My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Friday, October 02, 2009

Had Columbus been married..............

If Columbus had been married he might have never discovered America.

Reasons:
"Where are you going"?
"With Whom"?
"When will you return"?
"To discover what"?
"Why only you"?
"What do I do, when you are not here?
"Why can't I come along"?
"I will wait for you at Dinner "
Most importantly: "Mere liye kya laoge"? (What will you get for me?)

(An email forward)
__________________________________

Labels:

గాంధీ తాత కథలో ఆణిముత్యాలు!

రోజు గాంధీ జయంతి అని తెలుసుగా.. సందర్భంగా ఆయన ఆత్మకథలోని కొన్ని అంశాలను ఆయన మాటల్లోనే చదువుకుని, వాటిలోంచిమనమేం నేర్చుకోవాలో తెలుసుకుందామా?

* ''మా బంధువు ఒకతని మాటలు విని నాకు సిగరెట్టు తాగాలనే కోరికకలిగింది. కానీ మా దగ్గర డబ్బుల్లేవు. పదమూడేళ్ల వయసులో మొదటిసారిగాసిగరెట్ల కోసం నౌకర్ల వద్ద నుంచి డబ్బులు దొంగిలించాను. తర్వాత నాపదిహేనో ఏట మా అన్నతో కలిసి మరో పెద్ద దొంగతనం చేశాను. మా అన్న 20 రూపాయలు అప్పుబడ్డాడు. అది తీర్చడానికి అన్న చేతికి ఉన్న బంగారుమురుగు నుంచి ఒక తులం ముక్క తీయించి అప్పు తీర్చాం. కానీ పని నాకునచ్చలేదు. చేసిన దోషాన్ని అంగీకరిస్తేననే బుద్ధి వస్తుందని భావించాను. విషయం నాన్నకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఒక చీటీ మీద చేసినతప్పంతా రాసి క్షమించమని ఆయనకు అందించాను''
ఏం నేర్చుకోవాలి: చేసిన తప్పును అంగీకరించే నిజాయితీని అలవర్చుకోవాలి. దాన్ని కప్పిపుచ్చుకోడానికిచూడకూడదు.

* ''హైస్కూల్లో నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. దాంట్లో ఒకడిలో కొన్ని దురలవాట్లు ఉన్నాయి. ఇది నచ్చని నామరో మిత్రుడు నా స్నేహాన్ని వదిలేశాడు. అమ్మా అన్నయ్యలు కూడా అతనితో స్నేహం వద్దని చెప్పారు. 'మీరు చెప్పినదోషాలు అతనిలో ఉన్నమాట నిజమే. దురలవాట్లను నేనంటించుకోను. అతన్నే మంచివాడిగా తీర్చిదిద్దుతాను' అనివాళ్లను సమాధానపరిచాను. కానీ అతడు తన బుద్ధి పోనిచ్చుకోలేదు. అతనితో స్నేహం చేయడం నాదే పొరబాటనితర్వాత నాకు తెలిసింది. ఇతరుల్ని మంచిమార్గంలో పెట్టడానికి మరీ లోతుకు పోకూడదని గ్రహించాను. ఎవరితోనూ అతిస్నేహం పనికిరాదు. అందరితో చెలిమిగా ఉండడమే మంచి లక్షణం''
ఏం నేర్చుకోవాలి:చెడు అలవాట్లు ఉన్న స్నేహితులను గమనించుకుని వారికి దూరంగా ఉండాలి.

* ''నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు పాఠ్యవిషయాలను ఎక్కువగా ఇంగ్లిషులో చెప్పేవారు. రేఖాగణితం నాకు కొత్త. దాన్ని ఇంగ్లిషులో చెప్పడం వల్ల అది నాకు గుదిబండ అయింది. బాగా కష్టపడి చదవడం ప్రారంభించాను. దాంతో అదినాకు సులభంగా బోధపడిపోయింది. తగిన కృషి చేస్తే విషయమైనా తప్పక అర్థమవుతుంది. అప్పటి నుంచిరేఖాగణితంపై నాకు అభిరుచి పెరిగింది''
ఏం నేర్చుకోవాలి: పాఠ్యాంశమైనా అర్థం కాకపోతే దాన్ని మరింత పట్టుదలతో చదివితే అది సులువుగామారిపోతుందని గ్రహించాలి.

* ''ఒక పొరపాటు వల్ల కలిగిన ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను. చదువుకునేప్పుడు అందంగా రాయాల్సిన అవసరంలేదనే తప్పు అభిప్రాయం నాలో కలిగింది. తర్వాత అది తప్పని గ్రహించాను. వంకర టింకర అక్షరాలు అసంపూర్ణవిద్యకు చిహ్నమని నాకు అనిపించింది. నన్ను చూసి ప్రతి బాలుడు, బాలిక జాగ్రత్తపడాలని కోరుతున్నాను. మంచిదస్తూరి విద్యలో భాగమని అందరూ గుర్తించాలి''
ఏం నేర్చుకోవాలి: చిన్నప్పటి నుంచే చక్కని దస్తూరిని అలవర్చుకోవాలి.

(గాంధీజీ ఆత్మకథ 'సత్యశోధన'లో ఇలాంటి స్ఫూర్తిదాయకమైన అంశాలెన్నో ఉన్నాయి. మీరంతా తప్పక చదువుతారు కదూ!)
(ఈనాడు, హాయ్! బుజ్జీ!!, ౦౨:౧౦:౨౦౦౯)
__________________________________

Labels:

పాపం గాంధీ!

- శంకరనారాయణ



ఏ పాపం చేయని మహాత్ముణ్ని అన్యాయంగా అలా అంటావేమిటి? అనడానికి వీల్లేదు!
'పాపం చేస్తే పశ్చాత్తాపపడవచ్చు... పాపం చేయకపోతే తరవాత పశ్చాత్తాపపడీ ప్రయోజనం లేదు' అని వెనకటికి కవి పఠాభి నొక్కి వక్కాణించాడు. అయ్యో! పాపం గాంధీ! జాతిపిత కష్టాలు జాతిపితవి. ఇప్పుడు ఆయన్ను తలచుకునేదెవరు, తలచుకోవడానికి మటుకు ఆయన 'చేసింది' ఏముంది? (ఎప్పుడూ) పదవిలోనూ లేనివాణ్ని పెదవి పలకరిస్తుంది? ఎందుకు అభిమానం చిలకరిస్తుంది?

'పదవిలేని పాడుబతుకు పగవాడిక్కూడా వద్దు' అని ఊరకే అన్నారా?

మరణానంతరం కూడా తన ఉనికిని తానే కాపాడుకోవాలి. అటువంటివారినే 'కీర్తిశేషులు' అంటారు. పదవీ దీపం ఉండగానే వారసుల్ని చక్కబెట్టుకోవాలి. ఎవరి వారసుల్ని వారే తయారు చేసుకోకపోతే ఇంకెవరికి అవసరం! అది తెలియని గాంధీని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? 'దేశమును ప్రేమించుమన్నా' అంటే ఏం లాభం? సొంతలాభం మాత్రమే గుర్తుపెట్టుకుని 'కోశమును ప్రేమించుమన్నా... ఆస్తిపాస్తులు పెంచుమన్నా' అనుకుని ఉంటే ఎంత బాగుండేది? బినామీ పేర్లతోనైనా నాలుగు రాళ్లు వెనకేసుకుని ఉంటే వారసులు అయినా గుర్తుపెట్టుకుంటారని తాజా రాజకీయ 'అపేక్ష' సిద్ధాంతం గట్టిగా చెబుతోంది. అన్నట్టు సాపేక్ష సిద్ధాంతం ప్రవచించిన ఆల్బర్ట్ఐన్స్టీన్‌, బాపూజీ గురించి ఆణిముత్యాల్లాంటి మాటలన్నారు. 'మహాత్మాగాంధీ వంటి వ్యక్తి భూమ్మీద ఒకప్పుడు ఉండేవారంటే భావితరాలకు నమ్మశక్యం కాకపోవచ్చు' అని ఆయన చెప్పారు. ఇది ఇంకో రకంగా నిజమైంది. ఎటొచ్చీ మరీ తొందరగా నిజమైంది. ఇప్పటి బుడతళ్లకు గాంధీ అంటే మహాత్మాగాంధీ తప్ప ఇతర గాంధీల పేర్లన్నీ గుక్కతిప్పుకోకుండా చెప్పగలుగుతున్నారు! మన నాయకులకే గుర్తులేనప్పుడు ఆ అర్భకులను అని ఏం ప్రయోజనం? ఏ మాటకామాటే చెప్పాలంటే- గాంధీ జయంతికి సెలవు ఇస్తూ ప్రభుత్వం కొంతలోకొంత మంచిపని చేస్తోంది. లేకపోతే ఏడాదికి ఒకసారైనా గాంధీజీని తలచుకునే అవసరం ఏముంది? ఆ మాటకొస్తే గాంధేయులమని చెప్పుకొనే వాళ్లకూ ఆ అవసరం లేదు.

స్వాతంత్య్ర సమరకాలంలో 'కల్లు మానండోయ్బాబూ కళ్లు తెరవండోయ్‌' అనేది గాంధీజీ ప్రబోధంగా ఉండేది. ఆ రోజుల్లో ఇది అందరికీ ప్రమోదంగా ఉండేది. ఇప్పుడలా కాదు. 'మందు కొట్టండోయ్బాబూ కళ్లు మూయండోయ్‌' అనేది తాజా నినాదం! మద్యం పద్యం కాకుండాపోయింది. ఇదే 'మనసారా' విధాన 'సారా'ంశమైంది. తాగితే తప్పేముంది అనేవాళ్లూ బడాబడా నాయకులవుతున్నారు! ఐన్స్టీన్ను మరిచిపోవచ్చుగానీ- ఇటువంటి 'వైన్‌'స్టీన్లను ఎవరు మరిచిపోతారు? 'స్వైన్‌'ఫ్లూ తిక్కకుదిర్చే మందు ఉంటుందిగానీ- 'వైన్ఫ్లూ' తగ్గించే మందెక్కడుంది? 'మందు'కు మందు కనిపెట్టే మహానుభావుడెక్కడుంటాడు?

గాంధీజీ తన బాల్యంలో 'సత్యహరిశ్చంద్ర' నాటకం చూసి మారిపోయాడంటారు! అదేం గొప్ప- ఇప్పటి నాయకుల్లో అనేకమంది మీద కూడా హరిశ్చంద్రుడి ప్రభావం ఇంకా ఎక్కువ ఉంది. సత్యహరిశ్చంద్రుడిలా నిజం చెబితే తమ బతుకూ బస్టాండే అనుకుంటున్నారు. అందువల్ల చచ్చినా 'నిజం' చెప్పకూడదని తమ మీద తాము ఒట్టు వేసుకుంటున్నారు. వెయ్యి అబద్ధాలు ఆడి అయినా లక్ష ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు! పోతన ఇప్పుడు ఉంటే- 'వారిజాక్షులందు వైవాహికములందు' అనే పద్యంలో ఎన్నికలందు అనీ చేర్చి 'పాప విముక్తి'కి మార్గం చెప్పేవారు! సత్యంవద ధర్మంచర అనేది సత్యం'వధ', ధర్మం'చెర'గా మారిపోయింది. అన్నట్టు గాంధీజీ తాను జైలుకు వెళ్లి, ఎంతోమంది 'కృష్ణ జన్మస్థానం' వెళ్లడానికి కారకులయ్యారు! దానివల్ల ఆయనకూ, వాళ్లకూ మంచి పేరు ప్రతిష్ఠలు వచ్చాయి. అలా పేరు ప్రతిష్ఠలు వస్తుంటే జైలుకు వెళ్లడంలో తప్పేం ఉంది? గొప్పేం ఉంది? 'త్యాగం' ఏముంది? ఆయన 'పేరు' చెప్పుకొని 'ఓట్లు' (ప్రజాస్వామ్యం అనే చెట్టు కాయలు) కొంటున్నవారు అనేకమంది నానా కుంభకోణాలకు పాల్పడి పేరు పోగొట్టుకుని అప్రతిష్ఠపాలైనా సరే జైళ్లను 'పావనం' చేస్తున్నారు! ఇంతకన్నా 'త్యాగం' ఏముంటుంది, 'ధనకార్యం' ఏముంటుంది? మానాభిమానంబులు దేహంబునకే కాని, ఆత్మకు అంటనేరవని వెనకటికి ఓ మహారచయిత రచనలో ఉంది!

గాంధీ టోపీ అంటే అందరికీ తెలుసు. దానికి దేశమంతా ఎంతో ప్రచారం. ప్రస్తుత నాయకుల్లో ఎవరో తప్ప అందరూ ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఇతరులకు టోపీ పెడుతున్నారు! ఔరంగజేబు చక్రవర్తి టోపీలు కుట్టి తన జీవనం సాగించాడంటారు. అతగాణ్ని తలచుకుంటేనే జాలి కలుగుతోంది. టోపీలు కుట్టి సంపాదిస్తే మూలకొస్తుంది? టోపీలు పెట్టి తమ (ప్రజా) జీవనం సాగిస్తున్న గాంధీ వారసులు పుట్టుకొచ్చేశారు!

గాంధీజీ ఆదర్శాలు ఎక్కడికీ పోలేదు. ఆయన్ను తెల్లప్రభువులు అర్ధనగ్న ఫకీర్‌ అని ఎగతాళి చేశారు. తనను తాను 'దరిద్రనారాయణుడి ప్రతినిధి' నని గాంధీజీ చెప్పుకొనేవారు. అందువల్ల ఆయన 'వారస నాయకులు' దరిద్రనారాయణులను పెంచే పనిలో తలమునకలయ్యారు. గాంధీ జీవితాంతం విలువల రాజకీయాలకు కట్టుబడ్డారు. ఆయన వారసులు దాని 'అర్థం' మార్చేశారు. ఎంతో కొంత 'వెల' ముట్టచెప్పనిదే ఏ పనీ అడుగు ముందుకు కదలదు! చివరికి దేవుడి 'కోవెల'లో అయినా సరే...

రామరాజ్యం అని బాపూజీ కలవరించారు! ఆయన వారసులు 'సంగ్రామరాజ్యం' సాధించారు. ఆయన పుట్టిన రాష్ట్రంలోనే మతానికి మతానికి మధ్య చిచ్చుపుట్టి జనం సతమతమయ్యారు.

గాంధీజీ ఖద్దరు దుస్తులు ధరించాలని చెప్పేవారు. ఖైదీ దుస్తులైనా ధరిస్తాం తప్ప ఖాదీ దుస్తులు ధరించడం తమవల్ల కాదనే వాళ్లూ కనిపిస్తున్నారు!

గాంధీ స్వర్గస్థులయ్యాక 'బరి'స్థితులు మారి 'గాంధీపుట్టిన దేశమా ఇది' అని అందరూ కలవరపడ్డారు. ఆయన మళ్లీ పుడితే 'నేను పుట్టిన దేశమేనా ఇది' అని అనుమానపడవచ్చు. బాధపడవచ్చు! ఆ పాపం ఎందరికో అంటుతుంది. అందువల్ల బాపూ! మళ్లీ పుట్టకు!!
(ఈనాడు, ౦౨:౧౦:౨౦౦౯)
_____________________________

Labels: ,

విశ్వవ్యాప్త దీప్తి


కొందరికి వ్యూహకర్తలా...మరికొందరికి దేవదూతలా.. ఇంకొందరికి విప్లవవీరుడిలా... తత్వవేత్తలా...మార్గదర్శకుడిలా... ఎందరెందరికో ఆదర్శప్రాయుడిలా...ఇలా విభిన్నరూపాలతో... విభిన్న ముద్ర వేశాడు మహాత్మా గాంధీ. ఆయన భారత స్వాతంత్య్ర సాధకుడే కాదు... ప్రపంచాన్ని మేలుకొలిపిన నవయుగ వైతాళికుడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొన్న ప్రముఖులు ఎందరో.


ఓ మహాత్మా ఓ మహార్షీ
ఏది చీకటి ఏది వెలుతురు
.....
ఏది పుణ్యం ఏది పాపం
.....
ఏది సత్యం ఏదసత్యం
.....
ఏది తెలుపు ఏది నలుపు
ఏది నాది ఏది నీది
ఏది నీతి ఏది నేతి
నిన్న స్వప్నం నేటి సత్యం
.....
ఒకే కాంతి ఒకే శాంతి
ఓ మహర్షి ఓ మహాత్మా

మహాత్ముడు నేలకొరిగిన వార్త విని మహాకవి శ్రీశ్రీలో పెల్లుబికిన తాత్విక కవితా ధార సజీవ నదిలా మన హృదయాల్లో ప్రవహిస్తూనే ఉంది. మహాత్ముడి జీవితాన్ని, ఆలోచనలనూ, ఆచరణనూ తరచి చూసే కొద్దీ ఎన్నెన్నో సార్వజనీన సత్యాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆ మహనీయుని జయంతి రోజున వాటిల్లో కొన్నైనా ఆచరిద్దాం. మనలో మాలిన్యాలను కడిగేసుకుందాం!

''ప్రజాస్వామ్యవ్యవస్థలో రెండు ప్రధాన సూత్రాలు ప్రాణవాయువులా ఇమిడిఉన్నాయి. ఇందులో ఒకటి మెజారిటీవ్యక్తుల ఆధిపత్యమైతే...మరొకటి వ్యక్తిగౌరవం, సమష్టి హక్కులు...స్వేచ్ఛలకు సంబంధించిన అంశం. ఒకవేళ ఈ రెండు కీలకాంశాలమధ్య ఏదో ఒకదానిని ఎంచుకోవలసి వస్తే... నేను రెండోఅంశం వైపే బలంగా నిలబడతాను''

చర్చిల్కు అలా కనిపించాడు మరి...
'రాచపుండులాంటి వ్యక్తి'.. అంటూ చర్చిల్‌లాంటివాళ్లు తిట్టిపోస్తే... అత్యంత సంప్రదాయవాదులైన యూరోపియన్‌ క్రిస్టియన్లు కొందరు ఆయనను దైవ కుమారుడైన క్రీస్తుతో పోల్చడం గమనార్హం. 1926-1931 మధ్యకాలంలో భారత్‌కు వైస్రాయ్‌గా వచ్చిన లార్డ్‌ఇర్విన్‌ మహాత్ముడిలో ఓ మహోన్నతుడిని చూశారు. ఇర్విన్‌లో బలీయంగా పెరిగిన ఈ ఉదాత్త భావన గాంధీజీని అరెస్టు చేయించలేకపోయింది. అందుకే దండి ఉప్పుసత్యాహ్రం నిర్విఘ్నంగా ముందుకు సాగింది.

రొమెయిన్రోలండ్కు తాత్వికుడిలా...
చాలా మంది పాశ్చాత్యులకు మన మోహన్‌దాస్‌ ఓ పెద్దప్రశ్న. మెజారిటీ ప్రజలు ఆయనలో ఓ ఆధ్మాత్మిక మూర్తిని చూసుకున్నారు. 1924లో ప్రచురితమైన గాంధీ జీవిత చరిత్రల్లో రొమెయిన్‌ రోలండ్‌ రాసిన 'మహాత్మాగాంధీ ది మ్యాన్‌ హూ బికేమ్‌ వన్‌ విద్‌ ద యూనివర్సల్‌ బీయింగ్‌' ఆయనలోని మహారుషిని కళ్లకు కడుతుంది. 'గాంధీజీ ఆశీస్సులు పొందడం నాకో గొప్పఅనుభూతి. సాక్షాత్తూ మా మత గురువులు సెయింట్‌ డొమినిక్‌...సెయింట్‌ ఫ్రాన్సిస్‌లు నన్ను ఆప్యాయంగా ముద్దాడిన భక్తిభావన కలిగింది'.. అని తన స్మృతుల్లో రాసుకున్నారు.

ఫ్రెంచ్రాజకీయాల్లో సత్యాగ్రహం
1937లో మహాత్ముడిని వార్ధా ఆశ్రమంలో కలుసుకున్న సిసిలీకి చెందిన సంపన్నుడు జోసెఫ్‌ జీన్‌లాన్‌ డెల్‌వాస్టో.... ఆ చిన్ని కుఠీరంలో... ఆ మట్టినేలమీద.. అత్యంతనిరాడంబరంగా గాంధీజీ నీడలో నిలిచిపోవాలనిపించింది అని రాసుకున్నాడు. ఆ తర్వాత 1957లో డెల్‌వాస్టో అల్జీరియన్లపై ఫ్రాన్స్‌ దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ.. ఏకంగా 20రోజుల పాటు నిరశన దీక్ష చేపట్టాడు.

మదిదోచిన కొల్లాయి...
గాంధీ వస్త్రధారణ ఈశాన్య ఇంగ్లండ్‌లోని కార్మిక సోదరుల మది దోచింది. సన్నటి వైరు ఫ్రేము కళ్లద్దాలు.. బక్క చిక్కిన శరీరం... దానిపై ముతకకొల్లాయి వస్త్రాలు.. ఇలా మహాత్ముడి రూపం ముద్రించుకుపోయింది వారిమనసులో. అక్కడ నిర్వహించిన ఫ్యాన్సీడ్రెస్‌ పోటీలో బాపూజీ వస్త్రధారణలో జనాన్ని మంత్రముగ్ధులను చేసిన గోర్డీ స్కిన్నర్‌ను చరిత్ర మరచిపోదు. ప్రథమ బహుమతి గోర్డీబృందానికే లభించింది

అమెరికా నుంచి బాపూజీని వెతుక్కుంటూ...
1920లో అమెరికాలో కార్మికోద్యమాన్ని మహోధృతంగా నడిపిన రిచర్డ్‌ గ్రెగ్‌ అనే న్యాయవాది మహాత్ముడికి ఏకలవ్య శిష్యుడని చెప్పవచ్చు. గాంధీ అహింసా ఉద్యమాన్ని చూసి ముగ్ధుడైన ఆయన భారత్‌కొచ్చి... అహింసావాదిగా పరివర్తన చెంది వెళ్లిపోయిన వైనం చరిత్ర మరవని సత్యం.

మాకు గాంధీ కావాలి: ఆఫ్రో అమెరికన్లు
అమెరికాలోని ఆఫ్రోఅమెరికన్లు 1920 నుంచి కూడా గాంధీజీపై అంతులేని ప్రేమను పెంచుకున్నారు. ఆయన రచనలను ప్రేమగా ప్రచురించుకున్నారు. మార్కస్‌గార్వీ...డబ్ల్యు.ఇ.బి. డ్యుబోయిస్‌ తదితరులు వీరిలో ముఖ్యులు. 1936లో హోవార్డ్‌ థుర్మన్‌ అనే బాప్టిస్ట్‌ మంత్రి సారథ్యంలో ఆఫ్రోఅమెరికన్ల ప్రతినిధి బృందం ప్రత్యేకంగా భారత్‌ను సందర్శించింది. గాంధీని కలుసుకోవాలన్న కలను నెరవేర్చుకుందీ బృందం. 'మీరు మాకు కావాలి. శ్వేతజాతి అమెరికన్‌ల కోసం కాదు...నల్లజాతీ నీగ్రోల సమస్యల పరిష్కారాలకు మీరుకావాలి. అందుకే, మీరు రావాలి' అంటూ థుర్మన్‌బృందం ఆయను బతిమలాడింది.

అణ్వాయుధ వ్యతిరేకోద్యమం..
హిరోషిమా...నాగసాకిని సర్వనాశనం చేసిన అణుబాంబుదాడిని గాంధీజీ తీవ్రంగా ఖండించారు. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన అణ్వాయుధవ్యతిరేక ఉద్యమాల్లో గాంధీజీ స్పూర్తే అంతర్లీనంగా నిలిచింది. జర్మనీలోనూ ఇదే స్ఫూర్తితో సంతకాల సేకరణలు పెనుఉద్యమాలయ్యాయి. పాలకులను కదిలించాయి.ఇవన్నీ కూడా అహింసాయుతంగా సాగిన ఉద్యమాలే.

మార్టిన్లూథర్కింగ్కు స్ఫూర్తి
మార్టిన్‌ లూథర్‌కింగ్‌ సీనియర్‌ 1936లో ఓటుహక్కు డిమాండ్‌ చేస్తూ నిర్వహించిన ప్రదర్శన చరిత్రలో ఓ కీలక ఘట్టం. ఇక, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ జూనియర్‌ మహాత్ముడిపై ఓ ప్రముఖుడిచ్చిన ఉపన్యాసానికి వెళ్లి ముగ్ధుడైపోయాడు. వెంటనే వెళ్లి గాంధీజీపై ప్రచురితమైన ఎన్నో పుస్తకాలను కొనుక్కుని ఆమూలాగ్రం చదివేశాడట. ఆయన తననెంత ప్రభావితం చేసిందీ ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించాడు కూడా.

ఇలా చెప్పుకుంటూ పోతే...చరిత్రంతా మహాత్ముడి పాదముద్రలే కనిపిస్తాయి. ఆయన అహింసాపోరాట స్ఫూర్తే సాక్షాత్కరిస్తుంది. ఆయనలోని ఒక్కో కోణం ఒక్కోకాంతిపుంజమై ... ఎందరినో ముందుకునడిపించింది. మరెందరికో కరదీపికైంది. చరిత్రచెప్పే ఈ పాఠాలు భావితరాలకు మేలుబాటకావాలి. గాంధీజీ ఆశయజ్యోతి దేదీప్యమానంగా ప్రజ్వరిల్లాలి.


''మనసులో అయిష్టంగా ఉన్నా బయటకు 'సరే' అని చెప్పేకంటే మొహమాటం లేకుండా 'నో' అని చెప్పడం మేలు''

''ఇచ్చిపుచ్చుకోవడం అంటేనే రాజీపడటం. మౌలిక సిద్ధాంతాలు బలంగా ఉన్నపుడు ఇచ్చిపుచ్చుకోవడాల ప్రశ్నే రాదు. మౌలిక విషయాల్లో రాజీపడటం అంటే దాసోహం అనడమే!''

''దేవుడి ముందు- నువ్వు చేసిన పనులను బట్టి కాకుండా నీ హృదయాన్ని బట్టే అంతిమ తీర్పు ఉంటుంది. దేవుడికి నీ హృదయం తెలుసు!!''

- న్యూస్‌టుడే ప్రత్యేక విభాగం
(ఈనాడు, ౦౨:౧౦:౨౦౦౯)
__________________________________

Labels:

Thursday, October 01, 2009

చైనాకు 60 ఏళ్లు


1949 అక్టోబర్‌ 1న విదేశీ దురాక్రమణశక్తుల నుంచి, స్థానిక భూస్వామ్య పాలకుల నుంచీ విముక్తిని సాధించిన చైనాకు నేటితో 60 ఏళ్లు నిండాయి. ఈ ఆరు దశాబ్దాల కాలంలో చైనా అనేక మలుపులు చూసింది. సోషలిస్టు దేశంగా ఆసియాఖండంలోని దేశదేశాల విప్లవకారులకు స్ఫూర్తినిచ్చిన జనచైనా నేడు ప్రభుత్వ కఠిన నియంత్రణలో ఉన్న బలమైన మార్కెట్‌ శక్తిగా పరిణామం చెందింది. ఆధునిక పోకడలకు అనుగుణంగా దూసుకెళ్తూ.. అగ్రరాజ్యాలకు ధీటుగా పోటీనిస్తూ.. చైనా వస్తువులు కనిపించని నేలంటూ లేని పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో చైనా పరిస్థితులను ఒకసారి అవలోకిస్తే...

విద్యారంగం


1949కిముందు చైనా జనాభా 54 కోట్లు. వారిలో 80 శాతం ప్రజలు నిరక్షరాస్యులే. అయితే, 1949లో విముక్తి సాధించిన తర్వాత జనచైనా ప్రభుత్వం ప్రజల్లో అక్షరజ్ఞానం పెంపొందించటానికి చాలా ప్రాధాన్యమిచ్చింది. దీనివల్ల ప్రస్తుతం ఆ దేశంలో అక్షరాస్యత 90.8 శాతానికి చేరుకుంది. ఏటా ఆ దేశంలో 4,50,000 మంది ఇంజినీరింగ్‌, 50 వేల మంది పీజీ, 8 వేల మంది పీహెచ్‌డీ పూర్తి చేస్తున్నారు.

పరిశ్రమలు


విముక్తికి ముందు చైనాలో వ్యవసాయమే తప్ప పరిశ్రమలు అరకొరగా తప్ప లేవు. అలాంటి దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగింది. కొనుగోలుశక్తి పరంగా చూస్తే రెండో స్థానంలో నిలుస్తోంది. దీనికి కారణం, నిశితమైన ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని వాటిని పరిపూర్తి చేయటం. మొదటి పంచవర్ష ప్రణాళిక (1953-57) ద్వారా దేశంలో మౌలిక పరిశ్రమలను ఏర్పాటు చేశారు. 1956 నుంచి 1966 మధ్య పారిశ్రామిక ఉత్పత్తి నాలుగురెట్లు పెరిగింది. జాతీయాదాయం 58 శాతం పెరిగింది.

మలుపుతిప్పిన సంస్కరణలు
1978లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి మార్కెట్‌ ఆధారిత విధానాలను అమలు చేయటం మొదలుపెట్టిన నాటి నుంచీ చైనాలో కీలకమైన మార్పులు రూపుదిద్దుకున్నాయి. అంతవరకూ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న చైనా ఆర్థికవ్యవస్థలోకి ప్రైవేటు దేశీయ కంపెనీలు, కొన్నాళ్ల తర్వాత వాటికి పోటీగా విదేశీ కంపెనీలు చొచ్చుకొచ్చాయి. అప్పటికే మౌలికరంగాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసుకున్న చైనా.. వినియోగ, సేవా రంగాలపై దృష్టి సారించి విప్లవం సృష్టించింది. తనకున్న చవకైన శ్రమశక్తిని ఆధారంగా చేసుకొని మొబైల్‌ఫోన్లు, ఆటవస్తువులు, క్రీడాపరికరాలు... వంటి రంగాల్లో ప్రప్రంచవ్యాప్తంగా విస్తరించింది.

సైన్యం


ప్రపంచంలోనే అతిపెద్ద సైనికబలం చైనా సొంతం. దాదాపు 30 లక్షల సైనికులు చైనా సైన్యంలో ఉన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ పురుషుడూ సైనిక శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు కూడా సైనిక అనుంబంధ కార్యకలాపాల్లో కొంతకాలంపాటు సేవలు అందించాలి.

క్రీడలు


చైనాలో ప్రాచీనకాలం నుంచీ పోరాటవిద్యలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈనేపథ్యంలోనే ఆ దేశంలో క్రీడలకు, శారీక ఆరోగ్యానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించింది. ఒలింపిక్స్‌లో ఆ దేశం ఎప్పటికప్పుడు తన సత్తాను చాటుకుంటూనే వచ్చింది. అయితే, 1994 నుంచీ ప్రభుత్వ నియంత్రణ తగ్గి ప్రైవేటు స్పాన్సర్‌షిప్‌లు మొదలుకావటంతో ఆటలు అక్కడొక వృత్తిగా స్థిరపడ్డాయి. గత ఏడాది బీజింగ్‌లో నభూతో అన్న రీతిలో నిర్వహించిన ఒలింపిక్స్‌ ద్వారా ప్రపంచానికి తన సామర్థ్యం ఏమిటో చైనా తెలియజెప్పింది.

అంతరిక్షంలో అద్భుతాలు


అగ్రరాజ్యాలకు ధీటుగా అంతరిక్ష రంగంలో చైనా ప్రయోగాలను చేపట్టింది. అనేక ఉపగ్రహాలను ప్రయోగించింది. మానవసహిత అంతరిక్ష యాత్రలను సైతం విజయవంతంగా జరిపింది. ప్రస్తుతం ఆ దేశం అంగారకుడు లక్ష్యంగా పరిశోధనలు జరుపుతోంది. 2014-33 మధ్యలో అరుణగ్రహంపై మానవరహిత ప్రయోగాలను జరపాలని ప్రణాళికను రచించుకొని ఆ దిశగా అడుగులు వేస్తోంది.

వైద్యం


చైనాలో వైద్యరంగం 1980 వరకూ బాగా అభివృద్ధిని సాధించింది. ఆ తర్వాత వైద్యసేవల ప్రైవేటీకరణ అనంతరం పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులొచ్చాయి. 'రోగుల వద్దకే వైద్యుడు' అనే అత్యంత ప్రాచుర్యం పొందిన విధానం రద్దయింది. మిగిలిన కొద్దిపాటి ప్రభుత్వ వైద్యసేవల్లో అవినీతి రాజ్యమేలింది. ఈపరిస్థితిని మార్చటానికి 2005లో ప్రభుత్వం నడుం కట్టింది.

కీలక ఘటనలు
* చైనా కమ్యూనిస్టు పార్టీ ఛైర్మన్‌ మావోసేటుంగ్‌ నాయకత్వంలో 1949 అక్టోబర్‌ 1న చైనా విముక్తి సాధించింది. దేశాధినేతగా మావో బాధ్యతలు స్వీకరించారు. సోషలిజం ఆర్థికవిధానాల ప్రాతిపదికన పాలన మొదలైంది.



* నాయకత్వంలో, చైనా సమాజంలో పాతకాలపు ధోరణులు అలాగే కొనసాగుతున్నాయని గ్రహించిన మావో 1966లో సాంస్కృతిక విప్లవాన్ని ప్రారంభించి.. తప్పులుగా కనిపించిన దేనినైనా విమర్శించమని ప్రజలకు పిలుపునిచ్చారు.

* 1976లో మావో మరణానంతరం డెంగ్‌జియావోపింగ్‌ సారథ్యంలో సాంస్కృతిక విప్లవం కాలం నాటి విధానాలను పక్కనబెట్టి ఆర్థికసంస్కరణలు ప్రారంభించారు.

* సోషలిస్టు చైనా క్రమంగా పెట్టుబడిదారీ విధానం వైపు అడుగులు వేస్తూ వచ్చింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వంలో, పార్టీలో పెట్టుబడి దారులకు కూడా అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
----------------------------------------------
జాతీయ దినోత్సవ సంబరాలు నేడు అష్ట దిగ్బంధంలో బీజింగ్‌
బీజింగ్‌: కమ్యూనిస్టు చైనా అవతరించి గురువారంతో 60 వసంతాలు పూర్తికానున్న సందర్భంగా ఆ దేశ రాజధాని బీజింగ్‌ ఎరుపు రంగు సంతరించుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ దినోత్సవ సంబరాలకు ముస్తాబవుతోంది. వేడుకలు జరిగే ప్రాంతాన్ని పూర్తిగా భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించాయి. బీజింగ్‌లోని ముఖ్యమైన కూడళ్లను దిగ్బంధించారు. తియాన్మెన్‌స్వేర్‌, ఫర్‌బిడెన్‌ సిటి, ఇతర చారిత్రక స్థలాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తనిఖీలను విస్తృతం చేశారు. గత ఒలింపిక్‌ పోటీలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలతో ముంచిన చైనా... జాతీయ దినోత్సవాన్ని సైతం అంతే భారీతనంతో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. చైనా తాజాగా రూపొందించిన క్షిపణులు, ఉపగ్రహాలు, అత్యాధునిక రాడార్లు, మానవ రహిత విమానాలు, ఆయుధ పాటవాన్ని వేడుకల్లో ప్రదర్శించి, తన సైనిక సత్తా చాటనుంది. అనంతరం దేశాధ్యక్షుడు హూ జింటావో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 10వేల మంది భద్రతా సిబ్బంది డేగకళ్లతో పహారా కాస్తున్నారు. మరో 8లక్షల మంది వాలంటీర్లు వారికి సహాయసహకారాలు అందిస్తున్నారు. చైనా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడి అధికారులతో భారత సైనికాధికారుల బృందం గురువారం బమ్లాలో స్నేహపూర్వకంగా భేటీ కానుంది.
(ఈనాడు, ౦౧:౧౦:౨౦౦౯)
____________________________

Labels: