుమార సంభవం:-నన్నె చోడుడు

83] కొయ్య గుర్రం:-నగ్నముని

84] మైనా:-శీలా వీర్రాజు

85] మాభూమి:-సుంకర,వాసిరెడ్డి

86] మోహన వంశీ:-లత

87] నగరంలో వాన:-కుందుర్తి

88] రాముడుండాడు రాజ్యముండాది:-కేశవరెడ్డి

89] రంగనాథ రామాయణం:-గోన బుద్ధారెడ్డి

90] సౌభద్రుని ప్రణయ యాత్ర:-నాయని సుబ్బారావు

91] సూత పురాణం:-త్రిపురనేని రామస్వామి చౌదరి

92] శివారెడ్డి కవిత:-శివారెడ్డి

93] సాహిత్యంలో దృక్పథాలు:-ఆర్.ఎస్.సుదర్శనం

94] స్వేచ్ఛ:-వోల్గా

95] తెలుగులో కవితావిప్లవాల స్వరూపం:-వేల్చేరు నారాయణరావు

96] కరుణశ్రీ:-జంధ్యాల పాపయ్య శాస్త్రి

97] వేమన:-రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ

98] తృణకంకణం:-రాయప్రోలు

99] హృదయనేత్రి:-మాలతీ చందూర్

100]
బ్రౌను నిఘంటువు:-చార్లెస్ బ్రౌను

(జర్నలిష్టు కరదీపిక,సంపాదకుడు:కట్టా శేఖర్ రెడ్డి,
న్యూ మీడియా కమ్యూనికేషన్స్, హైదరాబాద్,2006)
--------------------------------------------------------
ఈ క్రింది సైటు కూడా చూడండి::
ఈమాట » ఈ శతాబ్దపు రచనా శతం

Labels: ,

చదవాల్సిన పుస్తకాలు

..'ఈనాడు' జర్నలిజం స్కూలు, 'ఆంధ్రజ్యోతి ' జర్నలిజం కళాశాలలు- జర్నలిస్టులు కాదలచినవారు చదవాల్సిన పుస్తకాల జాబితాలను రూపొందించాయి.ఆ జాబితాలోని తెలుగు నవలలు, నాటకాలు, కథలు, కవిత్వం, వ్యాసాల పేర్లు:

నవలలు:
ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులు:-'మాలపల్లి' (సంగవిజయం),
గుడిపాటి వెంకటచలం:-'మైదానం'
తెన్నేటి సూరి: -'చంఘీజ్ ఖాన్'
మొక్కపాటి నరసింహశాస్త్రి:-'బారిష్టర్ పార్వతీశం'
బుచ్చిబాబు:-'చివరకు మిగిలేది'(ఏకాంతం)
చిలకమర్తి లక్ష్మీనరసిహం:-'గణపతి '
కొడవటిగంటి కుటుంబరావు :-'చదువు'
డాక్టర్ శ్రీదేవి:-'కాలాతీతవ్యక్తులు'
గోపీచంద్:-'అసమర్ధుని జీవయాత్ర'
విశ్వనాధ సత్యనారాయణ:-'వేయి పడగలు'
బీనా దేవి:-'పుణ్యభూమీ కళ్ళుతెరు'
వాసిరెడ్డి సీతాదేవి:-'మట్టిమనుషులు'
ముప్పాళ రంగనాయకమ్మ: -'జానకి విముక్తి '
నామిని సుబ్రమణ్యం నాయుడు:-'ముని కన్నడి సేద్యం'
వడ్డెర చండీదాస్:- 'హిమజ్వాల'
నవీన్:-'అంపశయ్య'

నాటకాలు:
గురుజాడ అప్పారావు: -'కన్యాశుల్కం'
సుంకర, వాసిరెడ్డి: -'మా భూమి'

కథలు
గురుజాడ అప్పారావు: -'గురుజాడ కథలు '
కాళీపట్నం రామారావు: -'యజ్ఞంతో తొమ్మిది'
రావి శాస్త్రి:-'రావి శాస్త్రి కథలు'
చాగంటి సోమయాజులు: -'చాసో కథలు'
దేవరకొండ బాలగంగాఘధర తిలక్: -'తిలక్ కథలు'
ప్రేంచంద్ : -'ప్రేంచంద్ కథలు'
శ్రీపాదసుబ్రమన్యశాస్త్రి: -'శ్రీపాద కథలు'

కవిత్వం
శ్రీశ్రీ: -'మహాప్రస్థానం'
దేవరకొండ బాలగంగాఘధర తిలక్: -'అమృతంకురిసిన రాత్రి'
దేవులపల్లి కృష్న శాస్త్రి: -'కృష్ణ పక్షం'
నండూరి సుబ్బారావు: -'ఎంకి పాటలు'
ఆరుద్ర: -'త్వమేవాహం'
డాక్టర్ సి.నారాయణ రెడ్డి: -'విశ్వంభర'
కుందుర్తి:-'నాలోని నాధాలు'

వ్యాసాలు
పానుగంటి లక్ష్మీనరసింహారావు: -'సాక్షి వ్యాసాలు '
కొడవటిగంటి కుటుంబరావు: -'కొడవటిగంటి రాజకీయ వ్యాసాలు'
ఎబికె ప్రసాద్: -'ఎబికె సంపాదకీయాలు '
నార్ల వెంకటేశ్వర రావు: -'మూడు దశాబ్దాలు '

(జర్నలిష్టు కరదీపిక, సంపాదకుడు: కట్టా శేఖర్ రెడ్డి,2006.)
-------------------------------------------------

Labels: ,

Thursday, November 16, 2006

'పెద్దబాలశిక్ష '

.....వర్తకానికి వచ్చి రాజ్యాధిపతులైన ఆంగ్లేయులు మన దేశాన్ని దోచుకొని పోవడం వాళ్ళకు తప్పుగా కనపడలేదు. వారి కొలువులో వున్న దేశీయులు బతుకు తెరువు కోసం చేతనైన ఆర్జనలు చేయడం తప్పు కాదనిపించింది. రెవెన్యూ డిపార్టుమెంటులో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూవున్న నేటివులు అడ్డదారులు తొక్కి ధనార్జన కోసం అక్రమాలు అన్యాయాలు మోసాలు దగాలు తప్పుడు రికార్డులు సృష్టించడం మొదలైనివి చేస్తున్నారని తెల్లదొరలు గుర్తించారు.నేటివులు విశ్వసనీయంగా ప్రవర్తించాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించారు.నేటివుల విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకున్నారు.ఆనాటి మద్రాసు గవర్నరు సర్ తామస్ మన్రో 1822 జూలై రెండో తేదీన ఒక యీ దస్తు కోరారు.అందులో ఇలా వుంది :
‘రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా
సర్వేలు చేయించాము .దేశంలో పండే పంటల ఆరాలు
తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము.జనాభా
లెక్కలు గుణించాము.అంతేగాని నేటివుల విద్యావిధానం
గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.'

నేటివులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో ఏ మార్పులను తీసుకు రావాలో తెలుసుకున్నారు. అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను రాయించిన ప్రభువులు నేటివుల కోసం ప్రాథమిక గ్రంథాలను రాయించాలని అనుకొన్నారు.
1832 లో మేస్తర్ కుళులో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీతారామశాస్త్రిగారి చేత ‘బాలశిక్ష ‘అనే గ్రంథాన్ని రచింపచేశాడు. వీరి రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని గ్రంథకర్త రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.

1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు.
1865లో అంటే రమారమి పదేళ్ళ తర్వాత ముద్రణలో పుటల సంఖ్య 90. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, చందస్సు సంస్కృత శ్లోకాలు , భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు.దానిని 'బాలవివేకకల్ప తరువు 'గా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోవున్న పుస్తకం 'పెద్దబాలశిక్ష 'గా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్దబాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి-అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు- అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు- నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారత్రిక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పూదూరువారు పొందుపరచారు.

ఆ తరువాత, 1832 నుండి ఇప్పటివరకు 'పెద్దబాలశిక్ష 'ను తెలుగు సమాజం ఆదరించగా కొన్ని మార్పుల చేర్పులతో ఎంతోమంది ప్రచురణకర్తలు ఎన్నో పండిత పరిష్కరణలతో అందిస్తూవచ్చారు. ఆ మధ్య ఎన్నో 'గుజిలీ ' ఎడిషన్లు కూడా లభిస్తూ వచ్చాయి.పుదూరివారి తర్వాత పేర్కొనదగిన పరిష్కరణ
1916లో వావిళ్ళ వారిది. దీని విపుల పరిష్కరణను 1949లో అందించారు.భాషోద్దారకులు వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు 1949 పరిష్కరణలో ఇలా చెప్పారు: “భారత దేశమునకు స్వరాజ్యము లభించినందుకు ఇక ముందు దేశభాషలకు.... విశేషవ్యాప్తి ఏర్పడి ఇట్టి ('పెద్దబాలశిక్ష ') గ్రంథములకు వేలకువేలు ప్రచారమగునని తలంచుచున్నాను.” ఇప్పుడు భారత దేశానికి స్వరాజ్యం వచ్చిన ఏభైతొమ్మిది సంవత్సరాలకు కూడా వయోజనులకే కాక, తెలుగు పిల్లలకు తెలుగుదనాన్ని నేర్పి చక్కని పండితపౌరులుగా తీర్చిదిద్దే సామర్ధ్యం ఈ 'పెద్దబాలశిక్ష 'కు ఉంది.1983లో రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రాశస్త్యాన్ని గ్రహించి కొన్ని భాగాల్ని పాఠ్యాంశాలుగా కూడ చేర్చింది.పత్రికాధిపతులు, విజ్ఞులు 'పెద్దబాలశిక్ష 'ను గుణశీల పేటికగా అభివర్ణించారు.
________________________________________
(
సంకలనం: బుడ్డిగ సుబ్బరాయన్ గారి "సురభి-పెద్ద బాలశిక్ష"1997, లోని ఆరుద్ర గారి 'ఆనంద వాక్యాలు ', బుడ్డిగ సుబ్బరాయన్ గారి 'నా మాట ' ల నుండి)
________________________________________
ప్రస్తుతం తెలుగునాట పన్నెండు రకాలపైనే 'పెద్దబాలశిక్ష 'లు లభిస్తున్నాయి. పైచెప్పిన బుడ్డిగ సుబ్బరాయన్ గారి
"సురభి-పెద్ద బాలశిక్ష"-1997(398 పుటలు)రూ.119.99 మరియు గాజుల సత్యనారాయణ గారి "తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష"-2005 (1022 పుటలు)రూ.116- రెండూ కూడా మంచి సంప్రదింపు గ్రంథాలు.
____________________________________________

Labels: ,