My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, November 20, 2006

'తెలుగుదనం '


తెలుగువాడు అనగానే జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డిగారి గేయం గుర్తుకు రాకమానదు.

శాతవాహునుల వంశాన పుట్టినవాడు
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతమ్ము
పెద్దగద్దెలనేలి పేరుకెక్కినవాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.

పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు
కండువా లేనిదే గడపదాటని వాడు
పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసేవాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.


నేల నల్దెసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టె ఒదిగిన వాడు
"ఏ దేశమేగినా ఎందుకాలిడినా"
ఆవకాయ వియోగ మసలెసైపని వాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.

మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు
భాయి భాయి అన్న చేయి కలిపేవాడు
తిక్కరేగిందంటె డొక్క చీల్చేవాడు
చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు
ఎవడయ్య ఎవడు వాడు ఇం
కెవడయ్య తెలుగువాడు.

తెలుగువారు తమ వేషభాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, అచార వ్యవహారాలు, ఒక్కటేమిటి, అన్నింటా క్రమక్రమంగా 'తెలుగుదనం ' కోల్పోతున్నారనే విమర్శ ఈ మధ్య సర్వత్రా వినబడుతున్నది. మిగతా అందరు తమ సంస్కృతిని,అచార వ్యవహారాలను నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తుండగా ఒక్క తెలుగువారి విషయం లోనే ఇలా ఎందుకు జరుగుతున్నది? ఇది అందరు తీవ్రంగా ఆలోచిచవలసిన విషయం.

అంతకంటే ముందు అచ్చ తెలుగుదనం అంటే , ఎలా ఉంటుందో ఈ తరం వారు తెలుసుకోవలసిన అవసరం ఉంది.ఒకప్పుడు తెలుగువారి ఇళ్ళల్లో అడుగడుగునా, అణువణువునా తెలుగుదనం ఉట్టిపడుతుండేది. క్రమంగా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తెలుగువారిపై ఇతోధికంగా పెరిగిపొవడంతొ తెలుగుదనం అడుగంటి పోవడం ప్రారంభం అయింది.

ఈ నేపథ్యంలో తెలుగిళ్ళు, తెలుగింటి సంప్రదాయాలు , తెలుగువారి వేషభాషలు, తెలుగు వంటలు, తెలుగింటి మర్యాదలు, తెలుగువారి పలకరింపులు, అచ్చ తెలుగు తిట్లు, దీవెనలు, తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎలా వుండేవో తెలుసుకుందాం.

తెలుగిళ్ళు, వాకిళ్ళు
తెలుగిళ్ళు, వాకిళ్ళు, ముంగిళ్ళు ఎప్పుడూ కళకళలాడుతూ పండగ వాతావరణంలో వుండటం ఒకప్పుడు సంప్రదాయంగా వుండేది. తెలుగిళ్ళు, వాకిళ్ళు నిత్యం అలంకరణలతో శోభాయమానంగా వుండేవి.ఇంటికి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ వుండేది. ప్రహరీ గోడకు వెదురుతోనో, కొయ్యలతోనో ఒక తడిక ద్వారం వుంటుంది. ప్రహరీగోడ వెంబడి నీడనిచ్చే పెద్ద పెద్ద చెట్లు వుంటాయి. కొబ్బరి చెట్లు తప్పనిసరి.కొబ్బరాకుల పలకరింపు లేనిదే తెలుగువారికి తెల్లవారదు. కొందరు వేప, మామిడి చెట్లు కూడా వేసుకునేవారు.

వీటికితోడు ముంగిట్లో పూలమొక్కలు, పెరట్లో చిన్న చిన్న కూరగాయల మొక్కలు, ఫల వృక్షాలు వుండేవి. ముంగిట్లో మందారం, నందివర్ధనం మొక్కలు వేసేవారు. ఈ రెండు రకాల పువ్వులు పూజకు విరివిగా ఉపయోగపడతాయి. పందిళ్ళు వేసి, మల్లె, సన్నజాజి తీగలు పాకించేవారు. దీంతో ముంగిలి అంతా ఉద్యానవనంలా కళకళలాడుతూ లోనికి అడుగు పెట్టగానే చల్లగా, హాయిగా సువాసనలతో స్వాగతం చెపుతున్నట్టు అనిపిస్తుంది.

వాకిట్లో ఒక పక్కగ ఇత్తడి గంగాళంలో నీళ్ళు, ఇత్తడి చెంబు వుంటాయి. వాకిట్లోనే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలన్నమాట. ఇళ్ళు నేరుగా గదులతో మొదలుకావు. ముందుగా ఇంటికి ఇరువైపులా ఎర్రమట్టితో అలికి, ముగ్గులు పెట్టిన అరుగులు వుంటాయి. అరుగులు లేనిదే తెలుగింటికి సొగసు రాదు.

ఇంటికి ముందు ఒక విశాలమైన చావిడి ఉంటుంది. ఇది తలుపులు లేకుండా ఖాళీగ వుంటుంది. ఇది పిల్లలు ఆడుకోడానికి, మూటలు, సరుకులు దించుకోడానికి ఉపయోగపడే స్థలం. ఇది దాటితే సింహద్వారం,లేదా తలవాకిలి వుంటుంది. దీనికి పెద్ద పెద్ద గుమ్మాలు, దేవుళ్ళ బొమ్మలు, పువ్వులు, లతలు చెక్కిన పెద్ద తలుపు వుంటాయి. గడపలకు పసుపు కుంకుమలు అలంకరించి, గుమ్మాలకు తోరణాలు కట్టి వుంటాయి.

లోపల మొదటగా వుండే పెద్ద గదిలో దూలాల నుంచి పెద్ద ఇనుపగొలుసులతో వేలాడదీసిన ఉయ్యాలబల్ల వుంటుంది. ఇది లేనిదే ఇంటికి నిండుతనం రాదు. పిల్లలు ఎక్కి ఊగటానికి, పెద్దవాళ్ళు నిద్రపోవడానికి అనువైనది ఈ ఉయ్యాల బల్ల. మిగతా గదులు ఎవరి అవసరాన్ని, స్తోమతను బట్టి ఏర్పాటు చేసుకుంటారు. పూజగది మాత్రం ఒకటి తప్పనిసరిగ వుంటుంది.

ఇక పెరట్లో నీడనిచ్చే పెద్ద చెట్లతోపాటూ చిన్న చిన్న కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు వుంటాయి. ఒక కరివేపాకు చెట్టు తప్పనిసరిగా వేసుకుంటారు. నిమ్మచెట్లు వగైరా వుంటాయి. పెరట్లో ఒక చేదబావి వుంటుంది. ఈ బావికి గిలక వుండి, పెద్ద చేంతాడు, చేంతాడుకు ఒక బొక్కెన వుంటాయి.

పెరటి గుమ్మానికి ఎదురుగా తులసి కోట వుంటుంది. తులసి కోటకు చుట్టూ కొందరు అరుగు వేసుకుంటారు. సాయంత్రం వేళల ఇది కూర్చోడానికి హాయిగ వుంటుంది. తలవాకిలికి ఇరువైపులా, తులసికోటకూ- ముక్కోణపు ఆకారంలో గూళ్ళు వుంటాయి.ఇందులో సంధ్య దీపం పెడతారు.

పూజలు పునస్కారాలు

తెలుగిళ్ళు, పూజలు పునస్కారాలకు పెట్టింది పేరు. నాస్తికత్వం అంతగా ఉండేది కాదు. భగవంతుణ్ణి నమ్మేవారు. ఫండగ రోజుల్లోలాగానే ప్రతిరోజు తప్పనిసరిగా పెద్ద ఎత్తున పూజలు చేసేవారు. వృద్ధులకు పూజలు, అచారవ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. పూజ చేయనిదే పచ్చి మంచినీళ్ళయినా ముట్టని ఆచార సంపన్నులు వుండేవారు. మడి, తడి, కట్టుబాట్లు అధికంగా వుంటాయి. కొందరికి వుండేవికావు. దేవతార్చనలు, సుప్రభాతాలు,అష్టోత్తరాలు సాగేవి. సోమవారం, శుక్రవారాలలో పూజలు కొంచం పెద్ద ఎత్తున వుండేవి. ఇక పర్వదినాల్లో అయితే చెప్పనక్కర్లేదు.విశేషంగా భారి ఎత్తున పూజలు చేస్తారు. దేవుడి గదినీ, దేవుళ్ళ మంటపాలను విశేషంగా అలంకరిస్తారు. దేవుళ్ళ విగ్రహాలను తళతళలాడేలా తోమి వుంచుతారు. దేవుళ్ళ పటాలకంటే విగ్రహపూజ అధికంగా ఉండేది. పూజకోసం పంచపాత్ర, ఉద్ధరిణ, గంట, హారతి పళ్ళేలు, పూల సజ్జలు, పసుపుకుంకుమల గిన్నెలు, కలశం చెంబులు, వెండిబిందెలు, పానకం బిందెలు, పూల పళ్ళాలు వగైరా వుంటాయి.

పండుగలు

పండుగలను మనం ఇంకా మరచిపోనందుకు సంతోషించాలి. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ పండగలు వుండేది తెలుగువారికేనంటే అతిశయోక్తి కాదు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఉగాది, శ్రీరామనవమి,గోకులాష్టమి, వినాయక చవితి, దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి(దసరా),బోనాల పండుగ, నరక చతుర్దశి, దీపావళి సాధారణంగా పెద్దేత్తున జరుపుకొనే పర్వదినాలు. మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి, హనుమజ్జయంతి, వ్యాసపూర్ణిమ, మాఘపూర్ణిమ, వరలక్ష్మీవ్రతం, పోలాల అమావాశ్య, అత్లతద్ది, నాగుల చవితి, కార్తీకపూర్ణిమ, క్షీరాబ్దిద్వాదశి, సుబ్రమణ్యషష్టిలాంటివెన్నో పర్వదినాలున్నాయి. అయితే ఇందులో చాలా పండుగలను మనం దాదాపు మర్చేపోయాము. గుర్తున్నా ఆచరించేవారు లేరు. అసలు వీటి ప్రాధాన్యం ఏమిటో, చరిత్ర ఏమిటో, వీటిని ఎలా ఆచరించాలో కూడా చాలామందికి తెలియదు. శలవు వస్తేనే పండగలను గుర్తిస్తున్నారు. శలవులేని పండుగలు మరుగున పడిపోతున్నాయి. అయితే పత్రికాముఖంగానైనా వీటిని గురించి తెలుసుకోవడం అవసరం.

సంస్కారాలూ సంప్రదాయాలు

బారసాల, అన్నప్రాసన, నామకరణాలు, సీమంతాలు, గృహప్రవేశాలను కూడా సంప్రదాయంగా, కళాత్మకంగా నిండయిన తెలుగుదనంతో చేసుకోవడం తెలుగువారి ప్రత్యేకత.

పెండ్లి అంటే తెలుగువారింట పెద్ద సందడి.పెళ్ళిలో ముఖ్యాంశాలు- పెండ్లి చూపులు, చిన లగ్నాలు(నిశ్చితార్థం), తరలి వెళ్ళడం, విడిది, వరపూజ, బాసికా ధారణ, అడ్డుతెర, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్యధారణ, అక్షితలు, తలంబ్రాలు, పాణిగ్రహణం, సప్తపది, తొలిస్పర్శ (బొటనవేలు తొక్కియ్యడం) , మూడు ముళ్ళెయ్యదం, నాతిచరామి ప్రమాణం, అరుంధతీ నక్షత్ర దర్శనం, అంపకాలు, మూడు నిద్రలు, బట్టలివ్వడం (శోభన కార్యక్రమం) మొదలైనవి.

వంటలు, పిండివంటలు

తెలుగువారి పిండివంటలకు చాల ప్రత్యేకతలున్నాయి. ఇవి వ్యాపార దృక్పథంతో కాక కుటుంబ సభ్యులు అంతా కలిసి కూర్చుని తినడానికి, బంధుమిత్రులకు పంచడానికి, ప్రత్యేకంగా పర్వదినాల్లో తయారుచేసి, దేవునికి నైవేద్యం పెట్టడానికి ఉద్దేశించినివి. తెలుగు వారు నవకాయ పిండివంటలు చేస్తారు.

తీపి పిండివంటల్లో లడ్డు,రవ్వలడ్డు, తొక్కుడులడ్డు, పూర్ణాలు, బొబ్బట్లు, కజ్జికాయలు, సున్నుండలు, కాజాలు, పోళీలు, పరమాన్నం, గవ్వలు, అరిసెలు, పూతరేకులు, చలిమిడి, చిమ్మిలి, బూరెలు మొదలైనవి తెలుగువారి ప్రత్యేకమైన తీపి వంటలు.

తీరుతీరుగా ప్రతిరోజు కారపూస, చేగోడీలు,జంతికలు, చక్కిలాలు, పునుగులు, ఉండ్రాళ్ళు, పాలకాయలు, ఆవడలు, బజ్జీలు, పకోడీలు, కారబూంది, గారెలు, గట్టివడలు, పులిహోర, దద్దోజనం మొదలైనవి వున్నాయి.

తీరుతీరుగా ప్రతిరోజూ పలురకాల వంటకాలు, అధరువులు చేసుకొని తినడంలో తెలుగువారిని మించినవారు లేరు. ఒకప్పుడు తెలుగింట భోజనాలు అంటే ప్రతిరోజూ పండగ వాతావరణాని తలపింప చేసేవి. గుత్తివంకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, కొబ్బరి పచ్చడి, పులుసు, చారు, రోటి పచ్చళ్ళు, మిరపతొక్కు, చిత్రాన్నం, దప్పళం, కాకరపులుసు, వడియాలు, అప్పడాలు, ఒరుగులు, చింతకాయ పచ్చడి, పనసపొట్టు కూర, అరటిపువ్వు కూర, కంది పెసర పొడులు, పెరుగు పచ్చళ్ళు, ఊరగాయలు, నిల్వపచ్చళ్ళు- ఇవన్నీ తెలుగు ఇంట నిత్య వంటకాలు. పంక్తిభోజనాల వంటకాలు వేరుగా వుంటాయి.

తెలుగింటి ఆటలు

తెలుగిళ్ళలో పిల్లలలతోపాటూ పెద్దలు కూడా సరదాగా రకరకాల ఆటలు ఆడుకుంటుంటారు.

పిల్లల ఆడే ఆటల్లో గుజ్జనగూళ్ళు, బొమ్మలపెళ్ళిల్లు, కొయ్యబొమ్మలు, లక్కపిడతల ఆటలు, బుజబుజరేకులు, దాగుడుమూతలు, కూర్చుంటే కుర్రు మొదలైన ఆటలు ఆడుకుంటారు.

వయసులో ఉన్న అమ్మాయిలు చెమ్మచెక్కలు,కోలాటాలు, అట్లతదియ ఆటలు, ఉయ్యాలాటాలు,బుజబుజరేకులు, కుందుళ్ళు, తలబిళ్ళాటాలు
చేతిబిళ్ళాటాలు,దాగుడుమూతలు,గళ్ళాటలు ఆడుతుంటారు.

ఇక మధ్యవయసు స్త్రీలు వామన గుంటలు, గచ్చకాయలు, చింతపిక్కలు, అష్టాచెమ్మ, గవ్వలు, పులికట్ట,దోయాలు, పచ్చీసాటలు, పాచికలు, పావులాటలు అడుకునేవాళ్ళు. ఈఆటలకోసం గచ్చకాయలు, గుండ్రని రాళ్ళు, గవ్వలు, చింతగింజలు, చింతపిక్కలు, పాచికలు, వామన గుంటల పీటలు ప్రత్యేకంగా తెచ్చుకునేవాళ్ళు.

అచ్చ తెలుగు తిట్లు

తెలుగు తిట్లకు ప్రత్యేకతలున్నాయి. తెలుగువారి అచ్చతెలుగు తిట్లు కొన్ని ఆగ్రహం కాక నవ్వు తెప్పుస్తుంటాయి. కొన్ని ముద్దుగా, మురిపెంగా వుంటాయి. శుంఠ, అప్రాచ్యుడు, మొద్దురాచ్చిప్ప, బఢవ, వెధవాయి, చవటాయి, సన్నాసి, వాజమ్మ, ముద్దపప్పు, బడుద్ధాయి, అవతారం, నంగనాచి, సన్నసి, వాజమ్మ, ముద్దపప్పు, బడుద్ధాయి, నాలిముచ్చు, కుర్రకుంక, వెర్రిమాలోకం, చవట సన్నాసి లాంటి అచ్చ తెనుగు తిట్లు ప్రతి తెలుగింటా ప్రతిధ్వనిస్తుంటాయి.

నిజానికి అవి తిట్లు కాదు. దీవెనలే. "నేతి గారెలు వేడివేడిగా తింటాడనుకొంటే ఈ సన్నాసి ఎటు వెళ్ళడో?" అని బామ్మగారు దిగులులుపడుతుంది. మడికటుకొన్నాను. నన్ను అంటుకోకురా భడవా." అని అమ్మమ్మ ముద్దుగా కోప్పడుతుంది. "మా బడుద్ధాయి ఎంత బాగా పాడతాడో" అని తాతగారు మురిసిపోతారు. అలా!

తెలుగువారి లోగిళ్ళలో వాడే ప్రత్యేక తెలుగు పదాలు


తెలుగువారి లోగిళ్ళలో ప్రత్యేక పదాలు అలవోకగా వాడుతుంటారు.
అవి- దీపం పెద్దది చేయడం (దీపం తీసేయడం), తాళిబొట్టు పెరగడం(దారం తెగడం), కొంగు మాయడం (వాకిట వుండడం), కాలు మడుచుకోవడం (మూత్ర విసర్జనకు వెళ్ళడం), చుట్టం వచ్చాడు (కొత్తల్లుడు రావడం), వెళ్ళిరండి, వీళ్ళొస్తా, దయచేయండి మొదలైనవి.

తెలుగువారి ఆభరణాలు

కలిగినంతలో నాలుగు రకాల ఆభరణాలు చేయించుకోవడం తెలుగింట ఆనవాయితీగా వుండేది. తెలుగు ఆడపడుచులకు ఏడువారాల నగలు వుండేవి. కమ్మలు, దుద్దులు, జూకాలు, జుంకీలు, మాటీలు, చెంపసరాలు, ముక్కుపుడక, బేసరి, బులాకీ, నాగారం, పాంజేబులు, తోడాలు, జడకుప్పెలు, జడబిళ్ళలు, సూర్యవంక, చంద్రవంక, గాజులు, ఉంగరాలు, చామంతి బిళ్ళలు, దండకడియాలు, ఒంకీలు, వడ్డాణాలు, చంద్రహారం, కాసులపేరు,రుద్రాక్ష తావళాలు, ముత్యాల గొలుసులు, పెండేరాలు, పతకాలు, కొప్పుగొలుసులు, లక్కాకు పూసలు మొదలైన ఆభరణాలన్నీ ఒకాప్పుడు తెలిగిళ్ళల్లో విపరీతంగా ధరించేవారు. చిన్నపిల్లలు, కన్నెపిల్లలు, ముత్తయిదువులు, వృద్ధమహిళలు, యవ్వనంలోని పురుషులు, వృద్ధులు వేరు వేరు రకాల ఆభరణాలను ధరించేవారు.

పురుషులు చెవులకు పోగులు, మెడలో రుద్రాక్ష దండలు, కాళ్ళకు కడియాలు వుండేవి. చేతులకు కొందరు కంకణాలు ధరించేవారు. నుదుట గంధం, కుంకుమ, విభూతి బొట్లు తప్పనిసరిగా ధరించేవారు.

ఉడుపులు

ఆడపిల్లలు పట్టులంగాలు, పావడాలు, రవికెలు, పైటలు ధరించేవారు. స్త్రీలకు ఎన్నోరకాల చీరలు, రవికెలు అందుబాటులో వుండేవి.

పురుషులు పలురకాల ధోవతులు, పంచలు, చొక్కాలు, జుబ్బాలు, ఉత్తరీయాలు, కండువాలు, తలపాగాలు కూడా ధరించేవారు.



ఆచార వ్యవహారాలు


తెలుగిళ్ళలో అచారవ్యవహారాలు, పట్టింపులు అధికంగా వుంటాయి. ఇంట్లోకి వచ్చేముందు ఆరుబయట పాదరక్షలు వదలి, కాళ్ళు కడుక్కొని రావాలి. శుక్రవారాలు స్త్రీలు పసుపురాసుకుని , నూనె అంటుకొని తలస్నానం చేయాలి. గడపలకు పసుపు కుంకుమలు అలంకరించాలి. ప్రతిరోజూ సంధ్య దీపం వెలిగించి నమస్కరించాలి. పండుగనాదు నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.

రోటిపైన కూర్చోకూడదు. గడపమీద నిలబడి తుమ్మకూడదు. రోలును బోర్లించ కూడదు. దీపం పెట్టే సంధ్యాసమయంలో భోజనం చేయకూడదు. ఆషాడమాసంలో అత్తాకోడళ్ళు, నూతన వధూవరులు ఒకే ఇంట్లో వుండకూడదు. నూనె బదిలివ్వకూడదు. ఉప్పు, నూనె, ఇనుపవస్తువులు చేతిలో వేయకూడదు. ఇలాంటివి ఇంక ఎన్నో!

ఈ ఆచార వ్యవహరాలను ఏ కొద్దిమందో మాత్రం ఇప్పటికీ ఆచరిస్తున్నారు.

తెలుగువారి కళలు

పద్యపఠనాలు, శతకసాహిత్యాలు, అవధానాలు తెలుగువారి ప్రత్యేకతలు. తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు, జోలపాటలు, తుమ్మెదపదాలు, వీధిభాగవతాలు, గంగిరెద్దుల ఆటలు, తెలుగువారికే చెల్లు. కూచిపూడి నృత్యాలు, భరత నాట్యాలు, అంధ్ర నాట్యాలు, జానపద నృత్యాలు, పేరిణి, తాండవం, భామాకలాపం, కోయ నృత్యాలు, యక్షగానాలు తెలుగువారి కళల్లో కొన్ని.

తెలుగువారు ఏపని చేసిన తెలుగుదనం ఉట్టిపడేలా చేయడం ఒకప్పుడు ఆనవాయితీగా వుండేది. తెలుగుజాతికి గర్వకారణమైన తెలుగుదనాన్ని పునరుద్ధరించుకోవడం మనందరి బాధ్యత.

('తెలుగుదనం ' జంధ్యాల భారతి, ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 10/04/2003 మరియు
'మన వారసత్వం ' రచన, సేకరణ: దాక్టర్ వెలగా వెంకటప్పయ్య, సందకుడ్:దాక్టర్ బాబు ఆర్. వడ్లమూడి[మే, 2003] )

_________________________________________________________________

Labels:

Sunday, November 19, 2006

రుతు ప్రభావం

ఆగదు ఈ కాలం క్షణాల ఇంద్రజాలం- అన్నట్లుగా కాలం ఎవరి కోసమూ ఆగదు. కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది. ''కాలానికొక్కటే పని. అది రావడం వచ్చి వెళ్ళిపోవడం. నిజానికి రెండూ ఒకటే'' అన్నారు శ్రీపాదవారు. పగలు గడిచి రాత్రి దగ్గరపడుతున్నకొద్దీ వాతావరణం సహజంగానే మారిపోతూ ఉంటుంది. గోధూళివేళ గడిచి, పక్షులు గూళ్ళకు మళ్ళే తరుణం దాటి చీకటి ముసిరి రాత్రి చిక్కబడుతుంది. ఆ తరవాత మామూలుగానే తెల్లవారుతుంది. ఈ వైనాన్ని- ''అంధకారము దిక్కులనంతరించె, మెల్లమెల్లన తెల్లన వెల్లువయ్యె, అంతలోపల జగమంత హ్లాదపరత నలర బ్రకృతి స్మితస్మేర లలితమయ్యె'' అంటూ మనోహరంగా కళ్ళకు కట్టినట్లు వర్ణించారో కవి. రేయింబవళ్లు, మారే రుతువులు- అన్నీ ప్రకృతి లీలావిలాస కావ్యంలోని మధురాధ్యాయాలే. ''ఏతమెత్తేకాడ ఎదురుగా కూకుండి సూరియుణ్ని తిట్టు నా ఎంకి, మల్లీ ఎప్పటల్లె తెల్లారిపోతుంటె సెందురుణ్ని తిట్టు నా ఎంకి'' అంటాడు నాయుడుబావ. ఇంకా పొద్దుపోవటంలేదే అని సణుక్కునే యువజంటలే ఆ తరవాత అప్పుడే తెల్లారిపోతోందే అని విసుక్కోవటమూ పరిపాటి. ఎవరెలా అన్నా, అనుకున్నా కాలం మాత్రం దాని మానాన అది గడిచిపోతూనే ఉంటుంది. ''ఇద్దరు ఇంగ్లిష్ పెద్దమనుషులు కలిస్తే వాతావరణంతోనే వారి ప్రసంగం ప్రారంభమవుతుంది'' అంటాడు శామ్యూల్ జాన్సన్ అనే రచయిత. ఇంగ్లిష్‌వారనే కాదు అసలు ఏ ఇద్దరు కలిసినా సంభాషణ మొదలుపెట్టడానికి వాతావరణమే తగిన వీలు కల్పిస్తుంది. ''అబ్బ ఏం ఎండ కాసిందండీ ఈ వేళ. రోహిణీకార్తెలో రోళ్ళు పగిలిపోతాయంటారు. రోహిణీ ప్రతాపం ముందే కనిపిస్తున్నట్లుంది'', ''పొద్దుట్నించీ ఒకటే వాన మా ఆవిడ సణుగుళ్ళా. ఇల్లు కదలటానికే వీలులేకపోయింది'', ''ఈ ఏడాది చలి మరీ ఎక్కువగా ఉన్నట్లుందండీ''- ఇలాంటి సంభాషణలే ఏ ఇద్దరు కలుసుకున్నా!
ఒక రుతువును వెన్నంటి మరో రుతువు ప్రవేశిస్తూ తన విలాసాలు, హొయలు ఒలకబోసి మనుషులను ఆహ్లాదపరచడం, ఒక్కొక్కసారి విసుగునూ కలిగించడం సహజం. ''కుహుకుహుయంచు కోకిల కూసినపుడు, భమ్మటంచు దుమ్మెద పాడినపుడు నల్లపవనుడు మెల్లగా నానినపుడు-'' వసంతకాలం వచ్చేసిందని ఒకరు చెప్పకుండానే తెలిసిపోతుంది. మావిచిగురు తిని కోకిలలు గొంతులు సవరించుకొని గానాలాపనలకు దిగే కాలం వసంతకాలం. ఆపై పగటివేళలు పొడుగై ఎండలు మెండై వేసవికాలం ప్రవేశిస్తుంది. బొండుమల్లెలు వికసించినా, పండువెన్నెలలు కాసినా ఉస్సురుస్సురంటూ వేసవి తాపానికి తట్టుకోకతప్పదు. ఈ కాలంలో- దివసాంత రమ్యాణి- అన్నాడు కాళిదాస మహాకవి. పగలు ఎంత ఎండ కాసినా సాయంత్రానికి చల్లబడి మలయమారుతం సాగి మనసూ శరీరమూ సేద తీరతాయి. వర్షరుతువు ఎవరినైనా సంతోషపరచేదే. ''రసిక హృదయములోలలాడే మసుపు దినములు మరలివచ్చెను. మిసిమి మబ్బులు వ్రేలు మేలిమి ముసుగుతో నాకసము విచ్చెను...'' అంటూ జనమంతా ఆనందించేది వర్షకాలం. వాన చినుకుల్లో తడుస్తూ పిల్లల సంబరాల ఆటలకు అడ్డూ ఆపూ ఉండనిది, రైతు జనాలకు పండుగదినాల కాలం. పొలం పనులు ముమ్మరంగా సాగేది ఆ రుతువులోనే. ''ఇంత లేమబ్బు చిరు తున్కయేని లేదు విప్పిరేమొ నిశారాజి వెల్లగొడుగు'' అని అబ్బురపడే విధంగా పుచ్చపువ్వులా వెన్నెలలు విరిసేదే శరదృతువు. కాలానుగుణమైన వైభవంతో విరిసిపోయే ప్రకృతి సౌందర్యం ఎంత వర్ణించినా తనివి తీరనిదే. అందుకే ''ప్రకృతి మధురంబులకు వేషరచనలేల, ప్రకృతి సుందరతకు వేరు వేషమేల'' అన్నారో కవి.

శీతకాలం అడుగు పెడుతూనే చలి విజృంభిస్తుంది. పగటి వేళలు తరగి రాత్రి సమయం పెరుగుతుంది. తెల్లవారినా దుప్పటి ముసుగులోనే కాలక్షేపం చేయటానికి మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఎండ రావటమే పండుగగా భావిస్తూ ఉంటారు. శీతకాలంలో బద్దకం పెరుగుతుంది. సూర్యరశ్మి తక్కువ కావటాన వాతావరణ రీత్యా ఏర్పడే ఆరోగ్య సమస్యలు కొన్ని ఈ కాలంలోనే పీడిస్తాయి. వైద్య పరిభాషలో 'శాడ్' అని వ్యవహరించే 'సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్' ఈ కాలంలోనే ఎక్కువవుతాయంటారు వైద్య శిఖామణులు. పగటి పొద్దు తక్కువ కావటంతో మనుషులకు నిద్రమత్తు అంత తేలికగా వదలదు. ఎంత పొద్దెక్కినా మనుషుల్లో ఉత్సాహం ఉరకలేయదు. కొంచెం మూడీగా ఉంటారు. ''అదివరకే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడేవారికి ఆ సమస్యలు తిరగబెట్టే అవకాశం శీతకాలంలోనే ఎక్కువ...'' అంటున్నారు ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ రాజేశ్ సాగర్. సూర్యరశ్మి తక్కువగా ఉండటంవల్ల మెదడులో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిలో తేడా కనిపిస్తుంది. మెదడు అడుగుభాగంలో ఉండే ఓ గ్రంథి ఉత్పత్తిచేసే ఈ హార్మోనే నిద్రను ప్రభావితం చేస్తుంటుంది. వెలుతురు మందంగా ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువై నిద్రమత్తును కలగజేస్తుంది. అతి నిద్ర, విసుగు, బరువు ఎక్కువ కావటం లేదా బాగా తగ్గిపోవటం వంటి అవలక్షణాలన్నీ ఈ రుతుప్రభావం వల్ల సంప్రాప్తించవచ్చు. వీటిని తట్టుకోవాలంటే ప్రతిరోజూ ఉదయం వేళల కొంతసేపు బయట గడపటం, వీలైతే ఒక గంటసేపు బయట విహరించటం మంచిదంటున్నారు డాక్టర్లు. ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులు సైతం శీతకాలంలోనే తిరగబెట్టే అవకాశం ఉంది. ఈ బెడద ప్రతి సంవత్సరం ఉండేదే అయినా ఈ సంవత్సరం చలి కాస్త ఎక్కువగా ఉండే సూచనలున్నాయంటున్నారు డాక్టర్లు. ముందుజాగ్రత్తగా రగ్గులు, శాలువాలు పైకి తీసి దుమ్ముదులిపి సిద్ధంగా ఉంచుకోవటం మంచిది! వస్తోంది శీతకాలం బహుపరాక్...
(Editorial, Eenadu,19:11:2006)
_________________________________________

Labels:

ధర్మబద్ధ జీవన దిక్సూచి... భగవద్గీత

గీత అంటే గానం చేసినదని అర్థం. భగవంతుడే స్వయంగా గానం చేసింది కనుక భగవద్గీత అయింది. 'గీతా' అని అన్నప్పుడు బహువచన అర్థం వస్తుంది. దీన్ని అనుసరించి చూస్తే భగవద్గీతలోని ప్రతి అధ్యాయమూ ఒక గేయంగా చెప్పవచ్చంటారు పెద్దలు. పలు అధ్యాయాలు ఉన్నాయి కనుక ఇలా 'గీతా' అనడం కూడా కనిపిస్తుంది. ఒకరు మరొకరికి చెప్పిన మంచి మాటలు అన్నది చాలాచోట్ల కనిపించే అర్థం.

గీత అంటే ఒక్క భగవద్గీతే కాదు చాలారకాల గీతలున్నాయి. భారతంలోను, భాగవతంలోను దాదాపు పన్నెండు దాకా హంసగీత, బ్రాహ్మణగీత, భ్రమరగీత, శ్రుతిగీత లాంటి గీతలున్నాయి. అయితే గీత అన్న శబ్దం చెవిన పడగానే అందరి కళ్లముందు ప్రత్యక్షమయ్యేది భగవద్గీతే.

భగవద్గీత- శ్రీకృష్ణపరమాత్ముడు యుద్ధరంగం మధ్యలో అర్జునుడికి చేసిన హితోపదేశమిది. అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, బంధువులను చంపడం మహాపాపం కదా! అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు... 'ఇది నీ కర్తవ్యం. యుద్ధం చెయ్యక తప్పదు' అంటూ అర్జునుడు ఎందుకు యుద్ధం చేయాలో విడమరిచి చక్కగా బోధించాడు. అర్జునుడి చేత యుద్ధం చేయించి ధర్మానికి విజయం చేకూర్చిపెట్టాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎన్నిరకాలుగా ఉత్సాహపరచాలో అన్నిరకాలుగా విషయాన్నంతా విడమరిచి చెప్పి యుద్ధానికి సన్నద్ధం చేశాడు. యుక్తితో కొన్ని ఉదాహరణలతో భగవద్గీతను కృష్ణభగవానుడు అర్జునుడికి చెప్పాడు. అంత శక్తివంతమైనది భగవద్గీత.

అయితే ఇక్కడ కొంతమంది శ్రీకృష్ణుడు హత్యాకాండను ప్రేరేపించాడని అనవసరమైన అపవాదును చేస్తుంటారు. ధర్మం ఎంతో సూక్ష్మమైనది. దాన్ని దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మరిచిపోయి కృష్ణుడు చేసిన గీతోపదేశాన్ని యుద్ధప్రేరకంగా భావించడం మంచిది కాదన్నది పండితుల, పరిశోధకుల భావన. దీనికి ఒక న్యాయాధికారిని ఉదాహరణగా పండితులు చెబుతుంటారు. ఎదురుగా ఉన్నది బంధువులు కదా, వారిని ఎలా సంహరించటం? అనే సందేహం అర్జునుడికి కలిగింది. న్యాయాధికారి హంతకుడికి మరణదండన విధిస్తుంటాడు. ఆ సమయంలో నేరస్థుడు తనకు సమీప బంధువనీ, అతడికి మరణదండన ఎలా విధించగలననీ న్యాయాధికారి అనుకుంటే అతడు సరిగా న్యాయం చేసినట్లుకాదు. పక్షపాతబుద్ధి లేకుండా నేరస్థుడు బంధువైనా, మరొకరైనా శిక్షను అమలుచేయటంలో చిత్తశుద్ధితో ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి బుద్ధినే గీతోపదేశం చేసి అర్జునుడిలో కలిగించాడు శ్రీకృష్ణుడు. స్వ, పర భేదంలేక దుష్టులను శిక్షించడం ఉత్తమ క్షత్రియుడి కర్తవ్యమని బోధించాడు. ధర్మమనేది వ్యక్తిపరంగాకాక నిస్పక్షపాతంగా ఉండాలన్నాడు. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలన్నాడు. నీతిబాహ్యులైనవారిని శిక్షించకపోతే సమాజానికి చేటనేది కృష్ణుడి ఉపదేశంలో మనకందే సందేశం. అలా చేయకపోతే సంఘ వ్యవస్థ చెడిపోతుంది. దేశరక్షణ కోసం ఉన్న సైనికులు శత్రుసేనలు చొచ్చుకొస్తున్నప్పుడు అహింస అంటూ కూర్చుంటే సమంజసంగా ఉండదు. వారు చేస్తున్నది దురాక్రమణ కనుక ఎదురు నిలిచి వారిని సంహరించాల్సిందే. కౌరవులు కూడా న్యాయాన్ని అతిక్రమించారన్నది అప్పటికే ప్రపంచమంతా తెలిసిన విషయం. కృష్ణుడు ఎన్నో సందర్భాల్లో దుర్యోధనుడి అన్యాయాలను కళ్ళారా చూశాడు కూడా. అందుకే అర్జునుడిని యుద్ధం చెయ్యమని ఉపదేశించాడు.

శ్రీకృష్ణుడు మామూలు మనిషికాదు, ఆయన పరమాత్మ అని అప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా. సాక్షాత్తూ దైవమే వచ్చి చెప్పిన మాట ఏనాడూ అధర్మంగా ఉండదు. ఈ ఒక్క విషయాన్ని మనసులో ఉంచుకున్నా భగవద్గీత యుద్ధాన్ని ప్రేరేపించిన ఉపదేశం కాదని, సర్వమానవాళి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చెప్పిందేనని అవగతమవుతుంది. ఈ భగవద్గీతలో మానవజాతికి ప్రతినిత్యం ఎదురయ్యే నైతిక, ఆధ్యాత్మికపరమైన ధర్మసందేహాలకు సంబంధించిన సమాధానాలు ఉన్నాయి. వాటినన్నిటినీ వివరంగా తెలుసుకుంటే చక్కటి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి వీలుంటుంది. భగవద్గీతలో భగవత్ తత్వం, భగవత్ ప్రాప్తి మార్గాల వివరణ ఉంది. భగవద్గీతలో జ్ఞాన, కర్మమార్గాల్లో ఏది విశిష్టమైనది అనేదానికి సమాధానంగా రెండింటికీ భేదం లేదని, ఎంతటి జ్ఞాని అయినా కర్మ చేయక తప్పదని, అయితే ఫలాపేక్ష లేకుండా చేసే కర్మకు దోషం ఉండదని చెప్పిన సమన్వయం కనిపిస్తుంది. ఇలా భగవద్గీత మానవాళికి ఒక మార్గదర్శకంగా వెలుగొందుతోంది.

(డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు
http://www.eenadu.net/archives/archive-18-11-2006/sahithyam/display.asp?url=puranam1089.htm
--------------------------------------------------------------------

Labels:

మనకీర్తి మంచుకొండరా...

( - జి.వి.డి.కృష్ణమోహన్ )
''బ్లడీ ఇండియన్స్!''
-ఈ మాటలు వందేళ్ళ క్రితం గాంధీజీ సత్యాగ్రహం ప్రారంభించిన దక్షిణాఫ్రికాలో అప్పటి జాత్యహంకారులన్నవి కావు...
ఇది అరవయ్యేళ్ళ క్రితంవరకు మనల్ని పాలించిన బ్రిటిషర్ల దుర్భాషకాదు...
బతుకు తెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన మన జనాన్ని అక్కడి 'ప్రథమశ్రేణి పౌరులు' పిలిచే పిలుపూ కాదిది...
ఘనత వహించిన 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా'కు చెందిన ఓ కుర్ర నటిచుట్టూ దడికట్టి ఆమె మడిబట్టకు తగిలినవారిని తన్ని తగలేసేందుకు అరుదైన ఆ స్త్రీతోపాటు ఇండియా వేంచేసిన అంగరక్షక పంచకంలో మన ఘన చరిత్రా చేతగాని చవటాయిత్వాలను ఔపోసన పట్టిన అమెరికా జాతి దేహరక్షకుడి నోట జాలువారిన ముత్యాల సరాలు- ''బ్లడీ ఇండియన్స్!''
మనదేశంలో, మనజనం మధ్య మనవాళ్ళని అంత చీదరించుకునే, దూషించే, చివరికి చేయిచేసుకునే ధైర్యం ఓ విదేశీ నటి దేహరక్షకులకు ఎక్కడినుంచి వచ్చింది? నోరుపారేసుకున్న దేహవీరులు స్థాయిలేని అమెరికన్లనో, మన పోలీసులు కేసులు పెట్టారుకాబట్టి కథను కంచికి నడిపించేద్దామనో మనకుమనమే సర్దిచెప్పుకోవటానికి ఏమాత్రం వీలులేని ప్రశ్న ఇది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది... సుదీర్ఘ నాగరికత ఉన్న దేశం మనది... జనాభాలో చైనాను మించుతున్న రాజ్యం మనది... ప్రపంచ దేశాల్లో అత్యధికంగా ఆయుధాలు కొంటున్నదీ మనమే... ఐ.టి.లో మనమే మేటి... ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడగల స్థాయికి ఎదిగిపోయిన దేశం కూడా మనదే... మనల్ని మనం(మాత్రమే) పొగడుకోవడానికి కావాల్సిన ఈ తరహా పనికిమాలిన సరంజామాను పోగేస్తే హిమాలయాల ఎత్తుకు మించిపోతుంది. విదేశాల్లో ఇండియన్లకు దక్కుతున్న 'మర్యాదల' గత, సమకాలీన చరిత్రల్ని తిరగేస్తే... ఓ జాతిగా మనకి లభిస్తున్న గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది.
మొదటి తరగతి రైలుపెట్టెలో ఎక్కిన నల్లబాబును బోగీనుంచి లాగి బయటపడేస్తే... మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ అనే (అప్పటికి) అర్భకుడు దాన్ని మన హోం కమ్ ఉపప్రధాని పదవి వెలగబెట్టిన అద్వానీ మాదిరి సర్దుకుపోయి ఉంటే, ఆగ్రహమూ లేదు... సత్యాగ్రహమనే భావనే పుట్టేది కాదు. ఉపప్రధానిగా ఉన్నరోజుల్లో అధికారిక హోదాలో అగ్రరాజ్యంలో పర్యటించడానికి వెళ్ళిన అద్వానీ మహాశయుడిని అమెరికా ఉద్యోగులు బూట్లూ సాక్సు విప్పించి చూడటం మన జాతికి అవమానమని ఇక్కడి ప్రసార సాధనాల్లో అభిప్రాయాలు, వ్యాసాలు, వాదనలూ హోరెత్తుతున్న సమయంలో సదరు విప్పిన నేత సమాధానమేమిటంటే... ''దీన్ని గుడ్డలిప్పడంగా ఎందుకు భావిస్తున్నారో నాకు అర్థం కాలేద''ని. అర్థమైతే మహాత్ముడు- అర్థం కాకపోతే అద్వాని!
మనం అవతలిదేశంతో ఎలా వ్యవహరిస్తున్నాం, అవతలి దేశం మనతో ఎలా ఉంటోందన్నది దౌత్యంలో ప్రాథమికం, ప్రధానం. ఏకపక్ష గౌరవాలు, మర్యాదలు ఇచ్చేది సామంత రాజ్యమవుతుందే తప్ప సార్వభౌమ రాజ్యం కాలేదు. రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో రెండుమార్లు తన గుడ్డలూడదీసిన వైనాన్ని ఫెర్నాండెజ్ ఏనాడో పూసగుచ్చారు. విప్రో నిర్మాత అజీమ్ ప్రేమ్‌జీ, నటుడు కమల్‌హాసన్ సైతం ఇలా ఏదోరకంగా అవమానాలకు గురైనవారే. కాబట్టి ముంబాయిలో సినిమా షూటింగ్‌కోసం వచ్చిన ఏంజెలినా జోలి దేహరక్షకులే మనల్ని, మన జాతీయతను అవమానించారని బాధపడటం వ్యర్థం! ఉప ప్రధాని, రక్షణమంత్రి పదవుల్లోని వ్యక్తులనే పట్టించుకోని దేశంలోని వ్యక్తులు... ఆఫ్టరాల్, ముంబాయిలో ఓ స్కూలు పిల్లల్ని, వాళ్ళ అమ్మాబాబుల్ని సహేతుకంగా, సవినయంగా గౌరవిస్తారన్నదే వేరూ మొదలూ లేని ఆలోచన. అగ్రరాజ్యం నాయకత్వం తన పౌరులకు శాంతిసౌభ్రాత్రాలు, మానవతా విలువలు, సమానత్వ సూత్రాల స్ఫూర్తిని ఉగ్గుపాలలోనో సీసాపాలలోనో కలిపి పట్టిందనే వెర్రి నమ్మకాలెవరికీ లేవు. మిగతా ప్రపంచంలో అర్భకులు, అంగుష్ఠమాత్రులు మాత్రమే ఉంటారన్న భావన అక్కడి మనుషుల్ని కనిపించనివ్వనంత ఎత్తున అమెరికా నాయకత్వంలో మేటవేసి ఉన్నప్పుడు... ఆ దేశంలోని పౌరులందరిలో ప్రజాస్వామిక, మానవతా విలువలు హిమనదాల్లా ప్రవహించాలన్నదే దుస్వప్నం. ఇరాక్‌లో ఇరాకీలు, ఆఫ్ఘనిస్థాన్‌లో ఆఫ్ఘనీలు మాదిరే ఇండియాలో ఇండియన్లూ తమకన్నా తక్కువ జాతివారనే భావం కలగబట్టే మనదేశంలోనే మనం 'బ్లడీ ఇండియన్స్!'
'మీ దేశంలో భద్రత, రక్షణ వ్యవస్థలమీద మాకు నమ్మకం లేదు ఫొ'మ్మంటే క్లింటన్, బుష్‌ల పర్యటన సమయాల్లో మన సర్కార్లు తలూపాయి. వారి అధ్యక్షుడు పర్యటించే మన కార్యాలయాలు, ప్రదేశాలు అమెరికన్ల అధీనంలోకి వెళ్ళిపోయాయి. మన ప్రధాని, రాష్ట్రపతి ఎవరైనా, ఎప్పుడన్నా న్యూయార్కో వాషింగ్టనో సందర్శిస్తున్నప్పుడు... అదేతరహాలో వారి కార్యాలయాల్ని 'భద్రతా కారణాల దృష్ట్యా' మన దేశం అధీనంలో ఉంచాలని అడిగే సాహసమైనా మన నాయకత్వానికి ఉందా? ఇక్కడైనా అక్కడైనా మన భద్రతకన్నా వారి భద్రతే మెరుగని ఒప్పేసుకోగల చవటాయిత్వం మాత్రమే ఉంది. 'క్లింటన్ షేక్‌హ్యాండ్ ఇచ్చిన చేతిని' నెలరోజులపాటు కడుక్కోనని చెప్పగల బులపాటమే మన ఎంపీల్లో సైతం బయటపడింది. పౌరుడి ప్రాణానికి విలువలేని ఇండియాలో పుట్టినా మనం ఎలా బతగ్గలుగుతున్నామన్నదే వారికి అర్థంకాని ప్రశ్న. అమెరికా అధ్యక్షుడికి రక్షణ కల్పించారంటే సరే... ఓ నటికి కూడా అక్కడి దేహరక్షకులతోనే భద్రత కల్పించేందుకు మన ప్రభుత్వాలు ఎలా అనుమతించాయన్నది మనకు అర్థంకాని ప్రశ్న. ఈ దేశంలో కూడా సర్కారున్నది అమెరికన్ల రక్షణపట్ల శ్రద్ధ చూపడానికి మాత్రమేనా అన్నది సమాధానం లభిస్తున్న సందేహం.
ఏంజెలినా జోలి దేహరక్షకుల్లో ముగ్గురిమీద మన పోలీసులు కేసులు పెట్టేసినమీదట... ఇండియాలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని విదేశాల్లో ఎవరైనా భ్రమపడితే వాళ్ళ ఖర్మ. ఏకంగా ఓ విమానం వేసుకొచ్చి మన దేశంలో ఆయుధాల బోషాణాలు జారవిడిచి అదృష్టం బాగోక దొరికిపోయిన విదేశీయుల్ని మన ఘన జన సర్కారు ఏం చేసింది? మొహమాటపడి వదిలేసింది. ఏదో రష్యా, లాత్వియా, బ్రిటన్ లాంటి దేశాల నాయకులు మాటవరసకు అడగ్గానే శత్రువుల్ని, కుట్రదారుల్ని కూడా వదిలేసిన మన ప్రభుత్వాలు... అందచందాల అమెరికన్ తార దేహరక్షకుల్ని చట్టానికి పట్టించి జైల్లో పెట్టిస్తారా? ఉపప్రధాని, రక్షణమంత్రి వస్త్రాపహరణకు గురైతేనే పొడుచుకురాని రోషం... మన బడిపిల్లల్ని, వాళ్ళమ్మానాన్నల్ని అన్నంతనే ఎగదన్నుకు వస్తుందా? ఆ ముగ్గుర్నీ వదిలేయండని అగ్రరాజ్యం అధ్యక్షులవారు అడక్కపోయినా బేఫరవా! అమెరికానుంచి ఎవరు ఫోన్ చేసినా క్షణమాలస్యం చేయకుండా ఆపని కానివ్వాలనే నిర్ణయం ఇప్పటికే తీసుకోలేదని ఎవరు చెప్పగలరు? గాంధీపుట్టిన దేశంలో మహోన్నత జాతిని నిర్మించలేని మన నాయకుల్ని ఈ దేశంలో ప్రజలు అనగలిగిందేమిటి..?

(Eenadu,19:11:2006
http://www.eenadu.net/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2)
________________________________________________________

Labels: