My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Wednesday, November 04, 2009

కార్పొరేట్‌ కాలానికీ, ధర్మం సూక్ష్మమే!


మహాభారతమే మనకు అద్దం!
నైతిక సంస్కరణలూ అవసరం
దేశం ఆర్థికంగా అనూహ్య విజయాలు సాధిస్తోందిగానీ.. నైతికంగా మాత్రం మన పయనం ఏమంత తృప్తిగా లేదు. కార్పొరేట్శకంలో ధర్మం విలవిల్లాడుతున్న సందర్భాలుఅనేకం! ఈర్ష్యతో రగులుతూ యుద్ధాలకు దిగుతున్నదుర్యోధనులు నిత్యం మనకు కనబడుతూనే ఉన్నారు. కొడుకులకు పట్టం కోసం ఆరాటపడే ధ్రుతరాష్ట్రులు కళ్లకు గంతలు కట్టుకుంటూనే ఉన్నారు. అందుకే మహాభారతాన్నిసమకాలీన దృక్కోణం నుంచి మళ్లీ చదవటం అవసరమంటున్నారు ప్రముఖ రచయిత, కాలమిస్ట్గురుచరణ్దాస్‌!
నాడూనేడూ కూడా మన సమాజంలో ఒక వ్యక్తి 'మంచి మనిషి'గా నిలబడం అంత తేలికేం కాదంటూ... దీనికి ధర్మాధర్మవిచేచన ఒక్కటే సరైన మార్గమని నొక్కి చెబుతున్నారాయన తాజా పుస్తకం - డిఫికల్టీ ఆఫ్బీయింగ్గుడ్లో.
గురుచరణ్దాస్హార్వర్డ్విశ్వవిద్యాలయంలో ఒకవైపు తత్వశాస్త్రం, మరోవైపు బిజినెస్మేనేజ్మెంట్‌.. రెండూఅధ్యయనం చేశారు. మేనేజ్మెంట్రంగ నిపుణుడిగా లబ్ధప్రతిష్ఠులు. తొలి రచన 'ఇండియా అన్బౌండ్‌'తో యావత్ప్రపంచం దృష్టినీ ఆకర్షించారు. కొంతకాలంగా 'ఈనాడు'తో సహా పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో సమకాలీనఅంశాలపై లోతైన వ్యాసాలు రాస్తున్న ఆయన తాజా పుస్తకాన్ని మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. సందర్భంగా ఆయనతో ముఖాముఖీ!

* మీ పుస్తకానికి 'డిఫికల్టీ ఆఫ్బీయింగ్గుడ్‌' అని పేరు పెట్టారు.. ఈరోజుల్లో 'మంచి మనిషి'గా ఉండటం నిజంగానే 'కష్టం' అంటారా?

అవునవును.. అదెంత కష్టమో.. మన చుట్టూనే.. మన జీవితాల్నేచూడండి.. మనం 'మంచివాళ్లం' అనుకుంటూ (అది పూర్తి నిజంకాకపోయినా).. నిరంతరం మనల్ని మనమే మోసగించుకుంటూఉంటాం. పరిస్థితుల్లో అసలు 'మనం మంచిగా ఎందుకుండాలి?' అన్నది మౌలికమైన ప్రశ్న! ప్రశ్ననే నేను 'మహాభారతం' వెలుగులో తరచిచూసే ప్రయత్నం చేశానీ పుస్తకంలో!

* మనకెన్నో పురాణాలున్నాయి కదా.. మహాభారత దృక్కోణం నుంచే ఎందుకీ విశ్లేషణ?

ఎందుకంటే మహాభారతం మన జీవితాలకు చాలా సన్నిహితంగా ఉంటుంది! రామాయణాన్నే తీసుకోండి.. అది మరీ ఆదర్శవంతమైనది. దానిలో హీరో ఉత్తముడు, భార్య ఉత్తమురాలు, తమ్ముడు ఉత్తముడు.. చివరికి అందులో విలన్కూడా ఉత్తముడే! కానీ మహాభారతం అలా కాదు.. అందులో.. మనలాగానే.. అందరికీ ఏవో ఒక లోపాలుంటాయి, వాళ్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు.. అందుకే భారతం మనకు మరింత దగ్గరగా ఉంటుంది. రెండోది- మహాభారతం రాజకీయ ప్రపంచంతోగాఢంగా పెనవేసుకుంది. రాజు అనుసరించాల్సిన ధర్మం ఏమిటి? మంచి మనిషిగా ఉండాలంటే ఏది ధర్మం? ఇవన్నీచర్చిస్తుంది. ముఖ్యంగా మహాభారతంలో ఒక్కరూ కూడా సమాధానం కోసం 'దేవుడా నీదే భారం' అనరు. ప్రతి పాత్రా కూడా తనకు తానుగా నిలబడాల్సిందే. తన మీద తాను ఆధారపడాల్సిందే. ఎప్పటికప్పుడు పరిస్థితిని ధర్మాధర్మ విచక్షణతో బేరీజు వేసుకుంటూ.. తర్కించుకుంటూ ముందుకు సాగాల్సిందే. అందుకే భారతం మన నైతిక విచక్షణా శక్తికి పదునుపెడుతూనే ఉంటుంది. అంతిమంగా మహాభారతం చెప్పేది- ధర్మమనేది 'సూక్ష్మ'ంలో ఉంటుందని!

* సమకాలీన జీవితానికి మహాభారతం ఎలా స్ఫూర్తినిస్తుందంటారు?

స్థూలంగా చూసినప్పుడు.. మహాభారతం మనకు సమాధానాలు చెప్పదు, మన మీద మనం ఆధారపడటంముఖ్యమన్నది నేర్పుతుంది. సాక్షాత్తూ దైవం వాళ్ల మధ్యనే ఉన్నా కూడా భారతంలో ఎవరూ పూర్తిగా దైవం మీదే భారమేసి ఉండిపోరు. ఇది చాలా సానుకూలమైన అంశం, నేను భారతాన్ని ఎంచుకోవటానికి ఇదీ ఒక కారణం. ధర్మమంటే మతం కాదు. ధర్మాన్ని మతంగా చూడటమన్నది 19 శతాబ్దంలో క్రైస్తవం వచ్చిన తర్వాతే ఆరంభమైంది. లేకుంటే ధర్మమంటే- మంచి చేస్తున్నామా? చెడు చేస్తున్నామా? అనే.

అందుకే మహాభారత కథ చెబుతూనే.. మధ్యలో ఆపేసి.. ఇప్పుడేం జరుగుతోందన్న చర్చ చేశాను. ఉదాహరణకుదుర్యోధనుడ్ని విశ్లేషించేటప్పుడు నేను 'ఈర్ష్య' గురించి చర్చించా. దుర్యోధనుడికి ఎన్నో దుర్గుణాలుండి ఉండొచ్చు, కానీఇది అన్నింటిలోకీ అత్యంత ప్రమాదకరమైనది. పాండవుల విజయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు.చివరికి అదేయుద్ధానికి కారణమైంది. మరిప్పుడు అంబానీ సోదరుల మధ్య జరుగుతున్న యుద్ధం ఇది కాదా? నాకు రిలయెన్స్లోషేర్స్ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు.. ముఖేష్విజయం పట్ల అనిల్కున్న ఈర్ష్య.. చివరికి దేనికి దారి తీస్తుందోననిఆలోచిస్తుంటాను.. అందుకే క్రీ.పూ.5 శతాబ్దంలోనే గ్రీకులు ఈర్ష్య గురించి ఆందోళన చెందేవారు. ఏథెన్స్లో ఎవరైనా అధికప్రాచుర్యం పొందుతుంటే.. ఈర్ష్య తగ్గే వరకూ వారిని ప్రవాసంలోకి పంపేసేవారు. 1930లలో బెర్లిన్‌, వియన్నాల్లో 65% డాక్టర్లు, 50 శాతం వృత్తి నిపుణులు యూదులే. అందుకే యూదులకు వ్యతిరేకంగా మధ్యతరగతి ప్రజలను రెచ్చగొట్టటంహిట్లర్కు చాలా తేలిక అయ్యింది. ఈర్ష్య అన్నది అంత ప్రమాదకరమైనది. దురాశనే తీసుకుందాం... చాలామంది 'సత్యం' అధినేత రామలింగరాజు విషయంలో.. అన్నీ ఉండి కూడా ఆయన ఎందుకిలా చేసిఉంటారని అనుకుంటూ ఉంటారు. ఓపక్క మనకు మహాభారతం చెబుతూనే ఉంది.. అతనేమీ దుర్యోధనుడి వంటివాడు కాదు.. చాలా వరకూ ధ్రుతరాష్ట్రుడివంటివాడు! ఎందుకంటే తన కొడుకులు ఒక్కొక్కరికీ కంపెనీలు ఇవ్వాలనుకోవటమే సమస్య అయ్యుండొచ్చు. కాబట్టిమనం మహాభారత కాలంలో లేమనుకోవటానికేం లేదు.

* ఏది ధర్మం, ఏది అధర్మం తేల్చటం తేలిక కాదుకదా..

ప్రపంచం
ఉంటే మంచిగా, లేకుంటే చెడ్డగా ఉంటుందనేం లేదు. చాలాసార్లు 'మధ్య'లో ఉంటుంది. మనందరిలోనూ లోపాలుంటాయి. అయినా మనందరం మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మనంనీతిమంతంగా ఉంటే సంతోషంగా ఉంటామన్నది ప్రాథమిక విశ్వాసం. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు- కటికి నేల మీద పడుకున్న ధర్మరాజును చూసి ద్రౌపది అనుకుంటుంది.. 'మంచి మనిషివైన మీరేమో ఇక్కడ కష్టాలుపడుతుంటే.. చెడ్డవాడు దుర్యోధనుడు అక్కడ హంసతూలికా తల్పాల్లో శయనిస్తున్నాడు, ఇదేం న్యాయమని!.' కౌరవులుఅన్యాయంగా చేజిక్కించుకున్న రాజ్యం కోసం యుద్ధం చేద్దామంటుంది, క్షత్రియులుగా అది 'మన ధర్మమనీ' అంటుంది. కానీ ధర్మరాజు తన ధర్మం యుధిష్టురుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటాడు! ఇద్దరూ మాట్లాడేది ధర్మం గురించే. కానీ ఇద్దరూ వేర్వేరు ధర్మ సూక్ష్మాలను బయటకు తెస్తున్నారు. ధర్మ వివేచనే కథనాన్ని, జీవన గమనాన్నిముందుకు తీసుకువెళ్తుంటుంది.

* మీ తొలి పుస్తకం 'ఇండియా అన్బౌండ్‌'లో భారతదేశ ఆర్థిక పురోగమనం గురించి చర్చించారు.. దీనిలోకి వచ్చేసరికి దృష్టిని ధర్మం మీదకు మళ్లించారెందుకు?

పుస్తకం రాసిన తర్వాత పరిణామాలు చూసి మానసికంగా చాలా చింతలోకి వెళ్లాను. ఎందుకంటే దేశం ఆర్థికంగాసంపన్నవంతమవుతోందిగానీ.. ఇక్కడి నైతిక జీవనం మెరుగవ్వటం లేదు. ఇందుకు ప్రధానంగా మన ప్రభుత్వ వ్యవస్థనీ కారణంగా చెప్పుకోవాలి. ప్రతిచోటా లంచాలు. స్కూళ్లలో టీచర్లుండరు. ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులుండరు. ఆటోడ్రైవర్ల ఆదాయంలో 20% పోలీసులు గుంజుకుంటున్నారు. దైనందిన జీవితంలో ప్రతిచోటా అవినీతి. దేశం అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవమేగానీ మరోవైపు మన నైతికత ఘోరంగా విఫలమవుతోంది. పేదరికం ఎలాగైనా పోతుంది... నైతిక పేదరికాన్ని వదిలించుకోవటం ముఖ్యం! అందుకే ఇప్పుడు నేను మనకు ఆర్థిక సంస్కరణల కంటే కంటే రాజ్య/ప్రభుత్వ సంస్కరణలు ముఖ్యమని భావిస్తున్నాను. పోలీసులు, కోర్టులు, ముఖ్యంగా రాజకీయాలు, పరిపాలన.. అన్నీ సంస్కరించుకోవాల్సిందే. ఇది అసాధ్యమేం కాదు! ఒకప్పుడు స్కాండినేవియా, బ్రిటన్వంటి దేశాలన్నీ అవినీతిలో కూరుకున్నవే. ఇప్పుడు వాళ్లెంతగాసంస్కరించుకున్నారు? అందుకే పుస్తకంలో ధర్మం గురించి చర్చించాను. ఇదే అన్నింటికీ సమాధానం అనటం లేదు. మనలో ప్రతి ఒక్కరికీ ఇదొక అద్దంలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. దీనిలో మనల్ని మనం చూసుకుని.. మనల్ని మనం సరిదిద్దుకోవచ్చు. దిశగా ఇది మనకొక దివిటీలా దారి చూపుతుందని భావిస్తున్నా!
- న్యూస్టుడే ప్రత్యేక విభాగం

(ఈనాడు, ౦౪:౧౧:౨౦౦౯)
___________________________________
‌‌ ‌‌‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌ ‌

Labels: ,

Tuesday, November 03, 2009

'సెల్ఫ్‌ బ్రాండింగ్‌'.

నేను... అందగాణ్ని. సృజనాత్మకవ్యక్తిని. బాగా కష్టపడతాను. నిజాయతీపరుణ్ని. మీగురించి మీరు ఏమైనా అనుకోవచ్చు. ఎంత గొప్పగా అయినా వూహించుకోవచ్చు. ఆ సోదంతా ఎవరిక్కావాలి? నలుగురూ ఏమనుకుంటున్నారు? అదీ ముఖ్యం. అదే మీ 'బ్రాండ్‌'. ఆ నలుగురూ ఏం మాట్లాడుకోవాలన్నదీ మీరే శాసించగలిగితే అది 'సెల్ఫ్‌ బ్రాండింగ్‌'.

సందేహం లేదు. మీరో బ్రాండ్‌. తిరుగులేని బ్రాండ్‌. మీకు సరిసమానమైన బ్రాండ్‌ ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు మాత్రమే మీలా ఆలోచించగలరు. మీరు మాత్రమే మీలా మాట్లాడగలరు. మీరు మాత్రమే మీలా రాయగలరు. మీరు మాత్రమే మీలా ప్రోగ్రామ్‌ చేయగలరు.

బాటా చెప్పులకు మన్నిక లాగా, నోకియా సెల్‌ఫోన్లకు నాణ్యతలాగా, లెవిస్‌ జీన్స్‌కు నవ్యత లాగా... మీకూ ఓ యునిక్‌ సెల్లింగ్‌ ప్రపొజిషన్‌ (యూఎస్‌పీ) ఉంది. అదే మీ బ్రాండ్‌ విలువను నిర్ణయిస్తుంది. మీ యూఎస్‌పీ ఏమిటో మీకే తెలుసు. తెలియకపోతే వెంటనే తెలుసుకోండి.

అనర్గళంగా మాట్లాడగలరు, నొప్పించకుండా ఒప్పించగలరు, అడగ్గానే అమ్ములపొదిలోంచి ఐడియాలు తీసివ్వగలరు, సంక్షోభాల్లో సమర్థంగా వ్యవహరించగలరు, అద్భుతంగా నటించగలరు, అందంగా డాన్స్‌ చేయగలరు... ఏదైనా కావచ్చు.

మీలాంటి డాక్టర్లు, మీలాంటి లాయర్లు, మీలాంటి టీచర్లు, మీలాంటి నటులు, మీలాంటి రచయితలు... ఈ భూప్రపంచం మీద (కనీసం మీ రాష్ట్రంలో మీ నగరంలో మీ పట్టణంలో) బోలెడంత మంది ఉండవచ్చు. అంతమందిలో మీరెంత భిన్నమైన వ్యక్తో ప్రచారం చేసుకోవడమే బ్రాండింగ్‌.

'ఏదో ఒక టూత్‌పేస్టు...' అనకుండా, కాల్గెట్‌ అనో పెప్సొడెంట్‌ అనో కచ్చితంగా అడిగి కొనుక్కున్నట్టు... మిమ్మల్ని ఏరికోరి ఎందుకెంచుకోవాలో సవివరంగా విశ్లేషించడమే బ్రాండింగ్‌.

'కలవరపడొద్దు. కాపాడటానికి నేనున్నాను' అని ఏ దైవాంశ సంభూతుడో ధైర్యం చెప్పినట్టు, మీ వృత్తిఉద్యోగాల్లోని కస్టమర్లకు వాగ్దానం చేయడమే బ్రాండింగ్‌.

ఇదోరకమైన అభివ్యక్తి. మీ గురించీ మీ నైపుణ్యం గురించీ మీ విజయాల గురించీ మీ ఒక్కరికే లేదంటే ఏ కొద్దిమందికో తెలిసిన విషయాల్ని, తెలిసితీరాల్సిన వ్యక్తులందరికీ చేరవేయడం.
బ్రాండింగ్‌ ఎందుకు?
ఎందుకంటే, కాస్త రిలాక్స్‌ అవ్వాలనుకుంటే ఏ కోక్‌నో ఎందుకు తాగుతాం?

నోరు తీపి చేసుకోవాలనిపిస్తే ఏ పుల్లారెడ్డి దుకాణానికో ఎందుకెళ్తాం?

సూటు కొనాలంటే ఏ రేమండ్స్‌ షోరూమునో ఎందుకు సందర్శిస్తాం?

రెండో ఆలోచనే రాదెందుకు? ధర గురించి పట్టించుకోమెందుకు? నాణ్యత మీద అంత నమ్మకమెందుకు?

అదే బ్రాండ్‌ మహత్యం.

వస్తువుల వరకైతే ఫర్వాలేదు. నురగల సబ్బుబిళ్లకో కరెంటు రుబ్బురోలుకో ఉన్నట్టు మనుషులకూ బ్రాండ్‌ విలువ ఉంటుందా? ఉంటుందనే అంటున్నారు సెల్ఫ్‌ బ్రాండింగ్‌ పితామహుడు టామ్‌ పీటర్స్‌. 'బ్రాండ్‌ కాల్డ్‌ యు' అనే వ్యాసంలో ఆయన... 'వయసుతో సంబంధం లేదు. వృత్తితో సంబంధం లేదు. అర్హతతో సంబంధం లేదు. ప్రతి మనిషికీ బ్రాండింగ్‌ ఉండాలి. అప్పుడే, ఎదుటి మనిషి మన గురించి ఎలా ఆలోచించాలన్నదీ మనమే నిర్ణయించగలం' అని తేల్చారు.

నిజమే, చొరవతీసుకుని మీకంటూ ఓ బ్రాండ్‌ సృష్టించుకోకపోతే మీ కంపెనీ యాజమాన్యవో మీ సహోద్యోగులో మీ పొరుగువారో తమకు తోచినట్టు ఏదో ఓముద్ర వేసేస్తారు. సమర్థ నాయకుడిగానో సృజనాత్మకవ్యక్తిగానో గుర్తింపు పొందాల్సిన మీరు... 'భేషజం లేని మనిషి', 'కలుపుగోలు స్వభావం', 'సర్దుకుపోయే గుణం' లాంటి... చిన్నాచితకా బ్రాండ్‌లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

అదే జరిగితే మీ నైపుణ్యం, మీ సామర్థ్యం, మీ చొరవ, మీ క్రమశిక్షణ... అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. వందమంది గుమస్తాల్లో మీరూ ఒకరు. యాభైమంది కళాకారుల్లో మీరూ ఒకరు. పదికోట్ల మంది ఆంధ్రుల్లో మీరూ ఒకరు. వందకోట్ల మంది భారతీయుల్లో మీరూ ఒకరు. సృష్టిలోని అనంతకోటి జీవరాశిలో మీరూ ఒకరు.

'మీరొక్కరే...' అనిపించుకోవాలంటే మాత్రం బ్రాండింగ్‌ అవసరం.

డాక్టరు, ఇంజినీరు, కవి, కార్పెంటరు, టైలరు, ఎలక్ట్రీషియన్‌... ఏ వృత్తి అయినా కానివ్వండి. మీరున్న పట్టణంలో నలుగురు నిపుణుల పేర్లు చెప్పాల్సివస్తే మీ పేరూ ఉండాలి. మీ జిల్లాలో పదిమంది జాబితా తయారుచేయాల్సివస్తే మీరుండాలి. రాష్ట్రవ్యాప్తంగా ఓ వందమందిని జల్లెడపట్టి తీస్తే... అక్కడా మీరుండాలి.

బ్రాండే కీలకం
మనిషి ఎదుగుదలకు నైపుణ్యమే పునాది. సందేహం లేదు. కానీ నైపుణ్యం మనిషిని ఓ స్థాయివరకు మాత్రమే తీసుకెళ్తుంది. ఇంకా పైఅంతస్తులు ఎక్కాలంటే బ్రాండింగ్‌ ఉండాల్సిందే. కొంతమంది గొప్పగొప్ప నాయకులు, సమర్థులైన మేనేజర్లు, అద్భుతమైన వ్యూహకర్తలు... చచ్చేదాకా అనామకులుగానే మిగిలిపోతుంటారు. కారణం, బ్రాండింగ్‌ లోపమే.

అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువుకూ... ఆ వరుసలో చివరి స్థానంలో ఉన్న వస్తువుకూ మధ్య నాణ్యత తేడా కంటే, బ్రాండింగ్‌ వ్యత్యాసమే ఎక్కువ.

ఓ కంపెనీలోనో రాజకీయ పార్టీలోనో ఒకటో స్థానంలోనో రెండో స్థానంలోనో ఉన్న వ్యక్తికీ, ఏ పదవీలేని కార్యకర్తకీ తేడా సమర్థతకు సంబంధించింది కాదు, బ్రాండింగ్‌కు సంబంధించింది.

కొన్ని సభలకి జనం ఇసుకేస్తే రాలనంతగా వెళ్తారన్నా, కొన్ని సభలు బిరియానీ పెట్టిస్తామన్నా వెలవెలబోతాయన్నా కారణం... ఆ నేతలు సృష్టించుకున్న బ్రాండింగ్‌.

ఎందుకు రజనీకాంత్‌ డాన్స్‌ చేస్తేనే ఈలేసి గోలచేస్తాం, ఎందుకు సచిన్‌ శతకం చేస్తేనే పరవశించి పండగ చేసుకుంటాం, ఎందుకు రామ్‌దేవ్‌బాబా యోగా నేర్పిస్తారంటే వేలకువేలు పోస్తాం... అంతా బ్రాండ్‌ గొప్పదనం.

ఒక్కమాటలో చెప్పాలంటే, వ్యాపారాన్నీ రాజకీయాల్నీ సామాజిక సంబంధాల్నీ బ్రాండింగ్‌ శాసిస్తోంది.

మిమ్మల్ని మీరు సమాజానికి సరికొత్తగా పరిచయం చేసుకునేముందు ఓ సంకల్పం చెప్పుకోండి....

'నేను సుబ్బారావునో అప్పారావునో కాదు.

క్లర్క్‌నో అకౌంటెంట్‌నో కాదు.

ఇన్ఫోసిస్‌ ఉద్యోగినో బీహెచ్‌యీఎల్‌ ఉద్యోగినో కాదు.

నేనో బ్రాండ్‌ని.

'నేను.ఐఎస్‌సీ'కి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ని.

కోక్‌, మెక్‌డొనాల్డ్స్‌, టాటా, రిలయన్స్‌, నేను... అంతే!'

తిరుగులేని బ్రాండ్‌గా ఎదగడానికి ఏం చేయాలో బ్రాండింగ్‌ గురువులు కొన్ని సూత్రాలు చెప్పారు. ఆచరించండి. సరికొత్తగా అవతరించండి.

బ్రాండ్‌ బారసాల...
మీరు సమాజానికి ఎలా పరిచయం కావాలనుకుంటున్నారో, చరిత్రలో ఎలా నిలిచిపోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీ నిజావతారం (కోర్‌కాంపిటెన్సీ) ఏమిటో నిర్ధారించుకోండి. అదంత సులభం కాదు. నగ్నంగా అద్దంలో చూసుకున్నంత నిజాయతీగా మిమ్మల్ని మీరు బేరీజువేసుకోవాలి. బలాల్నీ బలహీనతల్నీ నైపుణ్యాల్నీ అసమర్థతల్నీ తూకమేసి చూసుకోవాలి. మీ గురించి మీరు అతిగా ఊహించుకున్నా నష్టమే. తక్కువగా అంచనా వేసుకున్నా కష్టమే.

మనం ఏమిటి, ఎక్కడున్నాం, ఎక్కడ ఉండాలనుకుంటున్నాం... అన్న అంతర్మథనం ఎంత నిజాయతీగా జరిగితే అంత మంచిది.

సెల్ఫ్‌ బ్రాండింగ్‌, వస్తువు మార్కెటింగ్‌ ఒక్కటి కాదు. అబద్ధాలు చెప్పు. మాటలతో మంత్రం వెయ్‌. తిమ్మినిబమ్మిని చెయ్‌. ఏం చేస్తావో నీ ఇష్టం. వీలైనంత ఎక్కువ ధరకు సరుకు అమ్మెయ్‌... అని చెబుతుంది మార్కెటింగ్‌.

బ్రాండింగ్‌లో అలాకాదు. నిజాయతీ ఉండాలి. పారదర్శకత ఉండాలి. స్పష్టత ఉండాలి. ఒక సరుకు అమ్ముకోవడంతోనో ఒక ప్రాజెక్టు చేజిక్కించుకోవడంతోనో ఆ అనుబంధం తీరిపోదు. నానాటికీ బలపడాలి.

నలుగురి నోట్లో...
మీ బ్రాండ్‌ గురించి నలుగురికీ ప్రచారం చేయండి. ఆ ప్రచారం 'నేడే చూడండి' అన్నట్టు సినిమాబండి పబ్లిసిటీ అంత ప్రత్యక్షంగా ఉండాల్సిన పన్లేదు. ఉండకూడదు కూడా. చాపకింద నీరులా సాగాలి. మీ వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సంఘాల్లో సభ్యత్వం తీసుకోండి. నిపుణుల ఉపన్యాసాలకు హాజరవ్వండి. వీలైతే వేదికల మీద నాలుగు మాటలు మాట్లాడండి. అవసరమైన ప్రతి సందర్భంలోనూ మీకూ మీలాంటి ఇతరులకూ మధ్య తేడా ఏమిటో స్పష్టంగా చెప్పండి. చేసి చూపించండి. మీ విశ్వసనీయతను చాటండి. సంస్థకూ క్త్లెంట్లకూ విధేయుడిగా మెలగండి. మీ అనుబంధం వ్యాపారానుబంధం కంటే కాస్త ఎక్కువే అన్న విషయం పరోక్షంగా గుర్తుచేస్తూ ఉండండి. ఆ వ్యక్తీకరణకు కాస్త భావోద్వేగాన్ని జోడించండి.

కనిపిస్తూనే ఉండటం... బ్రాండింగ్‌లో చాలా ముఖ్యం. అది భౌతికంగానే కానక్కర్లేదు. మంచి కొటేషన్స్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ చేయవచ్చు. మంచి ఫొటోలో వ్యాసాలో కనిపిస్తే మెయిల్‌లో ఫార్వర్డ్‌ చేయవచ్చు. ఇటీవల మీరు సాధించిన విజయాల్నీ సమర్థంగా పరిష్కరించిన సంక్షోభాల్నీ 'కేస్‌ స్టడీస్‌'లా అందరిముందూ ఉంచవచ్చు. నసగకుండా నాలుగు ముక్కలు మాట్లాడేవాళ్ల కోసం టెలివిజన్‌ ఛానళ్లు దివిటీ వేసి వెతుకుతున్నాయి. మీ రంగానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనే అవకాశం వస్తే వదులుకోవద్దు.

మీ మీరు...
మిమ్మల్ని మీరు గౌరవించుకోనప్పుడు, మీ మీద మీరు శ్రద్ధ చూపనప్పుడు ఇంకెవరో మీ గురించి పట్టించుకోవాలనుకోవడం భ్రమ. ఈ ప్రపంచంలో మీరు అతి ఎక్కువగా ప్రేమించే వ్యక్తి మీరే. ఎంత మందికి ఎన్ని నమస్కారాలు చేసినా మీమీద మీకున్న గౌరవమే వేరు. అదంతా మీ వస్త్రధారణలో కనిపించాలి. అలా అని ఖరీదైన దుస్తుల కోసవో విదేశీ అత్తర్ల కోసవో పాకులాడమని కాదు. మీమీద మీరు శ్రద్ధచూపిస్తున్నారనీ మీరంటే మీకు బోలెడంత గౌరవమనీ అర్థమయ్యేలా ఉంటే చాలు. అల్ట్రా వోడర్న్‌గా ఉండాల్సిన పనీ లేదు. వినియోగ వస్తువుల బ్రాండ్‌ విజయంలో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌కూ వాటా ఉంటుంది. మీ బ్రాండూ అందుకు మినహాయింపు కాదు. ఏదైనా అతికినట్టు సరిపోవాలి. హుందాగా కనిపించాలి. కృతకంగా ఉంటే, వెుదటికే వోసం.

అయినా... కాసిని నీళ్లు, అరచెంచా చక్కెర, చిటికెడు రంగు కలిపేసి 'కోకాకోలా' పేరుతో అరవై ఏడు బిలియన్‌ డాలర్ల బ్రాండ్‌ విలువ సృష్టించగలిగినప్పుడు, మిమ్మల్ని మీరు అద్భుతమైన వ్యక్తిగా ప్రపంచానికి పరిచయం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు.

వస్త్రధారణే కాదు... నలుగుర్లో మీ మాటతీరు, మీ నవ్వు, మీ పలకరింపు, మీరడిగే కుశలప్రశ్నలు, మీ విజిటింగ్‌ కార్డు, మీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌... ప్రతీదీ మీ బ్రాండ్‌ విలువను పెంచుతాయి.

లక్ష్యం దిశగా...
రిలయన్స్‌ అయినా, రేమండ్స్‌ అయినా... రాత్రికిరాత్రే గొప్ప బ్రాండ్లు కాలేదు. జనం నాలుకలకెక్కలేదు. దానివెనక చాలా శ్రముంది. వ్యూహాలున్నాయి. బడ్జెట్‌ ఉంది. కాలానికి తగ్గట్టు మార్పుచేర్పులున్నాయి. అన్నిటికీ మించి సుదీర్ఘ లక్ష్యం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఇన్ని దేశాలకు విస్తరించాలనో వచ్చే పదేళ్లలో ఇంతమంది కస్టమర్లని చేరుకోవాలనో ఇన్ని అమ్మకాలు సాధించాలనో... ఏవో లెక్కలుంటాయి. ఒక బ్రాండ్‌గా మీకంటూ ఓ లక్ష్యం ఉండాలి. అది 'ఎవరూ సాధించని విజయాలు సాధించాలి' అన్నంత అస్పష్టంగా ఉండకూడదు 'ప్రపంచాన్ని జయించాలి' అన్నంత అసాధ్యంగానూ ఉండకూడదు. నిర్ణీత వ్యవధిలో కచ్చితమైన ప్రయత్నంతో ఓ మామూలు మనిషి సాధించగలిగేదై ఉండాలి.
...ఇంతమంది కస్టమర్లను సంపాదించుకోవాలి.
...ఇన్ని పుస్తకాలు రాయాలి.
...ఇన్ని డిగ్రీలు సాధించాలి.
...ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి.
...ఇన్ని వేలమందికి నెట్‌వర్క్‌ విస్తరించుకోవాలి.
ఇలాంటివే ఏమైనా కావచ్చు.
లక్ష్యం విషయంలో ఎంత నిజాయతీగా ఉన్నారో, ఆ ప్రయాణం విషయంలోనూ అంతే నిజాయతీగా వ్యవహరించండి. విలువల్లేని వ్యక్తి బ్రాండ్‌గా అవతరించడం అసాధ్యం. అవతరించినా, అది తాత్కాలిక వైభోగమే.

ఇ-బ్రాండింగ్‌
ఇంటర్నెట్‌ను మించిన మాధ్యమం లేదు. దాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటే అంత మంచిది. ఒక్క క్లిక్‌తో కొన్నివేలమందిని చేరుకోవచ్చు. పలకరించవచ్చు. ఆలోచనలు పంచుకోవచ్చు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు. మిమ్మల్ని తిరుగులేని బ్రాండ్‌గా తీర్చిదిద్దగల శక్తి ఇంటర్నెట్‌కు ఉంది. బ్లాగు ప్రారంభించండి. ఫేస్‌బుక్‌ తెరవండి. ట్వీట్స్‌ ఇవ్వండి. ఫ్లికర్‌లో ఫొటోలు షేర్‌చేసుకోండి. స్నేహితుల్ని సంపాదించుకోండి. అనుచరుల్ని కూడగట్టుకోండి. చాలా కంపెనీలు చురుకైన ఉద్యోగుల కోసం సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లమీద ఆధారపడుతున్నాయి. ఎంతమంది అభిమానులుంటే అంత ప్రాధాన్యం. ఆమాత్రం నెట్‌వర్కింగ్‌ తెలిసినవాళ్లు, ఏ పని అప్పజెప్పినా సునాయాసంగా చేయగలరన్న నమ్మకం. మీ రంగానికి సంబంధించిన ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలిో సభ్యత్వం తీసుకోండి. దీనివల్ల వృత్తి పరిజ్ఞానం పెంచుకోవచ్చు. చుట్టూ ఏం జరుగుతోందో తెలుస్తుంది. ఇక్కడా కొన్ని జాగ్రత్తలు తప్పవు. మీరు రాసే రాత, మీరు వెల్లడించే అభిప్రాయం, మీరు వేసే జోకు... అన్నీ మీ బ్రాండింగ్‌తో ముడిపడి ఉంటాయి. ట్విటర్‌లో శశిథరూర్‌ వ్యాఖ్య ఎంత దుమారం లేపిందో గుర్తుంది కదూ!

నలుగురి కోసం
మీరో నాయకుడన్న సంగతి గుర్తుంచుకోండి. అనుచరులెప్పుడూ బలమైన బ్రాండ్లు కాలేరు. కుటుంబంలో కావచ్చు, అపార్ట్‌మెంట్‌లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వృత్తి సంఘాల్లో కావచ్చు... ఎక్కడ ఏ సమస్య తలెత్తినా నాయకుడిలా స్పందించండి. సమర్థుడైన లీడర్‌ అనుచరుల్లో ఆత్మవిశ్వాసం నింపుతాడు. కష్టాల్లో ఆదుకుంటాడు. నలుగురి గురించి పట్టించుకోకుండా 'నన్నంటుకోవద్దు నామాల కాకీ' అన్నట్టు వ్యవహరించే వారు, ఎంత గొప్పవారైనా ఎంత నిపుణులైనా సమాజం గౌరవించదు. షారుక్‌ఖాన్‌కు అయినా సచిన్‌ టెండూల్కర్‌కు అయినా కావలసినంత బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది. అయినా కూడా ఏ మంచిపని జరిగినా జనంలోకి వస్తారు. తలోచేయీ వేస్తారు. ఆ చొరవలో 'మేమూ ఈ సమాజంలో భాగమే...' అన్న బలమైన సందేశం ఉంది.

బ్రాండింగ్‌కు అది చాలా ముఖ్యం.

నిత్యనూతనం
ఒక విజయవో ఒక ఆవిష్కరణో ఒక అవార్డో ఒక ప్రశంసో... జీవితాంతం మీ బ్రాండ్‌ విలువను కాపాడలేవు. ఇదో నిరంతర సాధన. ఏరోజుకారోజు సవాలు. ఎప్పటికప్పుడు పరీక్ష. గెలుస్తూనే ఉండాలి. గెలుస్తూనే పోవాలి. కార్పొరేట్‌ కంపెనీలకు రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాలు ఉన్నట్టే... మీ ఆలోచనలిలో కొంత భాగాన్ని ఆవిష్కరణలకు కేటాయించుకోండి. మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. మీ విజయాల చిట్టా విస్తరించుకోండి. కొత్త ఆలోచనలతో కొత్త ప్రయోగాలతో మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. కనీసం నాలుగైదేళ్లకోసారైనా ప్రతి కంపెనీ పాత ఉత్పత్తులకే 'సరికొత్త' రూపం ఇవ్వడానికీ లోగోలూ నినాదాలూ ప్రచార వ్యూహాలూ మార్చడానికీ కారణం ఇదే. దీన్నే 'బ్రాండ్‌ పునరుత్థానం' అనొచ్చు.

వేదాంతం అనుకోకపోతే ఒక మాట. మీ బ్రాండ్‌, మీ పలుకుబడి, మీ నెట్‌వర్క్‌... మిమ్మల్ని ఢీకొట్టే మరో బ్రాండ్‌ రానంతకాలమే. వచ్చాక కూడా, పోటీదారులకు అందనంత దూరంలో మీరుండాలనుకుంటే వారు అందుకోలేనంత వేగంతో ఎదుగుతూ ఉండాలి. ఈవిషయంలో రష్యన్‌ పోల్‌వాల్ట్‌ క్రీడాకారుడు సెర్గీ బుబ్కాని ఆదర్శంగా తీసుకోండి. ఆ అలుపెరుగని ఆటగాడు ఎప్పుడో ప్రపంచ రికార్డు సాధించాడు. అయినా విశ్రమించలేదు. ఏటికేడాది... తన రికార్డును తానే బద్దలుకొట్టుకునేవాడు. రిటైర్మెంట్‌దాకా అతనికి ఎదురేలేదు. రిటైర్మెంట్‌ తరువాత కూడా ఆయన దరిదాపుల్లోకి వెళ్లడానికి మిగతా ఆటగాళ్లకి చాలా సమయం పట్టింది.

కనీసం రెండేళ్లకోసారైనా మీ ప్రొఫైల్‌లో మార్పు రావాలి. కొత్త విజయాలు, కొత్త భాషలు, కొత్త రచనలు, కొత్త నైపుణ్యాలు వచ్చి చేరాలి. బ్రాండ్‌ అనేది వాగ్దానం. అది నిలుపుకోడాన్ని బట్టి ఉంటుంది.ఎప్పుడూ ఆ నమ్మకాన్ని వమ్ముచేయకండి. అలా జరిగిననాడు, మీరు బ్రాండ్‌గానే కాదు, మనిషిగానూ విఫలమైనట్టే.

* * *
'బ్రాండింగ్‌, మహా అయితే పులిని సింహంలా చూపించగలదు.
చారల పిల్లిని పులిలా మార్చలేదు'.
- పర్సనల్‌ బ్రాండింగ్‌ పితామహుడు టామ్‌పీటర్స్‌
మహా 'బ్రాండ్లు'
మహాత్ముడు బతికున్నరోజుల్లో సెల్ఫ్‌బ్రాండింగ్‌ అన్న మాట ప్రచారంలో లేకపోవచ్చు. రామ్‌దేవ్‌కో రాఖీసావంత్‌కో అసలామాటకు అర్థం తెలియకపోవచ్చు. నారాయణమూర్తి ఆ ప్రయత్నమే చేసుండకపోవచ్చు. అయినాసరే, వాళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సిన బ్రాండింగ్‌ పాఠాలు చాలా ఉన్నాయి.
గాంధీజీ
భారతదేశంలో మహాత్మాగాంధీని మించిన బ్రాండ్‌ లేదు. మరణించిన అరవై ఏళ్ల తర్వాత కూడా ఆ బ్రాండ్‌ విలువ చెక్కుచెదరలేదు. రాజకీయ పార్టీలు ఆ బోసినవ్వుల లోగో కోసం ఇంకా పాకులాడుతున్నాయి. 'పర్సనల్‌ బ్రాండింగ్‌' అన్న మాట గాంధీజీ కాలంలో వాడుకలో లేకపోవచ్చు. కానీ దాని ప్రాధాన్యం ఆయనకి తెలుసు. దండి యాత్ర, అహింస, చరఖా, మౌనవ్రతం, ఉపవాసం ...మహాత్ముడి బ్రాండింగ్‌ మార్గాలు.
ఎన్‌.టి.రామారావు
తెలుగువారికీ తెలుగుదనానికీ ఓ బ్రాండ్‌ విలువ సంపాదించిపెట్టిన ఘనత ఎన్టీఆర్‌దే. ఆయనే ఓ నిలువెత్తు ప్రజాబ్రాండ్‌! కథానాయకుడిగా ఎంచుకున్న పాత్రలు, నాయకుడిగా అమలుచేసిన పథకాలు, ఆ తెగింపు, ఆ పలకరింపు... అన్నీ కలిసి ఆయన్ని తిరుగులేని బ్రాండ్‌గా మలిచాయి. ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి.
అమితాబ్‌ బచ్చన్‌
గొప్ప వ్యక్తులంతా గొప్ప బ్రాండ్లు కాలేరు. కానీ గొప్ప బ్రాండ్లే చరిత్రలో గొప్ప వ్యక్తులుగా మిగిలిపోతారు. స్టార్‌డమ్‌, బ్రాండ్‌ వేరువేరనడానికి అమితాబ్‌బచ్చన్‌ని మించిన ఉదాహరణ లేదు. ఆయన సినిమా ఇమేజ్‌కంటే బ్రాండ్‌ విలువే ఎక్కువ. కాబట్టే ఆయన 'ఐశ్వర్యారాయ్‌ మావయ్య'గా చరిత్రలో మిగిలిపోలేదు.
షారుక్‌ఖాన్‌
'నేను ఎస్‌ఆర్‌కే బ్రాండ్‌ కోసం పనిచేస్తాను. మా బాస్‌ ఎప్పుడు ఏం చేయమంటే అప్పుడు ఆ పని చేయడమే నా ఉద్యోగం' అని నిజాయతీగా ఒప్పుకున్న బ్రాండ్‌ బాద్షా షారుక్‌ఖాన్‌. 'అమితాబ్‌బచ్చన్‌ అంతటివాడు' అనిపించుకోవాలన్న తహతహ షారుక్‌లో కనిపిస్తుంది. అందుకేనేవో బ్రాండ్‌ విలువ పెంచుకోడానికి దాదాపు బిగ్‌-బి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. యాంకరింగ్‌ చేశారు. వోడలింగ్‌ చేస్తున్నారు. సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
సచిన్‌ టెండూల్కర్‌
పర్సనల్‌ బ్రాండింగ్‌కి సంబంధించి ఓ అధ్యయనంలో భాగంగా సచిన్‌ టెండూల్కర్‌ బ్రాండ్‌ విలువ మీద సర్వే చేశారు. క్రికెట్‌ అనగానే మీకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? సచిన్‌ అనగానే కళ్లముందు ఏం మెదులుతుంది? ఎవరు సెంచరీ కొట్టినప్పుడు మీరు బాగా ఎంజాయ్‌ చేస్తారు?... ఇలాంటి ప్రశ్నలే ఓ డజను దాకా ఉన్నాయి. ఎనభై అయిదు శాతానికిపైగా ప్రజలు క్రికెట్‌ అనగానే 'సచిన్‌' పేరే గుర్తుకొస్తుందని చెప్పారు. అదీ సచిన్‌ బ్రాండ్‌ విలువ! ఆటొక్కటే కాదు, వ్యక్తిగత జీవితం, విలువలు, అభిమానులతో ప్రవర్తించే తీరు... ఇవి కూడా సచిన్‌ బ్రాండింగ్‌లో తోడ్పడ్డాయి. ఎంత డబ్బు ఇస్తామన్నా ఆయన మద్యం, పొగాకు ప్రకటనల్లో నటించనని చెప్పేశారు.
నారాయణమూర్తి
నారాయణమూర్తి ఓ మల్టీబ్రాండ్‌! మామూలుగా ఒక వ్యక్తికి ఒకే బ్రాండ్‌ విలువ ఉంటుంది. నారాయణమూర్తి అలాకాదు. మధ్యతరగతి విజయానికి బ్రాండ్‌, నిజాయతీకి బ్రాండ్‌, మేనేజ్‌మెంట్‌ విలువలకు బ్రాండ్‌, మేధస్సుకు బ్రాండ్‌. కాబట్టే, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 'షాడో ఎ సి.ఇ.ఒ.' పేరుతో నిర్వహించిన వేలంపాటలో... అత్యధికశాతం విద్యార్థులు ఇన్ఫోసిస్‌ పెద్దమనిషికే ఓటేశారు.
బాబా రామ్‌దేవ్‌
ఈతరానికి యోగా అంటే రామ్‌దేవ్‌ బాబా పేరే తెలుసు. యోగసూత్రాల్ని పతంజలి మహర్షి రాశాడని చెప్పినా ఎవరూ నమ్మేట్టులేరు. అంతగా బలపడిపోయింది రామ్‌దేవ్‌ బ్రాండ్‌ విలువ. దాన్ని పెంచిపెద్దచేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలు తక్కువేం కాదు. ఆ యోగాగురువులో గొప్ప బ్రాండింగ్‌ గురూ ఉన్నాడు. తెల్లవారుజాము టీవీ షోలతో ఆయన బ్రాండింగ్‌ అమాంతంగా పెరిగిపోయింది. తన ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి బహుళజాతి సంస్థల ఉత్పత్తుల మీద యుద్ధం ప్రకటించారు. దేశవ్యాప్త పర్యటనలూ సంచలన ప్రకటనలూ బ్రాండింగ్‌లో భాగమే.
'బ్రాండింగ్‌' సాహిత్యం
'సెల్ఫ్‌ బ్రాండింగ్‌' అన్నమాటను ఇప్పుడిప్పుడే విరివిగా వాడుతున్నారు కానీ, వ్యక్తిత్వ వికాస సాహిత్య పితామహుడు డేల్‌ కార్నెగీ కాలం నుంచీ ఉన్న భావనే ఇది. కాకపోతే, ఆ పెద్దమనిషి ఎక్కడా 'బ్రాండింగ్‌' అన్న మాట వాడలేదు. పదేళ్ల క్రితం... టామ్‌ పీటర్స్‌ రాసిన 'బ్రాండ్‌ కాల్డ్‌ యూ' వ్యాసం ఈ విషయంలో కొత్త చర్చకు అవకాశం కల్పించింది. అప్పట్నుంచీ సెల్ఫ్‌ బ్రాండింగ్‌ మీద బోలెడంత సాహిత్యం వచ్చింది. బ్రాండ్‌ కాల్డ్‌ యు (పీటర్‌ మాంటోయో), మేనేజింగ్‌ బ్రాండ్‌ యు (జెర్రీ ఎస్‌ విల్సన్‌), బీ యువర్‌ ఓన్‌ బ్రాండ్‌ (డేవిడ్‌మెక్‌), మి 2.0: బిల్డ్‌ ఎ పవర్‌ఫుల్‌ బ్రాండ్‌ టు ఎఛీవ్‌ యువర్‌ సక్సెస్‌ (డాన్‌ స్కాబెల్‌)... తదితర పుస్తకాలు పాఠకాదరణ పొందాయి. సదస్సులూ సెమినార్లూ బ్లాగు చర్చలూ చురుగ్గా సాగుతున్నాయి. అదే స్థాయిలో విమర్శలూ ఉన్నాయి. నీ బాధ్యతలన్నీ పక్కనపెట్టి బాకా ఊదుకోవడమే అసలైన పని అంటూ తప్పుదోవపట్టిస్తోందీ సాహిత్యమని దుమ్మెత్తిపోస్తున్నవారూ ఉన్నారు.
(ఈనాడు, ౨౫:౧౦:౨౦౦౯)
__________________________

Labels:

Sunday, November 01, 2009

తెలుగు మాటకేదీ పలుకుబడి?

- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్



దేశంలోనే భాషాప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. సుసంపన్నమైన చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక నేపథ్యం తెలుగుభాష సొంతం. ఆంధ్రరాష్ట్ర అస్తిత్వానికి కారణమైన అమ్మభాష- కాలం గడుస్తున్నకొద్దీ తెలుగునాట మసకబారుతుండటమే కలచివేస్తున్న అంశం. అటు బోధనలోనూ, ఇటు జనవ్యవహారంలోనూ తెలుగు మాట అప్రాధాన్యాంశంగా మారుతోంది. తెలుగు ప్రాభవం కొడిగట్టడానికి కారణాలెన్నో ఉన్నాయి. వ్యాపారం, ఉద్యోగం, సంస్కృతి, విజ్ఞానాల్లోనూ; ప్రజల వ్యాసంగాల్లోనూ కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావం తెలుగుభాషపై పడుతోంది. మనభాషపై సాంస్కృతికంగా సంస్కృతం, పాలనపరంగా అరబిక్‌, పర్షియన్‌; శాస్త్ర సాంకేతికపరంగా ఆంగ్లభాషల ప్రభావం ఎక్కువ. ఈ కారణంగా తెలుగులో అన్యభాషల పదాలు వేలకొద్దీ చేరిపోయాయి. ఫలితంగా తెలుగుభాష నిత్య వ్యవహారంనుంచి క్రమంగా పక్కకు జరుగుతోంది.

ఆవిరైపోతున్న అధికార భాష
తెలుగువాడు 'నిద్ర' సంస్కృతంలో లేవడంతో తెలుగు 'కునుకు' కునుకు తీసింది. బ్రష్‌ చేయడంలో 'పదుంపుల్ల' అరిగిపోయి విరిగిపోయింది. 'పళ్లపొడి' పొడైపోయింది. 'టిఫిన్‌' దెబ్బకు చద్దన్నాలూ అంబళ్లూ పులిసిపోయాయి. 'లంచ్‌'లు, 'డిన్నర్‌'ల దెబ్బకి కూడు కాస్తా నోటికి దూరం అయ్యింది. తెలుగు కూర 'ఫ్రై', 'కర్రీ' అయిపోయింది. సాయంత్రం 'స్నాక్స్‌'లో పైటన్నం ఎటో కొట్టుకుపోయింది. ఈ వాక్యాలు వినడానికి చమత్కారంగానూ అతిశయంగానూ అనిపించినా ఇవి తెలుగు భాషపై ఆంగ్ల ప్రభావానికి దర్పణం పడతాయి. 'అన్యదేశ్యాలు వాడితే తప్పేముంది? దానివల్ల భాష విస్తృతమవుతుంది కదా' అన్న అభిప్రాయమూ వ్యాప్తిలో ఉంది. అదీ నిజమే. కానీ, అన్యదేశ్యాల వాడకం ప్రాథమిక పదజాలం నశించిపోయేంతగా ఉంటేనే సమస్య. సాధ్యమైనంతవరకూ నూతన పదబంధాలను సృష్టించాల్సిన చోట వాటినే వ్యాప్తిచేయాలి. కుదరని చోట అన్యభాషా పదాలను వాడితే తప్పులేదు. తమిళంలో ప్రాణవాయువు అనే తత్సమపదం 'పిరాణ వాయువు' అనే తద్భవంగా వ్యాప్తిలో ఉంది. తమిళులు దానితో సంతృప్తి చెందక 'ఉయిర్‌ కాట్రు' అనే దేశ్యపదాన్ని తయారుచేసి వ్యాప్తిలోకి తీసుకువచ్చారు. మన వాక్యంలో వ్యాకరణం తెలుగులో ఉంటుంది, పదాలన్నీ ఆంగ్లంలో ఉంటాయి. వాక్యరచన, క్రియలు, నామవాచకాలపై ఆంగ్లప్రభావం మితిమీరడమే దీనికి కారణం. ఈ ప్రభావాన్ని తగ్గించి తెలుగుభాషా వాడకాన్ని పెంచాలంటే మన భాషలో కూడా ఆధునిక వస్తువులకు ప్రత్యామ్నాయంగా అదే అర్థం స్ఫుర్తించే విధంగా నూతన పదబంధాలను సృష్టించాలి.

ఏ అంశాన్నయినా ఆంగ్లంలో చెప్పడమే నవనాగరకతగా చెలామణీ అవుతోంది. వ్యవహారంలో ఉన్న ఆంగ్లపదాలకు సరైన ప్రత్యామ్నాయాలు తెలియకపోవడంవల్ల ఆంగ్లపదాల సంఖ్య తెలుగులో అధికమవుతోంది. దీనివల్ల మన భాషలో రాటుదేలిన పదజాలమంతా క్రమంగా మసకబారిపోతోంది. ఏదైనా కొత్తపదం ఆంగ్లంనుంచి తెలుగులోకి ప్రవేశించినప్పుడు ఆ పదాన్ని అలాగే వాడుతున్నారు. ఇరుభాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు ఆ ఆంగ్లపదానికి సరైన ప్రత్యామ్నాయ తెలుగుపదాన్ని అన్వేషించేందుకు కృషి చేయడం లేదు. మరోవైపు- కొన్ని సందర్భాల్లో అదే ఆంగ్లపదం సామాన్యజన వ్యవహారంలో సొంతభాషలోనికి మారుతుంటుంది. దొంగోడ, డబ్బిళ్ల, తవ్వోడ, గ్యాసుబండ వంటివి ఎంతో సహజంగా మూలానికి దగ్గరగా ఉంటూ తెలుగుతనాన్ని పుణికిపుచ్చుకున్నాయి. వీటి సృష్టికర్తలు సామాన్యులే. ఇలాంటివారు కొత్తపదజాలాన్ని సృష్టిస్తే దాని ప్రామాణికత ఎంత అన్న సందేహం వెన్నాడుతూనే ఉంటుంది. ఇక తెలుగు అకాడమీ, విశ్వవిద్యాలయాలు చేసిన కొద్దిపాటి కృషి ప్రజలకు సరిగ్గా అందుతున్న దాఖలాలు లేవు.

మాతృభాషలో బోధనాభ్యాసాలు చేస్తే మిగిలినవారికంటే వెనుకబడిపోతామన్న అపోహలు సైతం తెలుగుభాష వెనుకబాటుకు కారణమవుతున్నాయి. జపాన్‌, రష్యా, చైనా ప్రజలు పూర్తిగా మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగిస్తున్నారు. అంతర్జాతీయంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆ దేశాలు ఎంత ముందంజలో ఉన్నాయో తెలిసిందే. ఆంగ్లభాషను విడిచిపెట్టాలని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. రష్యన్లు ఆంగ్లాన్ని రష్యన్‌ భాషలోనూ, చైనీయులు చీనీ భాషలోనూ అభ్యసిస్తున్నారు. కానీ తెలుగునాట మాత్రం మాతృభాషను సైతం ఆంగ్లంలోనే నేర్చుకునే దురవస్థలో కొందరు మగ్గుతున్నారు. భారతీయ భాషలన్నీ పదసంపదలో సుసంపన్నాలు. వాడుకలో లేకపోవడంవల్లే ఈ భాషలు వెనుకబడిపోతున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన తరుణమిది. ఆంగ్లభాషపై వ్యామోహంతో శాస్త్రసాంకేతిక విద్యాబోధనకు తెలుగు పనికిరాదని చేసే వాదనలో అర్థం లేదు. వాడుకలోకి తీసుకువస్తే ఆధునిక విజ్ఞానాన్ని అలవోకగా అందించగల శక్తి మాతృభాషకు ఉంది.

తెలుగుభాషను పరిరక్షించి, పరిపుష్టం చేయాలంటే కాలానుగుణంగా వచ్చి చేరే అన్యదేశాలకు సమానార్థకాలను సృష్టించుకోవడం తక్షణావసరం. శాస్త్రీయ అంశాలతోపాటు, వ్యవహార భాషకు సంబంధించీ సమానార్థక పదాలను తయారుచేసుకోవాలి. విద్యావిషయిక పారిభాషిక పదకల్పనలో తత్సమపదాలకే ప్రాధాన్యం ఎక్కువ. అది అనివార్యమే కాదు, సౌలభ్యం కూడా. వివిధ శాస్త్రాలకు సంబంధించిన పారిభాషిక పదాలు సులభగ్రాహ్యం కావని; వాటికన్నా ఆంగ్లపదాలే సులభంగా ఉన్నాయన్న వాదన ఒకటి ఉంది. శాస్త్రం బుద్ధిగ్రాహ్యం కాబట్టి కష్టంగా ఉన్నప్పటికీ తత్సమపదాలను ఉపయోగించాల్సిందే. కానీ- నిత్యవ్యవహారంలోని అన్యభాషాపదాలకు సాధ్యమైనంతవరకు అచ్చతెలుగు పదాలతో సమానార్థకాలను సృష్టించుకోవడం మంచిది. తొలినాళ్లలో పత్రికలు, అకాడమీలు, కొన్ని విశ్వవిద్యాలయాలు పెద్దయెత్తున ఈ కృషి చేశాయి. కాలం గడుస్తున్నకొద్దీ కొత్త వ్యాపారాలు, వ్యవహారాలు, విద్యలు రంగప్రవేశం చేశాయి. వీటికి సంబంధించిన సాంకేతిక పారిభాషికపదాలకు తెలుగు పదాలను సృష్టించుకోవడంలో ఎక్కడలేని అలసత్వం కనిపిస్తోంది. అన్నిరంగాల పారిభాషిక పదాలకు మారుగా తెలుగులో పదకల్పన చేయమనడం ఇక్కడ ఉద్దేశం కాదు. సాధ్యమైనంతమేరకు, ఆయా సాంకేతిక పదాలకు ప్రాంతీయ భాషల్లో సమానార్థకాలను తయారుచేసుకోవడం తప్పుకాదు. దీని సాధ్యాసాధ్యాలపై పెద్దయెత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాలానుగుణంగా భాషను తీర్చిదిద్దాల్సిన బాధ్యత భాషాశాస్త్రవేత్తలపై ఉంది. ఆంగ్లపదాలను ఉపయోగించక తప్పని పరిస్థితుల్లోనూ- గట్టి ప్రయత్నం చేస్తే దేశయంగా నూతన పదబంధాలను సృష్టించడం అసాధ్యమేమీ కాదు. ఇది మొండిగా అన్యభాషాపదాలను తిరస్కరించే ఛాందసవైఖరిగా మాత్రం మారకూడదు. రామ్‌ మనోహర్‌ లోహియా అన్నట్లు కేవలం రెండున్నర లక్షల పదసంపద ఉన్న ఆంగ్లంలో కంటే- ఆరు లక్షల పదాలున్న తెలుగులో భావవ్యక్తీకరణ సులభం. అందుకే ఆంగ్లపదాలకు మారుగా నూతన పదనిర్మాణం జరగాలి. ఇది తెలుగు అస్తిత్వాన్ని విస్తరింపజేసే ప్రయత్నంలో భాగం.

నూతన ఆంగ్ల పద నిర్మాణ ప్రక్రియ ఏ భాషకైనా ప్రాణావసరమే. 'ఆక్స్‌ఫర్డ్‌' నిఘంటువును అయిదేళ్లకోసారి పునర్నిర్మిస్తుంటారు. ఈ ప్రక్రియలో భాగంగా అన్యదేశ్యాలను చేర్చడం; కొన్నింటికి కొత్త పదాలను కల్పించడం; భాషావ్యవహారంలో పదాలకు జతపడుతున్న కొత్త అర్థాలను స్వీకరించడం వంటివాటిని చేస్తుంటారు. తెలుగులో ఆంగ్లభాషాపదాలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి సమానార్థక పదాలను సృష్టించుకోవడంలో ప్రయత్నలోపం తప్ప మరే కారణమూ కనిపించదు. తొలుత తెలుగులో మహానిఘంటు నిర్మాణం జరగాలి. ఇప్పటికైనా ఆ దిశగా ప్రయత్నించాలి. తెలుగులో మహానిఘంటువు ఏర్పడితే కనీసం పదేళ్లకు ఒకసారయినా దాన్ని సవరించుకోవచ్చు.
కొత్త పదాలకు శ్రీకారం
గతంలో సమానార్థక పదసృష్టి ఓ నియమంగా జరిగేది. అర్థాన్ని బట్టి మన భాషలో ఒక పదాన్ని స్థిరపరచుకొని వాడేవారు. ఇప్పుడు శీర్షికల్లోనూ ఆంగ్లపదాలే దర్శనమిస్తున్నాయి. తొలినాళ్లలో సమానార్థక పదనిర్మాణానికి మన పత్రికా సంపాదకులు కొన్ని విధానాలను అనుసరించేవారు. తమిళ ఆకాశవాణిలో ప్రతిరోజూ కొత్తపారిభాషిక పదాలకు సంబంధించిన కార్యక్రమం ప్రసారమవుతుంది. కిందటిరోజు ఆంగ్లపత్రికలో వచ్చిన కొత్త పారిభాషిక పదాలకు తమిళంలో సమానార్థకాలను తయారుచేసి ప్రసారం చేస్తారు. ఆ రకంగా వాటిని ప్రజల నిత్యజీవన వ్యవహారంలో భాగం చేస్తారు. ఇంగ్లిషు మాటలను ఉపయోగించకుండానే రాసేందుకు హిందీ, తమిళం, కన్నడ వంటి భాషాపత్రికల్లో విలేకరులు ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు ఇటీవల స్వైన్‌ఫ్లూ జ్వరానికి సంబంధించిన వార్తలు వివిధ పత్రికల్లో వచ్చాయి. ఆ పదాన్ని మన పత్రికలు యథాతథంగా వాడాయి తప్ప కొత్తపదాన్ని సృష్టించలేదు. కన్నడిగులు దాన్ని 'హందిజ్వర' అని తమభాషలోకి తర్జుమా చేసుకున్నారు. స్వైన్‌ఫ్లూ వంటి పదానికి అనువాదం దొరకడం కష్టమే. చక్కటి కొత్తపదాన్ని తయారుచేసినప్పుడు అది వాడుకలో చేరిపోతుంది. రామాయణం, మహాభారతం వంటి ఉద్గ్రంథాలను తెలుగు చేసుకోగలిగిన మనకు- నేటి అవసరాలను తీర్చే మాటలను కూడగట్టుకోవడం అసాధ్యమేం కాదు. కాశీనాథుని నాగేశ్వరరావు 1908లో ఆంధ్రపత్రికను వారపత్రికగా స్థాపించిన తరవాత 1938లో పారిభాషిక పదకోశాన్ని నిర్మించారు. ఆ మాటలను కందుకూరి వీరేశలింగం 'వివేకవర్థిని'ద్వారా, కొండా వెంకటప్పయ్య కృష్ణాపత్రిక ద్వారా ప్రచారం చేశారు. నైట్రోజన్‌కు నత్రజని, నికిల్‌కు నిఖలం, ఆక్సిజన్‌కు ప్రాణవాయువు, ఫొటోసింథసిస్‌కు కిరణజన్య సంయోగక్రియ అని తెలుగు చేసింది కాశీనాథులవారే.

సుసంపన్నమైన భాష- జాతి స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు, కీర్తి ప్రతిష్ఠలకు ప్రతీక. అపారమైన ప్రేమాభిమానాలుంటే అమ్మభాషను రక్షించుకోవడం, కొత్త దిశలకు విస్తరింపజేయడం అసాధ్యం కాదు. జనబాహుళ్యంలో సువ్యాప్తమైన భాషను ప్రభుత్వం అక్కున చేర్చుకుని ఆదరించాలి. ప్రభుత్వం అండగా నిలిచి, పాలన వ్యవహారాల్లో చోటు కల్పించినప్పుడే తెలుగుకు భద్రత, గౌరవం. భాష సామాజిక ఆస్తి. ఈ భావన తమిళుల్లో బలంగా వేళ్లూనుకుని ఉంది. తమిళనాడులో 'తిరుక్కురళ్‌' చదవనిదే ఇప్పటికీ ఏ సభా ప్రారంభం కాదు. 'మాతృభాష మనకి కళ్లు... ఆంగ్లభాష కళ్లజోడు' అని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అంటుంటారు. గుండెల్లో అంతటి అభిమానం ఉండబట్టే తల్లిభాషలోకి అన్యభాషాపదాల చొరబాటును తమిళులు అంగీకరించలేకపోతున్నారు. ఎంత మమకారం పెంచుకున్నా పరభాష ఏ రకంగానూ తల్లిభాషకు సాటికాదు, రాదు!
(ఈనాడు, ౦౧:౧౧:౨౦౦౯)
____________________________

Labels:

ఇది తెలుగు 'ముద్ర'

ఎవరెవరు పాలించారు? ఎన్ని యుద్ధాలు చేశారు?ఎంతమందిని పెళ్లాడారు?ఎన్నిటన్నుల కస్తూరి పూసుకున్నారు? ...ఏజాతి చరిత్ర చూసినా ఆ వోతలే, ఆ రాతలే! ఆ సమాచారమంతా పాఠ్యపుస్తకాల్లో పాఠాలుగా పనికొస్తుంది. బట్టీపట్టడానికి భలే అనువుగా ఉంటుంది.ఆ చరిత్రలు మనకొద్దు. ఆ భజనలు మనం చేయం. తెలుగుజాతికి ఆ అవసరంలేదు. మనక్కావలసింది భుజంతట్టినట్టు స్ఫూర్తినింపే చరిత్ర. కాగడా పట్టినట్టు దారిచూపే చరిత్ర. అంజనం వేసినట్టు అవకాశాలు వెతికిచూపే చరిత్ర. తొడపాశం పెట్టినట్టు హెచ్చరించి మేల్కొలిపే చరిత్ర. ఎన్ని దేశాలకు విస్తరించాం, ఎన్ని ఖండాల్లో జెండాలు పాతాం, ఎన్ని ఆవిష్కరణలు చేశాం, ఎన్ని ఘనతలు సొంతం చేసుకున్నాం... ఆ వివరాలే కావాలిప్పుడు. ఆ బౌద్ధిక జైత్రయాత్రల్నే సగర్వంగా తలుచుకోవాలిప్పుడు. 'ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం' సందర్భంగా... జాతీయంగా అంతర్జాతీయంగా 'టెలుగు ముద్ర'ల్ని వెతుక్కునే చిన్న ప్రయత్నం...

-------------------
మన జెండా
జాతీయ పతాకం









ఎగురవే ఎగురవే...
ఎగురవే జెండా!
ఎంతెత్తు ఎగిరినా...
ఎదురు ఏమున్నదే!
ఎర్రకోట మీద సగర్వంగా
రెపరెపలాడుతున్న ఆ మువ్వన్నెల జెండా...స్వతంత్ర భారతికి తెలుగువారు పెట్టిన పసుపుకుంకాల చీర!
మన 'తిరంగా' యాదృచ్ఛికంగా ఏం పుట్టలేదు. దాని వెనుక పింగళి వెంకయ్యగారనే మహానుభావుడున్నారు. 1916లోనే మనకంటూ ఓ జెండా ఉండాలన్న ఆలోచన వచ్చిందాయనకి. ఆ ప్రయత్నంలో దేశదేశాల పతాకాలు పరిశీలించారు. జెండాల చరిత్రలు అధ్యయనం చేశారు. రంగుల భావాలు అర్థంచేసుకున్నారు. ఐదేళ్లపాటు అదే ప్రపంచంగా బతికారు. 1921లో జరిగిన బెజవాడ కాంగ్రెస్‌ సమావేశంలో అధికారిక పతాకం గురించి చర్చ జరిగింది. అప్పుడే వెంకయ్యగారు తన ఆలోచనల్ని మహాత్ముడి ముందుంచారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో జెండా తయారుచేశారు. గాంధీజీ దానికి తెలుపు జోడించారు. మరో పెద్దమనిషి సామాన్యుడి వికాసానికి గుర్తుగా చరఖా పెడితే బావుంటుందన్నారు. వెంకయ్యగారు ఆ సూచనలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకో జెండా తయారు చేశారు. కరాచి సమావేశంలో, చరఖా ఉన్న మువ్వన్నెల జెండాకు వర్కింగ్‌ కమిటీ ఆవోదం లభించింది. రాజ్యాంగ నిర్మాణసభ చిన్నచిన్న మార్పులతో కాంగ్రెస్‌ జెండానే భారత జాతీయ జెండాగా స్వీకరించింది. అశోకచక్రమున్న త్రివర్ణపతాకం పంద్రాగస్టున దేశమంతా రెపరెపలాడింది.
'ఈ జెండా తెలుగుబిడ్డ తయారుచేసిందే...' అనుకోవడంలో గొప్ప ఆనందముంది.

---------------------
బంగారు బసవన్న
ఒంగోలు గిత్త


మనం కారో బైకో కొంటున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం! డిజైన్‌ చూస్తాం, మైలేజీ చూస్తాం, మెయింటెనెన్స్‌ చూస్తాం, రంగు చూస్తాం. పరమశివుడు కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకునుంటాడు. అందుకే, ఏరికోరి ఒంగోలు ఎద్దునే వాహనంగా ఎంచుకున్నాడు. కావాలంటే, లేపాక్షి బసవన్నను చూడండి. మీఊరి శివాలయంలోని నందిని చూడండి. అచ్చంగా ఒంగోలు గిత్తలాగే ఉంటాయి.
ఒంగోలు జాతి పశువులు బలంగా ఉంటాయి. అంతెత్తు ఆకారం. కళ్లు తిప్పుకోనివ్వనంత అందం. ఒళ్లుదాచుకోకుండా పనిచేస్తాయి. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకుని నిలబడతాయి.
రోగనిరోధకత ఎక్కువ. ఆ పనితనానికి విదేశీయులూ పడిపోయారు. ఒక్క బ్రెజిల్‌లోనే ఇరవై లక్షల ఒంగోలు పశువులున్నాయి. అమెరికాలో ఒంగోలు గిత్తల సాయంతో 'బ్రహ్మన్‌' అనే సంకరజాతిని సృష్టించారు. 1906 ప్రాంతంలోనే ఒంగోలు పశువుల ఎగుమతి ప్రారంభమైంది. హాలెండ్‌, మలేసియా, బ్రెజిల్‌, అర్జెంటీనా, కొలంబో, మెక్సికో, పోర్చుగల్‌, ఇండొనేషియా, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా...మన ఒంగోలు గిత్తలు ప్రపంచమంతా వ్యాపించాయి.
హాలెండ్‌లోని ఓ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 'పోతురాముడు' అనే ఒంగోలు గిత్త విగ్రహం పెట్టారట! ఐదేళ్ల క్రితం, బ్రెజిల్‌ మూడులక్షల రూపాయలకు ఒకటి చొప్పున రెండు గిత్తల్ని కొనుక్కుని వెళ్లింది. యాంత్రికీకరణ పెరిగాక చాలా దేశాలు ఒంగోలు పశువుల్ని సేద్యానికి వాడుకోవడం మానేశాయి. మాంసం కోసం పెంచుతున్నాయి. ఈధోరణి ఒంగోలు పశువుల్ని ప్రేమించేవారికి బాధ కలిగిస్తోంది. ఇక, బక్కపలచ తెలుగు రైతన్న ఒంగోలు గిత్తల్ని పోషించలేనని ఎప్పుడో చేతులెత్తేశాడు. భూస్వాములేవో ట్రాక్టర్ల సేద్యానికి అలవాటుపడ్డారు. దీంతో సొంతగడ్డమీదే ఆ జాతి కనుమరుగు అవుతోంది.

---------------------
మహాప్రసాదం!

తిరుపతి లడ్డు


ఓసీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి పదవీగండం ఉందని ప్రచారం జరిగింది. దీంతో ఆ ఖాకీబాసు తిరుపతి లడ్డూలు పట్టుకుని ఓ కీలకనేత దర్శనానికెళ్లారు. అనుకున్నట్టే, రెండ్రోజుల్లో దొరగారి పదవి వూడింది. కానీ, బొత్తిగా పన్లేని సీట్లో కూర్చోబెట్టకుండా, కాస్త గౌరవప్రదమైన బాధ్యతే కట్టబెట్టారు. తిరుపతి లడ్డూ రాయబారం పనిచేసిందన్నమాట!

తిరుపతి లడ్డూలు చేతిలో ఉంటే తిరుగే ఉండదు. సీఎం పేషీకెళ్లినా ప్రైమ్‌మినిస్టర్‌ ఆఫీసుకెళ్లినా పనులు చకచకా జరిగిపోతాయి. ఇక అమెరికాకెళ్తే, సాక్షాత్తు శ్రీవేంకటేశుడే వచ్చినంత సంబరపడిపోతారు ప్రవాస సోదరులు. అంత కమ్మగా ఉంటాయి కాబట్టే శ్రీనివాసుడు ఏరికోరి వండించుకుంటున్నాడో, శ్రీనివాసుడికి నివేదించడంవల్లే ఆ కమ్మదనం వచ్చిందో తెలియదు కానీ...లడ్డూలంటే తిరుపతి లడ్డూలే! ఆ రుచి నాలుకని తాకగానే అప్రయత్నంగా కళ్లుమూసుకుంటాం. అది భక్తి కావచ్చు, తీపంటే అనురక్తీ కావచ్చు. ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే తిరుపతి లడ్డూ!

1940 ప్రాంతంలో కల్యాణోత్సవాలు వెుదలైనప్పుడే...లడ్డూ ప్రసాదం పుట్టింది. తిరుపతి లడ్డూ తయారీకి కచ్చితమైన పద్ధతంటూ ఉంది. ఏయే దినుసుల్ని ఎంతెంత పరిమాణంలో వాడాలో తెలియజేసే 'దిట్టం' ఉంది. కాలానికితగినట్టు దానికీ మార్పులు చేస్తున్నారు. తొలిరోజుల్లో కట్టెల పొయ్యిమీద ప్రసాదం తయారు చేసేవారు. మెల్లగా యంత్రాలు ప్రవేశించాయి. రుచిలోనూ నాణ్యతలోనూ ఎంతోకొంత తేడా వచ్చింది. అయినా, తిరుపతి లడ్డూలకు తిరుగులేదు. పేటెంటు పుణ్యమాని ఆ విశిష్టత రికార్డులకెక్కింది.

-----------------------
ఆంధ్రుల 'అమృతం'

అమృతాంజనం


ఒకప్పుడు 'ముక్కోటి ఆంధ్రుల'మని కాలరెగరేసి చెప్పుకునేవాళ్లం. ఆ మాటల్లో 'మేం ముక్కోటి దేవుళ్లకు సరిసమానమండోయ్‌!' అన్న అతిశయమూ వినిపించేది. అయినా ఆ దేవుళ్లు, తెలుగువాళ్లకంటే ఎందులో గొప్ప! ఇన్నేళ్లలో దేవతల జనాభా పెరిగిన దాఖలాల్లేవు. మరి మనవో, పదికోట్లు దాటిపోయాం. వాళ్లు అమృతం సృష్టిస్తే, మనం అంతకంటే రెండక్షరాలు ఎక్కువున్న అమృతాంజనం సృష్టించాం. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి హృదయసాగర మథనంలోంచి పుట్టిందా దివ్యాంజనం. దేవుళ్లు తమ్ముళ్లను నొప్పించి అమృతం లాగేసుకుంటే, మనం తోటివాళ్ల నొప్పులు తగ్గించడానికి అమృతాంజనాన్ని దేశమంతా విస్తరించాం. ఇప్పుడది ఖండాంతరాలకు పాకిపోయింది. యూరప్‌ దాకా వెళ్లింది. అమెరికాలోనూ దొరుకుతోంది. మధ్యప్రాచ్యంలో బోలెడంత గిరాకీ ఉందట.
అటూఇటుగా అమెరికాలో 'విక్స్‌ వెపొరబ్‌' పుట్టినప్పుడే ఆంధ్రదేశంలో అమృతాంజనం పుట్టింది. 1893లో ప్రాంతంలో పంతులుగారు బొంబాయి కేంద్రంగా వ్యాపారం ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే ఉత్తరదక్షిణాలన్న తేడాలేనంతగా గిరాకీ పెరిగింది. నాగేశ్వరరావు పంతులుగారు అమృతాంజనం వ్యాపారంలో లక్షలు గడించారు. కానీ నయాపైసా దాచుకోలేదు. ఉన్నదంతా దేశం కోసమే ఖర్చుచేశారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించిన 'ఆంధ్రపత్రిక' ఆ డబ్బుతోనే నడిచింది. తొలిరోజుల్లో బ్రిటిష్‌
వ్యతిరేక సభల్లో, హర్తాళ్లలో అమృతాంజనం సీసాలు ఉచితంగా పంచేవారట. అలా...తలనొప్పినే కాదు, తెల్లవాళ్లనూ తరిమేసింది తెలుగువారి అమృతాంజనం.

----------------------
నెమలికి నేర్పిన నడక...

కూచిపూడి నృత్యం


'భామనే సత్యాభామనే... తన్మయంగా పాడుకుంటూ, దర్పంగా జడూపుకుంటూ, వయ్యారంగా నడుమూపుకుంటూ సత్యభామాదేవి నడుస్తూనే ఉంది. కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామం నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి అమెరికా, ఇంగ్లండ్‌, జర్మనీ, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక...ప్రపంచమంతా!
గత ఏడాది అమెరికాలోని క్యూపర్టినోలో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం జరిగితే, వేలమంది నృత్యకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ వైభోగమంతా చూసుంటే, కూచిపూడి రూపకర్త సిద్ధేంద్రయోగి ఎంత మురిసిపోయేవారో! పదిహేనో శతాబ్దంలో, సిద్ధుడు గజ్జెకట్టి ఆడిన రోజుల్లో ఇంత వైభోగం లేదు. ఇంత ప్రచారం లేదు. ఇంత ప్రోత్సాహం లేదు. కూచిపూడి భాగవతులకు గ్రామబహిష్కారం విధించిన అనుభవాలున్నాయి. కూచిపూడిని అసలు నాట్యమే కాదన్న దాఖలాలున్నాయి. ఆడవారు ఆడకూడదన్న వివక్షలున్నాయి. ఆ బంధనాలన్నీ తెంచుకుని...తెలుగువారి కూచిపూడి అంతర్జాతీయ కూచిపూడిగా ఎదుగుతోంది. భామాకలాపమైనా, అర్ధనారీశ్వరమైనా, శాకుంతలమైనా, యుద్ధము-శాంతి అయినా...ప్రపంచంలో ఎక్కడ ఏ వేదిక మీద కూచిపూడి ప్రదర్శన జరిగినా కుర్చీలు నిండుతాయి. చప్పట్లు వోగుతాయి. ఇంతకు మించి కావలసినదేముంది?
కూచి
పూడీ బహుపరాకు!
తెలుగుజాతీ బహుపరాకు!

--------------------
సాహితీ సమరం

అవధానం

యుద్ధమంటే అదీ! అటు అవధానీ ఇటు పృచ్ఛకులూ సాహితీ సుమాయుధాలతో సిద్ధమవుతారు. గణపతి స్తోత్రంతో యుద్ధభేరి వోగుతుంది. సమస్యాపూరణంతో రణం భీకరమవుతుంది. ఛందోబందోబస్తుల్ని లౌక్యంగా తప్పించుకోవాలి. నిషిద్ధాక్షరిని నిర్భయంగా ఎదిరించాలి. దత్తపదులతో ఒంటరిగా పోరాడాలి. వర్ణనల విన్యాసాలు చేయాలి. ఆశుకవితలతో 'భేషు' అనిపించుకోవాలి. కేరింతలు, హాహాకారాలు, విమర్శలు, ప్రతివిమర్శలు...రణభూమిని తలపిస్తుంది అవధాన వేదిక. మీసాలు మెలేసిన కవులున్నారు. తొడగొట్టిన అవధానులున్నారు. తిరుపతి వెంకటకవులూ కొప్పరపు కవులూ కలబడ్డారా...ఇండోపాక్‌ క్రికెట్‌ మ్యాచంత ఉత్కంఠభరితం.

అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, శతసహస్రావధానం...పిండికొద్దీ రొట్టె అన్నట్టు, ధారణకొద్దీ అవధానం. అవధాన విద్యకు ఆద్యులు మాడభూషి వెంకటాచార్యులు. వెంకట రామకృష్ణకవులు, రాజశేఖర వెంకట కవులు, పల్నాటి సోదరులు, దేవులపల్లి సోదరులు ... ఎందరో మహాపండితులు నలుదిశలా విస్తరించారు. అవధానం మీద కన్నడిగుల కన్నూ పడింది. హిందీ కవులకు భలే పసందుగా అనిపించింది. సంస్కృత పండితుల ప్రేమ సరేసరి. అక్కడక్కడా త్రిభాషావ ధానాలూ (తెలుగు-సంస్కృతం-ఇంగ్లిషు) జరుగుతున్నాయి. మనదీ అని సగర్వంగా చెప్పుకోదగిన సాహితీ ప్రక్రియ అవధానం.

---------------------
తెలుగు గోళీలు
ఔషధాలు


మెథోట్రెక్సేట్‌...
క్యాన్సర్‌ నివారణ ఔషధం. కీళ్లనొప్పులు, సోరియాసిస్‌ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు.

టెట్రాసైక్లిన్‌...
పదిహేనేళ్ల క్రితం గుజరాత్‌, మహారాష్ట్రలలో ప్రబలిన ప్లేగువ్యాధిని నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడింది. ఆ మందే లేకపోతే ఇంకెన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవో. మూడోతరం టెట్రాసైక్లిన్‌ అయిన డాక్సీసైక్లిన్‌ మలేరియా నివారణలోనూ సమర్థంగా పనిచేస్తుందని గుర్తించారు.

అరియోమైసిన్‌...
వెుట్టవెుదటి టెట్రాసైక్లిన్‌ యాంటీబయాటిక్‌. యాభై ఏళ్లలో కొన్నివేల ప్రాణాలు కాపాడింది. ఆ సమయానికి, ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ కంటే వాక్స్‌మన్‌ స్ట్రెప్టోమైసిన్‌ కంటే చాలా శక్తిమంతమైంది.

హెట్రాజన్‌...
బోదకాలు నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఔషధం.

వీటన్నిటిని ప్రపంచానికి అందించింది ఓ తెలుగు వ్యక్తే, డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు.
రక్తహీనతకు ప్రధాన కారణమైన విటమిన్‌ బి 12ను గుర్తించింది సుబ్బారావే. ఆయన కనిపెట్టిన ఫోలిక్‌ ఆమ్లాన్ని ఎన్నో ఔషధాల్లో మిశ్రమంగా వాడుతున్నారు. లుకేమియా చికిత్సలోనూ ఆయన మందులు పనికొస్తున్నాయి. నిజానికి, సుబ్బారావు ఆవిష్కరణల చిట్టా చాలాపెద్దది. అనేక సందర్భాల్లో ఆయన ఆ ఘనతను తనకింద పనిచేస్తున్న సిబ్బందికే వదిలేశారు. సుబ్బారావు దగ్గర సహాయకులుగా పనిచేసినవారు కూడా నోబెల్‌ పురస్కారాలు అందుకున్నారు.
ఆయన మాత్రం ఎలాంటి ప్రచారాన్నీ కోరుకోలేదు. కనీసం తన ఆవిష్కరణలకు పేటెంట్‌ తెచ్చుకోవాలన్న ఆలోచన కూడా లేదు. అంత నిరాడంబరుడు. పాతికేళ్లు అమెరికాలో నివసించినా సుబ్బారావుకు అక్కడి పౌరసత్వం లేదు. యాభైమూడేళ్లూ తెలుగువాడిగానే బతికారు. భారతీయుడిగానే మరణించారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ సహకారంతో ప్రఖ్యాత వైద్యులు డాక్టర్‌ సోమరాజు రూపొందించిన 'స్టెంట్‌' హృద్రోగులకు ఓ వరం. రెడ్డీస్‌, శాంతా బయోటెక్స్‌, మాట్రిక్స్‌, నాట్కో వంటి ఔషధ తయారీ సంస్థలు బహుళజాతి సంస్థలతో చేతులు కలిపి అంతర్జాతీయం అవుతున్నాయి. ఓరకంగా చెప్పాలంటే, తెలుగు గోళీల్ని ప్రపంచమంతా మింగుతున్నారు.

----------------------
వెలుగుల కొండ కోహినూర్‌ వజ్రం


బ్రిటిష్‌రాణి కిరీటంలో రెండువేల ఎనిమిదివందల వజ్రాల మధ్య రారాజులా వెలిగిపోతున్న కోహినూర్‌ (అంటే... వెలుగుల కొండ!) మనది మనది మనదే. గుంటూరు సీమలోని కొల్లూరు గనుల్లో పుట్టింది. అప్పట్లో ఆ ప్రాంతం గోల్కొండ సామ్రాజ్యంలో అంతర్భాగం కాబట్టి, వెుదట సుల్తానుల వశమైంది. ఆతర్వాత...బానిసలు, ఖిల్జీలు, తుగ్లక్‌లు, సయ్యద్‌లు, లోడీలు, సిక్కులు...ఎన్ని తలలు మారిందో, అన్ని తలలు బలితీసుకుంది. కోహినూరు వజ్రం చేతులుమారిందంటేనే, ఒక సామ్రాజ్యం పతనమైనట్టు. ఒక వంశం నాశనమైనట్టు. దాని తత్వమే అంత.
వస్తూవస్తూ విజయం తెస్తుంది.
వెళ్తూవెళ్తూ ప్రాణాలు తీస్తుంది!
ఆ భయంలోంచే బోలెడు కథలు పుట్టుకొచ్చాయి. కోహినూరు వజ్రమే పురాణాల్లోని శమంతకమణి అని నమ్మేవారు ఉన్నారు. అది సాక్షాత్తు సత్యభామాదేవి వజ్రం కాబట్టి, స్త్రీలు మాత్రమే ధరించాలన్న ప్రచారం జరిగింది. బ్రిటిష్‌ రాజకుటుంబం కూడా కోహినూరు వజ్రాన్ని ఆ ఇంటి పెద్దకోడలికే వారసత్వ కానుకగా ఇస్తోంది.
నూట ఎనభైఆరు క్యారెట్ల బరువైన ఆ వజ్రాన్ని ఖరీదు కట్టే షరాబు ఇప్పటిదాకా పుట్టలేదు. బాబర్‌ చక్రవర్తి మాత్రం 'ప్రపంచానికంతా రెండున్నర రోజులు భోజనం పెట్టినంత' అని లెక్కేసుకున్నాడు. తెల్లదొరల బొక్కసానికి వెళ్లాక, దానికి మెరుగులుపెట్టించాలని ఆల్బర్ట్‌ యువరాజుకు ఆలోచన వచ్చింది. సానబట్టడానికే రెండువేల వజ్రాలు అరిగిపోయాయి. బరువు నూటఅయిదు క్యారెట్లకు పడిపోయింది.
ఆ అమూల్య వజ్రాన్ని వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒకరోజు ఆ వెలుగులకొండను మనదేశానికి తీసుకురాగలిగితే...నేరుగా ఆంధ్రప్రదేశ్‌కే తీసుకురావాలి.
కోహినూర్‌ మన ఆస్తి!

-----------------------------
రండి...భోంచేద్దాం! ఆవకాయ


ఆపదల నాదుకొను కూర ఆవకాయ
అతివ నడుమైన జాడియెు ఆవకాయ
ఆంధ్రమాత సిందూరమ్మె ఆవకాయ
ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ
ఎంత గొప్పగా చెప్పారండీ గరికిపాటివారు!
మామిడికాయ వూరగాయ ఎవరైనా పెట్టుకోగలరు. అదేం బ్రహ్మవిద్య కాదు. నాలుగు కాయలు కోసేసి ఉప్పూకారం కలిపితే చచ్చినట్టు పచ్చడైపోతుంది. ఆంధ్రులు తప్ప, ఎవరైనా ఆపనే చేస్తారు. కానీ తెలుగిళ్లలో ఆవకాయ పెట్టడమంటే ఏ సత్యనారాయణస్వామి వ్రతవో చేసినంత భక్తీశ్రద్ధా. చిన్నరసాలు పట్టుకోడానికి పెద్దప్రయత్నమే చేయాలి. చిన్నావాల కోసం సూపర్‌మార్కెట్లన్నీ గాలించాలి. ఆవపిండికి ఆర్డరివ్వాలి. ఎర్రటి ఎర్రకారం తెప్పించాలి. కల్తీలేని నువ్వుల నూనె ఎక్కడ దొరుకుతుందో అంజనమేసి గాలించాలి. అంతా అయ్యాక, జాగ్రత్తగా జాడీలకెత్తాలి. అందులోనూ స్పెషలైజేషన్‌. బెల్లమావకాయ, ముక్కావకాయ, పెసరావకాయ, సెనగావకాయ, పులిహోర ఆవకాయ, గుత్తావకాయ, తొణుకావకాయ, నీళ్లావకాయ.ఇవిచాలవన్నట్టు మాగాయ. తియ్యగా వడ్డిద్దామనుకునే తల్లులు తేనె ఆవకాయా పెడతారట!
అరవై అయిదో కళ...ఆవకాయ పెట్టడం. అది ఆంధ్రుల సొత్తు. కాబట్టే, చెన్నై అయ్యరుగారైనా బెంగుళూరు కులకర్ణిగారైనా...పొరుగింటి తెలుగుపిల్ల చిట్టిగిన్నె పట్టుకొచ్చి 'ఆయ్‌... ఆవకాయ పెట్టామండీ! కాస్త రుచిచూసి పెట్టండి' అనడక్కపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అయినా జిహ్వచాపల్యం తీరకపోతే 'ఆవకాయ పెట్టడమెలా?' అన్న విషయం మీద స్పెషల్‌ క్లాసులు పెట్టించుకుని తమిళంలోనో కన్నడంలోనో నోట్సు రాసుకుంటారు. ఆ తీరికా ఓపికా లేనివారికోసం ఉండనే ఉంది... 'ఓప్రియా...ప్రియా!'
----------------------

పాటలీపుత్రమ్ము కోటకొమ్మల మీద తెలుగు జెండాల్‌ నర్తించునాడే... తెలుగుముద్ర భారతజాతి రాజముద్రగా రాజిల్లింది. విదేశీ యాత్రికులు రత్నమాలలతోపాటు తెలుగు అక్షరమాలనీ ఓడలకెత్తిననాడే... అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది. పాలగుమ్మివారి 'గాలివాన'తో తెలుగు కథ అంతర్జాతీయమైంది. జిడ్డు కృష్ణమూర్తి ఉపన్యాసాలు విన్నాకే ప్రపంచానికి 'తత్వం' బోధపడింది.
పీవీ సరళీకరణ విధానం, ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదం...
బాలమురళి శాస్త్రీయం, బాలూ లలితగానం...
అజహర్‌ అద్భుతాల క్రికెట్టు, శ్రీదేవి చిరునవ్వుల కనికట్టు...
నాయుడమ్మ వైద్యం, బాపూ చిత్రం...
తెలుగువెలుగుల కీర్తికిరీటం!
గద్వాల, పోచంపల్లి, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, చిరాల, నారాయణపేట, మచిలీపట్నం చేనేతలు...
మగ్గాల మీద అల్లిన ముత్యాల ముగ్గులు!
బంగినపల్లి మామిడిపళ్లు, పలాస జీడిపప్పులు,
ఆత్రేయపురం పూతరేకులు, బందరు లడ్డూలు, తాపేశ్వరం కాజాలు...రుచుల్లో రాజాలు!
శాకాంబరీదేవి ప్రసాదం...ఆంధ్రాబ్రాండ్‌
గోంగూర పచ్చడి.
తెలుగువారి వ్యాపారాలకు జైబోలో!
ఎంతచెప్పినా తెలుగు విజయాల చరిత్ర అసమగ్రమే.
ఎంతరాసినా తెలుగు ముద్రల జాబితా అసంపూర్ణమే.
మాతెలుగుతల్లికి మల్లెపూదండ వేసి,
ఎందరో మహానుభావులు... అందరికీ వందనములు!
అని దండం పెట్టుకుంటే,
తెలుగు వెలుగులందర్నీ స్మరించుకున్నట్టే
తెలుగు ముద్రలన్నీ తడిమిచూసుకున్నట్టే!
_______________________
(ఈనాడు, ఆదివారం, ౦౧:౧౧:౨౦౦౯)
___________________________

Labels: