My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, June 04, 2010

వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోయాను గగనానికి!

పాటల వేటూరి ఇక లేరు...
తెలుగు సినిమా పాటను పరవళ్లు తొక్కించిన కలం ఆగిపోయింది
ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి హైదరాబాద్‌లో శనివారం(22:05:2010) రాత్రి తొమ్మిది గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. వేటూరికి భార్య సీతామహాలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొద్దిరోజులుగా ఆయన వూపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. మూడు రోజుల కిందట గ్యాస్ట్రిక్‌ సమస్య అంటూ ఏషియన్‌ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షించి ఇతర సమస్యలున్నాయని చెప్పడంతో శుక్రవారం రాత్రి కేర్‌ ఆసుపత్రిలో చేరారు. వూపిరితిత్తుల్లో తీవ్రంగా రక్తస్రావం జరగడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు.

వేటూరి స్వస్థలం కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లి. ప్రముఖ కవి వేటూరి ప్రభాకరశాస్త్రి సోదరుడి కుమారుడు సుందరరామమూర్తి. 1950లో ఆయన మద్రాసు గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదివే రోజుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. సుందరరామమూర్తి తొలినాళ్లలో నటుడు కావాలని ఆశపడ్డారు. తరవాత రచనవైపు దృష్టిపెట్టారు. బెజవాడలో బియ్యే పూర్తిచేశాక మరోసారి మద్రాసు వెళ్లారు. ఆయన, నటుడు కైకాల సత్యనారాయణ పక్కపక్క గదుల్లో ఉండేవారు. ముక్త్యాల రాజా సిఫార్సుపై వేటూరి 'ఆంధ్రప్రభ'లో ఉపసంపాదకుడిగా చేరారు. 1956 నుంచి పదహారేళ్లపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆయన పాత్రికేయ జీవితంలో చిరస్మరణీయ ఘట్టం... శ్రీశైలం ప్రాజెక్టుకి పునాదిరాయి వేసినప్పుడు రిపోర్టింగ్‌ చేయడం. ఆయన రోజు ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఉపన్యాసాన్ని వార్తగా అందించిన విధానం ప్రతి ఒక్కరి మెప్పూ పొందింది. ఏళ్లు గడిచినా వేటూరికి నెహ్రూ ఉపన్యాసమంతా గుర్తుండేది. తరవాతి రోజుల్లో ఆంధ్రప్రభ వారపత్రికకు సినిమా ఎడిటర్‌గా పని చేశారు.

ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో...
తెలుగు సినిమా పాట నిస్తేజంగా ఉన్న సమయంలో చిత్రసీమలో అడుగుపెట్టారు వేటూరి. ఆయన రాసిన 'సిరికాకుళం చిన్నది' అనే సంగీత రూపకం అప్పట్లో ఆలిండియా రేడియోలో ప్రసారమైంది. ఈ రూపకం ఎందరో ప్రముఖుల్ని ఆకట్టుకొంది. అలా వేటూరి రచనపై ఆకర్షితులైన వారిలో నాటి అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ ఒకరు. ఆయన ప్రోత్సాహంతోనే వేటూరిలోని గీత రచయిత 'దీక్ష' చిత్రం కోసం కలం విదిల్చారు. 'నిన్న రాతిరి కలలో...' అనే పాట రాశారు. అది రికార్డు కాలేదు. కె.విశ్వనాథ్‌ 'ఓ సీత కథ' కోసం రాసిన పాటే తొలి గీతంగా చెప్పుకోవాలి. 'భారతనారీ చరితము... మధుర కథాభరితము...' అనే గీతాన్ని కేవీ మహదేవన్‌ స్వర సారథ్యంలో రాశారు. పి.లీల గానం చేశారు. వేటూరి గీత రచయితగా తొలి అడుగులు వేసే సమయంలో ఎన్టీఆర్‌, కె.విశ్వనాథ్‌, కె.రాఘవేంద్రరావు అండగా నిలిచారు. అందుకే పలు సందర్భాల్లో 'వాళ్లు నాకు త్రిమూర్తులు' అనేవారు వేటూరి. గీత రచయితగా ప్రవేశించిన మూడేళ్ల కాల వ్యవధిలోనే యావత్‌ చిత్రసీమనూ తనవైపు తిప్పుకోగలిగారు. 'సిరిసిరిమువ్వ'లో 'ఝుమ్మంది నాదం... సయ్యంది పాదం', 'సీతామాలక్ష్మి'లో 'సీతాలు సింగారం...', 'శంకరాభరణం'లోని అన్ని గీతాలూ కావ్య గౌరవంతో అలరారాయి. అలాగే 'అడవి రాముడు'లో 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను...'లాంటి అల్లరి పాటే కాదు 'మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ' లాంటి భావస్ఫోరకమైన గీతాన్నీ అందించారు. అటు కావ్యగౌరవం ఉన్న పాటలే కాదు కమర్షియల్‌గా ఈలలు వేయించే గీతాలూ వేటూరి నుంచి వచ్చాయి. పద్నాలుగుసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు అందుకున్నారాయన. ఉషాకిరణ్‌ మూవీస్‌ వారి 'ప్రతిఘటన'లో రాసిన 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో...' గీతానికి వేటూరి తప్పకుండా జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకుంటారని ఆశించారు. కానీ దక్కలేదు. 'మాతృదేవోభవ'లో 'రాలిపోయే పువ్వా...' గీతానికి జాతీయ గౌరవం దక్కింది. వేటూరి ఆ తరాన్నే కాదు ఈ తరాన్నీ ఉర్రూతలూగించారు. ఇటీవల వచ్చిన 'వరుడు'లో 'అయిదు రోజుల పెళ్లి' గీతం యువతరం సెల్‌ఫోన్లలో రింగ్‌టోన్‌గా, కాలర్‌ ట్యూన్‌గా వినిపిస్తోందంటే వేటూరి కలం ఎంతటి ప్రభావం చూపిస్తుందో అర్థమవుతుంది. తెలుగు పాటను లాలించి పాలించి శాసించిన వేటూరి మన మధ్య లేకపోయినా ఆయన పాటను తెలుగు శ్రోతల హృదయాల్లో మోగుతూనే ఉంటాయి.
- హైదరాబాద్‌, న్యూస్‌టుడే
__________________________________________
పాటల పొద్దు వాలిపోయింది
ఒక శకం ముగిసింది...
కోమల గీతాల కవి కోయిల... ఎద లోయలో శాశ్వతంగా నిదరోయింది.
కూచిపూడి నడకనీ, కూనలమ్మ కులుకునీ శ్రుతి కలిపి...

విశ్వనాథ పలుకునీ విరుల తేనె చిలుకునీ కలగలిపి... కిన్నెరసాని చేత వెన్నెల పైట వేయించిన కలం... రాలిపోయిన పువ్వులో మౌనరాగమై... వాలిపోయిన పొద్దులో వివర్ణమై... హంసల దీవిలో కృష్ణమ్మలా అనంతసాగరంలో లీనమైపోయింది.

కవితా సరస్వతి పద రాజీవాన్ని చేరు నిర్వాణసోపానాలను అధిరోహిస్తూ... తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయింది. వేటూరి శకం ముగిసిన మమతలు వేయిగ పెనవేసిన ఆ తీయని గీతాంజలి మల్లెలైపూస్తూనే ఉంటుంది. వెన్నెలై కాస్తూనే ఉంటుంది.

వేల పాటల తేనె వూట... కొత్త పుంతలు తొక్కిన తెలుగు పాట - వేటూరి సుందరరామమూర్తి సినిమా పాట! అంగారాన్నీ, శృంగారాన్నీ అలవోకగా కురిపించగల కలం వేటూరిది. తెలుగు సినీ గీతానికొస్తే సీనియర్‌ సముద్రాల, పింగళి, మల్లాది నుంచి ఆత్రేయ, ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి, సినారెల వరకూ ఒక్కొక్కరిదీ ఒక్కొక్కొ ప్రత్యేక బాణీ అయితే ఆ మహామహుల బాణీల బాణాలను తన తూనీరంలో ఇముడ్చుకున్న పాట యోధుడు మన సుందరరాముడు. తలచూసే ముగ్గు బుట్ట తలపు మాత్రం భావాల పుట్ట. పద్నాలుగు సార్లు నంది పురస్కారాలు అందుకొని తెలుగు పాటకు నందీశ్వరుడయ్యారు.

వేటూరి కలంలోని పాటల పరవళ్లకు దూకుతున్న జలపాతం జంకుతుంది. వెండి తెర ఆకాశాన్ని ఆ కలం తన సిరాతో నీలంగా అలికి, భావాల వానవిల్లును పరిచింది. ఆ కలం రాయని పాట లేదు. ఆ కలాన్ని పాడని గళం లేదు. తెలుగు సినిమా పాటను చంకనెత్తుకుని చందమామను, చక్కిలిగింతల చెక్కిలి భామను, చండ్ర నిప్పుల ఉద్యమాలను, సంకీర్తనల సంగతులనూ పరిచయం చేసి తెలుగు శ్రోతలను ఉర్రూతలూగించింది.
నిజానికి వేటూరి సుందరరామమూర్తి తెలుగు చిత్రసీమలోకి సినిమా పాట పరిస్థితి విచిత్రంగా ఉంది. సినిమా పాటా అంటూ జాలిపడే పరిస్థితి. ఆయన తొలి పాటకు కలం విదిలుస్తూనే కావ్యగౌరవం కల్పించే యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 'భారతనారీ చరితము...' అనే 'ఓ సీత కథ'లోని ఆయన తొలి పాట నిజంగా పాటేనా?.. పాటంటే పాట కాదు... అది హరి కథ. కానీ ఆ రచనకు సినిమా పరిశ్రమ వాహ్‌! అని పులకించింది. నాటి నుంచి ఎన్టీ రామారావు, కె.విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు లాంటి సినీ ప్రముఖులు ఇచ్చిన ప్రోత్సాహంతో వడివడిగా అడుగులు వేశారు. 'ఓ సీత కథ' తరవాత సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతామాలక్ష్మి, అడవి రాముడు, యమగోల లాంటి చిత్రాలతో యావత్‌ తెలుగు చిత్రసీమనీ తన వైపు తిప్పుకొన్నారు.
ఆ కలానికి ఎన్ని పాళీలో...
వేటూరి పాటల తీరుని పరిశీలించినవాళ్లు ఆయన కలానికి ఎన్ని పాళీలో అనుకోవల్సిందే! శంకరా నాద శరీరా..., 'శివ శివ శంకర', 'ఝుమ్మంది నాదం', 'ఏ కులమూ నీదంటే...' లాంటి సాహితీ విలువలతో అలరారే గీతాలూ ఆ కలం నుంచి వచ్చినవే. 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను..', 'ఆకుచాటు పిందె తడిసె...' లాంటి అల్లరి, శృంగార గీతాలూ ఆ కలమే రాసింది. వేటూరి పాటను ఎంతగా పొగిడినవాళ్లు ఉన్నారో... విమర్శలు గుప్పించినవాళ్లూ ఉన్నారు. బూతు రాస్తున్నారని దుయ్యబట్టారు. ఓ సినిమాలో ఆయన రాసిన పాటలో ఒక చోట 'జాకెట్లో జాబిల్లి...' అని ఉంటుంది. దీనిపై వేటూరి ఘాటుగా వివరణ ఇచ్చారు ''నేను రాసింది 'చీకట్లో జాబిల్లి...' ఓ కొంటె సహాయ దర్శకుడు చీకట్లోని జాకెట్లో అని మార్చాడు. వేటూరి బూతే రాయాలి అనుకొంటే జాకెట్లో రెండు... అని రాయగలడు''.

ఏ తరానికైనా...
విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావుల తరవాత ఎక్కువగా ఆయన జంధ్యాల లాంటి దర్శకులతో కలిసిపోయారు. ఆయన కేవలం కొందరితోనే అని కాకుండా అన్ని వయసులవాళ్లతోనూ, అందరు నిర్మాతలతోనూ కలుపుగోలుగా ఉండేవారు. వేటూరికి సహాయకుడిగా కీరవాణి కొన్నాళ్లు సహాయకుడిగా ఉన్నారు. ఇటీవల రెండు వందల చిత్రాలు పూర్తయిన సమయంలో నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు కీరవాణి ''రెండు వందల సినిమాలు పూర్తయ్యాయి అనే మాట గుర్తుకొస్తే వేటూరిగారిచ్చిన రెండు వందల రూపాయలు గుర్తుకొస్తున్నాయి. నేను ఆయన దగ్గర ఉన్న సమయంలో ఖర్చులకు అప్పుడప్పుడూ రెండు వందలు ఇస్తుండేవారు'' అన్నారు. స్వరకర్త కల్యాణి మాలిక్‌ మాటల్లోనే చెప్పాలంటే ''వేటూరిగారిది చిన్నపిల్లాడి మనస్తత్వం. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు''. అందుకే నవతరం దర్శకులకీ ఆయన ప్రీతిపాత్రమైన గేయ రచయిత. ప్రముఖ దర్శకులు మణిరత్నం తన ప్రతి చిత్రానికీ వేటూరితోనే పాటలు రాయించుకొనేవారు. గుణశేఖర్‌, శేఖర్‌ కమ్ముల తదితర దర్శకులు ఆయన గురువుతో సమానం.
వేగం ఆయనకే సొంతం
గీత రచయితలు పాట కోసం రోజుల తరబడి సమయం తీసుకొంటారనే అపప్రథ ఉంది. ముఖ్యంగా ఆత్రేయ లాంటివాళ్లని ఉదాహరణలుగా చెబుతారు. వేటూరి అందుకు భిన్నంగా వేగంగా పాటను రాసి ఇవ్వడం ఆయనకే చెల్లు. శంకరాభరణంలోని పాటల్ని ఎవరూ మరచిపోలేరు. అందులో పాటలు తక్కువ సమయంలోనే రాసి ఇచ్చారు.

పాట ఎలా ఉండాలి?
పాట ఎలా ఉండాలనే విషయంలో వేటూరి ఎంతో స్పష్టమైన వివరణ ఇచ్చేవారు. ''పాటంటే మాటలు కాదు. నేను విశృంఖల పద ప్రయోగం చేసినా అది పాటకు తగిన విషయం లేనప్పుడు, శబ్దాశ్రయం, వస్తువాశ్రయం లేనప్పుడు, భావ ప్రగల్భానికి అవకాశం లేనప్పుడు మాత్రమే పదాలతో ఆడుకున్నాను. ఒక శూన్యాన్ని దాటవలసి వచ్చినప్పుడు శబ్ద సేతువుల్ని నిర్మించుకున్నాను. అదే విధంగా చాలా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు శబ్దాలయాలు కట్టి అందులో ప్రతిమలుగా ఆ సన్నివేశ శిల్పాల్ని ప్రతిష్టించాను. ప్రతి పదానికీ సన్నివేశాన్ని మోసే శక్తి ఉండాలి. ప్రతి అక్షరాన్నీ తన గవాక్షంలోంచి అనంత విశ్వాన్ని దర్శించగలిగేబీజ శక్తి ఉండాలి'' అన్నారు.

ప్రముఖుల సంతాపం
తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతవరకూ వేటూరి ఉంటారని ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. వేటూరి మృతి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేటూరి మృతికి సంతాపం తెలిపినవారిలో తెదేపా అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ప్రరాపా అధినేత చిరంజీవి తదితరులున్నారు.
________________________________

మెచ్చుతునకలు
మన మధ్య వేటూరి లేని ఈ రోజు తెలుగు పాట ఎక్కడ అని అడక్కండి. ఎక్కడో ఒక మూలన పదం, మాట చొరబడలేని చోట ఒక్కర్తే కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తుంటుంది. ఈ కష్టమంతా కరిగిపోయేదాకా ఈ చేదు జ్ఞాపకం చెరిగిపోయేదాకా ఏడ్వనివ్వండి. ఎన్ని కన్నీళ్లు ఖర్చు చేస్తే వేటూరి లేరనే బాధ తీరుతుంది? తన పదాలతో పెంచి పరుగులెట్టించి పరవళ్లు తొక్కించిన తన తోటమాలి ఇక్కడలేడని, రాడనీ తెలిసి పాట మాత్రం ఎలా తట్టుకొంటుంది. ఇక తెలుగు పాటకు కొత్త రాగాలు లేవు. వర్ణాలూ రావు. అందుకే భోరున ఏడ్వనివ్వండి. ఓ గోదావరి పుట్టేలా, కృష్ణమ్మకు కన్ను కుట్టేలా... ఒక్కసారి వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని ఆణిముత్యాలను ఏరుకోండి...

* శంకరా నాద శరీరా - శంకరాభరణం
* మనిషై పుట్టినవాడు - అడవిరాముడు
* కిరాతార్జునీయం - భక్తకన్నప్ప
* శివ శివ శంకర - భక్తకన్నప్ప
* ఝుమ్మంది నాదం - సిరిసిరిమువ్వ
* ఏ కులము నీదంటే - సప్తపది
* నవమినాటి వెన్నెల నేను - శివరంజని
* నిన్నటిదాకా శిలనైన - మేఘసందేశం
* ఈ దుర్యోధన దుశ్శాసన - ప్రతిఘటన
* రాగం తీసే కోయిలా - నాగమల్లి
* సిరిమల్లెనీవే - పంతులమ్మ
* వేదం అణువణువున నాదం - సాగరసంగమం
* మిన్నేటి సూర్యుడు - సీతాకోకచిలుక
* ఆమనిపాడవే - గీతాంజలి
* అబ్బనీ తీయని దెబ్బ - జగదేకవీరుడు అతిలోకసుందరి
* యమహానగరి - చూడాలనివుంది
* ఈ పాదం ఇలలోన - మయూరి
* తెలుగుపదానికి జన్మదినం - అన్నమయ్య
* సొగసుచూడతరమా - మిస్టర్‌పెళ్లాం
* వేణువై వచ్చాను - మాతృదేవోభవ
* అయిదు రోజుల పెళ్లి - వరుడు

(ఈనాడు, సినిమా, ౨౩:౦౫:౨౦౧౦)
______________________________

నారీ.. నోరు విప్పాలి!


చెప్పాలనుకున్నదాన్ని ఎటువంటి తడబాటు లేకుండా, సూటిగా వ్యక్తం చేయడం నిజంగా కళే. కొంతమంది మగువలు తమవారి ముందు గుక్కతిప్పుకోకుండా మాట్లాడేస్తుంటారు. కానీ ఇతరుల ముందు నోరు పెగలదు. చిన్నపాటి సదస్సుల్లో, కార్యాలయంలో సహోద్యోగుల మధ్య విషయాలను వివరించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిపడతారు. వాక్చాతుర్యాన్ని పెంపొందించుకోవాలనుకున్న వనితలూ... ఓసారి ఇవి చదవండి.

* అభిరుచి :
ఎవరికి ఏ అంశంలో ఆసక్తి ఉంటుందో ఆ విషయాలను స్పష్టంగా మాట్లాడగలరు. కొంతమంది రాజకీయాల గురించి బాగా మాట్లాడితే, మరికొందరు పిల్లల పెంపకం, అందం, క్రీడలు.. తమకు నచ్చిన రంగం గురించి బాగా సంభాషించగలుగుతారు. తమ అభిరుచికి అద్దంపట్టే విషయాలను గుర్తించి, ఎప్పటికప్పుడు విషయసేకరణ చేసుకోవడం ఉత్తమం.

* అవగాహన :
పలు విషయాలపై పట్టున్నట్టే అనిపిస్తుంది. కానీ తీరా నలుగురిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు లోతుగా ప్రస్తావించలేరు. అందరికీ తెలిసిన పైపై మాటలు చెప్పి ఆగిపోతుంటారు. అందుకే ఆ రంగంలో మరింత అవగాహనను పెంచుకోవాలి. క్షుణ్ణంగా తెలిసుంటే ఆత్మస్త్థెర్యంతో ప్రసంగించగలరు. కొత్త విషయాలను చెప్పగలిగినప్పుడు ఎదుటి వారూ చెవిచ్చి ఆలకిస్తారు.

* శ్రోతల్ని గమనించాలి :
ఎవరి ముందు మాట్లాడుతున్నారో గుర్తెరగాలి. వాళ్ల ఇష్టాయిష్టాలు... ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారు? సాంకేతికంగా వారి పరిజ్ఞానం ఎంత? మాట్లాడుతున్న అంశాన్ని ఎంత వరకు అవగాహన చేసుకోగలరు? వంటి పలు అంశాలను గ్రహించగలిగితే దానికి తగ్గట్టు సన్నద్ధమవడం తేలిక.

* రాసుకుంటే.. :
సదస్సుల్లో పత్ర సమర్పణ లాంటివి చేయాల్సి వచ్చినప్పుడు వీలైతే మొత్తం వ్యాసాన్ని రాసుకుని చదువుకోవచ్చు. ముఖ్యాంశాలను రాసుకోవడం వల్లా ఉపయోగం ఉంటుంది. ఇలా చేస్తే చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోయే ప్రమాదం ఉండదు. మన ముందున్న వ్యక్తుల్ని చూసి తడబడి అసలు విషయాన్ని మర్చిపోతామన్న చింత దూరం.

* తర్ఫీదు :
మనసులో ఎన్ని విధాల అనుకున్నా ఆ భావాలను స్పష్టంగా పలకగలగాలి. ప్రసంగించాల్సిన విసయాన్ని ముందు రోజు ఒకటికి నాలుగు సార్లు అద్దం ముందు చెప్పుకొంటే మంచిది. సన్నిహితుల ముందు చెప్పినా ఫలితం ఉంటుంది. వారి సలహాలను కూడా స్వీకరించవచ్చు.

* సంసిద్ధత :
ఇన్నిరకాలుగా సంసిద్ధులైన తర్వాత ఇంకా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. వక్తృత్వ అంశమూ తెలుసు. శ్రోతల మనసూ తెలుసుకున్నప్పుడు భయమెందుకు? ధైర్యంగా మాట్లాడగలమన్న భావనను మనసులో ఒకటికి నాలుగు మార్లు మననం చేసుకుంటే చాలు.

* హావభావాలు :
నిటారుగా నిలబడి పాఠం అప్పగించేసినట్టు మాట్లాడటం ఎప్పుడూ అందగించదు. హావభావాలు ముఖ్యం. మనం ఏం చెబుతున్నామన్నది కొన్ని సార్లు చేతుల కదలిక, ముఖ కవళికలు ద్వారా కూడా వ్యక్తం చేయగలుగుతారు. అలాగని చేతుల్లో కాగితాలుంచుకుని వాటిని అటు ఇటూ కదిలిస్తూ మాట్లాడితే మైక్‌ ముందు చప్పుడై ఇబ్బందిగా ఉంటుంది. ఎదురుగా పోడియం ఉంటే దాని మీద చేతులు ఆన్చి మాట్లాడితే ఉత్తమం.

* చిరునవ్వు :
చిరునవ్వును మించిన ఆభరణం ఉండదంటారు. తీసుకున్న అంశాన్ని గురించి లోతుగా, ప్రభావితంగా మాట్లాడుతున్నా ముఖం మీద ప్రశాంతత, చిరునవ్వులను చెక్కుచెదరనీయకూడదు. సంతాప సభల్లో చిరునవ్వులు పనికిరావు. సమయానుకూల ప్రవర్తన మెప్పిస్తుంది.

* అతి వద్దు :
కొంతమంది ఎదురుగా ఉన్న ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ఏవో చిన్నపాటి జోకులు చెబుతుంటారు. కానీ కొన్ని మరీ పేలవంగా ఉండి ఎదుటివారికి నవ్వు తెప్పించవు. సరికదా 'కుళ్లు జోకు' అని విమర్శలకు తావిస్తాయి. అందుకే వీలైనంత వరకు సున్నితమైన హాస్యాన్ని పండించే చమక్కులను ఎంచుకోవాలి.

* అర్థవంతంగా :
'నా ధోరణి ఇంతే' అన్నతత్వం ఏ సమయంలోనూ సరికాదు. విషయాన్ని ఎంత సూక్ష్మంగా గ్రహించినా, చక్కటి తర్ఫీదు ఎలాగూ ఉందని మురిసిపోయినా, ఎదుటివారి నాడిని పట్టుకోగలమన్న ధీమా ఉన్నప్పటికీ... మనం చెప్పదలచుకున్న విషయాన్ని అర్థవంతంగా చెప్పకపోతే... వక్తృత్వం ఎదుటివారి మస్తిష్కంలో ఆలోచనను రేకెత్తించకపోతే మీరు చేసిన మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరేనన్నది అక్షర సత్యం. అందుకే అర్థవంతంగా ప్రసంగించగలిగితే చాలు.
(ఈనాడు, వసుంధర, ౦౩:౦౬:౨౦౧౦)
___________________________

Labels:

సరైన నిర్ణయానికి 10-10-10

జీవితాన్ని మలుపుతిప్పే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎన్నో విధాల ఆలోచిస్తాం. కొత్తగా ఓ పని మొదలుపెట్టాక కూడా కొందరు... గతంలో తీసుకున్న నిర్ణయం సరైనదేనా? కాదా? అని వూగిసలాడుతుంటారు. అలాంటి వారికి తనదైన సలహాను చెబుతున్నారు సుజి వెల్చ్‌. తుది నిర్ణయాలకు సంబంధించి ఈమె సూచించిన ఓ అంశం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు పలువురి మెప్పు పొందింది. ఆ సూత్రాన్నే '10-10-10' అనే పుస్తకంలో ఆమె పొందుపరిచారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. మనం తీసుకునే నిర్ణయం ప్రభావం, తర్వాతి 10 నిమిషాలు, 10 నెలలు, 10 ఏళ్ళలో ఎలా ఉండబోతుందన్నది ఆలోచిస్తే చాలన్నది ఆమె చెప్పిన సిద్ధాంతం.
''మన జీవితంలో పదేళ్ళు ముందుకు వెళ్ళి చూసుకోగలిగినప్పుడు ఇవాళ్టి నిర్ణయానికి ఓ ప్రత్యేకత ఏర్పడుతుంది. అప్పుడేదో అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్ల నా పరిస్థితి ఇలా దిగజారింది.. అని బాధపడాల్సిన అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో మన నిర్ణయాలు మన ఆత్మీయులు, బంధువుల మీద కూడా ప్రభావితం చూపుతాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. '10-10-10' విధానంతో మనలోని సానుకూల, ప్రతికూల దృక్పథాలు, ముందున్న అవకాశాలు.. పరిసరాలు అన్నీ సుస్పష్టంగా అవగతమవుతాయి. ఇవన్నీ మంచి వైపే నడిపిస్తాయి'' అని అంటున్న వెల్చ్‌ జీవితం పాత్రికేయురాలిగా ప్రారంభమైంది.
(ఈనాడు, వసుంధర, ౦౩:౦౬:౨౦౧౦)
[Suzy Welch (née Spring) (born 1959), formerly Suzy Wetlaufer, is a best-selling author, television commentator and noted business journalist. Her latest book, the New York Times best seller, 10-10-10: A Life Transforming Idea, presents a decision-making strategy for success at work and in parenting, love, and friendship.]
___________________________

Labels: ,

Thursday, June 03, 2010

The only Toyota that hasn't been recalled!! 100% Eco-friendly.



(An email forward)
________________________________

Labels: