My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, March 23, 2012

ఉగాది శుభాకాంక్షలు!

ఆంగ్లంలో నెలల పేర్లు చెప్పమంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు చెబుతారు. అలాగే తెలుగు నెలలు వేరే ఉన్నాయని తెలుసుగా? వాటిని చైత్రం నుంచి ఫాల్గుణం వరకు చెప్పాలి. కాలాన్ని కొలవడంలో వేర్వేరు పద్ధతులను ఉపయోగించడం వల్లనే ఈ తేడాలు ఉంటాయి. సూర్యుని గమనం ఆధారంగా సౌరమానం, చంద్రుడి గమనం ఆధారంగా చాంద్రమానం వాడుకలో ఉన్నాయి. చాంద్రమానం ప్రకారం తెలుగు నెలల్లో చివరిదైన ఫాల్గుణ మాసం పూర్తయ్యాక తిరిగి చైత్రమాసం మొదలవుతుంది. ఆ తొలిరోజునే 'ఉగాది'గా పరిగణిస్తారు. అంటే ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది జనవరి 1తో మొదలైతే, మన తెలుగు క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది ఉగాదితో ఆరంభమవుతుందన్నమాట.

పురాణాల ప్రకారం చూస్తే బ్రహ్మదేవుడు ఇదే రోజున విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు. యుగానికి ఆది యుగాది అయితే, వాడుకలో అదే ఉగాదిగా మారిందని చెపుతారు. ఈ రోజుతోనే వసంత రుతువు మొదలవుతుంది.

ఉగాది పుట్టుక వెనుక మరో ఆసక్తికరమైన పురాణ కథ కూడా ఉంది. విష్ణుమూర్తి నాభిలోంచి పెరిగిన కమలం నుంచి బ్రహ్మ పుట్టాడు. సృష్టిబాధ్యత స్వీకరించిన బ్రహ్మ తనతో పాటు నిత్యం ఉండమని విష్ణువును కోరాడు. అప్పుడు విష్ణువు పాలకడలిలో శేషతల్పంపై పడుకున్నట్టున్న తన విగ్రహాన్ని బ్రహ్మకు ఇస్తాడు. ఇదే మొదటి దేవుని విగ్రహమని అంటారు. దాన్ని ఆరాధిస్తూ సృష్టి పూర్తి చేసిన బ్రహ్మ, ఆతర్వాత దాన్ని సూర్యుని కోరిక మేరకు అతనికి ఇచ్చాడు. సూర్యుడు తన కొడుకైన మనువుకు, మనువు తన కొడుకైన ఇక్ష్వాకుడికి ఇచ్చారు. అదే వంశంలో పుట్టిన శ్రీరాముడు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించాడు. ఆపై విభీషణుడి కోరికపై రాముడు దాన్ని ఇచ్చాడు. అయితే లంకకు తీసుకెళ్లే దారిలో విభీషణుడు దాన్ని పొరపాటున నేలపై ఉంచడంతో అది అక్కడే పాతుకుపోతుంది. ఆ ప్రదేశమే తమిళనాడులోని శ్రీరంగం అనీ, ఆ విగ్రహమే శ్రీరంగనాథస్వామి అని చెబుతారు. ఆ సంఘటన కూడా ఉగాదినాడే సంభవించిందంటారు.
 ఉగాదిని మనతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, సింధీ ప్రజలు చేసుకుంటారు. మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వా అని, మణిపూర్‌లో సాజిబు చేరోబా అని, సింధీ ప్రజలు చేత చాంద్ అని పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది పచ్చడిని బేవు-బెల్లా అంటారు.
చి ఉగాది రోజు అమ్మ ఆరు రుచులతో కూడిన పచ్చడి చేస్తుంది కదా? దానర్థం ఏమటంటే జీవితంలో సుఖ, సంతోషాలు, కష్టనష్టాలను సమానంగా స్వీకరించాలనేదే! ఆరు రుచుల్లో తీపి సంతోషానికి, చేదు బాధకి, కారం కోపానికి, ఉప్పు భయానికి, పులుపు చిరాకుకు, వగరు ఆశ్చర్యానికి గుర్తుగా భావిస్తారు. 

(ఈనాడు, ౨౩:౦౩:౨౦౧౨ ) 
____________________

Labels: ,