My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Sunday, October 20, 2013

1277-Quotes


________________________________________

Labels: , ,

1276-ఎలుగెత్తి పిలిచే వెలుగు


ఆశించటం, అది సాధించేందుకు తపించిపోవటం, పోటీపడీ పోరు సాగించీ విజయానందం అందుకోవటం... జీవితం! ఆ ఆరాటంలో, పోరాటంలో ఉన్న సాధనాలన్నీ వినియోగించి, అన్ని సాయుధబలగాల్నీ మోహరించి వడివడిగా ముందుకు సాగే మనిషికి నాళం కృష్ణారావు కవి దర్శించిన 'పట్టుదల బూని చేయుమా పనులనెల్ల/ కాలమే సమకూర్పగలదు ఫలము' అన్నదే అనుభవానికొస్తుంది. పరిశీలన, అనుశీలన కలగలిసిన వ్యూహరచనతో ఇతర గుణగణాలూ జతకడితే, విజయాలు పరంపరగా సిద్ధించి మానవుణ్ని మాననీయుణ్ని చేస్తాయి. ఏనుగు లక్ష్మణకవి విపులీకరించిన 'ఆపదలందు ధైర్యగుణ, మంచిత సంపదలందు దాల్మియున్/ భూ సభాంతరాళమున బుష్కల వాక్చతురత్వ, మాజి బా/హా పటుశక్తియున్, యశమునం దనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధి' ప్రకృతిసిద్ధ లక్షణాలే కాక మానవాళి పాలిట ఆయుధాలూ సాధనాలూ. రాజనందనుడైన సిద్ధార్థుడు నాడు శ్రుతులు, స్మృతులు, సంహితలతో పాటు నిఖిల శాస్త్రాల పాండిత్యాన్ని గడించాడు. అఖిల అస్త్రశస్త్ర రహస్యాలు, తంత్రవాదనల సారాంశాలు, యంత్రవాదాల లోలోని మర్మాలూ గ్రహించి సర్వజ్ఞుడయ్యాడు. 'ఉపాయపూర్వకమగు విపులయత్నము సర్వార్థ సాధకము' అన్నట్లు బాణ ప్రయోగ కళాదక్షుడిగా, ఖడ్గచాలనాది విద్యాపారీణుడిగా వీరాధివీరత్వాన్నీ సొంతంచేసుకున్నాడు. అటుతరవాత భోగభాగ్యాల్ని వదిలి, భార్యాబిడ్డల్నీ వీడి శాశ్వత జ్ఞానసాధన దిశగా తరలివెళ్లిన అతడి మేధోసంబంధ ఆయుధం- తత్వచింతనే!
పూర్వాపరాల ఆలోచన, ప్రత్యేకమైన అభిరుచి, అవిశ్రాంత కృషి కారణంగానే ఫలితం ప్రాప్తిస్తుంది. 'ధనమునకు దానమును, తప/మున కాచారమును, రాజ్యమున కాజ్ఞయు, జీ/వనమునకు యశము, విద్యకు/వినయంబును, నీతులకు వివేకము ఫలముల్' అని పలికిన సుభాషితకర్త అంతరార్థమూ సాధనాల ప్రాధాన్యమే. దానవులతో కలిసి క్షీరసాగర మథనం చేసిన దేవతలు భయాలకు లొంగలేదు, ప్రలోభాలకు దాసులు కాలేదు. అమృతభాండం లభించేవరకూ ప్రయత్నం మానలేదు. కనుకనే కృతనిశ్చయం వదలని నిపుణమతులయ్యారు. నగములు కంపించేలా గగనానికెగసి ప్రత్యర్థుల్ని భయకంపితుల్ని చేసిన గరుత్మంతుడిది రెక్కల బలం. యమధర్మరాజును వెంటాడి, పతి ప్రాణాల్ని తిరిగి దక్కించుకొన్న సావిత్రిది అపార ధైర్యం. 'ధర్మదేవతా, సూర్యచంద్రాదులార/ పంచభూతమ్ములార, దిక్పాలులార/ నన్ను రక్షింపరే నాథునకు వచించి' అంటూ నిండుసభలో సత్యపోరాటం సాగించి గెలిచిన శకుంతలది నిరుపమాన సాహసం. తనయుడు అర్జునుణ్ని ద్వాపరంలో ఆయుధంగా, సాధనంగా మలచింది తల్లి కుంతీదేవి. 'పరమశివుణ్ని ఆరాధించి పాశుపతం సంపాదించు, కదనభూమిలో విజృంభించి విరోధుల్ని నిరోధించు' అని ఆశీర్వదించి పంపింది. 'వెలుగు నిన్ను ఎలుగెత్తి పిలుస్తుంది, చీకటి నీకు దూరంగా నిలుస్తుంది' అంటూ త్రేతాయుగంలో కుమారుడు హనుమను దీవించి జాగృతపరచింది అంజన. 'నీ మాతను వీరమాతను చేయి, నీ జాతికి నవజీవం పోయి' అని కృతయుగంలో ప్రబోధించి బిడ్డను కార్యనిర్వహణ దీక్షాదక్షుణ్ని చేసింది వినత. కర్తవ్యాన్ని విస్మరించి కురుక్షేత్రంలో చేష్టలుడిగి కూర్చున్న ప్రియతముణ్ని 'లెమ్ము ధనుంజయా! విధి బలీయము, న్యాయము గెల్చు, నిల్చు స/త్యమ్ము, నశించు స్వార్థము, సదా యుగధర్మమిదే గదోయి' అని తట్టిలేపిన కృష్ణపరమాత్ముడిదీ కార్యసాధన తత్వమే. 'అంగత్రాణ కృపాణ బాణధరులై యంగమ్ము లుప్పొంగ, దు/స్సంగ స్వార్థ మదేభ కుంభములపై సంగ్రామ రంగమ్మునన్/ సింగమ్ముల్ వలె దూకి' పాండవవీరులు విజృంభించటానికి ఆ చైతన్య సమరభేరే కారణం. సకల శుభాలు, విజయ పరంపరలు ప్రసాదించే దుర్గమ్మ హస్తాలనిండా ఆయుధాలే కనిపిస్తాయి. సదాశయానికి వినియోగించే ప్రతి సాధనమూ ఆయుధమే. అక్షరం, ఆత్మవిశ్వాసం, గుండెబలం, విద్య, వినమ్రత, సమయస్ఫూర్తి... అన్నీ ఆయుధాలే, సాధనాలే. అందుకే 'బలిమి జేయరాని పని యెట్టిదైన/ ఉపాయబలము చేత జేయవచ్చు' అన్నారు 'చిత్రభారతం' కర్త.

సాహసం పథమైనప్పుడు, పట్టుదల ప్రధానమై పౌరుషమే ఆయుధంగా మారుతుంది. 'పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు/ పట్టెనేని బిగియ పట్టవలయు' అని హితవుచెప్పిన వేమన 'పట్టరాని పట్టు పట్టియుండినవాడు/ పుడమిలోన కీర్తి పొందలేడు' అంటూ హెచ్చరికా చేశాడు. ఆయుధ ప్రయోగానికైనా, సాధనాల వినియోగానికైనా పట్టువిడుపులు ఉండాలన్నది మానవ జీవన మంతటా నిండాల్సిన అంతస్సూత్రం. జ్ఞానసాధనమైన మెదడుతో పురోగమిస్తున్న విశ్వం 'శ్రమయేవ జయతే' సిద్ధాంతాన్నీ విశ్వసిస్తోంది. విశ్లేషించి చూస్తే, సంజీవదేవ్ అన్నట్లు 'తెలివిలేని శ్రమ కానీ శ్రమలేని తెలివికానీ అంతగా ఉపయోగపడవు. తెలివి, శ్రమ... రెండూ కలిసినప్పుడే ఏ పనిలోనైనా సఫలత'. కార్యసాఫల్యానికి కావాల్సింది సమాచరణ. వెనుక కాచుకుంటూ, ముందు చూసుకుంటూ సజావుగా పని సాగించటంలోనే జీవిత పరమార్థముంది. జగజ్జనని దుర్గను విజయదశమి అరుణోదయ వేళలో ఆరాధించిన జిజియా- బాలశివాజీకి చేసిన ఉద్బోధా అదే. మహాకాళి మృగేంద్ర వాహనమెక్కి కదిలి దనుజ మర్దన జరిపిన మహత్తర దినమే దశమి. 'పంచతంత్రం' కర్త తేల్చిచెప్పినట్లు 'లోకంలో సమర్థులకు అసాధ్యమన్నదే ఉండదు'. పనినే ఆయుధం, సాధనం చేసుకొని ప్రతివ్యక్తీ కదిలినప్పుడు ఆశాజ్యోతి జ్వలిస్తుంది, సాధన నిలుస్తుంది, తపస్సు ఫలిస్తుంది !

(ఈనాడు ,13:10:2013)
____________________

Labels: , , ,

1275- తెలుగు జాతిరత్నం




శోకం- శ్లోకం పలికితే రామాయణం. ఆకలి- అక్షరాభ్యాసం చేస్తే తెలుగువారికొక జ్ఞానపీఠం! పనసపండు తన రహస్యాన్ని పరిమళం రూపంలో చెప్పినట్లుగా, రచయితలు తమ ఆకలిని అక్షరాల రూపంలో ఈ లోకానికి వివరిస్తారు. అక్షరాలతో ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అక్షరాలతోనే ఆత్మారాముడు తృప్తిచెందినట్లు భావిస్తారు. అక్షరాలకు అంజలి ఘటిస్తారు. తమ నుంచి అక్షరాలను వెలువరిస్తోంది కనుక ఆకలినీ గౌరవిస్తారు. 'ఆకలి నా రచనలకు ప్రేరణ' అని సగౌరవంగా ప్రకటించడంలో రావూరి భరద్వాజ స్ఫురద్రూపిగా కనిపిస్తారు. ఆకలి ఆయనను జ్ఞానిని చేసి పై మెట్టుపై కూర్చోబెట్టింది. జ్ఞానపీఠాన్ని కట్టబెట్టింది. ఆకలిని గౌరవించడమంటే అట్టడుగు వర్గాన్ని గౌరవించడమే! అత్యున్నత జ్ఞానపీఠాన్ని అందుకున్నప్పుడు భరద్వాజ అదే చెప్పారు. 'నేను సామాన్యుణ్ని... గట్టిగా చెప్పాలంటే అంతకన్నా తక్కువవాణ్ని' అన్నారాయన. పిడికెడు మెతుకులకోసం ఆయన వ్యవసాయకూలీగా పనిచేశారు. పశువులు కాశారు. బొగ్గుపనిలో మాశారు. పేపర్లు వేశారు. కలప అడితిలో, కమ్మరి కొలిమిలో, పొగాకు కొట్టులో పనిచేశారు. ఆకలి అన్ని పనులూ నేర్పింది! ఏడో తరగతి మానేసిన కుర్రాణ్ని జీవితం చదువుకున్న గొప్ప విద్యావంతుణ్ని చేసింది. పదిహేడేళ్లకే రచయితను చేసింది. సాహిత్య అధ్యయనాన్నే విద్యాభ్యాసంగా మార్చింది. బతుకు పుస్తకాలను చదివించింది. రాయించింది. 'నాకు సంబంధించి నా జీవితానికి, రచనకు వైరుధ్యం లే'దని చెప్పిన రావూరి భరద్వాజ- సహస్ర వృత్తుల శ్రమజీవుల జీవన సమరాన్ని గుండెలకు హత్తుకొనేలా అక్షరీకరించిన ధన్యజీవి!

చూసినవారి గురించే రాశాడాయన. 'జీవనసమరం' దానికి గట్టి సాక్ష్యం. అందులో పాత్రలు అందరికీ పరిచయమైనవేగాని, వాటిని చిత్రించడం మాత్రం భరద్వాజకే సాధ్యం. అట్టడుగు వర్గమంటే సాంఘిక అసమానతలకు గుర్తు. అణచివేతకు, అవమానాలకు ఆలవాలం. ఆకలి దహిస్తుంటే... ఆక్రోశం, అణిచివేస్తుంటే- ఆందోళన సహజం. ఆ రెండూ అక్షరరూపం దాల్చినప్పుడు ఆ అక్షరాల్లోంచి మాడుతున్న పేగు వాసన ఉబికివస్తుంది. రావూరి రచనల్లోని జీవలక్షణం ఆ ఘాటువాసనే! సమాజంలోని అట్టడుగు జీవుల్ని సాహిత్యలోకపు అందలాలెక్కించిన భరద్వాజ రచనల్లో- రాగిణి, కొత్తచిగుళ్లు, కాదంబరి, నాలోని నీవు, అంతరంగిణి, ఐతరేయం, ఒకింత వేకువకోసం, పదహారు నెలలపాటు 'ఈనాడు' దినపత్రికలో ధారావాహికగా ఆకట్టుకున్న 'జీవనసమరం'... వంటివన్నీ ఒక ఎత్తు. ఆయనకు జ్ఞానపీఠాన్ని అందించిన 'పాకుడురాళ్లు' మరో ఎత్తు. అందులో రంగస్థల సహజ జీవి 'మంగమ్మ'- తళుకుబెళుకుల సినీతార 'మంజరి'గా తర్జుమా అయిన తీరు విషాద రమణీయం. అందులోని అక్షరాలు అంతరంగ లోతట్టు పొరల గవాక్షాలు. గుండెపొరల్లోంచి విచ్చుకున్నవి కాబట్టి, వాటి తడి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఏ రచనకారచన ప్రత్యేక శైలితో, విభిన్న ధ్వనులతో, కాకువు విశేషంతో మనలను పలకరిస్తుంది. రచయితగా భరద్వాజ స్థాయిని నిరూపిస్తుంది. రావూరి జీవితానికి గట్టి ఓదార్పు అక్షరం. ఆయన జీవితానికి తీర్పు అక్షరం. అక్షరం ఆసరాతో మనసు తేలికపడ్డ ప్రతి రచయితలాగే- భరద్వాజ సైతం అక్షరానికి నివాళి అర్పించారు. అక్షరానికి జీవితాన్ని ముడుపుకట్టి దాని నీడన ఆశ్రయం పొందారు.

రావూరి జీవితానికి మరో చల్లని నీడ- ఆయన భార్య కాంతం! కాంతాన్ని- కాంతమ్మా అని పిలవడం భార్యగా ఆమె సాధించిన గొప్ప గౌరవం. 'భగవంతుడు కూడా నీ రూపంలో కనబడితే తప్ప నేనిప్పుడు గుర్తించలేను కాంతం' అన్న భరద్వాజ- 'నేనిప్పుడు నిరీహస్థితిలో ఉన్నా'నంటూ చేసిన అక్షరార్చన అజరామరం! ఆమె మరణం ఆయన చేత స్మృతికావ్యాలు రాయించింది. అక్షర నీరాజనాలు పలికించింది. మాడుతున్న పేగు వాసనలాగే మట్టి వాసన కూడా ఆయన సాహిత్య జీవలక్షణం. 'పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం నడిచివచ్చిన పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం దారిచూపిన పాదాలకు కృతజ్ఞతలు... నన్ను అనుసరించిన పాదాలకు కృతజ్ఞతలు' అన్నాడొక కవి. రావూరి చితికట్టెల చిటపటలు కూడా బహుశా అవే మాటలను వినిపించి ఉంటాయి. మరింత నిశితంగా వినిఉంటే, ఆ చితిమంటల సవ్వడి నుంచి 'మంగమ్మ'కు కృతజ్ఞతలు...' అనీ తప్పక వినపడే ఉంటుంది. ఆమె 'మంజరి'గా మారకుంటే 'పాకుడురాళ్లు' నవలా లేదు, ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠమూ లేదు. జీవితంలో మేలుచేసిన ప్రతి సందర్భానికీ, ప్రతి వ్యక్తికీ, పదేపదే ధన్యవాదాలు చెప్పుకొన్న భరద్వాజ- తన చరమదశలో విశ్వనాథ, సినారెల సరసన చోటుకల్పించిన ఆ స్త్రీమూర్తికి తప్పక కృతజ్ఞతలు చెప్పినతరవాతే అనంతవాయువుల్లోకి ప్రయాణం సాగించి ఉంటారు. పల్చని దేహంతో, నెరిసిన గెడ్డంతో అచ్చతెనుగు రూపురేఖలతో ఆంధ్రదేశాన్ని అలరించిన రావూరి భరద్వాజ తన ఆరోప్రాణం దగ్గరికి పరుగెత్తిన పతి... మనకిక తీయని స్మృతి. తెలుగుజాతికి మరో జ్ఞానపీఠం దక్కడానికి అవసరమైన స్ఫూర్తి! 'ఆవిరి ఓడలో జలధియానమొనర్చు బాటసారులు'గా వర్ణించాడు- మనుషుల్ని మహాకవి జాషువా. ఎవరి రేవు రాగానే వారు దిగి వెళ్ళిపోతుంటారు. రావూరి భరద్వాజ దిగవలసిన రేవు వచ్చింది. ఆయన దిగి వెళ్ళిపోయాడు- నిశ్శబ్దంగా!

(ఈనాడు, 20:10:2013)
__________________________

Labels: , , ,