My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Monday, May 10, 2010

ఉత్కృష్టమార్గం

- తటవర్తి రామచంద్రరావు


'ఈ ప్రపంచంలో జీవించటానికి ఉత్కృష్టమైన మార్గమేది?' అని ఒక శిష్యుడు శ్రీరామకృష్ణుని ఒకసారి అడిగితే దానికి పరమహంస ఇలా జవాబు చెప్పారు:

'నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి. నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైనవాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.

ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. 'నా బాబువి కదూ, నా తల్లివి కదూ' అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియమార తినిపిస్తుంది. కాని, ఆమెకు తెలుసు- ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.

తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది! అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి. నీ మనసును మాత్రం ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.

బాల్యంలోనే దైవారాధన అనే సదాచారం నీకు అలవడకపోతే సంపదలు, సౌకర్యాలు, సుఖాలు పోగేసుకునే వ్యామోహంలోపడి ఆ పరాత్పరుణ్ని పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంది. సర్వసమర్థుడినన్న అహంకారం, ఆశించినవి అందటంలేదన్న దుఃఖం, అంతుపట్టని అసంతృప్తి నిన్ను పూర్తిగా ఆక్రమించుకుని అశాంతి పాలుచేసే విపత్తు పొంచి ఉంటుంది. ప్రాపంచిక వస్తువుల్ని పోగేసుకుంటున్నకొద్దీ వాటి మీద నీ యావ ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది.

పనసపండును కోసే ముందు అరచేతులకు నూనె రాసుకోవాలి. లేకపోతే దాని పాలు బంకలా వేళ్ళను పట్టుకుని వదలదు. అలాగే ముందు దైవప్రేమ అనే నూనెను అందిపుచ్చుకో... ఆ తరవాతనే ప్రాపంచిక ధర్మాలను చేతపట్టు. దైవానుగ్రహం లభించటానికి నీకంటూ ప్రత్యేకంగా కొంత ఏకాంత సమయం కావాలి.

పాల నుంచి వెన్న దొరకదు. ముందు పాలనుకాచి పెరుగు తోడుపెట్టుకోవాలి. తొందరపడి దాన్ని కదిపితే పెరుగు తోడుకోదు. పాలుగానే ఉండిపోతుంది. చిక్కని పెరుగును చిలక్కొట్టిన తరవాతే వెన్న లభిస్తుంది. ప్రపంచం నీళ్ల లాంటిది. మనస్సు పాల లాంటిది. పాలను నీళ్ళల్లో పోస్తే అదంతా కలిసి ఏకమవుతుంది. వెన్నని నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది.

అలాగే, ఆధ్యాత్మిక శిక్షణకు ఏకాంత సాధన కావాలి. జ్ఞానమనే వెన్నను చిలికి తెచ్చుకోవాలి. ఒకసారి అది లభించాక ప్రపంచమనే నీటిలో ఉంచినా అది కలవదు. ఈ స్థితికి చేరుకోగలిగేదే ఉత్కృష్ట మార్గం.
(ఈనాడు, అంతర్యామి, ౧౦:౦౫:౨౦౧౦)
_____________________________

Labels:

సన్మార్గమే సోపానం

యం.సి.శివశంకరశాస్త్రి


అది ఒక పల్లెటూరు. దేవుడు లేడని వాదించేవాళ్లు అక్కడ చాలామంది ఉన్నారు. ఆ వూరికి ఏ సాధువు, సన్యాసి వచ్చినా అక్కడి నాస్తికవాదులందరూ ఒక్కటై చుట్టుముట్టి 'దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు' అని వేధించేవారు.

ఒకసారి ఆ వూరికి ఒక యోగి వచ్చి అక్కడి రామాలయంలో మకాం వేశాడు. అల్లరి గుంపంతా కలిసి వెళ్లి యోగిని ముట్టడించింది. ఆ మహాత్ముడు వారడిగిన కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పి 'నాయనలారా! రెండు రోజులుగా భోజనం చేయలేదు. ఏమైనా తెచ్చి ఇవ్వగలరా?' అని కోరాడు. వారిలో ఒక యువకుడు వెంటనే ఇంటికెళ్ళి ఒక గ్లాసునిండా పాలు పట్టుకొచ్చి ఇచ్చాడు. పాల గ్లాసు చేతపట్టుకొని అక్కడే పడి ఉన్న ఒక పుల్లతో పాలను కలియబెడుతూ పదేపదే పరీక్షగా ఆ పాలలోకి తొంగిచూడటం మొదలుపెట్టాడు. పాలు తాగమన్నాడు తెచ్చి ఇచ్చిన యువకుడు. 'నాయనా! పాలలో వెన్న ఉంటుందని అంటారు. ఆ వెన్న చూద్దామని వెతుకుతున్నాను' అని చెప్పాడు యోగి. 'భలేవాడివే. అలా వెతికితే వెన్న ఎలా కనబడుతుందనుకున్నావు? ప్రతి పాల బొట్టులోనూ వెన్న ఉంది. కానీ అది అలా కనబడదు. దాన్ని వెలికితీసే పద్ధతి వేరే ఉంది. పాలను కాచి, తోడుపెట్టి, చిలికితే తప్ప వెన్న కనబడదు' అన్నాడు.

'మరైతే దేవుడున్నాడా? ఎక్కడున్నాడో చూపెట్టు అంటూ ఇందాక మీరందరూ కలిసి నన్ను సతాయించారే. దేవుడు అంత సులభంగా కనిపిస్తాడని ఎలా అనుకుంటున్నారు? ఆయన అందరికీ కనబడడు. కొందరే చూడగలరు. దేవుని చూసే ప్రక్రియ వేరే ఉంది' అని చెప్పాడాయన. 'అది ఎలా సాధ్యమో చెప్పండి' అన్నాడు అతను.

'మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. విషయం మళ్ళీ తెలియజేస్తాను. ఇప్పటికిక నన్ను వదిలిపెట్టండి' అని వారిని సమాధానపరచి పంపాడు.

పాలు తెచ్చి ఇచ్చిన యువకుడికి యోగి మాట తీరు బాగా నచ్చింది. ఆయన ద్వారా విషయాలు మరిన్ని తెలుసుకుంటే బాగుంటుందని భావించాడు.

మరునాడు ఉదయం రామాలయానికి వెళ్ళాడు. యోగిని దర్శించుకొని 'స్వామీ! మీరేమీ అనుకోనంటే ఓ మాట అడగాలనుకొంటున్నాను. అడగమంటారా?' అన్నాడు. 'అడుగు నాయనా! నాకు తెలిసిందేదో చెబుతాను' అన్నాడాయన. 'దేవుణ్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక నాకు ఎంతో కాలంగా ఉంది. నెరవేరుతుందంటారా?' అని అడిగాడు యువకుడు. 'నేను చెప్పినట్టు చేస్తే తప్పక నెరవేరుతుంది. దేవుని నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. రేపు సూర్యోదయానికి ముందే శుచిగా నువ్వు ఇక్కడికి రా' అని చెప్పాడు.

యోగి చెప్పినట్లు యువకుడు మర్నాడు రామాలయం దగ్గరికెళ్ళాడు. అప్పటికే ఆయన ఒక మూట తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆ యువకుని రమ్మని 'ఇదిగో ఈ మూటను తలపై పెట్టుకొని నాతోపాటు ఆ కనబడే కొండ శిఖరాన్ని చేరుకో. అక్కడ దేవుని ప్రత్యక్షంగా నీకు చూపెడతాను' అన్నాడు.

యువకుడు మూట నెత్తిన పెట్టుకొని కొండ ఎక్కసాగాడు. కొంత ఎత్తుకు వెళ్లేసరికి మూట బరువనిపించింది. యోగికి చెప్పాడు. 'మూట విప్పి అందులోంచి ఒక రాయి తీసి పడేసి మళ్ళీ పయనం సాగించు' అన్నాడు. ఆయన చెప్పినట్లే చేసి ముందుకు నడిచాడు. ఇంకొంత ఎత్తుకు వెళ్ళాక మళ్ళీ మూట బరువనిపించింది. వెనకాలే వస్తున్న యోగికి చెప్పాడు. ఇంకొక రాయి తీసి పడేయమన్నాడు.

ఇలా ఒక్కొక్క రాయి చొప్పున ఆ మూటలో కట్టి ఉంచిన ఆరు రాళ్లూ తీసి పడేశాడు. ఖాళీ చేతులతో కొండ శిఖరం చేరుకున్నాడు. 'మీరు చెప్పినట్టే ఇక్కడికి చేరుకున్నాను. దేవుని ప్రత్యక్షంగా చూపెట్టండి' అన్నాడు యువకుడు. 'నాయనా! మూటలో కట్టి ఉంచిన ఆరు రాళ్ళూ శిఖరందాకా మోయలేక ఒక్కొక్కటిగా అన్నీ తీసి పడేసి చివరికి వట్టి చేతులతో ఇక్కడికి చేరుకున్నావు. నేను అందులో కట్టి ఉంచిన ఆరు రాళ్ళూ మామూలు రాళ్ళని అనుకోకు. అరిషడ్వర్గాలుగా పిలిచే ఆరు చెడ్డ గుణాలకు అవి ఉదాహరణలు. వాటిని తీసివేసిన తరవాతే సులభంగా ఈ శిఖరం చేరుకున్నావు- అవునా?' అన్నాడు. 'అవును' అన్నాడు అతడు. 'అలాగే మనిషి ఎదుగుదలకు అన్ని విధాలా అడ్డుగా ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు చెడ్డ గుణాలను మన నుంచి దూరం చేసుకోవాలి. అప్పుడు ఏ పని చేసినా సులభతరమవుతుంది. సఫలమవుతుంది' అని పలికాడు యోగి.

'అరిషడ్వర్గాలన్నింటినీ అరికట్టే మార్గమేదో దయచేసి తమరే తెలియజేయండి' అన్నాడీసారి యువకుడు. 'అందుకు మనం చేయాల్సిందల్లా ఒక్కటే. అంతర్ముఖ బుద్ధి సంపాదించి సాధన సంపత్తి సాధిస్తే ఇక అసాధ్యమనేది ఏదీ ఉండదు' అని విడమరచి చెప్పాడు యోగి. ఈ మాటలతో యువకుని మనసు మారిపోయింది. 'స్వామీ! ఇక ఈ క్షణం నుంచి నా నడవడికను మార్చుకుని మంచి మార్గంలో పయనిస్తాను' అని చెప్పాడు. అతణ్ని అభినందించాడు యోగి.
(ఈనాడు, అంతర్యామి, ౦౯:౦౫:౨౦౧౦)
________________________________

Labels: