My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Tuesday, June 13, 2017

2147~ పాటే వెన్నెల... పదమే ఊయల...

అమ్మ పాడే లాలి పాటలు.. అమ్మా అని బిడ్డ నోరారా పాడే పాటలు... అల్లరి వయసు విరహ గీతాలు.. ప్రేమికుల సరసాల సయ్యాటలు.. వ్యక్తిత్వానికి వన్నెలుదిద్దే నీతిపాఠాలు.. జీవిత సూత్రాల చద్దిమూటలు.. ఇలా తెలుగు సినీ సాహితీవనంలో సినారె వెదజల్లిన సౌరభాలెన్నో. ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాల్లా ఆ పాటలు శాశ్వతంగా నిలిచిపోతాయి.

‘అమ్మా అని నోరార పిలవరా.. ఆ పిలుపే అందరు నోచని వరమురా..’ అంటూ ‘మనుషులు మట్టిబొమ్మలు’లో బిడ్డల కోసం పరితపించే ప్రతి కన్నతల్లి ఆర్తిని అక్షరాల్లో ఆవిష్కరించారు. ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా..’ అంటూ అమ్మ అనే మాటకు సరికొత్త భాష్యం చెప్పారు ‘ప్రేమించు’ చిత్రంతో. తల్లి, చెల్లి, అర్ధాంగి, కూతురు... ఇలా మగవాడి కోసం తన జీవితం మొత్తం ధారబోస్తోంది మగువ. ఆ సత్యాన్ని ‘మాతృదేవత’లో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ..’తో చెప్పారు సినారె. ‘ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు.. సద్దుచేశారంటే ఉలికులికి పడతాడు..’ అంటూ చిన్ని కన్నయ్యలను అమ్మతో జోకొట్టించేశారు ‘జీవనజ్యోతి’లో.

అమ్మ గొప్పతనం గురించి చెప్పే క్రమంలో నాన్నను తక్కువ చేయలేదాయన. బిడ్డలను పూలతోటలో నడిపించేందుకు తాను ముళ్లబాటలో నడిచేందుకు సిద్ధమయ్యే తండ్రిని ‘ఓ నాన్నా నీ మనసే వెన్న.. అమృతం కన్న అది ఎంతో మిన్న..’ అని ‘ధర్మదాత’లో కీర్తించారు. ‘అనగనగా ఒక రాజు అనగనగా ఒకరాణి.. రాజు గుణము మిన్న.. రాణి మనసు వెన్న..’ అంటూ ‘ఆత్మబంధువు’తో పిల్లలకు విలువలు నేర్పించారు. ‘చదువురాని వాడివనీ దిగులు చెందకు.. మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు..’ అంటూ నిజమైన చదువంటే ఏంటో బోధించారు.

ఇలాంటి కన్నప్రేమ గీతాలే కాదు.. కన్నె ప్రణయగీతాల్లోనూ తన చమక్కు చూపించారు సినారె.
‘వగలరాణివి నీవే.. సొగసుకాడను నేనే..’ అని ‘బందిపోటు’తో పాడించి రాకుమారిని మేడ దింపారు. ‘పూజాఫలం’లో ‘పగలే వెన్నెల జగమే వూయల..’ అంటూ వూహాలోకంలో పరవశింపజేశారు. ‘తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజా నీ రూపు తెలిసిందిలే..’ అని ప్రేమ వూసుల ఆచూకీ చూపించారు ‘రాముడు భీముడు’లో. ‘ఛాంగురే బంగారు రాజా.. మజ్జారే మగరేడా.. మత్తైన వగకాడా..’ అంటూ ప్రియురాలి విరహ తాపాన్ని ‘శ్రీకృష్ణపాండవీయం’ లో కళ్లకుకట్టారు. ‘నువ్వలా ముందుంటే నిన్నలా చూస్తుంటే..’ అని ‘గూఢచారి 116’ పాడుకున్నా, ‘కోటలోని మొనగాడా వేటకు వచ్చావా..’ అంటూ ‘గోపాలుడు భూపాలుడు’లో పడుచు పిల్ల చిలిపిగా ఆరా తీసినా, ‘అమ్మమాట’లో ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు..’ అని కన్నెపిల్ల వాపోయినా, ‘ఎంతవారుగానీ వేదాంతులైనగానీ వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్‌..’ అని ‘భలే తమ్ముడు సెలవిచ్చినా, ‘చిట్టిచెల్లెలు’లోని ‘ఈ రేయి తీయనిది.. ఈ చిరుగాలి మనసైనది..’ అనే పాట ఇప్పటి ప్రేక్షకుల నోళ్లలోనూ నానుతున్నా.. అదంతా సినారె కలం మహత్యమే.

మెరిసే ముత్యాలు...: సినారె పాటల్లో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సూక్తులు, జీవిత సత్యాలూ ఉన్నాయి. ‘గాలికి కులమేదీ.. నేలకు కులమేదీ..’ అనే పాటతో మనుషులకెందుకు కులభేదమని ప్రశ్నిస్తారు ‘కర్ణ’ చిత్రంలో. ‘ఎవరికీ తలవంచకు.. ఎవరినీ యాచించకు..’ అని ఆత్మవిశ్వాసం నూరిపోస్తారు ‘నిండు సంసారం’లో.
‘మంచి మిత్రులు’లోని ‘ఎన్నాళ్లొ వేచిన ఉదయం..’ పాటలో మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని ధైర్యమిస్తాడు.
‘ఇదేనా మన సంప్రదాయమిదేనా..’ అంటూ ‘వరకట్నం’ దురాచారంపై ఎలుగెత్తి నిరసిస్తాడు.
‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవొద్దు..’ అని ‘కోడలు దిద్దిన కాపురం’లో గుర్తుచేశాడు.
‘రైతు కటుంబం’లో ‘ఈ మట్టిలోనే పుట్టాము.. ఈ మట్టిలోనే పెరిగాము..’ అంటూ మట్టితో రైతు అనుబంధాన్ని ఆవిష్కరించారు.

Labels: , , , ,

Monday, March 09, 2015

1888- రావి శాస్త్రి ఉవాచ

 




Labels: , ,

Friday, March 14, 2014

1368- Bapu- evolution in his signatures

_________________________________

Labels: , , , ,

Sunday, October 20, 2013

1275- తెలుగు జాతిరత్నం




శోకం- శ్లోకం పలికితే రామాయణం. ఆకలి- అక్షరాభ్యాసం చేస్తే తెలుగువారికొక జ్ఞానపీఠం! పనసపండు తన రహస్యాన్ని పరిమళం రూపంలో చెప్పినట్లుగా, రచయితలు తమ ఆకలిని అక్షరాల రూపంలో ఈ లోకానికి వివరిస్తారు. అక్షరాలతో ఆకలి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అక్షరాలతోనే ఆత్మారాముడు తృప్తిచెందినట్లు భావిస్తారు. అక్షరాలకు అంజలి ఘటిస్తారు. తమ నుంచి అక్షరాలను వెలువరిస్తోంది కనుక ఆకలినీ గౌరవిస్తారు. 'ఆకలి నా రచనలకు ప్రేరణ' అని సగౌరవంగా ప్రకటించడంలో రావూరి భరద్వాజ స్ఫురద్రూపిగా కనిపిస్తారు. ఆకలి ఆయనను జ్ఞానిని చేసి పై మెట్టుపై కూర్చోబెట్టింది. జ్ఞానపీఠాన్ని కట్టబెట్టింది. ఆకలిని గౌరవించడమంటే అట్టడుగు వర్గాన్ని గౌరవించడమే! అత్యున్నత జ్ఞానపీఠాన్ని అందుకున్నప్పుడు భరద్వాజ అదే చెప్పారు. 'నేను సామాన్యుణ్ని... గట్టిగా చెప్పాలంటే అంతకన్నా తక్కువవాణ్ని' అన్నారాయన. పిడికెడు మెతుకులకోసం ఆయన వ్యవసాయకూలీగా పనిచేశారు. పశువులు కాశారు. బొగ్గుపనిలో మాశారు. పేపర్లు వేశారు. కలప అడితిలో, కమ్మరి కొలిమిలో, పొగాకు కొట్టులో పనిచేశారు. ఆకలి అన్ని పనులూ నేర్పింది! ఏడో తరగతి మానేసిన కుర్రాణ్ని జీవితం చదువుకున్న గొప్ప విద్యావంతుణ్ని చేసింది. పదిహేడేళ్లకే రచయితను చేసింది. సాహిత్య అధ్యయనాన్నే విద్యాభ్యాసంగా మార్చింది. బతుకు పుస్తకాలను చదివించింది. రాయించింది. 'నాకు సంబంధించి నా జీవితానికి, రచనకు వైరుధ్యం లే'దని చెప్పిన రావూరి భరద్వాజ- సహస్ర వృత్తుల శ్రమజీవుల జీవన సమరాన్ని గుండెలకు హత్తుకొనేలా అక్షరీకరించిన ధన్యజీవి!

చూసినవారి గురించే రాశాడాయన. 'జీవనసమరం' దానికి గట్టి సాక్ష్యం. అందులో పాత్రలు అందరికీ పరిచయమైనవేగాని, వాటిని చిత్రించడం మాత్రం భరద్వాజకే సాధ్యం. అట్టడుగు వర్గమంటే సాంఘిక అసమానతలకు గుర్తు. అణచివేతకు, అవమానాలకు ఆలవాలం. ఆకలి దహిస్తుంటే... ఆక్రోశం, అణిచివేస్తుంటే- ఆందోళన సహజం. ఆ రెండూ అక్షరరూపం దాల్చినప్పుడు ఆ అక్షరాల్లోంచి మాడుతున్న పేగు వాసన ఉబికివస్తుంది. రావూరి రచనల్లోని జీవలక్షణం ఆ ఘాటువాసనే! సమాజంలోని అట్టడుగు జీవుల్ని సాహిత్యలోకపు అందలాలెక్కించిన భరద్వాజ రచనల్లో- రాగిణి, కొత్తచిగుళ్లు, కాదంబరి, నాలోని నీవు, అంతరంగిణి, ఐతరేయం, ఒకింత వేకువకోసం, పదహారు నెలలపాటు 'ఈనాడు' దినపత్రికలో ధారావాహికగా ఆకట్టుకున్న 'జీవనసమరం'... వంటివన్నీ ఒక ఎత్తు. ఆయనకు జ్ఞానపీఠాన్ని అందించిన 'పాకుడురాళ్లు' మరో ఎత్తు. అందులో రంగస్థల సహజ జీవి 'మంగమ్మ'- తళుకుబెళుకుల సినీతార 'మంజరి'గా తర్జుమా అయిన తీరు విషాద రమణీయం. అందులోని అక్షరాలు అంతరంగ లోతట్టు పొరల గవాక్షాలు. గుండెపొరల్లోంచి విచ్చుకున్నవి కాబట్టి, వాటి తడి మనకు తెలుస్తూనే ఉంటుంది. ఏ రచనకారచన ప్రత్యేక శైలితో, విభిన్న ధ్వనులతో, కాకువు విశేషంతో మనలను పలకరిస్తుంది. రచయితగా భరద్వాజ స్థాయిని నిరూపిస్తుంది. రావూరి జీవితానికి గట్టి ఓదార్పు అక్షరం. ఆయన జీవితానికి తీర్పు అక్షరం. అక్షరం ఆసరాతో మనసు తేలికపడ్డ ప్రతి రచయితలాగే- భరద్వాజ సైతం అక్షరానికి నివాళి అర్పించారు. అక్షరానికి జీవితాన్ని ముడుపుకట్టి దాని నీడన ఆశ్రయం పొందారు.

రావూరి జీవితానికి మరో చల్లని నీడ- ఆయన భార్య కాంతం! కాంతాన్ని- కాంతమ్మా అని పిలవడం భార్యగా ఆమె సాధించిన గొప్ప గౌరవం. 'భగవంతుడు కూడా నీ రూపంలో కనబడితే తప్ప నేనిప్పుడు గుర్తించలేను కాంతం' అన్న భరద్వాజ- 'నేనిప్పుడు నిరీహస్థితిలో ఉన్నా'నంటూ చేసిన అక్షరార్చన అజరామరం! ఆమె మరణం ఆయన చేత స్మృతికావ్యాలు రాయించింది. అక్షర నీరాజనాలు పలికించింది. మాడుతున్న పేగు వాసనలాగే మట్టి వాసన కూడా ఆయన సాహిత్య జీవలక్షణం. 'పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం నడిచివచ్చిన పాదాలకు కృతజ్ఞతలు... నా కోసం దారిచూపిన పాదాలకు కృతజ్ఞతలు... నన్ను అనుసరించిన పాదాలకు కృతజ్ఞతలు' అన్నాడొక కవి. రావూరి చితికట్టెల చిటపటలు కూడా బహుశా అవే మాటలను వినిపించి ఉంటాయి. మరింత నిశితంగా వినిఉంటే, ఆ చితిమంటల సవ్వడి నుంచి 'మంగమ్మ'కు కృతజ్ఞతలు...' అనీ తప్పక వినపడే ఉంటుంది. ఆమె 'మంజరి'గా మారకుంటే 'పాకుడురాళ్లు' నవలా లేదు, ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠమూ లేదు. జీవితంలో మేలుచేసిన ప్రతి సందర్భానికీ, ప్రతి వ్యక్తికీ, పదేపదే ధన్యవాదాలు చెప్పుకొన్న భరద్వాజ- తన చరమదశలో విశ్వనాథ, సినారెల సరసన చోటుకల్పించిన ఆ స్త్రీమూర్తికి తప్పక కృతజ్ఞతలు చెప్పినతరవాతే అనంతవాయువుల్లోకి ప్రయాణం సాగించి ఉంటారు. పల్చని దేహంతో, నెరిసిన గెడ్డంతో అచ్చతెనుగు రూపురేఖలతో ఆంధ్రదేశాన్ని అలరించిన రావూరి భరద్వాజ తన ఆరోప్రాణం దగ్గరికి పరుగెత్తిన పతి... మనకిక తీయని స్మృతి. తెలుగుజాతికి మరో జ్ఞానపీఠం దక్కడానికి అవసరమైన స్ఫూర్తి! 'ఆవిరి ఓడలో జలధియానమొనర్చు బాటసారులు'గా వర్ణించాడు- మనుషుల్ని మహాకవి జాషువా. ఎవరి రేవు రాగానే వారు దిగి వెళ్ళిపోతుంటారు. రావూరి భరద్వాజ దిగవలసిన రేవు వచ్చింది. ఆయన దిగి వెళ్ళిపోయాడు- నిశ్శబ్దంగా!

(ఈనాడు, 20:10:2013)
__________________________

Labels: , , ,

Wednesday, August 28, 2013

1263-The Telugu navala

My recent item on the early Tamil novel (Miscellany, August 12) had reader Saraswathi Rao wondering whether or not Sri Ranga Raja Charitra by Narahari Gopala Krishnamma Chetty was the first Telugu novel. No authority on the subject, I did some checking around and discovered that it had been written in 1872, was dedicated to Lord Mayo, and had been described by the Fort St. George Gazette as being “ apparently the first attempt ever made… at novel writing in Telugu prose.” The author was at the time the Deputy Collector of Kurnool District and undertook the work in response to a notice by Lord Mayo, the then Governor-General, that had appeared in the Bengal Gazette .
The notice had stated that a work of fiction featuring the customs and rituals of the Bengalis would be rewarded. Lord Mayo saw this as a means of getting the British administrators, who till then had only to learn the language, better acquainted with the customs of the people. Krishnamma Chetty decided to do this on behalf of the Telugu people of Madras Province. He called it a “navina prabandham”, emphasising that it was an original story — not a translation — and re-emphasising that it was ‘new’. Set in the 15th Century, it tells the story of Sri Ranga Raju of the Vijayanagar dynasty and describes the customs and rituals prevalent at the time. These customs have not changed at all, Chetty points out in criticism. Was this then an attempt to urge society to change as well as break caste taboos, wonders a later commentator.

What intrigued me in this commentary, however, was the use of the term navala , the word used in Telugu today, I’m told, for ‘novel’. Kasibhatta Brahmayya Sastry, a scholar, is quoted as saying, “In English, the word ‘novel’ has come out of ‘nav’ which means ‘new’. It is not clear that this ‘nav’ is related to ‘nava’ of Sanskrit. Therefore, ‘navala’ means that (literary form) which has new features — navan visesan lati grihnati iti navala. In English too the word bears the same meaning. Therefore, I am using here the word ‘navala’ for this (literary form) instead of attempting to coin another Sanskrit word.”
Sastry’s use of ‘navala’ came in a commentary he wrote c.1900 on the second Telugu novel, Raja Sekhara Charitra by Kandukuri Veeresha Lingam, which was serialised in 1878 in the author’s own journal, Viveka Vardhani . The word has apparently stuck since then.
No doubt, there’ll be more on this, one of these days, from readers.

(S.Muthiah, Madras Miscellany, Metroplus, Chennai, The Hindu, 26:08:2013)
_____________ __________________

Labels: , , , , , ,

Friday, August 23, 2013

1254-సాహితీ మాలతీ.. మనకిక లేరు!




అక్షర చైతన్య శీలి... కన్నుమూశారు. అశేష పాఠక 'హృదయనేత్రి'.. వీడ్కోలంటూ వెళ్లిపోయారు. 'ప్రమదావనం' శీర్షికతో తెలుగు పత్రికా ప్రపంచాన్ని మహిళల దిశగా అడుగులేయించిన కలం.. నిశ్చలమైంది.ఎప్పటికప్పుడు కొంగొత్తగా ఎగసిపడ్డ 'పాత-కొత్త కెరటాల' పాళీ.. ప్రాణధారను కోల్పోయింది. లాలనగా, తార్కికంగా, గద్దింపుగా 'అడగండి చెబుతా!' అన్న పెద్దరికం... మాటయినా అడగకుండా సెలవు తీసుకుంది.

తెలుగు సాహిత్యానికి తనదైన సుగంధాలద్ది బుధవారం నేలరాలిన మాలతీ... సాహితీ, వ్యక్తిగత జీవనం ఆద్యంతం చైతన్యశీలంగానే సాగింది. 'పఠనం ఒక తీరని దాహం. ఆ దాహం ఎప్పటికైనా తీరుతుందో లేదో..!' అంటుండేవారు మాలతీచందూర్. నిజానికి ఆమె తుదిశ్వాస వరకు ఆ దాహం తీరలేదనే చెప్పాలి. ఆమె తన ప్రాణాపాయకర 'కణితి' గుర్తించిన తర్వాత కూడా తన శీర్షిక కోసం పుస్తకాలతో నెచ్చెలిమి నెరపుతూనే ఉన్నారు. మాలతీగారి రచనా ఔన్నత్యానికి పుస్తకపఠనం ఒక ఎత్తయితే.. చందూర్ జీవనభాగస్వామ్యం మరొక ఎత్తు!! ఇవి రెండూ కలిసే తనను మంచి రచయిత్రిగా చేశాయని అంటారు మాలతీ... ఆమెకే సాధ్యమైన నిరాడంబరతతో. కానీ పుస్తకపఠనాలు, పరిచయాలే ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయా? అంటే కాదనే అంటారు ఆమెతో కాస్త పరిచయం ఉన్నవాళ్లెవరైనా. మాలతీచందూర్‌లో సహజంగానే ఉన్న ఓ అన్వేషణా దృక్పథం, ఎన్నడూ ప్రతికూల భావాలు దరిచేరనీయని నిబ్బరం, గొప్పదనం ఎక్కడున్నా వెదికిపట్టి వెంబడించే చైతన్యశీలత.. ఆమె సహజగుణాలు. వాటికి పుస్తకపఠనం, చందూర్ జీవనభాగస్వామ్యం గోడచేర్పుగా అమరాయి.

రవ్వదుద్దులు...
నూజివీడులో ఆమె ఎప్పుడూ మగరాయుడిలాగే అల్లరి చేస్తూనే ఉండేవారట. 80 ఏళ్లు పైబడ్డాక కూడా ఆ చలాకీతనం చెక్కు చెదరలేదు. సున్నితమైన హాస్యం ఆమెను వీడలేదు. నూజివీడులో ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాక మేనమామ చందూర్ ఇంటికి వెళ్లారు. మావయ్యతో కలిసి సాహితీసభలకు వెళుతుండేవారు. 1945-46లోనే తొలిసారిగా విశ్వనాథ, కృష్ణశాస్త్రి, గాయకుడు ఎంఎస్ రామారావు, చలం పరిచయమయ్యారు. సాహిత్యమండలి తరపున వేసిన శశాంక నాటకాల్లో అనూరాధ పాత్ర కూడా పోషించారు. అప్పట్లో క్రమం తప్పకుండా చదువుతున్న ఆనందవాణి పత్రికలో తన తొలికథ 'రవ్వల దుద్దులు' రాశారు. అమ్మ జ్ఞానాంబ మాలతీ బాధ్యత పూర్తిగా మామయ్యకే అప్పగించి.. పెళ్ళి చేశారు. పెళ్ళయాక మద్రాసు వచ్చారు. అక్కడే పెళ్ళి రిజిస్టర్ చేసుకున్నారు. మద్రాసు మహానగరంలో స్వాతంత్య్రం వచ్చాక రిజిస్టర్ అయిన తొలి వివాహం ఆ దంపతులదేనంటారు! ఆకాశవాణిద్వారా ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు ఆ కుటుంబానికి పరిచయమయ్యారు. ఆయన ప్రోత్సాహంతో తొలిసారి ఆకాశవాణిలో టాల్‌స్టాయ్‌పై 15 నిమిషాలు ప్రసంగించారు. ప్రపంచ సాహిత్యంపై ఆమె వేసిన తొలి అడుగు అది. పాతకెరటాలకు ఒకరకంగా అప్పుడే బీజం పడింది. పాతకెరటాలు, కొత్తకెరటాల ద్వారా ఆమె 350 ప్రపంచ పుస్తకాలను పరిచయం చేశారు.

47 ఏళ్లపాటు 'ప్రమదావనం'!
1952లో ఆంధ్రప్రభలో ప్రమదావనం శీర్షిక ప్రారంభించిన కొత్తల్లో దానికి కనీస స్పందన కరవైంది. మాలతీ అందులో 'లేడీస్ హోమ్' కోణం ప్రవేశపెట్టి.. వైవిధ్య పుంతలు తొక్కాక తిరుగులేకుండా పోయింది. 47 ఏళ్లపాటు నిరాఘాటంగా సాగి తెలుగు పత్రికా ప్రపంచంలో రికార్డు సృష్టించిన శీర్షిక అది. ఆ శీర్షికలోని సమాధానాలు చదివి ఐఏఎస్‌లుగా మారినవారున్నారు. 'చంపకం-చెదపురుగులు'తో ఆమె తొలినవల. 'హృదయనేత్రి' కేంద్ర సాహిత్య అకాడమీ అందుకుంది. శతాబ్ది సూరీడు, ఆలోచించు వంటి 30 నవలలు రాశారు. '1970-80ల నాటి న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగినులు.. ఇలా అన్నివృత్తుల మహిళలనూ మానవీయ పాత్రలుగా మలచిన రచయిత్రి అప్పట్లో మరొకరు లేరు. తన జీవితాన్ని అంతే క్రమశిక్షణగా, ప్రణాళికాబద్ధంగా, నిరాడంబరంగా మలచుకున్న నిజకథానాయిక ఆమే'నంటారు ప్రముఖ రచయిత్రి ఓల్గా. సెన్సార్ బోర్డు సభ్యురాలిగా తమిళం నేర్చుకుని శివశంకరి(ఒక మనిషి కథ), జయకాంతన్(కొన్ని సమయాల్లో కొందరు మనుషులు), సుజాతా రంగరాజన్, పుదుమైపిత్తన్‌లాంటివారిని తెలుగు పాఠకులకు దగ్గర చేశారు. 'మాలతీ అనువాదంతోనే తెలుగుదేశంలో నాకు ఎంతోమంది అభిమానులు వచ్చారు. ఇక్కడి సాహితీవేత్తలతో పరిచయం ఏర్పడింది. ఎంత గొప్ప రచయిత్రో అంత మంచి స్నేహశీలి తను. మాలతీ స్నేహం మరిలేదనంటే ఎలా నమ్మను?!' అని 'ఈనాడు'తో ఆవేదన వ్యక్తంచేశారు తమిళరచయిత్రి శివశంకరి. 

(ఈనాడు , 22:08:2013)
_________________________________

Labels: , , , , , , , ,

Saturday, August 21, 2010

జయహో కృష్ణరాయ!


'కారే రాజులు, రాజ్యముల్‌ గలుగవే, గర్వోన్నతిం బొందరే, వారేరీ? సిరి మూటగట్టుకొని పోవంజాలిరే? భూమిపై బేరైనం గలదే...?' అన్నాడు పోతనామాత్యుడు భాగవతంలో. బలిచక్రవర్తి నోట ఆయన పలికించిన ఆ సత్యవాక్కు అక్షరాలా ఆణిముత్యమే. ఈ లోకయాత్ర ముగిసిన వేళ- సిరులూ సంపదలూ తమ వెంట తీసుకువెళ్లలేరెవరూ. ఎన్ని రాచరికాలు, ఎంతమంది రాజులు, ఎవరి ఏలుబడులు ప్రజల స్మృతిపథంలో ఇప్పుడు నిలిచి ఉన్నాయి? స్థాపించిన సామ్రాజ్యాలు, మిడిసిపాటుతో సాగించిన దొరతనాలు, కట్టుకున్న సౌధాలు, కూడబెట్టిన సిరులతోపాటు తమ నామధేయాలూ కాలగర్భంలో కలిసిపోయిన ఏలికలు ఎందరో! జనరంజకంగా, యశఃకాములై ప్రవర్తిల్లినవారి పేర్లే జగత్తులో చిరస్థాయిగా వర్ధిల్లుతాయి. వారి కీర్తిసౌరభాన్ని వందలు, వేల ఏళ్లయినా వెదజల్లుతూనే ఉంటాయి- అదృశ్యంగా. తెలుగునేలను సంతోష చంద్రశాలగా, శౌర్యస్థలిగా, సకల కళల కాణాచిగా తేజోమయం చేసిన ప్రభువు కనుకనే శ్రీకృష్ణదేవరాయల పేరు- చెక్కుచెదరని శిల్పంలా, చెరిగిపోని శిలాక్షరంలా నేటికీ సజీవంగా మిలమిలలాడుతోంది. అయిదేళ్ల ఏలుబడితోనే మొహం మొత్తించే పాలక నిక్షేపరాయళ్లున్న ఈ రోజుల్లోనూ- అయిదు శతాబ్దాల క్రితంనాటి ఏలిక కృష్ణరాయల పేరు సమ్మోహన మంత్రమై మోగుతూ అందరికీ చిరస్మరణీయమవుతుండటం అందుకు దాఖలా. ఆయన పట్టాభిషిక్తుడై అయిదువందల ఏళ్లు దాటిన సందర్భమిది. రాజకీయంగానే కాక, సాంస్కృతికంగానూ దక్షిణాపథాన్ని ఏకం చేసిన రాయలవారిని స్మరించుకుంటూ తెలుగుజాతి వేడుకల్ని నిర్వహిస్తున్నది అందుకే.

తెలుగునేలను ఏలిన విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణరాయలు స్వతహాగా కన్నడ దేశస్తుడు. అమ్మపలుకు తుళు. సంస్కృతంలో కావ్యాలల్లినవాడు. సకల భాషలకు జననిగా వాసికెక్కిన సంస్కృతంపైనా ఆయనకు మక్కువే. ద్రావిడ భాషా కుటుంబంలో పెద్దక్కగా పేరొందిన తమిళ'మొళి' మీదా గౌరవమే. వాటితోపాటు కన్నడ కస్తూరి పరిమళాల్నీ తన ఆస్థానంలో గుబాళింపజేసినవాడే. అయినా- పది బాసలు తెలిసిన ఆ ప్రభువు 'బాస యన యిద్ది' అంటూ ఎలుగెత్తి చాటి, మణిమకుటం పెట్టింది మాత్రం తెలుగుభాషకే! అందుకే ఆయన తెలుగు రాయలయ్యాడు. తెలుగువారికి ఆరాధనీయుడయ్యాడు. బంగారు పళ్లెరానికి గోడ చేర్పువలె- భాషకు పాలకులు గొడుగుపడితే, సారస్వత వికాసం మూడు పూవులూ ఆరు కాయలుగా విరాజిల్లుతుందనడానికి... రాయల పాలనలో అపూర్వ గౌరవాదరాలను సొంతం చేసుకున్న తెలుగు వెదజల్లిన విద్వత్‌కాంతులే తార్కాణం. ఆ కాలంలో తెలుగు అక్షరం కొత్త నడకలు నేర్చింది. కొత్త సోయగాలు సంతరించుకుంది. 'మరపురాని హొయల్‌' చిలికించింది. ప్రబంధమై నర్తించింది. ఆచార్య రాయప్రోలు అన్నట్లు 'విద్యానగర రాజవీధుల కవితకు పెండ్లి పందిళ్లు' కప్పించిన రోజులవి. సారస్వత మూర్తులను 'న భూతో...' అన్న రీతిన సమ్మానించిన రాజు రాయలవారే. మనుచరిత్ర కర్త ఆంధ్రకవితా పితామహుడు పెద్దనామాత్యుడు 'ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి/ కేలూత యొసగి యెక్కించు'కున్నవాడు ఆయన. తనకు అంకితమిచ్చిన ఆ ప్రబంధాన్ని స్వీకరించేవేళ, పెద్దన పల్లకిని 'తనకేల యెత్తి పట్టిన'వాడు. తెలుగు కవీంద్రుడు ఆనాడు కవితా రాజసంతో దక్కించుకున్న రాజ లాంఛనమది! హృద్యమైన పద్యం వినిపిస్తే 'స్తుతమతి ఐన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకెట్లు కల్గె/ ఈ అతులిత మాధురీ మహిమ?' అంటూ పరవశించిన కవితా పిపాసి రాయలు.

రాయలవారి 'భువనవిజయ' సభామంటపం సాహితీ గోష్ఠులకు వేదిక. అష్టదిగ్గజాలుగా విఖ్యాతులైన కవీశ్వరులకు నెలవు. సారస్వత చర్చలకు, కవితా పఠనాలకు ఆటపట్టు. తెలుగు సాహితీ సరస్వతి కొలువు తీరిన ఆస్థానమది. ఆంధ్రభోజుడు ఆయన! సమరాంగణంలోనే కాదు, సాహితీ రంగంలోనూ రాయలు సార్వభౌముడే. మనుచరిత్రము, వసుచరిత్రము, ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యము, శృంగారనైషధము- తెలుగు సాహిత్యంలో పంచ మహాకావ్యాలని ప్రతీతి. ఆముక్తమాల్యద కృతికర్త కృష్ణరాయలే. శృంగార నైషధాన్ని మినహాయిస్తే, మిగిలిన మూడు కావ్యాలూ రాయలవారి ఆస్థాన కవుల అమృత కరస్పర్శతో అక్షరాకృతి దాల్చినవే. తెలుగులోని అయిదు మహాకావ్యాల్లో నాలుగు, రాయల కాలంలోనే వెలువడటం- ఆయన హయాములో విద్యానగరం తెలుగు భాషాభారతిని సమున్నత పీఠంపై అధిష్ఠింపజేసిందనడానికి దర్పణం. తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగానిది ఓ అధ్యాయం. దానికి అంటుకట్టింది రాయల కాలమే. అప్పటివరకు అనూచానంగా వస్తున్న అనువాద కావ్య రచనల పద్ధతికి కవులు స్వస్తి చెప్పి, ప్రబంధ రచనా సంప్రదాయానికి శ్రీకారం చుట్టేలా బాటలు పరచినవాడు రాయలు. అనంతర కాలంలో తెలుగునాట రెండు, మూడు శతాబ్దాలు కొనసాగిన సంప్రదాయమది. అపారమైన ప్రతిభా వ్యుత్పత్తులతో, అనితరసాధ్యమనిపించే రీతిలో ఆయన రచించిన ఆముక్తమాల్యద- రాజనీతి, వైరాగ్య, భక్తి బంధుర మహాకావ్యంగా పండితుల ప్రశంసలందుకున్న ప్రౌఢ ప్రబంధం. రాయల యుగం తెలుగు సాహిత్యానికి సంబంధించి స్వర్ణ శకం. ఆయన ఆస్థానంలో అగ్రపూజలందుకున్నదీ, అందలాలెక్కిందీ తెలుగు భాషే. కవుల్ని ఎత్తుపీటపై నిలపడమే కాదు, స్వయానా తానూ తెలుగులో మహాకావ్యం రాసిన రాజకవి కృష్ణరాయలు. 'తెలుగదేలయన్న దేశంబు తెలుగు/ ఏను తెలుగు వల్లభుండ, తెలుగొకండ/... దేశ భాషలందు తెలుగు లెస్స' అంటూ రాయలు కట్టిన పద్యం- ప్రతి తెలుగు ముంగిటా నిత్య రంగవల్లికై వెలుగులీనాలి. ప్రతి తెలుగు గుండె తలుపునూ తట్టాలి. తెలుగువారి జాతీయగీతమై ఎదఎదలో రవళించాలి. తెలుగువారందరూ తెలుగు అక్షరానికి పట్టం కట్టినప్పుడే- రాయలవారి పట్టాభిషేక పంచశత ఉత్సవాలకు సార్థకత. తెలుగు రాయల స్మృతికి నికార్సయిన నివాళి అదే! (ఈనాడు, సంపాదకీయం, ౧౧:౦౭:౨౦౧౦)
____________________________

Labels: , ,

Monday, May 03, 2010

మహాకవి... మన దారిదీపం

'నా యింటిపేరు ప్రపంచం
ప్రజలే నా కుటుంబం
వెదజల్లుతా దిగ్దిగంతం
అభ్యుదయ సుగంధం
అప్పుడు నా జీవితమే ఒక ప్రబంధం'
- అని నినదించిన మహాకవి శ్రీశ్రీ శతజయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరంపాటు జరిగాయి. అయినా శ్రీశ్రీ కవిత్వాభిమానులకు ఇంకా తనివితీరలేదు. ఈ నిరంతర కవితా చైతన్యోత్సవం ఆగామి కాలమంతటా జయభేరి మోగించాలని ఉవ్విళ్లూరేవారి సంఖ్య అనంతంగా ఉంది. తెలుగు సాహిత్యంలో వేగుచుక్కగా ఉద్యమించిన గురజాడ అడుగుజాడలో పయనించి, అభ్యుదయ భువన భవనపు బావుటాగా పైకి లేచిన శ్రీశ్రీపై తెలుగు ప్రజలు ప్రకటించిన గౌరవాభిమానాలకు చిహ్నాలు ఈ శతజయంతి వేడుకలు. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ వేడుకలు శతజయంతుల చరిత్రలో నూతన స్థాయిని చేరుకున్నాయి. కవిత్వం చదవడం, రాయడం, అనుభవించడం జీవిత లక్ష్యాలుగా ఎంచుకున్న శ్రీశ్రీకి ఇంతటి గౌరవం దక్కడం సమంజసమే. ప్రతిభాగుణం, ప్రయోగశీలం, ప్రాపంచిక చైతన్యం, చమత్కార ప్రియత్వం, అధ్యయన వైశాల్యం- శ్రీశ్రీ కవిత్వానికి పంచప్రాణాలు. ఆయన నమ్మిన సామాజిక సిద్ధాంతం ప్రపంచాన్ని లొంగదీసుకుంది. ఆయన సాహిత్య ప్రపంచాన్ని లొంగదీసుకున్నాడు.'అరిస్తే పద్యం- స్మరిస్తే వాద్యం' అని ప్రకటించుకోగలిగాడు. అధోజగత్‌సహోదరుల కోసం ఆకాశ రథాలను నేలకు దింపాడు. తన కవిత్వాకాశాలను లోకానికి చేరువ చేశాడు. మన చుట్టూ మరో ప్రపంచాన్ని నిర్మించి మనలోకి మనం ఒక మహాప్రస్థానాన్ని కొనసాగించేలా చేయగలిగిన మాంత్రికుడు శ్రీశ్రీ.

సామాజిక ఉద్యమకారులు ఆదర్శస్వప్నంలోంచి వాస్తవ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటారు. కవులు వాస్తవిక ప్రపంచాన్ని స్వాప్నిక జగత్తుగా పరివర్తన చేయాలనుకుంటారు. శ్రీశ్రీ ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించడంలో అద్భుతమైన ప్రజ్ఞను ప్రదర్శించి అనర్గళం, అనితరసాధ్యం అయిన కవితామార్గం పట్టాడు. జయభేరి, అవతారం, మరోప్రపంచం, కవితా! ఓ కవితా! వంటి ప్రసిద్ధ మహాప్రస్థాన గీతాల రచనతో 1940 నాటికే ఆయన గొప్ప కవుల జాబితాలో చేరిపోయాడు. అంతేకాదు, ఆయనకు అనుకూల- విరుద్ధ వర్గాలకు చెందిన సంప్రదాయ- భావకవిత- అభ్యుదయ మార్గాలకు చెందిన కవులందరూ ఆయనను మూర్ధన్యుడిగా అంగీకరించక తప్పని స్థితి ఏర్పడింది. మహాప్రస్థానం తప్ప శ్రీశ్రీ రాసిన ఇతర రచనల గురించి చాలామందికి తెలియదు. ఆయన స్వతంత్రంగా కథలు రాశాడు. గొప్ప కథలను అనువదించాడు. అద్భుతమైన వచనరచన చేశాడు. నాటికలు రాశాడు. పదబంధ ప్రహేళికలు సృష్టించాడు. చమత్కార రచనలెన్నో చేశాడు. మహాప్రస్థానం ముందు ఇవన్నీ దివిటీముందు దీపాలయ్యాయి. శ్రీశ్రీ శతజయంతిని ఘనంగా జరుపుకొన్నా- మనం ఆయనను వాల్ట్‌ విట్‌మన్‌లాగా అంతర్జాతీయకవిగానో; ఠాగూర్‌, సుబ్రహ్మణ్య భారతి, వళ్లత్తోళ్‌, కువెంపుల తరహాలో జాతీయస్థాయి కవిగానో పేరుపడేలా చేయలేకపోయాం. ఇది తెలుగువారి అశక్తత, అలసత. శ్రీశ్రీ తెలుగు కవులను ప్రపంచానికి పరిచయం చేయడానికి; ప్రపంచ కవులను, రచయితలను తెలుగువారికి పరిచయం చేయడానికి నిజాయతీగా ప్రయోజనాపేక్ష లేకుండా గట్టి ప్రయత్నం చేశాడు. శ్రీశ్రీతో తులతూగగల అనువాద సామర్థ్యం ప్రకటించగల తెలుగువారు అరుదుగా కనిపిస్తారు. తెలుగు యువకులు ఆయన అనువాదాలను అధ్యయనం చేసి ఆ ఒడుపు తెలుసుకొని జాతీయ, అంతర్జాతీయ సాహిత్యాన్ని తెలుగు సాహిత్యాభిమానులకు అందించే కృషి కొనసాగిస్తే- శ్రీశ్రీ లక్ష్యం నెరవేరుతుంది, తెలుగు యువకుల సాహిత్యావగాహన విస్తరిస్తుంది.

మంచి కవిత్వానికి శ్రీశ్రీ అన్నదే గొప్ప బిరుదైతే ఎంతో బాగుండును- అని ఎన్నో దశాబ్దాల కిందట పలికిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి మంగళాశాసనం ఈ శతజయంతి వేడుకల రూపంలో సమగ్రంగా సాక్షాత్కరించిందనాలి. శ్రీశ్రీ అస్తమించినా ఆయన కవిత్వం ఇప్పటికీ నిత్యనూతనంగానే ఉంది. శ్రీశ్రీ తనువు చాలించినా ఆయన చమత్కారాలు నిత్యం మన జీవితాల్లో పూలబాటలు పరుస్తూనే ఉన్నాయి. తాను విశ్వసించిన సామాజిక సిద్ధాంతాలకు సైతం తలవంచని గాంభీర్యాన్ని, స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని తన గుండెలోనే దాచుకొని బైటకు ఏమీ తెలియని అమాయకుడిలా, అల్లరి పిల్లాడిలా, విదూషకుడిలా ప్రవర్తించి వెళ్లిపోయాడు శ్రీశ్రీ. ఎన్నడూ తనను తాను అధికుడననీ అనుకోలేదు, అధముడననీ అనుకోలేదు. నువ్వు అధ్యక్షుడివి అన్నప్పుడు పొంగిపోలేదు, నువ్వు కార్యకర్తవు అన్నప్పుడు కుంగిపోలేదు. జీవితమే వైరుధ్యమైనప్పుడు- వైరుధ్యాల కూడలిలోంచి నడవక తప్పదనుకున్నాడు. ఏ నడక నడిచినా తన లక్ష్యం ఒకటేనని చాటుకున్నాడు. ఒక మాటను ఎడం లేకుండా రెండోమాట పలకడంలో మజా ఉంటుందంటాడు శ్రీశ్రీ. 'శ్రీ' అనే అక్షరాన్ని ఎడం లేకుండా రెండోసారి ఉచ్చరించడంలో ఉన్న మజా ఏమిటో మనందరికీ తెలిసిందే. ఆ మజా ఈ శతజయంతితో ఆగదు. సహస్ర జయంతి పర్యంతం నిలిచిపోతుంది!
(ఈనాడు, సంపాదకీయం, ౦౨:౦౫:౨౦౧౦)
___________________________________

Labels:

Friday, April 30, 2010

స్వేదం శ్రీశ్రీ వేదం

- డాక్టర్‌ సశ్రీ

ఆధునికతకు విరాట్‌రూపం శ్రీశ్రీ. ఇంటిపేరు, ఒంటి పేరుల్ని క్లుప్తీకరించి అణువుల్లా పేర్చుకోవటంతో పేట్రేగిన ఆధునికత ఆపై కవిత్వమై పేలింది.
రెండక్షరాల శ్రీశ్రీ అంటే లోతు,
శ్రీశ్రీ అంటే ఎత్తు.
శ్రీశ్రీ కవిత్వం అగ్ని.
శ్రీశ్రీ సాహిత్యం మార్పు.
శ్రీశ్రీ ఓ నేత, ఓ దూత, ఓ భావి!
'తెలుగు సాహిత్యం'పై శ్రీశ్రీదే అసలైన 'ముద్ర'. తెలుగు కలాల్లో జడపదార్థాలూ, చైతన్య పదార్థాలూ సమంగానే ఉన్నాయి. శ్రీశ్రీ ఒక్కముక్కలో చోదకశక్తి. మరో ప్రపంచం కోసం పలవరించి తానే మరో ప్రపంచమై వెలుగు రేకలు విప్పారిన ఏకైక కవి. అక్షరంలోని అనంతశక్తిని లోకానికి చాటిన ప్రజాకవి శ్రీశ్రీ. ప్రాచీన కవులూ, ప్రబంధ కవులూ శబ్ద వైచిత్రికీ, కల్పనా చాతుర్యానికీ పెట్టింది పేరు. మళ్లీ ఆ రెంటినీ ఆధునిక కవుల్లో ఒక్క శ్రీశ్రీలోనే చూస్తాం. ప్రబంధ కవుల తరవాత అంతటి శబ్ద మహేంద్రజాలం శ్రీశ్రీలోనే వెల్లువెత్తుతుంది. పద్యాన్ని తప్పిస్తే తెలుగు కవిత్వం లేనేలేదనిపించేంతలో- నేటికాలంలో 'మహాప్రస్థానం' మేరువై, జనాభ్యుదయానికి చేరువై ఆధునిక సాహిత్యాన్ని బతికిస్తూంటుంది. 1933-'47 నాటి నలభై ఒక్క కవితల స్తంభాలతో కట్టిన మేడ, అగ్నిమంటపం 'మహా ప్రస్థానం'. అది ఓ రకంగా శ్రీశ్రీ చేసిన అగ్నిసంతకం. ప్రజల చేతిలో కాగడా 'మహాప్రస్థానం'. ప్రాచీనమైనదంతా విశిష్టమనీ, ఆధునికమైందంతా అరిష్టమనీ అపోహలు రాజ్యం చేస్తూన్న కాలంలో ఆధునికతలోని ప్రామాణికతకు కొలబద్దగా శ్రీశ్రీ సాహిత్యం నిలుస్తుంది. కార్మిక, కర్షక అభ్యుదయమే శ్రీశ్రీ కవితామార్గం. సామాన్యుడే మహాకవి పాలిటి స్వర్గం. మానవుడే సందేశం... మనుష్యుడే సంగీతం. 'పురోగామి భావాలకు' పునరుత్తేజం కలిగించినదోపిడీకి తావులేనిది సామ్యవాద రాజ్యమేనని ఎలుగెత్తి చాటిన ఎర్రజెండా శ్రీశ్రీ అక్షరాక్షరం.
కర్షక వీరుల కాయం నిండా కాలువకట్టే ఘర్మజలానికి ఖరీదు లేదన్న శ్రీశ్రీకి స్వేదమే వేదం... శ్రామికుడే దేవుడు!! శ్రీశ్రీ చారిత్రక జ్ఞానం రాబోయేకాలంలో కాబోయే కవులకు పాఠమై ప్రవహిస్తుంది. నిజానికి కవిత్వం అన్నది వ్యక్తీకరణ కళ. ఎవరు ఏ మేరకు కవో శిల్పమే పట్టిస్తుంది. శ్రీశ్రీది ప్రత్యేక శైలి. శబ్ద విన్యాసంలో శక్తిమంతుడిగా పేరొందిన శ్రీశ్రీ ఆధునిక కవుల్ని అధిగమించాడు. ఇవాళ్టి వచన కవితతో శ్రీశ్రీ కవితను పోల్చలేం. నిరంతర పరిణామానికి అలవాటుపడ్డ వచన కవిత్వంలో శ్రీశ్రీది ఓ ప్రస్థానం... ఓ శుభారంభం... తొలకరివాన. తనలో తాను వర్షమై కురిసి కురిసి మహా ప్రస్థానమై వెలిసిన కవి శ్రీశ్రీ. తన అంతరాత్మను మండించి లావాగా పెల్లుబికిన కలం శ్రీశ్రీ. సాహిత్య స్పృహకు ఆలవాలం... సామాజిక స్పృహకు బలం శ్రీశ్రీ. ఆయనో సాహిత్య సంస్కర్త. 'ఇంటెలిజెంటిల్మన్‌' లాటి ప్రయోగాలకు శ్మశానాల నిఘంటులు దాటిన అక్షర బాటసారి శ్రీశ్రీ. వ్యధాసర్పదష్టులారా అనాల్సింది 'బాధాసర్పదష్టులార' అంటూ వ్యాకరణాల సంకెళ్లు విదిలించుకున్న కలం శ్రీశ్రీ.
పారశీక గజల్‌ నడకను మాత్రాగణాల్లో పరకాయ ప్రవేశం చేయించి ఛందస్సుల సర్పపరిష్వంగం వదిలించుకున్న అక్షర పారిజాతం శ్రీశ్రీ. ఆకలి, ఆవేదనలు తొడుక్కున్న బట్టలు శ్రీశ్రీ అక్షరాలు. ఆవేశపు ఇస్త్రీ మడత నలగని తెలుగుదనం వెల్లివిరిసే పట్టుపంచె శ్రీశ్రీ సృజన. అవ్యక్తానుభూతుల 'రసన' శ్రీశ్రీ సాహితి. అందరిలా శ్రీశ్రీ కావ్యకర్త మాత్రమే కాదు, అంతకు మించి కార్యకర్త కూడా. పౌరహక్కుల ప్రతినిధిగా పనిచేసిన ఉద్యమ కెరటం శ్రీశ్రీ. విప్లవోద్యమాల పురిటిగడ్డ ఆయన మస్తిష్కం. 1930 తరవాత నడిపించిన పెద్దదిక్కుగా, మార్గదర్శిగా విమర్శకుల మన్ననలందుకున్నాడు. ఏ కూలీ నాలీ జఉద్యమంగా ఉరకలెత్తబట్టే కవుల్లో శ్రీశ్రీ మాత్రమే మహాకవిగా నిలిచాడు, యుగకర్తగా జనహృదయం గెలిచాడు. తెలుగు సాహిత్యానం కోసం కలం పట్టానని శ్రీశ్రీ పలికాడో ఆ సామాన్యులకు శ్రీశ్రీ శబ్దభేరీ 'కవిత్వం' ఏమేరకు అర్థమవుతుందన్నది ఓ ప్రశ్న. ఉన్నంతలో తెలుగు సమాజం చుట్టూ పరిభ్రమించకుండా తక్కిన కవులకు భిన్నంగా ప్రపంచ బాధల్ని పల్లవించటం వరకూ మెచ్చుకోలు. వట్టి నినాదాలు కవితలు కావుకానీ, 'మినీ' కవిత్వాన్ని శ్రీశ్రీ ఆహ్వానించాడు.
'నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది తాజమహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు...' అంటూ శ్రీశ్రీ అక్షరీకరించిన సామాన్య వాక్యాలు సత్యాన్వేషణలో భాగం కనక గొప్పమాటలే అవుతాయి. కష్టజీవికి ఇరువైపులాఉన్నవాడు శ్రీశ్రీ. అక్షరానికి ఆవేశాన్ని నేర్పినవాడు. శ్రీశ్రీ వచ్చేదాకా తెలుగు అక్షరానికి ప్రణయార్చన తప్ప ప్రళయగర్జన తెలీదు. గుప్పెడు అక్షరాల అణువుల్ని ఎలా పోగేయాలో నేర్చిన శాస్త్రవేత్త శ్రీశ్రీ. కన్నీటికి ఉప్పెన రూపాన్ని ఇవ్వగల ప్రకృతి శ్రీశ్రీ. సామ్యవాదం జాబిలిని చూపి అక్షరాల గోరుముద్దలు తినిపించే అమ్మ శ్రీశ్రీ. ఓ అభ్యుదయ సంతకం... ఓ విప్లవ కెరటం... ఓ పోరాట రూపం. కవిత్వాన్ని ఆరాటంగా కాక పోరాటంగా మలచిన యోధుడు. శ్రీశ్రీ అక్షరాలు ఆశావాదానికి కళ్లు, పురోగామి భావాలకు కాళ్లు!
(ఈనాడు, ౩౦:౦౪:౨౦౧౦)
______________________________

Labels:

సినిమా పాట మీద శ్రీశ్రీ సంతకం

ఆయన - ఆకలి వాకిట కేకలు వేసిన సిరిసిరి పాపడు. శబ్దాన్ని శాసించి, శతాబ్దం తనదేనని ఘోషించిన యుగపురుషుడు. ఆయన అరిస్తే పద్యమైంది... స్మరిస్తే వాద్యమైంది. ఆ కలం ఖడ్డసృష్టిలో అక్షరాక్షరం అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యమైంది. 'సినిమాల చిట్టడవిలో చిక్కుకొన్న మహాకవి' అని కొందరు వాపోయినా ఆ చిట్టడవిలో దట్టమైన గీత వసంతాల్ని పూయించడం శ్రీశ్రీకి హక్కుభుక్తమైంది. మహాకవి శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంలో ఓ విహంగ వీక్షణ...
________________________________

దృశ్య కావ్యాల మీద శ్రీశ్రీకి ఉన్న మక్కువ సినీ రంగంలో స్థిరపడేలా చేసింది. అంత వరకూ జీవిక కోసం రకరకాల ఉద్యోగాలు చేస్తూ వచ్చిన శ్రీశ్రీ చివరి వరకూ సినిమాల్లోనే కొనసాగడానికి ఇదే కారణం. 1950లో 'నీర్‌ ఔర్‌ నందా' చిత్రాన్ని 'ఆహుతి' పేరుతో అనువదించిన శ్రీశ్రీ డబ్బింగ్‌ ప్రక్రియకు అంకురార్పణ చేశారు. అందులో 'ప్రేమయే జనన మరణ లీల' పాట శ్రీశ్రీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం టాకీపులి హెచ్‌.ఎమ్‌.రెడ్డి, మునాఫ్‌ లాంటి వారి దగ్గర శ్రీశ్రీ నెల జీతానికి కుదురుకున్నారు. అనువాద చిత్రాల ద్వారా స్థిరపడ్డ తనకు డబ్బింగ్‌ రైటరు అనే ముద్రపడినా పట్టించుకోలేదు. అవకాశం వస్తే విజృంభించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో అన్నపూర్ణా వారి 'తోడికోడళ్లు', 'మాంగల్యబలం', 'వెలుగునీడలు', 'ఇద్దరు మిత్రులు', 'డాక్టర్‌ చక్రవర్తి' లాంటి చిత్రాలు - శ్రీశ్రీలోని విశ్వరూపాన్ని చూపెట్టాయి.పి.ఎ.పి.వారి 'భార్యాభర్తలు', 'కులగోత్రాలు', 'పునర్జన్మ', ఆత్రేయ 'వాగ్దానం', రాజ్యంవారి 'నర్తనశాల', రేఖా అండ్‌ మురళీ 'దేవత', జగపతివారి 'ఆరాధన', సురేష్‌ ప్రొడక్షన్స్‌ 'రాముడుభీముడు' చిత్రాల్లో శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన గీతాలు ఆల్‌టైమ్‌ హిట్స్‌గా నిలిచాయి.

హీనంగా చూడకుదేన్నీ:
నిజానికి డబ్బింగ్‌ గీతాల్లో సైతం శ్రీశ్రీ ప్రయోగాలు చేశారు. 'హీనంగా చూడకు దేన్నీ... కవితామయమేనోయి అన్నీ' అని పరోక్షంగా స్పష్టం చేశారు. తొలి చిత్రం 'ఆహుతి'లో సంగీత దర్శకులు ఎస్‌.రాజేశ్వరరావు సందర్భోచితంగా తాళం బిట్లు తీసుకొని, వేరే ట్యూన్స్‌ సమకూరిస్తే వాటికి తగ్గట్టుగా శ్రీశ్రీ రాసిన పాటల్ని ప్రయోగంగానే భావించాలి.

అలాగే 'గాంధారి గర్వభంగం' (డబ్బింగ్‌) చిత్రంలోని 'పదునాలుగు లోకముల ఎదురేలేదు' అనే పాట నేపథ్యగీతం కావడంతో, లిప్‌సింక్‌ ఇబ్బంది లేకపోవడంతో దాన్ని శ్రీశ్రీ స్వతంత్ర రచనలాగే రూపొందించారు. ఈ పాట తాలూకు స్ఫూర్తి 'బాలభారతం' చిత్రంలో ఆరుద్ర రాసిన 'మానవుడే మహనీయుడు' మీద స్పష్టంగా కనిపిస్తుంది.అనువాద ప్రక్రియకు మెలకువలు చెప్పిన ఘనత కూడా ఈయనదే. పరాయి పలుకులు తెలుగు మాటలుగా వినిపించాలంటే ఏం చెయ్యాలీ, ఎలా చెయ్యాలనే విషయానికో మార్గం వేశారాయన. ప, ఫ, బ, భ, మ అనే ఓష్ట్యాల విషయంలో జాగ్రత్త పాటించాలని సూచించింది శ్రీశ్రీయే.

వైవిధ్యం ఆయన సొంతం:
రాశిలో తక్కువే అయినా వాసిగల సినిమా పాటల్ని శ్రీశ్రీ రాశారు. నిప్పులురిమే ఉద్యమ గీతాలకో, ఉత్తేజాన్ని నింపే దేశభక్తి పాటలకో, జాతిని జాగృతపరచే ప్రబోధాత్మక రచనలకో ఆయన పేటెంట్‌ కావచ్చుగాక. స్వేచ్ఛ లభించిన సందర్భాల్లో ఆయన్నించి చిలిపి సినీగీతాలు వెలువడ్డాయి. గిలిగింతలు పెట్టే సాహిత్యం శ్రీశ్రీ కలం నుంచి వెలువడింది.

మీసాల మీద సీసం రాయడం శ్రీశ్రీకే చెల్లింది. 'సదమల మదగజ గమనము'తో తెలుగు సినిమాలో హరికథను చెప్పించడం ఆయన హక్కుభుక్తమైంది. వీణపాటలకు ప్రాచుర్యం శ్రీశ్రీతోనే మొదలైంది. పాడవోయి భారతీయుడా అని ప్రతి పౌరుడితోనూ పాడించినా, బతుకును కన్నీటిధారలకు బలిచేయవద్దని ప్రబోధించినా, బొమ్మను చేసి ప్రాణము పోసిన వాడిలోని ఆడుకొనే వేడుకను ప్రశ్నించినా, మనసున మనసైన తోడు కోసం సితార మీటినా, తెలుగువాడి పౌరుషాగ్నితో మన్యంలో మంటలు పుట్టించి తెలుగు సినిమా పాటను తొలిసారిగా జాతీయ పురస్కారంతో అలంకరించినా అది మహాకవి శ్రీశ్రీకే సాధ్యమైంది.

ఆశావహ దృక్పథం:
'చెవిలో రహస్యం' పేరుతో ఓ డబ్బింగ్‌ చిత్రాన్ని తీసి ఆర్థికంగా దెబ్బతిన్న శ్రీశ్రీ తన వ్యక్తిగత సమస్యల్ని సినిమా రచనపై ప్రసరించకుండా 'ప్రొఫెషనల్‌' స్థాయిని కనబరిచారు. ముందున్న మంచి కాలాన్ని తన గీతాల్లో ఉజ్వలంగా ప్రదర్శించారు. ఎవరో వచ్చి ఉద్ధరిస్తారని ఎదురుచూడకుండా నిజం తెలుసుకొని నడుంబిగించమని ఉద్బోధించారు.

శ్రీశ్రీ పాటలకే పరిమితం కాలేదు. ఎన్నో చిత్రాలకు చిత్ర సంవిధానాన్ని సమకూర్చి పదునైన సంభాషణలు కూడా రాశారు. ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో తెలుగు సినిమాలు రావాలని, సొంతంగా తీయాలని శ్రీశ్రీ కన్న కలలు అలాగే మిగిలిపోయాయి. అలాంటి చిత్రాలు మనవాళ్లు తీయాలి.. అదే శ్రీశ్రీకి అసలైన నివాళి.

(ఈనాడు, సినిమా, ౩౦:౦౪:౨౦౧౦)
____________________________

Labels: ,

శత వసంతాల జ్వాలాశిశువు

-డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌

'పతితులార భ్రష్టులార! బాధాసర్పదష్టులార! ఏడవకండేడవకండి-'
ఈ ఓదార్పు 19వ శతాబ్ది తెలుగుజాతినే కాదు, యావత్‌ దేశాన్నీ ఉలిక్కిపడేటట్టు చేసింది. కవిత్వంలో అక్షరాల్నికాదు అశ్రువుల్ని నింపుకొని; భావోద్వేగాల్నికాదు వాస్తవదృశ్యాల్ని అల్లుకొని అత్యంత వేగవంతంగా చెప్పిన కవి శ్రీశ్రీ.శ్రీశ్రీ కవిత్వంలోని వేగాన్ని పట్టుకున్న కవి ఇంతవరకూ పుట్టలేదు. శ్రీశ్రీతో పోల్చదగిన కవీ తెలుగునాట లేడు. సాంప్రదాయిక శక్తిని అంతర్నిహిత విద్యుత్తుగా మార్చి, అభ్యుదయపథాల పరుగుపెట్టించిన భాషాభగీరథుడు ఆయన. శబ్దశక్తినీ, అర్థవ్యాప్తినీ అంచనావేసి వాడిన ప్రయోగశీలి. అందుకే యుగకవిగా శ్రీశ్రీ గుర్తింపు పొందాడు.

'వ్యక్తికి వింజామరలు విసరలేను/ సమూహం నా సరదా' అని ప్రకటించి, ప్రజలవైపు ముఖ్యంగా పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం నిలిచిన మానవతావాది శ్రీశ్రీ. విదేశాల్లోని పరిస్థితులపై దృష్టి కేంద్రీకరించి, దేశీయ అభ్యున్నతికోసం విదేశీ విజ్ఞానాన్ని వాడటంలో సిద్ధహస్తుడాయన. శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ఎందుకు యుగకర్తగా నిలిచాడని ప్రశ్నించుకొని ఆలోచిస్తే- వ్యక్తిత్వంలో, కవిత్వంలో, జీవితంలో చిత్తశుద్ధిగా శ్రమసౌందర్యాన్ని ఆకాంక్షించిన వ్యక్తిగా, ఉద్యమమూర్తిగా కన్పిస్తాడు. అప్పటివరకు వూహాలోకాల్లో విహరిస్తున్న తెలుగు కవిత్వానికి వాస్తవిక స్పృహను, హేతువాద దృక్పథాన్ని, సామ్యవాదాన్ని కలగలిపి ప్రభంజనం సృష్టించాడు.

సమానత్వం కావాలంటే ముందుగా రాజకీయ స్వాతంత్య్రం, తరవాత ఆర్థిక స్వాతంత్య్రం కావాలనీ, వీటిలో రెండోది మనకింకా రాలేదని ఏనాడో చెప్పాడు. అలాగే ప్రపంచీకరణవల్ల జరిగే విధ్వంస చిత్రాన్ని నాడే తన కవిత్వంలో చూపాడు. 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' అనడంలో వైయుక్తిక చైతన్యాన్ని సామాజిక చైతన్యంగా రూపుకట్టించడం కన్పిస్తుంది. శ్రీశ్రీ వ్యక్తిత్వం నుంచి, కవిత్వం నుంచి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆర్థిక దృక్పథాలకెన్నో కొత్త దారులు దొరుకుతాయి. కార్మిక విజయావిష్కరణ, సామాజిక హృదయ స్పందన, వాస్తవ జీవనచిత్రణ సాహిత్యంలో శ్రీశ్రీతోనే పుట్టాయి. కళకి ఆధారం భ్రమ కాదనీ, సామాజిక సత్యాల్ని వాస్తవిక దృష్టితో కవిత్వంలో పొదగడమే కళ అనీ శ్రీశ్రీ నిర్వచనం. సామాజిక స్పృహ లేని కవిత్వంలో నాగరక లక్షణాలుండవు. అందుకే సామాజిక కవిత్వంలోని అనుభూతిని సామాజిక చైతన్యం, శ్రమజీవన సౌందర్య వర్ణనలవైపు నడిపిన కవి శ్రీశ్రీ. పెట్టుబడిదారీ విధానాన్ని అన్నివిధాలుగా ఖండించి కార్మికవర్గాల్లో తీవ్ర చైతన్యాన్ని మేల్కొల్పిన శాస్త్రీయ సామ్యవాదాన్ని పుణికిపుచ్చుకుంది శ్రీశ్రీ కవిత.

'ధనిక స్వామికి దాస్యంచేసే
యంత్రభూతముల కోరలు తోమే
కార్మిక వీరుల కన్నుల నిండా
కణకణమండే గలగల తొణికే
విలాపాగ్నులకు విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబులేడోయ్‌'
- ఈ మాటలు పారిశ్రామిక విప్లవం తెచ్చిన ఆర్థిక సంక్షోభానికి సాక్షీభూతాలు. ఏళ్ళతరబడి అభివృద్ధికి నోచుకోక గనుల్లో, కార్ఖానాల్లో మగ్గుతున్న కార్మిక సోదరుల వ్యథార్త దృశ్యాలు. ప్రపంచమంతటా అభివృద్ధి కాంక్షించే స్వభావం రావడానికి కారణం రష్యన్‌ విప్లవం. విప్లవం నుంచే శ్రామికలోకం పక్షాన నిలిచి కణకణమండే త్రేతాగ్నుల్లాంటి కవితల్ని శ్రీశ్రీ వెెలయించాడు. సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్య విప్లవం సాగాలన్న దృఢసంకల్పాన్ని పొందాడు. దీనికి శ్రీశ్రీలోని ప్రయోగవాదశీలం దోహదం చేసింది. కవిత్వం, సమాజం రెండూ పరిణామశీలాలు. కాబట్టి ఈ రెంటిపై ప్రయోగాలు తప్పవు. ఈ ప్రయోగాలు సకలజన ప్రయోజనాలకు అనుకూలమైనప్పుడు మాత్రమే అది ఒక సంప్రదాయంగా ఘనీభవిస్తుంది. అందుకే నాడు శ్రీశ్రీ పూరించిన శంఖారావ ప్రతిధ్వనులే నేడూ సమాజంలోనూ, శ్రామికవర్గ చైతన్యంలోనూ, సాహిత్యంలోనూ విన్పిస్తున్నాయి.

కష్టించే కండల్ని పూజించని సమాజంలో జవసత్వాలు లేనట్లే. అది వృద్ధ ప్రపంచం. అందుకే ఆ వృద్ధ ప్రపంచానికి నెత్తురూ, కన్నీరు కలిపి శ్రీశ్రీ కొత్త టానిక్‌ తయారుచేశాడు. అక్షరాల్ని ఆ టానిక్‌లో ముంచి, ప్రతి పదాన్నీ కదం తొక్కించాడు. శ్రీశ్రీ కవిత్వంలో పదాలు, భావాలు, ప్రతీకలూ అన్నీ శ్రమసౌందర్యాన్ని ఆస్వాదించేవిగా, స్వేదానికి పట్టాభిషేకం చేసేవిగా కన్పిస్తాయి. మాట్లాడే మంటలు, శ్రామికలోకపు సౌభాగ్యాలు, వర్షుకాభ్రముల ప్రళయ ఘోషలు, అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రబావుటా నిగనిగలూ... అన్నీ కార్మిక లోకకల్యాణం కోసమే.

శ్రీశ్రీ 1934-47 వరకూ రాసిన కవితల సంపుటి 'మహాప్రస్థానం'. మహాభారతంలో పాండవులు మహాప్రస్థానం చేసింది స్వర్గారోహణ కోసమే. సామ్యవాద సమాజాన్ని స్వర్గంగా కలలు కన్న శ్రీశ్రీ కూడా మహాప్రస్థానం రాశాడు. సాహిత్యంలో ప్రతిదీ ప్రతిఫలించాలనీ, అంతా కవితామయం చేశాడు. అందులోనూ శ్రమకు పట్టమే కట్టాడు.
కుక్కపిల్ల-ఆకలి, అగ్గిపుల్ల-పరిశ్రమ, సబ్బుబిళ్ల-ఫ్యాక్టరీ, రొట్టెముక్క- బేకరీ, అరటితొక్క-కర్షకుడు, బల్లచెక్క-శ్రామికుడు, తలుపుగొళ్లెం-బ్రిటిషువారి పాలన, హారతి పళ్ళెం-విజయం, గుర్రపుకళ్ళెం- వేగం.
వీటిలో మొదటి పదాల ద్వారా ప్రతీకలుగా రెండవ పదాల్ని స్ఫురింపజేశాడు. 'అల్పాక్షరంబుల అనల్పార్థ రచన' ఇదే. వీటిలో శ్రామిక వర్గాల బాధలు, ఆకలికేకలూ స్వాతంత్య్రం వచ్చినా తీరలేదని, తీర్చడానికి వేగవంతమైన తన కవిత్వం ద్వారా పాటుపడతాననే సందేశాన్నిచ్చాడు. దీనికి మద్దతుగా-
'చీనాలో రిక్షావాలా,
చెక్‌ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ ఖండాంతర నానా జాతులు...'


'ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం'.

'ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా?! ఇకపై సాగదు'...

'నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది?',

'తాజమహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు'
వంటి లోతైన, గాఢమైన భావవాక్యాలు నిలుస్తాయి. విదేశీయులైన చెహోవ్‌, ఫ్రాంజ్‌కాంఫ్కా, కారల్‌ చాపెక్‌, విక్టర్‌ సాడన్‌, విలియం సోలోయార్‌, వాల్ట్‌ విట్‌మన్‌, ఇ.ఇ.- కమింగ్‌, మయకోవస్కీ, సాబ్లోనెరుడా, పుష్కిన్‌, వాసిల్వేవా, కోవ్‌సాంతిన్‌, అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌, రసా, షాన్‌ షెంకిస్‌ వంటి ప్రగతిశీలవాదులను తెలుగువారికి పరిచయం చేయడం కూడా సామ్యవాద ఆకాంక్షల్లో భాగమే. ఈ సామ్యవాదాన్ని ఆకాంక్షించిన కార్ల్‌మార్క్స్‌, ఏంగెల్స్‌, లెనిన్‌లను శ్రీశ్రీ కణకణమండే త్రేతాగ్నులుగా ఉత్ప్రేక్షించాడు. 'ధనంజయునిలా సాగండి...' అన్న మహాప్రస్థానంలోని పిలుపు, విజయునిలా విక్రమాన్ని చూపాలని ఉద్బోధిస్తుంది.

ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తించేటట్టు, సామ్యవాదాన్ని ఆకాంక్షించేటట్టూ చేయాలి. దీనికోసం దిగుమతి చేసుకున్న విదేశీ భావజాలాన్ని తెలుగునాట సంప్రదాయంలో విత్తాడు. అది అంకురించి, తదుపరి సాహిత్యంలోనూ, సమాజంలోనూ ఉద్యమాలుగా వికసించింది. శ్రీశ్రీ ఎంచుకొన్న ఈ ప్రణాళికలో భాగమే సంప్రదాయ పదజాలాన్ని కొత్త అర్థాలలో వాడటం.
సమిధ, భూతం (ప్రాణి), యజ్ఞోపవీతం, ముహూర్తం (12 క్షణాల కాలం) వంటివెన్నో ఉన్నాయి.
ఇంకా 'యముని మహిషపు లోహఘంటలు...'
'నరకలోకపు జాగిలమ్ములు,'
'ఉదయసూర్యుని సప్తహయములు...'

'కనకదుర్గా చండసింహం,'
'ఇంద్రదేవుని మదపుటేనుగు...' మొదలైన ప్రయోగాల్లోనూ శ్రామిక జీవన దృక్పథ వర్ణనమే కన్పిస్తుంది. సనాతనంగా సంప్రదాయంలో ఉన్నవాటినే ప్రతీకలుగా తీసుకొని, అందులో సామ్యవాదాన్నీ అభ్యుదయ కాంక్షను పలికించాడు శ్రీశ్రీ. శాంతికాముకత, సమసమాజ నిర్మాణం, వర్గసంఘర్షణ వంటి లక్షణాల పట్ల ఆకర్షితుడైన శ్రీశ్రీ-
'కదిలేదీ కదిలించేదీ,
మారేదీ మార్పించేదీ,
మునుముందుకు సాగించేదీ,
పెనునిద్దుర వదిలించేదీ' అభ్యుదయ పథమే
నని నమ్మారు. '1930 వరకూ కవిత్వం నన్ను నడిపించింది. 30ల తరవాత నేను కవిత్వాన్ని నడిపిస్తున్నాను' అన్న ఆత్మవిశ్వాసపూరిత వాక్యాలు అభ్యుదయ దృక్పథం హృదయం నుంచి వచ్చినవే. ఇదే శ్రీశ్రీని సమాజానికి, కవిత్వానికి నిబద్ధుణ్ణి చేసింది.

'కవికి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. దాన్ని విస్మరించడం అంటే సమాజానికే ద్రోహం. వెనుకటి కవులు నిరంకుశులేమో కానీ నేటి కవులు సమాజ శ్రేయస్సుకి నిబద్ధులు' అన్న ఆయన మాటలు, కవికీ సమాజానికీ ఉండవలసిన బంధాన్ని వివరిస్తాయి. కవిత్వం పట్ల కూడా లోతైన అవగాహన శ్రీశ్రీకి ఉంది. ప్రక్రియ, వస్తువు- రెండూ కలిస్తేనే కవిత్వమనీ, ప్రక్రియ శరీరమైతే వస్తువు ప్రాణమనీ, ఈ రెండూ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయని, ఈ లక్షణం కేవలం ఆధునిక కవిత్వానికే కాక, అన్ని కాలాల, అన్ని ప్రాంతాల కవిత్వాలకూ వర్తిస్తుందని నమ్మినవాడు శ్రీశ్రీ. అందుకే ప్రాచీన ఛందస్సులోని సంస్కృత పదాలను, విదేశీయుల భావాలను అన్నింటికీ అతీతంగా కొత్తకొత్త అర్థాలలో ప్రయోగించగలిగాడు. 'సమాజంలోని సంఘర్షణలనూ, సమస్యలనూ మార్క్సిస్ట్‌ దృక్పథంతో అవగాహన చేసుకోవాలి. ఈ అవగాహనే తల్లివేరు లాగా కవిత్వానికి పరిపుష్టినిస్తుంది. నేను కవిత్వం రాసేటప్పుడు ఇదే నా నిబద్ధత- సిద్ధాంతం' అని చెప్పుకొన్న శ్రీశ్రీ ప్రతి కవిత్వ చలనంలోనూ ఒక కొత్త చోదకశక్తిని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు.

శ్రీశ్రీ ఆలోచనలు, ఆశయాలు, అభ్యుదయం, శబ్దప్రయోగంలోని వేగం, తళుక్కున మెరిసే చమత్కారం ఎవరూ అందుకోలేనివి. కాలం కన్నా ముందు పరిగెత్తేదే కవిత్వమనీ, ఇది కేవలం జీవితానికి వ్యాఖ్యానం మాత్రమే కాదని, సమస్యలకు పరిష్కారం చూపించేదనీ శ్రీశ్రీ అభిప్రాయం. కవిత్వం ఒక భోగవస్తువుగా కాక ఉపయోగ వస్తువుగా మారినప్పుడే అది ప్రజా కవిత్వమవుతుంది. ఈ లక్షణం ఉండడం వల్లనే శ్రీశ్రీ రాసిన 'కవితా ఓ కవితా' గీతం- సంప్రదాయవాది విశ్వనాథ సత్యనారాయణ కూడా కంటతడి పెట్టించిందట! అంతటి వేగం, ఆవేగం శ్రీశ్రీ కవితకే సొంతం.

శ్రీశ్రీ జీవితానికి, కవిత్వానికి ప్రయోగం హృదయనాడి. భిన్నంగా చెప్పడం, ఉండటం శ్రీశ్రీకి నచ్చే గుణాలు. శ్రీశ్రీ- ఆలోచనల్లో లోతుల్నీ, ఆశయాల్లో ఉన్నతాల్నీ శ్వాసించే నిరంతర క్రియాశీలక జీవి. తెలుగు సాహిత్యాన్ని ఒక్కసారిగా జాగృతం చేసి నవీన పంథాలో దౌడు తీయించిన రౌతు. శ్రీశ్రీ కవిత ఒక మహాశక్తి. దాని ప్రభావం సమాజంపై నేటికీ ప్రసరిస్తోంది. శ్రీశ్రీ మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని. న్నో దీపాలను వెలిగించిన సాహిత్య జ్యోతి. శ్రీశ్రీ మనస్సే ఒక కార్మికశాల. నిరంతరం కవితాక్షరాలు అచ్చుపోసినట్టు వస్తూ శ్రమజీవికి పట్టాభిషేకం చేస్తాయి. ఆధునిక కవిత్వానికి తొలి వేకువ శ్రీశ్రీ. ఫిరంగిలో సైతం జ్వరం ధ్వనింపజేసే మృదంగరావాలు శ్రీశ్రీ పిలుపులు. కవిత్వంతో కదం తొక్కిన ఏకైక కమాండో! కవిత్వంలో మెషిన్‌గన్‌లాంటివాడు. జీవితంలో నైట్రోజన్‌లాంటివాడు. కొడవటిగంటి కుటుంబరావు మాటల్లో చెప్పాలంటే 'శ్రీశ్రీ కన్నా మిన్న ఏదైనా ఉందంటే- అది శ్రీశ్రీ కవిత!'
(రచయిత హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులు)
(ఈనాడు, ౩౦:౦౪:౨౦౧౦)
_________________________________

Labels:

Friday, April 09, 2010

విశాఖపట్నం, న్యూస్‌టుడే: 'భరాగో'గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత భమిడిపాటి రామగోపాలం బుధవారం విశాఖపట్నంలో గుండెపోటుతో తుదిశ్వాస వదిలారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గుండె సంబంధిత వ్యాధితో గత మూడేళ్లుగా బాధ పడుతున్న ఆయన ఆరోగ్య గత ఫిబ్రవరి నుంచి క్షీణిస్తూ వచ్చింది. విజయనగరం జిల్లా అలమండ మండలం అన్నమరాజుపేటలో 1932 ఫిబ్రవరి 6న భరాగో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సునిశిత హాస్య రచనలకు పెట్టింది పేరైన ఆయన ఎన్నో తెలుగు కథలు, నవలలతో పాటు సినిమా పాటలపై సమీక్షలు రాశారు. 160కి పైగా కథలు, మూడు నవలలు, అనేక వ్యాసాలు రచించారు
_____________________________________________
మానవీయ హాస్య కదంబం
- ఎర్రాప్రగడ రామకృష్ణ
వెనకటికి ఒకాయన 'ఈ ప్రపంచంలో స్త్రీలందరిలోనూ మా ఆవిడే సుప్రీం అందగత్తె' అన్నాడట.
ఇది విన్నవాడు మొహం పక్కకు తిప్పేసి నవ్వుకుని 'ఆహా అలాగా!' అన్నాడట.
'నువ్వేదో వేళాకోళంగా తీసుకుంటున్నట్టుంది. నేనన్నది నా ఒక్కడి అభిప్రాయం అనుకుంటున్నావేమో! మా ఆవిడ అభిప్రాయం కూడా అదే- తెలుసా!'

బాలనాగమ్మ సినిమాలో 'ఆహా నా సొగసే కని మరుడే దాసుడు కాడా' పాట గురించి తన వ్యాఖ్యానాన్ని పై చమత్కారంతో ప్రారంభించే మనిషిని హాస్యప్రియుడనో, రచయిత అయితే హాస్యరచయిత అనో ముద్ర వేయడం లోకానికి రివాజు.

భరాగోను ప్రపంచం ఆ రకంగానే భావించింది. గుర్తించింది. ఒక్కోసారి చిన్న పువ్వు ఆధారంగా ఒకానొక మహారణ్యాన్ని గుర్తు పట్టవలసిన సందర్భాల్లో- లోకం పొరబడే అవకాశాలూ ఎక్కువే ఉంటాయి. అలాంటి పొరబాటే భరాగో విషయంలోనూ జరిగింది. భరాగో తెలుగునాట హాస్యరచయితగా ముద్రపడ్డారు. పడ్డాకా- దాన్ని నిలబెట్టుకోవాలనో, చెరిపేసుకోవాలనో ఎలాంటి ప్రయత్నాలూ చేయకుండా 'కాబోసు' అనుకుని నవ్వేసుకున్నాడాయన.

ఏభై ఎనభై దశకాల మధ్య తెలుగు సాహిత్యపు స్వర్ణయుగ కాలంలో గొప్ప కథకుడిగా పేరు తెచ్చుకున్న భరాగోను హాస్యరచయితగా లోకం ముద్రవేయడంలో భరాగో సహకారం కూడా ఉండటం విశేషం. స్వరాజ్య సమరం ముగిశాక తెలుగువారి సామాజిక జీవనంలోకి స్వార్థ చింతన, సంకుచితత్వమూ చాలా వేగంగా చొరబడ్డాయి. దానికి కారణాలు ఏమిటో, మూలాలు ఎక్కడివో నిశితంగా గమనించి కథల్లో గొప్పగా చిత్రించిన రచయితల్లో భరాగో ముఖ్యుడు. తెలుగువాడి పట్ల ఆపేక్ష, అభిమానం పెంచుకున్న మనిషి కాబట్టే- మనిషిని ద్వేషించడం ఆయనకు వీలుకాలేదు.

'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' కథలో రజక వృత్తి చేసుకునే యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం లభించి, జీవనస్థాయి పెరుగుతుంది. అయినా తన పై అధికారుల ఇళ్లల్లో బట్టలు ఉతికే పని తప్పలేదు. 'పోనీ ఒకలా చెయ్యి. బట్టలు ఉతికేటప్పుడు కొంచెం మోటతనం ఉపయోగించీ, కాస్త బ్లీచింగ్‌ పౌడరు తగిలించీ, ఇస్త్రీ చేసేటప్పుడు మరికొంచె హీటు పెంచీ నీ నైపుణ్యం చూపిస్తే ఏమన్నా మార్పుకి అవకాశం ఉండొచ్చేమో' అన్న సలహా ఎదురవుతుంది. నిజానికి అది అతని అహాన్ని చల్లార్చే సలహాయే! కానీ, ఆ యువకుడు దాన్ని తిరస్కరిస్తాడు. 'సారీ సర్‌ నా స్వభావంలో ఉన్న బేసిక్‌ మోరల్‌ నన్ను అలా చెయ్యనివ్వదండి!'అని బదులిస్తాడు. భరాగోను గుర్తించవలసింది- ఆ జవాబులోనే! బేసిక్‌ మోరల్‌ అని- దేని గురించైతే రచయితగా భరాగో అభిప్రాయపడుతున్నారో అది రచయిత స్వభావంలోనే ఉంటే తప్ప అలాంటి వాక్యం అతని నుంచి ప్రవహించడం కష్టం.

ఈ రకమైన మనస్తత్వంతో తెలుగువాడి ఆత్మలోకపు దివాలాకోరుతనాన్ని చిత్రీకరించేటప్పుడు- ద్వేషానికి బదులుగా సానుభూతి, మనిషి పట్ల వాత్సల్యం, రచయిత శైలిలో హాస్య ధోరణిని ప్రవేశపెడతాయి. మెత్తగా కొట్టిస్తాయి. దానికి వ్యంగ్యమో, హాస్యమో ముసుగేసి మరీ కొట్టిస్తాయి. పైపైకి అవి హాస్యోక్తులుగా భ్రమపెట్టి నవ్విస్తాయి. వాటి పదును నిజానికి చాలా తీవ్రమైనది. హాస్య కథలుగా చలామణీ అవుతున్న ఒక ముళ్లపూడివీ, ఒక భరాగోవి నిజానికి హాస్యకథలు కావు. చాలా గడుసు కథలు. జాణ కథలు. ఈ జాతి పట్ల అపారమైన బెంగలోంచి పుట్టుకొచ్చిన బాపతువి.

అలాగే రాజకీయ క్రీనీడలపై వ్యంగ్య ధోరణిలో చిత్రించిన కథలూనూ. ఉదాహరణకు 'చేతికర్ర'. గవర్నరుగారు పర్యటనకు వస్తున్నారని అధికార యంత్రాంగం అగ్గగ్గలాడుతూ ఎన్నో ఏర్పాట్లు చేసింది. జనాన్ని తెగ కంగారు పెట్టేసింది. ఆ గవర్నరుగారి బాల్యమిత్రుడైన ఒక స్వరాజ్య సమరయోధుడు నానా అగచాట్లు పడి ఎలాగో ఆయన్ను కలుసుకోగలుగుతాడు. అయితే, పోతూ పోతూ దొరగారి చేతికర్రను పొరబాటున పట్టుకుపోతాడు. ఇక దాంతో అధికార గణం హడావుడి చూడాలి. దాన్ని స్వరాజ్య సమరయోధుడి మాటల్లోనే చెప్పాలంటే- 'ఊళ్లోకి ఫలానా వారొస్తున్నారు, కావలసిన వాళ్లు కలుసుకోవచ్చు' అని ప్రకటించినవారు... నేను కలుసుకోవాలని భోగట్టా అడిగితే దరఖాస్తు పెట్టమన్నారు. రెండు రూపాయల కోర్టు స్టాంపు అంటించమన్నారు. నేను పొరబాటున ఆయన కర్ర తెస్తే అది తీసుకోవడానికి అర్ధరాత్రి ఊళ్లో సహం మందిని నిద్రలేపారు. మీ పద్ధతులు మంచివి కావు. మార్చుకోండి. లేకపోతే దేశం పాడైపోతుంది'

ఈ కథను, ముఖ్యంగా ఈ వాక్యాన్ని మన చట్టసభల్లోని పెద్దలకు వినిపించాలనిపిస్తుంది. అంతటి పదునైన చెణుకు భరాగో సొంతం.

ఆయన కథలు చదివాకా 'హాస్య రచయిత' మాత్రమే అని ముద్రవేయడం సాహిత్య ద్రోహం. ఆయన గొప్ప కథకుడు. గుండెలో కొంత భాగాన్ని ఎల్లప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకున్న మనిషి. జబ్‌దిల్‌హీ టూట్‌గయా... అంటూ జీవితపు ఆధారషడ్జమానికి బలంగా ఆనుకుని కథాగానాన్ని దిగంతాలు దాటించిన ఘనుడు. 'సుఖకష్టాలు' అనే పదబంధాన్ని ప్రేమించిన స్వాప్నికుడు. కష్టాలనూ, కన్నీళ్లనూ ప్రేమించి, వాటిలోని కరెంటును కథల్లోకి అనువదించి వాటిని సుఖమైన కష్టాలుగా మార్చుకున్న కష్టజీవి. ఆ క్రమంలోనే కష్టాలకు జీవితాన్ని ముడుపుకట్టి వాటి ఘాటుకు తట్టుకోలేకనూ, అలసట మరిచిపోయేందుకని-

నడిచినంత మేరా నవ్వులు విరజిమ్ముతూ నడిచాడు...
గడిపినంత సేపూ సంగీతంతో సావాసం చేస్తూ గడిపాడు...
కథలు వినిపిస్తూ తిరిగాడు...
సంకలనాలన్నాడు... చాకిరీలు నెత్తికెత్తుకున్నాడు..
'ఏమని పాడెదనో...' అని పాడుకుంటూ అనారోగ్యాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నించాడు.

- చివరికి ఓడిపోయాడు. మృత్యు దేవతను పిల్చి 'ఇట్లు తమ విధేయుడు' అంటూ లొంగిపోయాడు.

మనకు మాత్రం నవ్వుకోవడానికి బోలెడు కథలు మిగిల్చిపోయాడు. ఆ రకంగా మన మధ్యనే ఉండిపోయాడు.
(eenaaDu, 08:04:2010)
______________________________

Labels: ,

Thursday, February 12, 2009

వందేళ్ల అడుగుజాడ!

గురజాడ అప్పారావుగారి 'దేశమును ప్రేమించుమన్నా' దేశభక్తి గేయానికి వందేళ్ల పండగ! వొట్టిమాటలు కట్టిపెట్టి గట్టిగా ఆ గేయాన్ని ఆలపించాల్సిన సమయం వచ్చింది.

వందేళ్ల క్రితం మన తాతో ముత్తాతో ఓ విత్తునాటుంటే, ఇప్పటికది వూడలమర్రంత విస్తరించి ఉంటుంది. అది వేపచెట్టయితే... ఎంతమందిని నిద్రపుచ్చిందో. అది పూలచెట్టయితే... ఎన్ని దండలు కట్టిందో. అది పండ్లచెట్టయితే... ఎన్ని నోళ్లలో అమృతం పోసిందో. అది అక్షరాల చెట్టయితే మాత్రం, ఆ విత్తునాటిన తాతగారు కచ్చితంగా గురజాడవారై ఉంటారు. 'ముత్యాల సరాల్లోంచి' సర్రున జారొచ్చిన ఆ ముత్తెమంత విత్తు...వెులకై, వెుక్కై, చెట్త్టె, మహావృక్షమైంది. ఎన్నో మెదళ్లలో ఆలోచనలు నింపింది. ప్రపంచ మానవుల జాతీయ గీతంగా శ్రీశ్రీ మన్ననలందుకున్న గురజాడవారి 'దేశభక్తి' గేయానికి ఇది శతాబ్ది సంవత్సరం. ఆయన 1910లో రాశారీ గేయాన్ని. ఈ ప్రకారం చూస్తే, 2009 ప్రారంభం నుంచే వందేళ్ల పండగ వెుదలుకావాలి. ప్రభుత్వమూ స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రజలందరూ పూనుకొని 'దేశభక్తిగేయం' శతవార్షికోత్సవానికి ఏర్పాట్లు చేయాలి.

గేయమును ప్రేమించుమన్నా...
వందేమాతరం వందనాలు అందుకుంటున్నప్పుడు, జనగణమన గణగణమని మారువోగుతున్నప్పుడు... గురజాడవారి దేశభక్తిగేయం మాత్రం పాతపుస్తకాల మధ్య పాట్లుపడటమెందుకని ప్రశ్నిస్తున్నారు కృష్ణాజిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ప్రతినిధులు. ''భారతదేశంలో చాలా జాతీయగీతాలొచ్చాయి. వాటిలో దేనికీ అప్పారావుగారి గీతంలోని భావగాంభీర్యం లేదు. బంకించంద్రుని 'వందేమాతరం' కానీ రవీంద్రుని 'జనగణమన' కానీ, ఇక్బాల్‌ 'హిందుస్థాన్‌ హమారా' కానీ 'దేశమును ప్రేమించుమన్నా...' గీతానికి ఏమాత్రం సరితూగవు'' అంటారు మద్దుకూరి చంద్రశేఖరరావు తన 'చంద్రం వ్యాసావళి'లో. వందేమాతర గీతం మీద చాలా విమర్శలొచ్చాయి. అందులో 'విగ్రహారాధన' కనబడుతోందని మహ్మద్‌ ఆలీ జిన్నా లాంటివారు నిరసించారు. జనగణమన మీదా ఏవో అభ్యంతరాలొచ్చాయి. కానీ 'దేశభక్తి' గేయం మాత్రం విమర్శలకు అందనంత గొప్ప స్థాయిలో ఉందని గురజాడ అభిమానుల అభిప్రాయం. 'పెద్ద కొండలు, నదులు, వృక్షాలు...ఇవా ప్రజలకు ధైర్యసాహసాలూ ఉత్తేజం కలిగించేవి? అన్ని కాలాల్లోనూ ఇవన్నీ స్థిరంగా ఉండేవే. ఒక్కో యుగంలో ఒక్కో జాతి ప్రజలు ఆయా ప్రదేశాల్లో ఉంటారు. వారిలో మహానుభావులు, వారి గుణగణాలు, జాతి జీవితం... ఇవే వర్ణనీయమైనవి, ప్రజల్లో చైతన్యం కలిగించేవి' అని సాక్షాత్తు గురజాడవారే బంకించంద్రుని గీతాన్ని ఆక్షేపించారని ఓ ప్రచారం. ఒక్క గురజాడవారి రచన తప్ప, ఏ దేశభక్తి గేయమూ 'ఆచరణకు' ప్రాధాన్యం ఇవ్వలేదు. మహాకవి స్వాతంత్య్ర పోరాటంలోనే కాదు, స్వతంత్రం వచ్చాకా ఎలా మెలగాలన్నది చెప్పారు. 'జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయి' అనడంలో స్వావలంబన ఆవశ్యకత ధ్వనిస్తోంది. 'సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచిన నాడే సామాజిక అభ్యుదయమనీ, లేకపోతే ఎంత ప్రకృతి సంపద ఉన్నప్పటికీ దానివల్ల ప్రయోజనం నెరవేరదని మహాకవి హెచ్చరించారు. ఇది ఆయన గేయంలోని అంతర్జాతీయ స్వభావం' అంటారు స్వాతంత్య్ర సమరయోధులు పరకాల పట్టాభిరామారావు.


మతం గురించి గురజాడ చెప్పిన మాటలూ వర్తమాన సమాజానికి వర్తించేవే.
'అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి'

... ఎంత గొప్ప మాట. అన్నట్టు...

'మందగించక ముందు అడుగేయి వెనకపడితే వెనకేనోయి' అన్న హెచ్చరికనూ మరచిపోకూడదు.

శ్రీశ్రీ అయితే, 'దేశభక్తి గీతం సమస్త ప్రపంచ మానవుల జాతీయ గీతం. రామాయణ, భారతాది ఇతిహాసాలకున్న విలువ ఈ ఒక్క గీతానికే ఉందంటే కొందరు ఆశ్చర్యం పొందుతారేవో! కాలం గడుస్తున్నకొద్దీ బలం సంతరించుకునే కొద్దిపాటి మహాకావ్యాలలో ఒకటిగా దీన్ని గుర్తించక తప్పదు. ఒక తెలుగు కవి ప్రపంచానికి ఇచ్చిన కానుక ఇది. మానవుని ఆధ్యాత్మిక యాత్రలో భగవద్గీతకు గల ప్రత్యేక స్థానం ఉంది, గురజాడ దేశభక్తి గీతానికి' అంటూ మనసారా కీర్తించారు.

అడుగుజాడ గురజాడదని చెప్పుకోవడం కాదు.

నిజంగానే ఒక్కటై అడుగులేయాల్సిన సమయం వచ్చింది. రండి... కలిసి పాడుకుందాం!

దేశభక్తి గేయం
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోయి
గట్టిమేల్‌ తలపెట్టవోయి!

పాడి పంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటుపడవోయి
తిండి కలిగితె కండకలదోయి
కండగలవాడేను మనిషోయి!

యీసురోమని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయి?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయి!

పూనుస్పర్ధలు విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధ కలహం పెంచబోకోయి
కత్తివైరం కాల్చవోయి!

దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని యేదైనాను వొక మేల్‌
కూర్చి జనులకు చూపవోయి!

స్వంతలాభం కొంతమానుకు
పొరుగువాడికి తోడుపడవోయి
దేశమంటే మట్టికాదోయి
దేశమంటే మనుషులోయి!

చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయి,
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయి!

మతం వేరైతేను యేవోయి?
మనసు లొకటై మనుషులుంటే
జాత మన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయి

దేశమనియెుడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయి
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయి!

ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలెనోయి
పలుకులను విని దేశమం దభి
మానములు వెులకెత్తవలె నోయి!
-గురజాడ అప్పారావు (1910)
(ఈనాడు,౦౮:౦౨:౨౦౦౯)
_______________________

Labels: ,

Wednesday, February 11, 2009

తెలుగు భాస్కరుడు అస్తమించాడు!

చెన్నై, న్యూస్‌టుడే:
చెన్నైనగరంలో ఏ తెలుగు కార్యక్రమం జరిగినా ఆయన హాజరీ తప్పదు. ఎక్కడ తెలుగు పలుకు వినిపించినా నుదుట కుంకుమబొట్టు, చేతిలో సంచి, సాదాసీదా వస్త్రాలతో ఎంతెంతో శ్రమకోర్చి వెళ్లే ఆయన జీవనయానం ఆగిపోయింది. తమిళనాడు తెలుగువారు ప్రవాసులుకారని తీవ్రంగా వాదించే ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. నగర చిన్నారులను ఊరేగింపుగా తీసుకెళ్లి... వీధివీధినా తెలుగు నినాదాలు వినిపించినా ఆ కాళ్లు ఆగిపోయాయి. చెన్నైలోని తెలుగు ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి మురిసిపోయినా ఆ చేతులు అచేతనాలయ్యాయి. అవును! మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం వ్యవస్థాపక కార్యదర్శి పేరిశెట్ల భాస్కరుడు తుది శ్వాస విడిచారు. తెలుగు తల్లి ఉచ్ఛ్వాసనిశ్వాసలో కలిసిపోయారు.

తెలుగు తల్లి ముద్దుబిడ్డ పేరిశెట్ల భాస్కరడు సోమవారం మృతిచెందారు. ఆయన వయసు 66 ఏళ్లు. భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆరణి సమీపంలోని కుమ్మరపేట ఆయన స్వస్థలం. తల్లితండ్రుల కాలంలోనే ఉత్తరచెన్నై చాకలిపేటలో స్థిరపడ్డారు. రాష్ట్ర రహదారి విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ ఎనిమిదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతూ వచ్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో కన్నుమూశారు. భాస్కరుడు అంత్యక్రియలు మంగళవారం ఉదయం 6.30 గంటలకు కొరుకుపేట ఎంజీఆర్‌ నగర్‌లోని శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు

తెలుగు నూరిపోశారు...
తమిళనాట తెలుగు వికసించాలంటూ... వినిపించాలంటూ గత 30 ఏళ్లుగా నినదించారాయన. ఉత్తరచెన్నైలోని నేటి యువతకు వార్షిక వూరేగింపులతో తెలుగుపాలను నూరిపోశారాయన. ఆయనకు డాక్టర్‌ సీఎంకేరెడ్డి నేతృత్వంలోని అఖిల భారత తెలుగు సమాఖ్యతో అవినాభావ సంబంధం ఉంది. దేవాంగ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ప్రతి ఏడాది అమరజీవి పొట్టి శ్రీరాములు, పిట్టి త్యాగరాయ చెట్టి జయంతి, వర్థంతి వేడుకలు, వీరపాండియ కట్టబ్రహ్నన జయంతి, వర్థంతి వేడుకలు, తెలుగు ఉగాది వేడుకలు, హరికథా కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించేవారు. గత జులైలోఅనారోగ్యం తనను ఇబ్బంది పెడుతున్నా కూడా తిరుచ్చిలో జరిగిన తెలుగు సాంస్కృతిక ఉత్సవాలకు వెళ్లి వచ్చారాయన. ఆ తర్వాత కొంతకాలానికే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.

ప్రగాఢ సంతాపం...
మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం వ్యవస్థాపక కార్యదర్శి పేరిశెట్ల భాస్కరుడు మృతిపట్ల పలువురు తెలుగు ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తంచేశారు. అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సీఎంకేరెడ్డి తమ సమాఖ్య నిర్వాహకులతో కలిసి కొరుకుపేటలోని పేరిశెట్ల భాస్కరుడు నివాసానికెళ్లి భౌతిక కాయానికి పూలమాలేసి నివాళులర్పించారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, పోయస్‌గార్డన్‌ లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు లయన్‌ నాగరాజు, మద్రాసు తెలుగు అభ్యుదయ సమాజం అధ్యక్షుడు ఎంఆర్‌ సుబ్రహ్మణ్యం, ద్రావిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు, మద్రాసు తెలుగు యువసేన ఉపాధ్యక్షుడు ఇ.పెంచలస్వామి తదితరులు భాస్కరుడు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

'ఆర్థిక స్తోమత లేకపోయినా తెలుగు కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించేవారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయన లోటు చెన్నైలోని తెలుగు సంఘాలకు తీరని లోటు.'
- సీఎంకే రెడ్డి, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు
'తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలనే డిమాండుతో మేం చేపట్టిన కరపత్రాల ఉద్యమంలో ఆయనది కీలకపాత్ర. తమిళనాడులో మాతృభాష తెలుగు భాష వికాసానికి తన వంతు కృషిచేసిన అరుదైన వ్యక్తుల్లో ఆయనా ఒకరు.'
- కృష్ణారావు, అధ్యక్షుడు, ద్రావిడ దేశం
'ఆయన సంఘం తరపున ఒక వైపు తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇతర సంఘాలు జరిపే తెలుగు కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. భాస్కరుడి మృతి వ్యక్తిగతంగా తనకు తీరనిలోటు.
- గుడిమెట్ల చెన్నయ్య, జనని ప్రధాన కార్యదర్శి
ఎప్పుడూ మేమిద్దరమే ఒకటిగా తిరిగేవాళ్లం. అలా నా సహచరి నాకు తీరని లోటుమిగిల్చాడు
- లయన్‌ నాగరాజు
(ఈనాడు , ౧౦:౦౨:౨౦౦౯)
__________________________________

Labels: ,

Monday, June 16, 2008

అక్షరాగ్ని గిరిశిఖరం

16:06:2008 శ్రీశ్రీ 25వ వర్ధంతి
- రావూరి ప్రసాద్‌
... శ్రీశ్రీ- తెలుగు అక్షరాన్ని సాయుధం చేశాడు... తెలుగు పదాన్ని రణగర్జనగా మలచాడు... తెలుగు వాక్యానికి 'యుద్ధ వ్యాకరణాన్ని' నేర్పాడు... తెలుగు పద్యాన్ని సంగ్రామ భేరీనాదంలా పలికించాడు... తెలుగు పాటకు కదన రాగాన్ని కూర్చాడు, కదం తొక్కించాడు...

ఒక మేరునగం గురించి ఓ గులకరాయి ఏం పలకగలదు? ఒక అగ్నిపర్వతాన్ని ఓ ధూళికణం ఏమని వర్ణించగలదు? ఒక మహాసముద్రం గురించి ఓ నీటి బిందువు ఏం మాట్లాడగలదు? ఇవాళ శ్రీశ్రీ గురించి కొత్తగా ఎవరు మాత్రం ఏం రాయగలరు?

వెంటనే- 'మరల ఇదేల రామాయణంబన్నచో నా దైన భక్తి నాది గాన' అన్న విశ్వనాథవారి ఉవాచను గుర్తుకు తెచ్చుకుని- 'మాదైన ప్రేమ మాది గాన' అని సగర్వంగా శ్రీశ్రీ గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే, రావిశాస్త్రి అన్నట్లు 'శ్రీశ్రీగారు మా మహాకవి. ఆయనంటే మాకు ఎంతో ఇష్టం. ఎంతో గొప్ప. మాకు చాలా గర్వం!'

పాతికేళ్ల క్రితం ఇదే రోజున తన 74వ ఏట కనుమూసిన యువకుడు శ్రీశ్రీని ఇవాళ తలచుకోవడం అందుకే. ఆయన గురించి కొత్తగా చెప్పడానికి ఎవరూ ఏమీ మిగిల్చి ఉండక పోవచ్చు. కానీ-

'ఇలా వచ్చావేం వెన్నెలా?
ఎలా వర్ణించను నిన్ను?...
ఏది రాసినా ఏం లాభం?
ఇదివరకెవడో అనే వుంటాడు
బహుశా ఆ అన్నదేదో నా కన్నా
బాగానే అని వుండొచ్చు'- అన్న శ్రీశ్రీ కూడా 'వెన్నెల పేరెత్తితేచాలు... వెర్రెత్తి పోతుంది మనస్సు' అంటూ 'శరచ్చంద్రిక' గీతాన్ని వెలయించాడు. అలాగే- శ్రీశ్రీ గురించి ఇంతకుముందు చెప్పినవాళ్లు అందరి కన్నా బాగానే చెప్పి ఉండవచ్చు. అయినా మహాకవి పేరు తలుచుకుంటే చాలు... మన మనస్సులూ వెర్రిత్తిపోతాయి. ఆ రెండు అక్షరాలు హృద్రక్తాన్ని ఉరకలెత్తిస్తాయి.'స్మరిస్తే పద్యమై, అరిస్తే వాద్యమ'య్యే ఆ శబ్ద విపంచి వినిపించే భాస్వరస్వరాలు హృదయాన్నంతటినీ రసమయం చేస్తాయి. శ్రీశ్రీ అంటే నిప్పులు విరజిమ్మే రెండు అక్షరాగ్ని పర్వతాలు... కాంతులు వెదజల్లే రెండు కవితానల ఖడ్గాలు! నవ్య చేతనార్చి- ఒక శ్రీ... నిత్య జాగృతాగ్ని మరో శ్రీ. వెరసి శ్రీశ్రీ అనే రెండు అక్షరాలు వాగ్దేవి కర్ణాభరణాలై ధగద్ధగాయమానంగా వెలుగులీనే రెండు జ్వాలావలయాలు!!

ఈ సమాజ సమరాంగణంలో- అణగారిన ఆర్తజనుల పక్షాన తన అక్షర అక్షౌహిణులను మోహరించిన సారస్వత మహాసేనాని శ్రీశ్రీ.

అతడు- తెలుగు అక్షరాన్ని సాయుధం చేశాడు... తెలుగు పదాన్ని రణగర్జనగా మలచాడు... తెలుగు వాక్యానికి 'యుద్ధ వ్యాకరణాన్ని' నేర్పాడు... తెలుగు పద్యాన్ని సంగ్రామ భేరీనాదంలా పలికించాడు... తెలుగు పాటకు కదన రాగాన్ని కూర్చాడు, కదం తొక్కించాడు.

''ఈనాటి కవిత్వమంతా ఏమిటి? ఎందుకు వుంది ఏం చేస్తోంది?'' అని ధిక్కరించి అడిగే తెలుగు ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం ప్రత్యుత్తరం- అన్నాడు ఒకప్పుడు చెలం. అవును. కవిత్వంలో విద్యుత్‌తేజాన్ని వికసింపజేసిన తన అక్షరశక్తినంతటినీ పతితులకోసం, భ్రష్టులకోసం, బాధా సర్పదష్టులకోసం వెచ్చించిన తెలుగు శబ్ద విరించి శ్రీశ్రీ. దగాపడిన తమ్ముల, కూడు లేని భిక్షుల, గూడులేని పక్షుల, దిక్కులేని దీనుల, హీనుల బాధల్ని గాధల్ని కష్టాల్ని కన్నీళ్లను పాటలుగా కట్టి తెలుగు కవిత్వాన్ని 'భూమార్గం పట్టించాడు, భూకంపం పుట్టించాడు.'

అప్పటిదాకా తనను నడిపిస్తూ వచ్చిన కవిత్వాన్ని ఆ తరవాతి నుంచి తాను నడిపిస్తూ వస్తున్నానని అంటూ 'ఈ శతాబ్దం నాది' అని చాటుకున్న అల్పసంతోషి శ్రీశ్రీ. ఆ శతాబ్దమే కాదు, కవిత్వపరంగా రానున్న శతాబ్దాలూ శ్రీశ్రీవే. ఎందుకంటే, 'అర నిమిషం గడిచేసరికల్లా అదే నాకు గత శతాబ్ది' అన్నదీ ఆయనే. తనదిగా ఆయన చెప్పుకొన్న శతాబ్దంలో ఎన్ని అర నిమిషాలు గడచిపోయి ఉంటాయో లెక్క వేసుకొంటే- ఎన్ని శతాబ్దాల పాటు శ్రీశ్రీ అక్షర'సరస్వతి' సంతకం చెక్కు చెదరదో అర్థం చేసుకోవచ్చు.

''శ్రీశ్రీ పేరు తలుచుకుంటే చాలు/ వాగ్దేవి ఆలయప్రాంగణంలో అక్షర మహోత్సవం కళ్లారా చూడవచ్చు/ రానున్న సూర్యోదయాలపై కూడా శ్రీశ్రీ సంతకం చేస్తున్న సన్నివేశం చూడవచ్చు''నంటూ మహాకవికి అజంతా అర్పించిన నివాళి అక్షరసత్యం.

శ్రీశ్రీ నిర్మించిన అక్షర దుర్గం జనం కోసం! అధర్మనిధనానికై అతడు సృష్టించిన అక్షర ఖడ్గం జనం కోసం! 'మనుష్య సంగీతాన్ని మీటుతూ, మానవ సందేశాన్ని చాటుతూ, కష్టజీవికి ఇరువైపులా నిలిచి' అతడు కవిత్వీకరించిన అక్షర సముచ్ఛయం జనంకోసం! 'మాటలచేత మాట్లాడిస్తూ, రక్తం చేత రాగాలాపన చేయిస్తూ' అధోజగత్‌ సహోదరులకు బాసటగా అతడు ఆవాహన చేసి ప్రతిష్ఠించిన ప్రతి పదం, ప్రతి వాక్యం, ప్రతి పద్యం, ప్రతి పాట జనం కోసమే!

తమ కోసం తెలుగు సాహిత్యానికి కొత్త రూపు కల్పించి, కొత్త చూపునిచ్చి, కొత్త రక్తం ఎక్కించి కొత్త దారుల్లో నడిపించిన శ్రీశ్రీకి తెలుగువాళ్లు ఇవాళ చూపిస్తున్న చోటెక్కడ? జయంతులు, వర్ధంతుల సందర్భంగా సంస్మరణ సభలూ సమావేశాలు నిర్వహించో, శిలావిగ్రహానికి పూలమాలలు వేసో, చేతులు దులిపేసుకోవడమేనా మన మహాకవి పట్ల మనం చూపించే కృతజ్ఞత? మనం అర్పించే నివాళి?

శ్రీశ్రీ మన జాతి కవి. తాను యావదాంధ్ర జాతికీ చెందిన కవినని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొన్నారు కూడా. ఆయన అభిమానుల్ని, కొన్ని సంస్థలను మినహాయిస్తే- 'తనవాడు' అని తెలుగు జాతి సగర్వంగా చెప్పుకోవలసిన శ్రీశ్రీకి ప్రభుత్వపరంగా మన్నన దక్కకపోవడానికి రాజకీయాలే కారణమైతే- అది పాలకుల సంస్కార రాహిత్యం; సాంస్కృతికంగా దివాలాకోరుతనం! అయినా- ప్రజల కవిగా అజరామర కీర్తినార్జించుకున్న ఆయనకు ప్రభుత్వ భుజకీర్తులు అనవసరమే.

వ్యక్తిగా తాను అశాశ్వతమని, తన సాహిత్యం ఎప్పటికీ నిలుస్తుందన్నది- తనలోని వ్యక్తిగత లోపాలను విమర్శించేవారికి ఆయన జవాబు. కవిగా ఆయన మహోన్నతుడు, మరణం లేనివాడు. తెలుగువాడి జీవనాడి! శ్రీశ్రీ ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా తన అక్షరాల రూపేణా చిరంజీవే. రావిశాస్త్రి మాటల్లో చెప్పాలంటే- ''భారత జాతికీ, ప్రపంచ సాహిత్యానికీ ఈతడు తెలుగువారిచ్చిన వెలుగుకానుక. తెలుగు భాష ఉన్నంత కాలం ఈయన ఉంటారు. తెలుగుభాష మాసిపోతే, ఈయన మిగతా భాషల్లో ఉంటారు. ఈ ప్రపంచంలో మానవుల మనుగడ ఉన్నంతకాలం ఈయన ఉంటారు. మానవుడు మరో ప్రపంచాన్నీ, మరి కొన్ని లోకాల్నీ వెతుక్కు వెళ్తే శ్రీశ్రీ గారు వారితోపాటు అక్కడ కూడా ఉంటారు. అవును! శ్రీశ్రీ మహాకవి! మహా మనీషి!''

తాను సృష్టించుకున్న మరో ప్రపంచంలోకి శ్రీశ్రీ మహాభినిష్క్రమణం చేసిన రోజిది.
''...యుగ సంగీతాన్ని

లక్షనక్షత్రాలుగా వెలిగించాడు
శతకోటి జలపాతాలుగా నినదించాడు
'శ్రీశ్రీ చనిపోయాడ'ని అనకండి
ఒక మహాకవి అమరత్వం అతనిది!''- అంటూ కవి శివసాగర్‌ శ్రీశ్రీకి ఘటించిన కవితాంజలి స్మరణీయం.

నిజమే. శ్రీశ్రీ లేడని అనకండి. అతను చనిపోలేదు... కవిత చవిపోలేదు.

శ్రీశ్రీ-
అధునాతన భారతాన
అనల'గీత'కాద్యుడు
ఎన్ని యుగాలైనా
ఎప్పటికీ ఆరాధ్యుడు!
(eenadu,16:06:2008)
____________________________

Labels: ,

Sunday, June 15, 2008

నాగభైరవ కోటేశ్వరరావు కన్నుమూత

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రముఖ కవి, సాహితీవేత్త ఆచార్య నాగభైరవ కోటేశ్వరరావు (76) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక్కడి మధురానగర్‌లోని స్వగృహంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మృతి చెందారు. ఆయనకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. భార్య చాలాకాలం క్రితమే చనిపోయారు. అనేక కథలు, కవితాసంపుటిలు రాసిన నాగభైరవకు.. తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉండేది. 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'కు ఆయన మాటలు కూడా రాశారు. ఇరవై సినిమాలకు పాటలు రాశారు. ఆయన మృతికి ముఖ్యమంత్రి వైఎస్‌, తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ కార్యదర్శి నారాయణ సంతాపం వ్యక్తంచేశారు. మూడు దశాబ్దాలుగా తన వచన కవితలతో యువతరాన్ని ప్రోత్సహించారని, కవిత్వం ద్వారా అభ్యుదయ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాగభైరవ సిద్ధహస్తుడని వైఎస్‌ పేర్కొన్నారు. ఆయన రచనలు తెలుగుసాహితీ ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందాయని, రంగాజమ్మ, కన్నీటిగాధ, గుండ్లకమ్మ చెప్పిన కథలు సామాజిక స్పృహకు నిదర్శనాలని బాబు తెలిపారు. నాగభైరవ ఎందరో యువ సాహిత్యవేత్తలను ప్రగతిశీల సాహిత్యం వైపు నడిపించిన ఉద్యమకారుడని నారాయణ శ్లాఘించారు.

కవన విజయంతో ప్రాచుర్యం: నాగభైరవ వృత్తి రీత్యా అధ్యాపకుడైనా.. కవి, రచయిత, సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యుడిగా భిన్న భూమికలు పోషించారు. ప్రకాశం జిల్లా రావినూతలలో 1931 ఆగస్టు 15న జన్మించిన ఆయన.. ప్రాథమిక విద్యాభ్యాసం ఆ జిల్లాలోనే పూర్తి చేశారు. తెలుగు భాషపై మమకారంతో తెలుగు మాధ్యమంలోనే ఉన్నత విద్యను పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగరీత్యా నెల్లూరు వెళ్లారు. అక్కడి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో దీర్ఘకాలం తెలుగు అధ్యాపకుడిగా విధులు నిర్వహించారు. అనంతరం గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, చేబ్రోలు, ప్రకాశం జిల్లాలోని చీరాలలో పనిచేశారు. విధులు నిర్వహిస్తూనే.. సాహిత్యంపై అభిరుచితో కథలు, కవితా సంపుటిలు, నవలలు రాశారు. ఇందులో రంగాజమ్మ, కన్నీటి గాథ, తూర్పు వాకిళ్లు, ఒయాసిస్సు ముఖ్యమైనవి. 'భువన విజయం'కు వ్యంగ్యానుకరణగా ఆయన రాసిన 'కవన విజయం' పుస్తకం బాగా ప్రాచుర్యం పొందింది. 300కిపైగా ప్రదర్శనలు నిర్వహంచారు. తెలుగు సాహిత్యంపై 'గురజాడ నుంచి బెజవాడ దాక' అన్న కవితా రూపం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. వెలుతురు స్నానం, గుండ్లకమ్మ చెప్పిన కథలు, పద్యరూపకాలనూ రచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. 2001లో తానా అమెరికాలో నిర్వహించిన తెలుగు మహాసభలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈయనకు రాజాలక్ష్మి ఫౌండేషన్‌, గడియారం వేంకట శేష శాస్త్రి, రామినేని ఫౌండేషన్‌ వారి నుంచి పురస్కాలు పొందారు.
(ఈనాడు, 15:06:2008)
__________________________________

Labels: ,

Tuesday, November 20, 2007

సాహితీ తపస్వి 'పులికంటి' మృతి

తిరుపతి(క్రీడలు), నవంబరు 19 (న్యూస్‌టుడే):
చిత్తూరు నుంచి చికాగో దాకా సాహిత్య రసజ్ఞుల హృదయాలను కొల్లగొట్టిన సాహితీ పిపాసి అతడు.. ఐదు దశాబ్దాలుగా మాండలిక పరిభాషలో జనజీవనాన్ని కళ్లకు కట్టినట్టు తన రచనల్లో ప్రతిబింబించి, కవితకు కొత్త ఒరవడిని నేర్పిన మేధావి.. కలాన్ని గళంలో ధ్వనించి అందెలు మోగించిన గాయకుడు.. సీమ జీవితాల శిథిల ఘోషను తన సాహిత్యంలో ఏర్చి కూర్చిన భావుకుడు.. 'నిండుగా, కండగా, కవితల కలకండ' అంటూ నారాయణరెడ్డి, 'ప్రణయార్థ మెరిగిన భావకుడతడంటూ' శంకరంబాడి పొగిడినా.. 'రాయలసీమ చిన్నోడు'గా అందరి గుండెల్లో నిలిచిన సాహితీ తపస్వి పులికంటి కృష్ణారెడ్డి. ఆయన కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజులుగా స్విమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.

జీవిత విశేషాలు:
చిత్తూరు జిల్లా జక్కదొన గ్రామంలో గోవిందరెడ్డి, పాపమ్మకు 1931 జులై, 30న పులికంటి జన్మించారు. డిగ్రీ కాకుండానే రైల్వేలో బుకింగ్‌ క్లర్క్‌గా, ఏఎస్‌ఎంగా పనిచేశారు. అనంతరం తన ఆశయాలకు ఉద్యోగం అడ్డని భావించి రాజీనామా చేసి తిరుపతిలో కాఫీ పొడి వ్యాపారం ప్రారంభించారు. అదే సమయంలో సొంతంగా 'కామధేను' పక్ష పత్రికకు శ్రీకారం చుట్టి విలేఖరి కూడా అయ్యారు. ఇవేవీ సంతృప్తి ఇవ్వకపోవడంతో సాహిత్య రంగంవైపు అడుగులు వేశారు.

తనదైన ముద్ర:
కథకుడిగా, కవిగా పులికంటి అనేక రచనలు చేశారు. రాయలసీమ సాహిత్యంలో 'రాయలసీమ చిన్నోడు'గా ప్రాచుర్యం పొందారు. మాండలిక రచనల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1961లో 'గూడుకోసం గువ్వలు' ఆయన రచించిన మొదటి కథ. ఆ తర్వాత 'అరచేతిలో గీత', 'తీయలేని కలుపు', 'మరపురాని మా ఊరు' తదితర కథలకు తెరతీశారు. 'నాలుగ్గాళ్ల మండపం'లో సామాన్య జనజీవితాన్ని ఆవిష్కరించిన తీరుతో కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. 'పులికంటి కథలు', 'కోటిగాడు స్వతంత్రుడు' కథా సంపుటి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.

నిర్వహించిన పదవులు:
ఆకాశవాణి, దూరదర్శన్‌ సలహా సభ్యుడిగా, ఎస్వీయూ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఫెర్‌ఫామింగ్‌, రాయలసీమ జర్నలిస్ట్‌ సంఘ సభ్యునిగా వివిధ పదవులు నిర్వహించారు.

కీర్తి కిరీటాలివీ:
ప్రతిభకు గుర్తింపుగా ఆయనకు అనేక బహుమతులు, రివార్డులు దక్కాయి. చిత్తూరు నాటక అకాడమీ-నటశేఖర్‌ అవార్డును, బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి-ఉత్తమ నటుడు, హైదరాబాద్‌ యువకళా వాహిని-గోపిచంద్‌ అవార్డుల్ని ప్రదానం చేశాయి. దీంతో పాటు జానపద కోకిల, ధర్మనిధి పురస్కార్‌ పొందారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు 2005లో ఎస్వీయూ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించి తన కృతజ్ఞతను చాటుకుంది.
(Eenadu, 20:11:2007)
____________________________________

Labels: ,

Saturday, September 08, 2007

ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ అస్తమయం

ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిషశాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు భమిడిపాటి రాధాకృష్ణ(78) మంగళవారం ఉదయం 11.05 గంటలకు రాజమండ్రిలో మృతి చెందారు. ఆస్తమా, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఆయన స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడురోజుల క్రితం కోమాలోకి వెళ్ళిన ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. 1929, నవంబరు 24న రాజమండ్రిలో జన్మించిన రాధాకృష్ణకు భార్య సుశీల, ఒక కుమార్తె, అయిదుగురు కుమారులు ఉన్నారు. ఈయన 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంతవేదాంతం తదితర నాటిక, నాటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. కీర్తిశేషులు నాటకంలోని ఓ పాత్ర ద్వారా ప్రముఖ నటుడు రావుగోపాలరావు మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు పోద్బలంతో భమిడిపాటి సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కళాతపస్వి కె.విశ్వనాథ్‌ తొలి చిత్రమైన ఆత్మగౌరవం చిత్రం కూడా ఉంది. బ్రహ్మచారి, కథానాయకుడు, కీర్తిశేషులు, మరపురానికథ, విచిత్రకుటుంబం, పల్లెటూరి బావ, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామ కళ్యాణం, నారీనారీ నడుమ మురారి, కాలేజీ బుల్లోడు వంటి చిత్రాలకు ఈయనే కథకుడు. నాటి తరంలోని ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ వంటి మహానటులకు భమిడిపాటి సన్నిహితుడు. ప్రత్యేకించి అక్కినేని నాగేశ్వరరావుతో మంచి మైత్రి ఉండేది. ఆయన ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పనిసరిగా భమిడిపాటిని కలిసేవారు. రాధాకృష్ణ 1994 తరువాత క్రమంగా సినిమా రంగానికి దూరమై తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. భమిడిపాటి క్యాలెండర్‌ పేరిట క్రీస్తు పూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా రాధాకృష్ణ అసాధారణ ప్రజ్ఞాపాటవాలు కనబరిచారు. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా నామకరణ మహోత్సవం సందర్భంగా చిన్నారులు బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా జాతకాలు చెబుతారనే పేరుంది. 'అపరిచితుడు' సినీ హీరో అసలుపేరు కాన్‌ కెనడీ కాగా జాతకం ప్రకారం ఆయనకు విక్రమ్‌గా నామకరణం చేసింది రాధాకృష్ణ కావడం గమనార్హం. హాస్యబ్రహ్మ భమిడిపాడి కామేశ్వరరావు కుమారుడిగా ఆయన రచనా వారసత్వాన్ని రాధాకృష్ణమూర్తి పుణికి పుచ్చుకుని సునిశితమైన వ్యంగ్యాన్ని రంగరించి ఆయన కథల్లో హాస్యాన్ని పండించేవారు. తుది ఘడియల వరకు కూడా రచనా వ్యాసంగంలోనే మునిగి తేలారు. తాను 'సెప్టెంబరు 4న గంట కొట్టేస్తాన'ని నర్మగర్భంగా తన మరణ తేదీని ముందే డైరీలో రాసుకున్న ఉదాహరణ రాధాకృష్ణ హాస్యచతురతకు, సంఖ్యా, జ్యోతిష శాస్త్రాలపై ఆయనకున్న పట్టును రుజువు చేస్తుంది. ప్రముఖ వారపత్రిక 'స్వాతి' ఎడిటర్‌ వేమూరి బలరామ్‌ భమిడిపాటి రాధాకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించగా, సాహితీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.
(Eenadu, 05:09:2007)

Labels: ,

Wednesday, August 29, 2007

అచ్చమైన నుడికి అతడే గొడుగు

గిడుగు జయంతి సందర్భంగా...
- అక్కిరాజు రమాపతిరావు
సమాజానికి, దేశానికి, జాతికి, సాహిత్యానికి గొప్ప మేలు చేసినప్పుడే ఒక వ్యక్తిని మహాత్ముడని, మహనీయుడని, మహాపురుషుడని ప్రజలు భావిస్తారు. అంతకు పూర్వం లేని కొత్త వికాసాన్ని, పరిణామాన్ని, సమాజహితాన్ని ఆ వ్యక్తి సాధించినప్పుడు ఆ జాతి జనులకు ఆయన చిరస్మరణీయుడంటాము. ఆధునిక తెలుగు భాషా సాహిత్య చరిత్రలో గిడుగు రామమూర్తి అటువంటివారిలో ప్రముఖులు.

ప్రపంచాన్ని చూసి నేర్చుకోండి అని తెలుగువారికి ప్రబోధించిన గిడుగు... భాషా శాస్త్ర విజ్ఞానాన్ని తెలుగువారికి మొదటిసారిగా పరిచయం చేశారు. తెలుగును ఆధునికీకరించడానికి బీజావాపం చేసి పంట పొలాన్ని తయారుచేశారు. ఆయన వ్యాకరణాన్ని కాదనలేదు. సంప్రదాయ సాహిత్యాన్నీ వద్దనలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకోవచ్చనీ చెప్పలేదు. భావ ప్రకటనలో భాషాశైలిలో తప్పులంటూ ఏమీ ఉండవు, ఉంటే మాత్రం ఏం? అనీ అనలేదు. భాష ఎదుగుదలను కాంక్షించాడు. ఆ విషయమే పండిత పామరులందరూ అర్థం చేసుకునేట్లు చెప్పాడు. ఇంటగాని, బయటగాని, ఉపన్యాసాల్లో రచయితల రచనల్లో కాని ఒక భావ ప్రకటన కోసం ఉపయోగించే పదాన్ని అది వ్యాకరణం ద్వారా సమర్థించలేమనో, నిఘంటువులో లేదనో, మాండలికమనో, గ్రామ్యమనో అనకూడదని మాత్రమే ఆయన కట్టడి చేశారు. కవి ప్రయోగం ద్వారా ఆ పదం తాలూకు ఔచిత్యమో, అనౌచిత్యమో చర్చించవచ్చు, నిర్ణయించవచ్చు. కానీ సాధుత్వమో, అసాధుత్వమో నిర్ధరించే హక్కు ఏ పండితుడికీ, ఏ విమర్శకుడికీ లేదనీ, ఉండకూడదనీ ఆయన వాద సారాంశం. డెబ్భై ఏళ్ళ కిందట ఆయన ఏమని చెప్పారో చూడండి: ''విద్యా విధానము మారవలెను. ప్రజలకు సులభముగా తెలిసేటట్టు మాతృభాషలో సమస్త శాస్త్రములు బోధించవలెను. నాజూకుగా సరసంగా సభ్యంగా ఎదుటివారి మనస్సు ఆకర్షించేట్టు మాటలాడడము, ఉపన్యసించడమూ నేర్పవలెను. ప్రజా ప్రభుత్వము బాగా ఉండవలెనంటే వక్తృత్వము బాగా వృద్ధి పొందవలెను''

వక్తృత్వం అంటే దాన్ని మాతృభాషలో కాక ఏ భాషలో వృద్ధి చేయగలుగుతారు? వ్యక్తృత్వానికి అన్య భాషల వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రజాసామాన్యంలో అది సాధ్యమా? ప్రజల సాముదాయక చర్చల వల్ల, అభిప్రాయ వినిమయం వల్ల ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుందని, ప్రపంచమంతటా వర్తించే సంప్రదాయం ఇదేనని నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ కూడా అన్నారు. అసలైన ప్రజాస్వామికపు విశాల దృక్పథం ఏమంటే ప్రజల అభిప్రాయం, చర్చలు, వాదోపవాద పరిగణనం, పరిపాలనలో ప్రజల మాట ప్రాధాన్యంగా ఉండాలనీ అయన చెప్పారు. గిడుగువారు చెప్పిందీ అదే. ''గ్రీసు దేశంలో ప్రాచీన కాలంలో వాగ్మిగా ఉండటమే గొప్ప విద్యగా ఎంచుకునేవారు. నోటి మాటకే జయము. నాటక రచన కూడా ఆ దేశంలో వృద్ధి పొంది ప్రజలను విజ్ఞానవంతులనుగా చేయడానికి తోడ్పడింది. మనదేశంలో కూడా వ్రాత (లిపి) లేనికాలంలోనూ, తరువాత అచ్చు పుస్తకాలు రాని కాలంలోనూ నోటి మాట ద్వారానూ ఉపాధ్యాయుల ఉపన్యాసాల వల్లనూ విజ్ఞానం వ్యాప్తమయ్యేది. భావం స్పష్టంగా తెలియవలెనంటే భాష సుపరిచితముగా ఉగ్గుపాలతో అలవడ్డ మాతృభాష అయి ఉండాలి'' అన్నారు గిడుగువారు. ఏదైనా విషయ చర్చకుగాని, విషయ గ్రహణానికికాని, అభిప్రాయ ప్రతిపాదనకుకాని, ప్రజల ఆమోదం పొందడానికి కాని మాతృభాష ద్వారా సాధ్యపడినట్లు వలస పరిపాలన భాషామాధ్యమం ద్వారా సాధ్యమవుతుందా!

ఏ జాతి వికాసమైనా ఏ భాష అభివృద్ధి అయినా ఆ కాలపు విజ్ఞానవ్యాప్తిపైనే ఆధారపడి ఉంటుందనీ జనసామాన్యంలో విద్యనూ, విజ్ఞానాన్నీ వ్యాపింపజేయాలంటే వాఞ్మయం మించిన సాధనం లేదనీ గిడుగువారు పదేపదే ప్రబోధించారు. ప్రజలందరూ గ్రాంథిక భాషా పండితులు కాలేరు. వాడుక భాష వారికి నేర్పితే చాలును అని ఆర్తి చెందారు. 'ఆంధ్రులను విద్యావంతులను చేయడానికి నా మతము అంగీకరించేట్లయితే ఒక మాసము రోజులలో సాధ్యమవుతుంది. ముందుగా వ్యావహారిక భాషలో మీ కరపత్రాలన్నిటిని అచ్చొత్తించండి. ఆ తరువాత తెలుగు అక్షరాలూ గుణితమూ ప్రతివారికీ నేర్పడానికి గ్రామానికొక ప్రచారకుణ్ణి ఏర్పాటు చేయండి. అక్షరాలూ గుణింతమూ మామూలు తెలివితేటలుగలవాడు నేర్చుకోవడానికి వారము పదిరోజుల కన్న ఎక్కువ పట్టదు. ఎప్పుడైతే అక్షరాలూ గుణింతమూ వచ్చాయో ఆ క్షణము నుంచీ మీ కరపత్రాలు మొదలుగునవి చదువుకోగలుగుతారు. ఇంతకన్న దేశములో విద్య వ్యాపింప జేయడానికి సులభమార్గము లేదు. మీరీ పనికి పూనుకొనవలెను. ఈ విధముగా బాల్కను రాష్ట్రాలలో యుద్ధము అయిపోయిన తర్వాత చేసినారు. నేను ఆ విషయమంతా చదివినాను. బాల్కను రాష్ట్రాలలో ఆరు మాసాలలో విద్యాశూన్యత అంతాతొలగిపోయింది' అని 1935లోనే గృహలక్ష్మీ కంఠాభరణమనే వ్యాస సంకలనం పీఠికలో గిడుగువారు ప్రబోధించారు. ఆయన రచనలు, ఆయన విశ్లేషణలు పట్టభద్ర స్థాయి విద్యాబోధనలో, స్నాతకోత్తర స్థాయిలో మన విశ్వవిద్యాలయాలు పాఠ్యగ్రంథాలుగా చేయకపోవడం విచారకరం.

గిడుగువారి వ్యక్తిత్వం, ఉదార హృదయం, ఉదాత్త సంస్కారం చాలా గొప్పవి. గాంధీజీ అస్పృశ్యత నివారణానికి 25 ఏళ్ల ముందే సవరల్లో అస్పృశ్యులని భావించే పానోలను గిడుగువారు తమ ఇంట్లోకి రానిచ్చి ఆదరించారు. సవరల కోసం సొంత సొమ్ము వెచ్చించి, ఉపాధ్యాయులకు తానే జీతాలిచ్చి ఆయన పాఠశాలలు నిర్వహించారు. వాళ్లకోసం నిఘంటువులు, వాచక పుస్తకాలు, వాళ్ల పాటలు, ఆటలు తెలియజేసే పుస్తకాలు ప్రకటించాడు.అటువంటి మహానుభావులు, మార్గదర్శకులు, మహర్షులు ఏరీ ఇప్పుడు!
(eenadu, 29:08:2007)

చూడండి:

గిడుగు పిడుగు

-------------------------------------------------

Labels: ,

Sunday, August 05, 2007

గిడుగు పిడుగు

గిడుగు వెంకట రామమూర్తి(23:08:1863- 22:01:1940)

ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చరపిడుగు 'గిడుగు '.గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందిరికి అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది.

గిడుగు వేంకట రామమూర్తి, 23:08:1863న శ్రీకాకుళం జిల్లాలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉండే పర్వతాలపేటలో జన్మించి, 1875 వరకు అక్కడే వారి బాల్య కౌమర దశలు గడిపారు.1875 మొదలు 1880 వరకు విజయనగరంలో గడిపారు;1880 లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై, గంజాం జిల్లాలోని పర్లాకిమిడిలో, ఉన్నతపాఠశాలలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంచేస్తూ, స్వతంత్ర విద్యార్థిగా చదువు సాగించి 1886 నాటికి ఎఫ్.ఏ,1890 నాటికి బి.ఏ పరీక్షల్లో ఇంగ్లీషు, సంస్కృత భాగాల్లో ఉత్తీర్ణులయ్యారు, కాని చరిత్ర భాగము పూర్తిచేయలేదు.

1880 నుండి 1895 వరకు బడిపనులు చూసుకొంటూ వారు చేసిన విద్యావ్యాసంగాలలో ముఖ్యమైనవి రెండు: శాసనాలు చదవడం, సవర భాషా కృషి. ముఖలింగ క్షేత్రంలోని దేవాలయపు గొడలపైనున్న శాసనాలు, పర్లాకిమిడి దగ్గరలోనే కొండలలోనివసించే సవరల భాషా, అచారవ్యవహారాలు వింతగా తోచి గిడుగువారిని ఆకర్షించాయి.

ఆయన సవర-తెలుగు, తెలుగు-సవర నిఘంటువులను, సవరకథలు, పాటలూ ప్రకటించడానికి కొంత కృషి సాగించారు, కాని అప్పట్లో ఆ పని ఆగి పొయ్యింది. వారు తమ అభిమాన వ్యాసంగాలను కట్టిపెట్టి చదువు సాగించి 1896లో బీ.ఏ చరిత్ర భాగానికి సంబంధించిన పరీక్షలో మొదటి తరగతిలో రెండవ వారుగా ఉత్తీర్ణులయ్యారు.

1896 మొదలుకొని 1911 వరకు పర్లాకిమిడి రాజా స్థాపించిన రెండవగ్రేడ్ పర్లాకిమిడి కాలేజిలో చరిత్రాధ్యాపకులుగ వారు పనిచేసారు. ఆ కాలంలోనే వారు రాసిన సవర-తెలుగు, తెలుగు-సవర నిఘంటువులున్ను, సవరకథలు, పాటలూ, సవర వాచకాలు మద్రాసు ప్రభుత్వం ముద్రించి ప్రకటించారు. అందుకు వారు ఏ పారితోషకమూ పుచ్చుకోలేదు.

1913లో ఆయనకు ప్రభుత్వం 'రావుసాహెబ్ ' బిరుదునిచ్చారు.

1906 నుండి 1940 వరకు వారి కృషి అంతా తెలుగు భాషా సేవకే.యేట్స్ అనే స్కూళ్ళ ఇన్స్పెక్టర్ యొక్క ప్రోత్సాహంతో శిష్టజన వ్యావహారిక తెలుగు భాషను గ్రంథరచనకు గ్రాహ్యమైందిగా చేయడానికి అత్యంత కృషి చేసి కృతకృత్యులయ్యారు.వీరేశలింగం పంతులు గారి ఊతం కూడా వీరికి లభించింది.1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు 'తెలుగు ' అనే మాసపత్రిక నడిపారు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో(1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసారు 'గిడుగు '. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా ఆయన వాదాన్ని బలపరచాయి. 1934లో ప్రభుత్వం ఆయనకు 'కైజర్-ఇ-హింద్ ' అనే స్వర్ణపతకాన్నిచ్చి గౌరవించారు.

ఆయనకు చిన్నప్పటినుంచి విద్యాసక్తి, కార్యదీక్ష, సత్యాన్వేషణం ప్రధాన లక్షణాలు.
సవరలు, హరిజనులు అంటరాని జనాలని అప్పటి సంఘం అంటుండే ఆ కాలంలోనే, ఆయన సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి,భోజనం పెట్టేవారు.
1930లలో ఒరిస్సా ఏర్పడనున్నప్పుడు, పర్లాకిమిడి రాజా తన పర్లాకిమిడి తాలూకా అంతటిని ఒరిస్సా రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారికి నాయకులుగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించారు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, పర్లాఖిమిడి పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా ఒరిస్సాలో చేర్చడంవల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ ఆయన 1936లో ఒరిస్సా రాష్ట్రప్రారంభోత్సవం జరిగే దినం ఉదయమే పర్లాఖిమిడిలో ఉండడానికి ఇష్టపడక, వెంటనే రాజమహేంద్రవరం వచ్చి అక్కడే తన శేషజీవితాన్ని గడిపారు. వారి పట్టుదలకు ఇది ఒక గొప్ప నిదర్శనం.

ఆ మహా మనీషి 22:01:1940న పరమపదించారు.

తండ్రికి తగ్గ తనయుడిగా గిడుగు సీతాపతి కీర్తి గడించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ ' కళాప్రపూర్ణ ' బిరుదు పొందిన తండ్రీ కొడుకులు వీళ్ళిద్దరే!

(పుటలు:660-661, కీ.శే.గిడుగు వెంకట సీతాపతి,విజ్ఞాన సర్వస్వము,తెలుగు సంస్కృతి,రెండవ సంపుటి, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు-మార్చి-1985)
---------------------------------------

Labels: ,