My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, December 02, 2007

ఫన్‌కర్‌ ఫటాఫట్‌

బాగా 'తినాలని' కోరుకునే వారికి మీరిచ్చే సలహా?

'కాగ్‌ రిపోర్టులు చదవండి. మంచి మార్గాలు తెలుస్తాయి' అని.
________________________
* మీకు 'హస్త'సాముద్రికం వచ్చని విన్నాను. నిజమేనా?

ఇంకా నయం. 'హస్త లాఘవం' వచ్చని అన్లేదు.
__________________________
* అటు టాటా, ఇటు బిర్లా మధ్యలో మీరు ఉంటే...?

ఇద్దరి జేబుల్లోనూ చెయ్యి పెడతా!
__________________________
* బిల్‌గేట్స్‌ నన్ను అప్పు అడగాలంటే ఏం చేయాలి?

మీ ఇంటి 'గేట్స్‌' బార్లా తెరచి మంచి కల కనండి.
________________________________
* పారిశ్రామికవేత్తలూ 60 ఏళ్లకు పదవీ విరమణ చేయాల్సి వస్తే?

పెన్షన్‌ ఉండదు కానీ టెన్షన్‌ ఉంటుంది! అయినా వయసుతో పని ఏముంది పర్సులోనే కదా అంతా ఉంది.
_______________________________
* 'భాగ్యలక్ష్మి' కరుణించాలంటే

వెంటనే ఆవిడకో ఓ ఫ్లాట్‌ కొని ఇచ్చేయండి.
________________________________
* 'దివాలా' బ్యాంకుకు మిమ్మల్ని మేనేజర్‌గా ప్రమోట్‌ చేస్తే?

మీలాంటివాళ్ల 'సాయం'తో ఏదో విధంగా 'మేనేజ్‌' చేయడానికి ప్రయత్నిస్తా.
________________________________
* నేను ఓ కంపెనీలో మేనేజర్ని. ఈమధ్య నా ఛాంబర్‌లోకి వచ్చిన వాళ్లంతా వణికి పోతున్నారు. నేనంటే వాళ్లకి ఎంత భయమో కదా?

భయంలేదు, గియంలేదు కాని, శీతాకాలం కదా! మీరు కాస్త ఆ ఏసీ కట్టేస్తే సరి.
__________________________________
* శ్రీకృష్ణుని భార్య రుక్మిణీ దేవికి నచ్చని వ్యాపారం?

టపాసుల వ్యాపారం! దాని పేరు వింటేనే రుక్మిణీదేవికి సత్యభామ గుర్తొచ్చి తిక్కరేగుతుంది.
_____________________________
* ముకేశ్‌ తన సతీమణికి రూ.234 కోట్ల విలువైన విమానాన్ని బహుమతిగా ఇచ్చాట్ట. అలాకాకుండా ఆమెకు కోపం తెప్పించాలంటే ఆయన ఏం చేసేవారు?

'లుంబినీ పార్కు'కు షికారు వెళదాం వస్తావా? అని అడిగేవారు.
_______________________________
(Eenadu, 02:12:2007)
________________________________

Labels:

మన తెలుగు తల్లికి...

'ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు పూజ సల్పితినో ఇందు పుట్టినాడ కలదయేని పునర్జన్మ కలుగుగాక మధుర మధురంబగు తెనుగు మాతృభాష' అని పులకించిపోయారు రాయప్రోలువారు. అంతటి ఆరాధనభావంతో తల్లిభాషను నెత్తిన పెట్టుకుంటున్నవారు నేడు ఎందరున్నారు? ప్రపంచంలో అనేక భాషలున్నాయి. ఎవరి భాష వారికి గొప్ప. అదేం విచిత్రమో- ఇప్పుడు ఎందరికో ఇతర భాషలంటేనే మోజు. 'మాతృభాషా తృణీకారం మాతృదేవీ తిరస్కారం' అన్నారు గాంధీజీ. హితోక్తుల్ని ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసేవారి సంఖ్య పెరిగిపోతున్నచోట కనిపించేది మాతృభాషా తృణీకారమే. 'పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడప దాటనివాడు పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు' తల్లిభాషకు దూరమవుతున్నాడన్నది చేదునిజమే. స్వయంగా కన్నడ ప్రభువైనా 'దేశభాషలందు తెలుగు లెస్స' అని శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతించాడు. సొంతంగా అద్భుత తెలుగు ప్రబంధం 'ఆముక్త మాల్యద'ను సృష్టించింది ఆయనే. రాయల ఏలుబడిలో భువన విజయ కవితా గోష్ఠులది మరపురాని చరిత్ర. నాటితో పోలిస్తే- వెలాతెలా పోతున్న నేటి తెలుగును చూసి, భాషాభిమానుల్ని నిలువునా దిగులు ఆవరిస్తోంది. అత్యున్నత మానవతా విలువలు, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన తెలుగుభాష తనను కాచి కాపాడేదెవరని ఆక్రోశించే దుర్గతి నేడు దాపురించింది. తల్లిభాషను రక్షించుకోవాలని ఎలుగెత్తి చాటేందుకు తాజాగా తిరుపతి వేదికైంది. మన భాషా సాహితీ సౌరభాలను, వెలుగు జిలుగులను అందరికీ పంచేందుకే తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు తలపెట్టామన్నది నిర్వాహకుల మాట. తప్పెటగుళ్లు, తాళాలు, బాజాలు, కొమ్ముబూరల సవ్వళ్లతో మార్మోగిన తిరుపతి- తల్లిభాషను కాపాడాలన్న నినాదాలతో ప్రతిధ్వనించింది. ఈ పిలుపు ఎందరికి మేలుకొలుపు అవుతుందన్నదే ప్రశ్న.

వెనకటి తరం రచయితలు కొందరు లాల్చీ ధారణ, బెంగాలీ పంచెకట్టు, రవీంద్రుడి మార్కు గడ్డంతో వంగ కవిత్వాన్ని భుజాన మోసేవారు. 'ఠస్సా చెప్పి రంజింప చేద్దా'మనే గిరీశం తరహాలో- ఆంగ్లంపై అమిత అనురక్తి ప్రదర్శించేవారి సంఖ్యాధిక్యానికి నాడూ నేడూ కొదవ లేదు. జీలకర్రలో కర్ర లేకపోవచ్చుగాని తెలుగువాడిలో వాడికి లోటు లేదన్న గర్జనలకూ ఏనాడూ కరవు లేదు. జనవరి, మార్చి, మే, జులై నెలల పేర్లతో- 'జనవరిష్టుడు శ్రీరామచంద్రమూర్తి మేలుగూర్చుట వ్రతముగా మెలగినాడు మహిని రాక్షసులన్‌ బరిమార్చినాడు సూర్యవంశపు జూలయి శోభలీనె' అని తమాషా పద్యాలల్లిన నేర్పరులిక్కడ ప్రభవించారు. తెలుగు చేవ ఇతర రాష్ట్రాలకూ వ్యాపించింది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పూర్వీకులు ఇక్కడివారేనని, కేరళలో నంబూద్రి నాయర్లు సైతం తెలుగువారేనని, కర్ణాటకలో వైదిక బ్రాహ్మణులు మన భాషీయులేనని సంబరపడతాం. ఆది శంకరాచార్యులు మొదలు అన్నాదొరై వరకు ఎందరో తెలుగువారేనని మురిసిపోతాం. తెలుగు భాషా పరిరక్షణ సంగతేమిటంటే- ముందు వెనక అంతా... నిశ్శబ్దమే. 'దేశంలో తెలుగుభాషది రెండోస్థానం (ఇది జనాభాకు సంబంధించి!) ప్రాశస్త్యంలో మొదటిస్థానం అనేది నా వ్యక్తిగతాభిప్రాయం...'- అదీ, శ్రీశ్రీ మాట. తెలుగు పదాలకున్న శబ్దమాధుర్యం మరే భాషకూ లేదు. ఏ సాంకేతిక అభిప్రాయాన్ని అయినా, ఏ వైజ్ఞానిక విషయాన్ని అయినా సునాయాసంగా ప్రకటించే శక్తి తెలుగు భాషకుందని ప్రొఫెసర్‌ హాల్డేన్‌ లాంటి విజ్ఞాన వేత్తలెందరో ఒప్పుకొన్నారు. అయితేనేం... మాతృభాషపట్ల పలువురు తెలుగువారి నిరాసక్తత, ప్రభుత్వ ఉదాసీనత- ఎడాపెడా జోడుకత్తులై ఘన వారసత్వాన్ని తెగనరుకుతున్నాయి. ప్రజల కాలానుగుణ అవసరాలు తీర్చలేని ఏ భాషైనా ఉనికి కోల్పోక తప్పదు. ఆ ప్రమాదం తెలుగుకు వాటిల్లకూడదన్న ముందుచూపు కనబరచినప్పుడే మన భాషకు మళ్లీ వెలుగు!

దేశంలోనే మనది మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రం. సమున్నత భాషా సాంస్కృతిక వారసత్వ సంపద మన సొంతం. 'తెలుగదేలయన్న దేశంబు తెలుగు...' అంటూ ఒకప్పుడు మన్ననలందుకున్న భాష నేడు అడుగడుగునా ఎందుకు మసకబారుతోంది? ప్రతి రాష్ట్రానికీ ఆ రాష్ట్ర భాషే అధికార భాషగా ఉండాలని, పరిపాలన వ్యవహారాలన్నీ రాష్ట్ర భాషలోనే జరగాలని నెహ్రూ గిరి గీశారు. 'తెలుగు బాసను జుంటితేనెయని పొగిడి పొరుగింటి పులుపుపై మరులు' పెంచుకుంటున్న అవ్యవస్థ తెలుగు తేజాన్ని హరింపజేస్తోంది. జాతీయ భాష కాగల అర్హత ఒక్క తెలుగుకే ఉందన్నది మహాకవి వాక్కు. దాన్ని వెక్కిరిస్తున్న రీతిగా- సంస్కృతం, తమిళాల్ని ప్రాచీన భాషలుగా గుర్తించిన కేంద్రం వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులూ మంజూరు చేసింది. తెలుగుపై శీతకన్నేసింది. వచ్చే సంక్రాంతిలోగా ప్రాచీన భాష హోదాను అనుగ్రహించకపోతే తెలుగుజాతి సామూహిక నిరశన తప్పదని తిరుపతి భాషా బ్రహ్మోత్సవాల్లో తీర్మానం చేశారు. రెండు నెలలక్రితం విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. అక్కడ జాతీయ సమైక్యతే రచయితల లక్ష్యమని, తెలుగు భాషా పరిరక్షణ వారి బాధ్యతేనని గవర్నర్‌ తివారీ చెప్పారు. ప్రభుత్వం తనవంతుగా ఏం చేయాలో ప్రత్యేకించి ఎవరూ వివరించనక్కర్లేదు. తెలుగు బోధకుల్ని, అభ్యాసకుల్ని పాలకులు అన్ని విధాలా ప్రోత్సహిస్తే- భాషా పరిరక్షణలో అదే పెద్ద ముందడుగు. తెలుగు నేరిస్తే తమ భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న భరోసా విద్యార్థుల్లో కలిగించాలి. దాదాపుగా కార్యకలాపాలన్నీ మాతృభాషలోనే చక్కబెడుతున్న తమిళనాడు, కేరళ శాసనసభల్ని చూసైనా 'ఆంగ్ల ప్రదేశ్‌' తీరు మారాలి. ఆధునిక శాస్త్ర ఫలితాల్నీ మాతృభాషల్లోనే ఇముడ్చుకొని పురోగమిస్తున్న జపాన్‌, జర్మనీ, చైనాల అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్వాలి. ఇటు పౌరులూ తెలుగు తల్లికి మల్లెపూదండలేసి మంగళారతులు పట్టేందుకు ముందుకొచ్చేలా ప్రభుత్వ విధానాలు మారాలి!
(Eenadu, 02:12:2007)
______________________________________

Labels: