My SCRAPBOOK (సేకరణలు): A COLLECTION of articles in English and Telugu(తెలుగు), from various sources, on varied subjects. I do not claim credit for any of the contents of these postings as my own.A student's declaration made at the end of his answer paper, holds good to the articles here too:"I hereby declare that the answers written above are true to the best of my friend's knowledge and I claim no responsibility whatsoever of the correctness of the answers."

Saturday, September 05, 2009

ఆచార్యదేవోభవ!


నేడు ఉపాధ్యాయ దినోత్సవం
- కర్లపాలెం హనుమంతరావు

'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.

గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా
చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!

నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు.ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయించినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
(ఈనాడు, ౦౫:౦౯:౨౦౦౯)
____________________________

Labels:

దణ్నం దశగుణం భవేత్‌!


- కర్లపాలెం హనుమంతరావు
'గుడ్‌ మార్నింగ్‌ ఇండియా!' అంటుంది పొద్దున్నే ఎఫ్‌ఎమ్‌ రేడియో. 'వందేమాతరం' అని పాడుతుంది అంతకు ముందుగానే ఆకాశవాణి. ఏ పనినైనా 'ఓనమశ్శివాయ!' అంటూ ప్రారంభించడం మన సనాతనాచారం. సంధ్యావందనం చేయనిదే దినచర్య ఆరంభించేవాళ్ళు కాదు మన పూర్వీకులు! 'వన్దేమన్దారు మన్దారమన్దిరానన్దకన్దలమ్‌' అంటూ ఆది శంకరులు కనకధారాస్తవం ఆలపించగానే కనకవర్షం కురిసిందని ఓ గాథ. సరస్వతీ నమస్తుభ్యమ్‌ అన్నా, అస్సలాం లేకుం అన్నా, సత్‌శ్రీఅకాల్‌ అన్నా, ఆమెన్‌ అన్నా... అన్నీ ఆ భగవానుడికి వివిధ రూపాల్లో భక్తుడు చేసే నమస్కారాలే గదా!

ఏ పుట్టలో ఏ పాముందోనని చెట్టుకూ పుట్టకూ కూడా నమస్కారాలు చేస్తుంటాం మనం. రోడ్డుకు నమస్కారం చేశాడో కవి. ఈ దండాన్ని కనిపెట్టిన వాడెవడోగానీ గడుసు పిండమే... వాడికో దండం!

అణుబాంబులు, ఆ బాంబులూ ఈ బాంబులూ అంటూ అగ్రరాజ్యాలు ఊరికే హడావుడి చేసేస్తుంటాయిగానీ- నమస్కార బాణాన్ని మించిన ఆయుధం ప్రపంచం మొత్తంలో ఏదీ లేదు. ఇంగ్లిషువాడు హలో అన్నా, చైనావాడు లెయ్‌వో అన్నా, జపానువాడు ముక్కు పట్టుకుని ముందుకు వంగి ముక్కినా, జర్మనీవాడు కుడిచెయ్యి గాల్లోకెత్తి ఊపినా, కాంగోవాడు మాంబో అన్నా, ఫ్రెంచివాడు శాల్యూట్‌ కొట్టినా, ఇంగ్లాండ్‌వాడు టోపీ గాల్లోకెత్తి చూపెట్టినా... అవన్నీ ఎదుటివాడిని పడగొట్టడానికి ప్రయోగించే శక్తిమంతమైన ఆయుధాలే!

మన దేశంలోనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా నమస్కారాలు చేస్తుంటారు. రాజస్థాన్‌లో 'రాంరాం' అంటే, గుజరాత్‌లో 'కెమ్‌చె' అంటారు. బెంగాల్లో నమష్కార్‌ అంటే తమిళనాట 'వణక్కం' అంటారు. చేతులు కలుపుకోవటం, గుప్పెట్లు గుద్దుకోవటం 'హాయ్‌ ఫై' చెప్పుకోవటం ఈతరం కుర్రకారు నమస్కారం. ఈ మధ్యే ప్రసిద్ధికెక్కిన రెహమాన్‌ 'జయహో' కూడా ప్రపంచానికి మనదేశం పెట్టే కొత్తరకం నమస్కారమే! నమస్కారం మన సంస్కారం. ఉత్తరాది వైపైతే పెద్దవాళ్ళ పాదాలకు వంగొంగి నమస్కారాలు పెట్టాలి. నడుముకు మంచి వ్యాయామం.

ఈ దండాలు పెట్టడంలో తెలుగువాడేమీ తీసిపోలేదు. 'దండమయా విశ్వంభర, దండమయా పుండరీక దళనేత్రహరీ, దండమయా కరుణానిధి దండమయా నీకునెపుడు దండము కృష్ణా!' అంటూ ఆ దేవుడిమీద అదేపనిగా ఐదేసిసార్లు దండ ప్రయోగాలెందుకు చేశాడో తెలుసాండీ? దండమనేదాన్ని ఇలా వచ్చి అలా ఒకసారి పెట్టేసి పోయేదానికన్నా పదేపదే ప్రయోగిస్తూ ఉండాలి. అదీ పనున్నప్పుడే కాదు సుమా... ఎప్పుడూ సంధిస్తూంటేనే ఏ పనైనా సజావుగా సాగేదని ధ్వనించడానికన్నమాట. వేడిమీదున్న వాడిని చల్లబరచేదీ, విడిపోదామనుకునేవాళ్ళను కలపగలిగేదీ కూడా ఈ నమస్కారమే సార్‌! మొన్నటి ఎన్నికల్లో అమ్మలక్కలకు అందరికన్నా ఎక్కువగా దండాలు పెట్టాడు గనకనే మన సీయం మళ్ళీ సీయం కాగలిగాడని ఓ వర్గం అభిప్రాయం.

అన్ని దండాలూ ఒకేలా ఉండవు. 'దండం దశ గుణం భవేత్‌' అని సంస్కృతంలో అన్నది ఈ దండాన్ని గురించి కాకపోయినా, దీనికీ వర్తిస్తుంది. రెండు చేతులూ జోడించి గుండెల మీద పెట్టుకుంటే పెద్దలకు పెట్టినట్లు, నెత్తిమీద పెట్టుకుంటే దేవుడికి పెట్టినట్లు. నుదురు నేలను తాకినట్లు వంగితే అల్లాకు పెట్టినట్లు. మోకాలి మీద వంగితే బుద్ధ భగవానుడికి పెట్టినట్లు. క్రాసు చేసుకుంటే యేసుకు పెట్టినట్లు. తలొంచుకుని మౌనంగా నిలబడితే చనిపోయినవారి ఆత్మలకు పెట్టినట్లు. భజన చేస్తూ ఎగిరెగిరి పెడితే గిడిగీలు పెట్టినట్లు. గోత్రనామాలు చెబుతూ పెడితే ఏటికోళ్ళు.... బొక్కబోర్లా పెడితే సాష్టాంగ ప్రణామాలు, పొర్లుతూ పెడితే పొర్లుదండాలు... ఇవికాక ఇంకా టెంకణాలు, జాగిలీలు, గొబ్బిళ్ళు- అబ్బో... సూర్య నమస్కారాలకన్నా ఎక్కువే లెక్క తేలతాయి ఈ నమస్కారాలు! ఇన్ని దండాలుండంగా ఎందుకో మనిషి మరి 'దండా'నే ఎక్కువ నమ్ముకుంటున్నాడు?!

దండాలు పెడితే లాభమా లేదా అనే మీమాంస మాట అటుంచి, అసలు పెట్టకపోతే అసలుకే మోసం వచ్చే సందర్భాలు మనబోటి మామూలు మనుషుల జీవితాల్లో మాటిమాటికీ వస్తుంటాయి. పనిలో మనమెంత తలమునకలుగాఉన్నా పైఅధికారి కనపడగానే లేచి విష్‌ చేయకపోతే మనపని ఫినిష్‌! అందుకే అనేది- ఉద్యోగులకు నమస్కారం అనేది తప్పనిసరిగా అభ్యాసం చేయాల్సిన యోగం. ఈ హస్తకళలో ప్రావీణ్యం సంపాదించినవాడిని దండకారణ్యంలో పారేసినా 'దండు'కుని మరీ తిరిగి రాగలడు. దండాలు స్వామీ అంటే, ముందు నీ తండ్రి బాకీ తీర్చు అనేవాళ్ళూ ఉంటారు. తస్మాత్‌ జాగ్రత్త!

ఈ గజిబిజీ కాలంలో ఎవరూ మనవంక తిరిగి చేతులు జోడించకపోతుంటే చేతులు ముడుచుకు కూర్చో కూడదు. తగిన భక్తులు సమకూరిందాకా మనకాళ్ళకు మనమే మొక్కుకుంటూ ఉండాలి. దాన్నే రాజకీయం అంటారు. మన వీపు వైపు మనమే నమస్కారం చేసుకోలేం గనక. మీరు ఎదుటివాడికి 'నమామి' చెబితే ఎదుటివాడు మీకు 'ప్రణమామ్యహం' అనాలనే ఏర్పాటూ చేసుకోవచ్చు. దీన్నే రాజకీయాల్లో పొత్తులంటారు.

మంత్రాలకు చింతకాయలకు రాలకపోవచ్చేమోగానీ- నమస్కారాలకు పురస్కారాలు దక్కే ఆస్కారాలు పుష్కలంగా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఒక దండం వంద దండల పెట్టు. అతి వినయం ధూర్త లక్షణమనే మాట ఈ కాలానికి అతికే సామెత కాదు. నమ్మకంగా నమస్కారాలు పెట్టుకుంటూ పోతే ఏనాటికైనా ప్రధానమైన ఏ మంత్రిపదవో, మళ్ళీ మాట్లాడితే... మరోసారీ అదే పదవీ దక్కే అవకాశాలు... ఉన్నాయిగదా! అందుకేనేమో ఆ త్యాగరాజస్వామి 'ఎందరో మహానుభావులు... అందరికీ వందనాలు' అని ముందుగానే దండాల మీదే ఎత్తుకున్నాడు.

నిద్రలేచినప్పటినుంచీ నిద్రపోయేదాకా మనం ఎదుటివాడివంక వేలెత్తి చూపించటానికి ఉపయోగించే శక్తిని దండాలు పెట్టటం వైపు మళ్ళించగలిగితే- దేశంలో ఇంత అశాంతి, అరాచకం ప్రబలి ఉండేవి కాదు. సైనికులు, పోలీసులు- తుపాకులకూ తూటాలకూ పెట్టే ఖర్చును ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు అన్నాడు ఓ సంస్కర్త. ఇన్ని తెలిసీ మరి ఈ మధ్య ఓ ప్రజా ప్రతినిధి, బ్యాంకు ఉద్యోగి మధ్య రుణాల విషయంలో పెద్ద రణమే జరిగింది. చెరొక దండం పెట్టేసుకుంటే సమస్య మొదట్లోనే పరిష్కారమైపోయేది కదా!
(ఈనాడు, ౦౫:౦౯:౨౦౦౯)
_____________________________

Labels:

దుఃఖసాగరంలో రాష్ట్రం


కుండపోతగా వాన కురిసింది కొండాకోనల నల్లమలపైన. ఊహాతీతంగా పిడుగు పడింది మాత్రం యావత్‌ రాష్ట్ర ప్రజ గుండెల మీద! రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. మరి లేరన్న దావానలంలాంటి దుర్వార్త ప్రజానీకాన్ని శోకసాగరంలో ముంచేసింది. ఏటా సంబరంగా సాగే గణేశ నిమజ్జనం సైతం బాధాతప్త హృదయాల కన్నీటి మడుగులోనే ముగిసిపోయింది. రచ్చబండ కార్యక్రమంకోసం చిత్తూరు జిల్లాకు బయలుదేరిన వై.ఎస్‌. హెలికాప్టర్‌ ఆచూకీ గల్లంతు అయిందన్న తొలి సమాచారం తెలిసినప్పటినుంచి ఇరవై నాలుగ్గంటలపాటు ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడిన జనవాహిని- కనిపించిన దేవుళ్లకల్లా మొక్కుతూ కోరుకొంది ఒక్కటే- ముఖ్యమంత్రి వై.ఎస్‌. క్షేమంగా తిరిగి రావాలనే! చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కేంద్ర దేశీయాంగ, రక్షణ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా అత్యాధునిక విమానాలతో నల్లమలను జల్లెడ పడుతున్నంతసేపూ- పూర్వాశ్రమంలో నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌(ఎన్‌.సి.సి.) సభ్యుడైన వై.ఎస్‌. అడవిని జయిస్తారనే మీడియా కూడా సాంత్వన వచనాలు పలికింది. కర్నూలుకు తూర్పున నలభై నాటికల్‌ మైళ్ల దూరాన కొండ కొమ్ముపై హెలికాప్టర్‌ జాడ తెలిసిందన్న సమాచారమూ దాన్ని వెన్నంటి వచ్చిన శరాఘాతంలాంటి కబురూ ప్రజానీకాన్ని హతాశుల్ని చేశాయి! ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ దారితప్పి 18 కిలోమీటర్లు తూర్పుదిశగా వెళ్లి కొండను ఢీ కొట్టిందని రాష్ట్ర డి.జి.పి. చెబుతున్నారు. 1978లో ఎన్నికల రాజకీయాల్లోకి తొలిసారి అడుగుపెట్టింది మొదలు వై.ఎస్‌. కాంగ్రెస్‌లో కొండల్లాంటి సీనియర్లు ఎందరినో ఢీ కొడుతూనే ముందుకుసాగారు. వరస పరాజయాలతో కుంగిన రాష్ట్ర కాంగ్రెస్‌కు తన ప్రజాపథ ప్రస్థానంతో కొత్త ఊపిరులూది వరస విజయాలు కట్టబెట్టిన వై.ఎస్‌.- తానే రాజకీయ మేరునగంగా ఎదిగారు. అననుకూల వాతావరణంలో రాజశిఖరం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నల్లమల కొండ శిఖరాగ్రాన్ని తాకి ముక్కలై మహా విషాదాన్ని వర్షించింది. విధి మనిషిని విగతం చేస్తుందేమోగాని, చెమ్మగిల్లిన గుండెల సాక్షిగా వై.ఎస్‌. ప్రజల మనిషి!

'నేను వృత్తిరీత్యా డాక్టరును... అయితే రోజుకు ఎంతమంది రోగులకు వైద్యం చెయ్యగలను? యాభై... వంద- అంతేకదా! అందుకే రాజకీయాల్లోకి రావాలనుకొన్నా'- అని ప్రకటించిన వై.ఎస్‌.కు మూడు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేదు. 'గరీబోళ్ల బిడ్డ'గా అధికార పీఠం అందుకొన్న అంజయ్య మంత్రివర్గంలో తొలిసారి వై.ఎస్‌.కు చోటు దక్కింది. తరవాత ఇరవయ్యేళ్లు అధికార పదవులకు దూరంగా ఉన్నా- 2004లో కాంగ్రెస్‌ విజయం దరిమిలా ముఖ్యమంత్రి పీఠం ఆయన్ను కోరి వరించింది. చదువుకొనే రోజుల్లోనే ఆదాయం పన్ను కట్టానని పలుమార్లు చాటుకొన్న వై.ఎస్‌. మృతికి పేదవాడి గుండె ఎందుకు చెరువవుతోంది? కారణం ముంజేతి కంకణం. 'ప్రజల్ని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలంటే మార్పు తప్పనిసరి... అయితే అది మానవీయ కోణంలోనుంచి రావాలి' అని ప్రకటించిన వై.ఎస్‌.- సంక్షేమ పథకాల్ని పల్లెబాట పట్టించారు. ఖజానాకు భారమన్నా వినకుండా మొండిగా కిలో రెండు రూకల బియ్యం పథకాన్ని పట్టాలకు ఎక్కించారు. వందల కోట్ల బడ్జెట్టుతో నిరుపేదల్ని ఆరోగ్య 'శ్రీమంతుల్ని' చేశారు. బడుగు రైతాంగానికి ఉచిత విద్యుత్తు సరేసరి! ఇందిరమ్మ ఇళ్లు, బడుగు, బలహీన, అల్పాదాయ వర్గాల పిల్లలకు వృత్తి విద్యా కోర్సు ఫీజుల పూర్తి చెల్లింపు వంటివి వై.ఎస్‌.ను పేదల పక్షపాతిగా మార్చేశాయి. ముఖ్యమంత్రి సహాయనిధినీ వందల కోట్లకు పెంచి అవసరార్థులకు దాన్ని కామధేనువుగా మార్చింది వైఎస్సే! రాజశేఖరరెడ్డి ఏలుబడి తీరుతెన్నులపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాక- నిరుపేదల కళ్లకు ఆయన తమ ఆర్తి తీర్చే ఒయాసిస్సే! ఆ విధంగా ఎందరికో ఆత్మబంధువైన వై.ఎస్‌. లేని లోటు వేరెవరూ పూడ్చగలిగేది కాదు!

వై.ఎస్‌. అనగానే గుర్తుకొచ్చేవి- తెలుగు ఠీవి ఉట్టిపడే పంచెకట్టు, నగుమోము చేసే కనికట్టు! రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని చెప్పే వై.ఎస్‌. స్వీయ ప్రతిష్ఠను పణం పెట్టి అయినా నమ్ముకొన్నవాళ్లను ఆదుకొన్న మిత్రశ్రేష్ఠుడు! రాష్ట్ర బడ్జెట్‌ను లక్షకోట్లకు చేర్చడం, తెలుగుభాషకు ప్రాచీన హోదా రాబట్టడం వై.ఎస్‌. ఘనతలే. 'పాదయాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నా... విద్యుత్‌, బియ్యం, ఆరోగ్యశ్రీ పథకాలను శాశ్వత ప్రాతిపదికన అమలు చేస్తాం- ప్రాజెక్టులు పూర్తి అయ్యేవరకు విశ్రమించం' అని నిరుడు జూన్‌ 15న వై.ఎస్‌. ప్రకటించారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంద్వారా కోటి ఎకరాలకు సాగునీటి పరికల్పన సాధిస్తామంటూ ఆయన ఉద్ఘోషించని వేదికే లేదు. తొలి అయిదేళ్లలో లక్ష్యసిద్ధికోసం జలయజ్ఞానికి వై.ఎస్‌. వెచ్చించింది రూ.43వేల కోట్లు! ఫలానా పని చెయ్యాలనుకొన్నాక విమర్శల్ని, కష్టనష్టాల్ని బేఖాతరు చేస్తూ ముందుకు సాగడమే ఆయన నైజం. మరికొన్ని రోజుల్లో ప్రధాని చేతుల మీదుగా తలపెట్టిన భెల్‌- ఎన్‌.టి.పి.సి. ప్రాజెక్టు శంకుస్థాపన ఈ పాటికే పూర్తయి ఉంటే, మౌలిక రంగంలో ఓ భారీ కర్మాగారం రాష్ట్రానికి రావాలన్న తన స్వప్నం ఫలించిందన్న సంతృప్తి వై.ఎస్‌.కు మిగిలుండేదన్నది నిజం! తాను చేపట్టిన పథకాలే కాంగ్రెస్‌కు గెలుపు గుర్రాలవుతాయని విశ్వసించిన వై.ఎస్‌.- వాటిలో లోటుపాట్ల పరిశీలనకు బయలుదేరడమే, అననుకూల వాతావరణం రూపేణా ప్రాణాంతకమయ్యింది. బియ్యం, రేషన్‌ కార్డులు, పావలా వడ్డీ, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల అమలు తీరుపై ప్రజలతో నేరుగా చర్చించదలచిన నాయకుడు మరలిరాని లోకాలకు తరలిపోవడంతో పల్లె కన్నీరొలుకుతోంది. జన ప్రియనేతకు రాష్ట్రం నివాళి ఘటిస్తోంది- 'వై.ఎస్‌. అమర్‌ రహే' అని!
(ఈనాడు, ౦౪:౦౯:౨౦౦౯)
____________________________

జీవనవేదం


మనం ఎంతగానో ప్రేమించేవారిని ఆ దేవుడు మన దగ్గర్నుంచి తీసుకుపోతే... ఆ మోసానికి విరుగుడేమిటో తెలుసా! 'మనం ప్రేమించేవారు ప్రేమించినవన్నీ మనమూ ప్రేమిస్తూ ఉండటమే' అంటాడు ఆస్కార్‌ వైల్డ్‌. భారతంలో యక్షుడు 'ప్రపంచంలోకెల్లా వింత ఏది?' అనడిగితే 'రేపు పోయేవాడు ఇవాళ పోయేవాడిని గురించి ఏడుస్తూ కూర్చోవడమే!' అంటాడు ధర్మరాజు. నిజం కదా! అసలు 'జీవితం ఒక నాటకం' అని షేక్‌స్పియర్‌లాగా మనమూ అనుకోగలిగితే పుట్టటం, గిట్టటమనేవి దేవుడు చేసే ప్రకటనలు అని ఇట్టే అర్థమైపోతుంది. ఆవేదన సద్దుమణుగుతుంది. విశ్వవిజేతగా మారాలనుకున్న అలెగ్జాండర్‌ చలిజ్వరంతో 'హతీతో క్రతిస్తో' అంటూ ఖాళీ చేతులు చూపించి వెళ్లిపోయాడు! ఎలా పోయారన్నది కాదు లెక్క, ఎలా బతికారన్నది ముఖ్యం. తనకోసం అమృతం తాగిన ఇంద్రుడికి, లోకంకోసం విషాన్ని మింగిన శివుడికున్న విలువుందా? మిన్నాగులాగా కలకాలం బతికేకన్నా మిణుగురులాగా క్షణకాలం మెరిసినా మిన్నే! అసలు మృత్యువనేది ఒక్క దుఃఖాన్ని తప్ప మరేదీ దక్కనివ్వదా?! రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఓ జర్మనీ చెరసాలలో ఖైదీలు కిక్కిరిసిపోయి ఉన్నారు. ఇంకొక్క కొత్తబందీ వచ్చి చేరినా అంగుళం స్థలం కూడా లేనంత ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఖైదీల సంఖ్య తగ్గించేందుకు చెరసాల అధికారులు ఓ పథకం పన్నారు. ప్రతి బందీకి ఒక అంకె ఇచ్చారు. రోజూ కొన్ని అంకెలు చీటీలు వేసి తీయడం. ఆ అంకెవాడిని కాల్చిపారేయడం! ఓ రోజు అలాంటి అంకె వచ్చిన ఓ ఖైదీ ఏడుస్తూ కూర్చుని ఉంటే పక్కనే ఉన్న ఇంకో ఖైదీ- 'ఏడవద్దులే... ఇంకా ఇక్కడ బందీగా నీకంతగా బతకాలనుంటే చీటీ నాకు ఇవ్వు' అని తాను ఆనందంగా వెళ్ళి తుపాకీ గుండుకు బలైపోయాడు! అతని ఆనందం- అరువు ప్రాణాలమీద బతికే ఆ ఖైదీకి ఏదీ?

'మృత్యువు నా వాకిట్లో నిలబడితే వట్టి చేతులతో పంపను' అంటారు గీతాంజలిలో టాగోర్‌. 'జాతస్యః మరణం ధ్రువమ్‌' అంటుంది గీత. కాలప్రవాహానికెదురు ఈదటం ఎవరి తరమూ కాదు. అందుకే మృత్యువును మన పురాణేతిహాసాలు 'కాలధర్మం'గా వర్ణించాయి. భూమ్మీద కలకాలం సుఖంగా బతకాలని ఎవరికుండదు? నిజంగా చిరంజీవిగా ఉండాలంటే తుమ్మి చిరంజీవ అనిపించుకోవడం కాదు. చిరకాలం జనహృదయాల్లో సజీవంగా ఉండే సత్కార్యాలు చేయాలి. మొక్కుబడిగా కీర్తిశేషులనిపించుకోడం కాదు. మొక్కి మరీ 'కీర్తి'ని గుర్తుచేసుకునే ఘనకార్యాలు చేయగలగాలి. మనస్సులకు దగ్గరైనవారు దూరమైనారంటే ఒక పట్టాన ఒప్పుకోలేని పిచ్చి ప్రేమభ్రమలు మనిషి పుట్టిననాటినుంచే వెంట వస్తున్నాయి. రోమన్లు చనిపోయినవాళ్ల వేళ్లు కోసి, రక్తం గడ్డకట్టి ఉంటే తప్ప ఆ వాస్తవాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. గ్రీకులు చనిపోయిన మనిషి తిరిగి వస్తాడేమోనని మూడురోజులపాటు భద్రం చేసేవారు. ఎడ్గార్‌ ఎలాన్‌ పో తన చిన్నకథా సంకలనం 'మెక్బరి'లో శవపేటిక లోపల మీటలు ఉండే విధానాన్ని సూచించాడు. ఖననమైన తరవాత మృతుడికి ప్రాణంవస్తే ఆ మీటనొక్కి బైటవాళ్ళకు చెప్పే ఏర్పాటు అది! హిందూ ధర్మంలో దింపుడు కళ్ళం ఆచారం వెనకున్న రహస్యం ఈ బతుకుమీద ఆశే!

శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇలాంటి ఆ మాటలు వింటే నవ్వు రావచ్చేమోగానీ, నిజానికి గుండెచప్పుడు ఆగిపోయిన కొన్ని నిమిషాలదాకా ఇసిజిని నమోదు చేయవచ్చని ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా ఒప్పుకొంటోంది. పైలోకార్పైన్‌ అనే మందును మృతుడి కంటిలో వేస్తే మూడుగంటల తరవాత కూడా కంటిపాప సంకోచిస్తుంది. అసలు మరణమనేది హఠాత్తుగా జరిగే విషాదంకాదు- అదో క్రమంలో భౌతిక దేహంలో జరిగే ప్రక్రియ అంటుంది మరణశాస్త్రం(థాంటాలజీ). మతాలన్నీ మరణాన్ని మనకంటికి కనిపించని ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడంగా అభివర్ణించినాగానీ- విజ్ఞానశాస్త్రం మాత్రం విశ్లేషించటానికి వీలైన ప్రయోగాలు విజయవంతమైనదాకా అది మనిషికి, మనసుకు సంబంధించి ఒక అత్యంత భావోద్వేగ సంబంధమైన విషాదంగానే గుర్తిస్తుంది. మనకు మరింత దగ్గరగా వచ్చిన మనిషి హఠాత్తుగా ఇంకెప్పటికీ తిరిగిరాని లోకాలకు ఎగిరిపోయాడని వింటే మనస్సు విలవిల్లాడకుండా ఎలా ఉంటుంది! అందులోనూ పెద్దమనసున్న పెద్దమనిషి మరణమంటే మామూలు జనానికి పత్రికల్లో నల్లరంగు పూసుకొని వచ్చే పతాక శీర్షికో, టీవీ ప్రసారాల్లో ఆపకుండా చూపించుకుంటూ పోయే రియాల్టీ ప్రదర్శనోకాదు గదా! ఆట ముగిస్తే రాజైనా, బంటైనా ఒకే పెట్టెలోకి పోతారన్న మాట నిజమే కావచ్చేమోగానీ- జనం తరఫున ఆడే ఆట ముగించకుండానే మధ్యలో వదిలేసి ఎవరైనా అలా చిరునవ్వులు చిందించుకుంటూ పైలోకాలకు వెళ్ళిపోవటం మాత్రం కచ్చితంగా తొండే! బతుకు- బతకనివ్వు అన్నది మానవ పరిణామ క్రమం తరంతరంగా నిరంతరంగా వినిపిస్తున్న పాఠం. గుండె దిటవుతో మృత్యుఘోషను ధిక్కరించి నిబ్బరంగా ముందడుగేస్తేనే నవోదయం!
(ఈనాడు, ౦౬:౦౯:౨౦౦౯)
______________________________

Labels:

Tuesday, September 01, 2009

SOME VARIETY CAMERA CLICKS







(An email forward)
___________________________________

Labels:

Swineful wedding


(An email forward)
____________________________________________________________________

Labels:

ఐడియా - సరికొత్త ఆక్సిజెన్

కాఫీ తాగుతున్నప్పుడో పేపర్‌ తిరగేస్తున్నప్పుడో షేవింగ్‌ చేసుకుంటున్నప్పుడో షవర్‌ కింద తలంటుకుంటున్నప్పుడోఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఐడియా మీ బుర్రలో తళుక్కుమంటుంది. అదొక్కటి చాలు, మీ జీవితాన్ని మార్చేయడానికి!


నీఖాతాలో డబ్బుందా?
నీ పేరుతో ఫ్లాటుందా?
పార్కింగ్‌లో కారుందా?
ఖరీదైన సెల్‌ఫోన్‌ ఉందా?

ఛీ..ఛీ..!
ఎప్పుడూ ఇవే ప్రశ్నలేనా? కాలంచెల్లిన ఆలోచనలన్నీ కట్టగట్టి చెత్తబుట్టలో పడేయండి. గాలికి పైకెగిరొస్తాయనుకుంటే, పెట్రోలు పోసి తగలేయండి. కల్తీపెట్రోలేవో అన్న అనుమానం ఉంటే, బన్సీలాల్‌పేట విద్యుత్‌ శ్మశానవాటికలో కాల్చిపడేయండి. పీడా విరగడైపోతుంది.

కాస్త విశాలంగా, కాస్త డిఫరెంట్‌గా, కాస్త మెవరిక్‌గా ఆలోచించలేరూ!
ఆలోచించాలి. ఆలోచించితీరాలి.
బీరువాల్లో పెట్టుకునో బ్యాంకు లాకర్లలో దాచుకునో తెగ మురిసిపోయే ఆస్తిపాస్తులకు కాలం చెల్లింది. ఇప్పుడు, భూషణముల్‌ సుభూషణముల్‌...అన్నీ ఐడియాలే!
ఐడియా... ఇరవై ఒకటో శతాబ్దపు కరెన్సీ.
ఐడియా... ఇరవై ఒకటో శతాబ్దపు గుర్తింపు కార్డు.
ఐడియా... ఇరవై ఒకటో శతాబ్దపు ఆక్సిజన్‌.
* * *

ఐజాక్‌ న్యూటన్‌ 'వెధవ యాపిల్‌ నెత్తిమీదే పడాలా...' అని ఆలోచించినప్పుడు భూమ్యాకర్షణ ఐడియా పుట్టింది.

స్నానపుతొట్టెలోని నీళ్లు ఒలికి కిందపడ్డప్పుడు ఆర్క్‌మెడిస్‌ సూత్రం ఐడియా ప్రాణంపోసుకుంది.

బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ గాలిపటం మాంజాకి తాళాల గుత్తి కట్టి తుపానులో ఎగరేసినప్పుడు దిమ్మదిరిగే షాకే కాదు, అద్భుతమైన కరెంటు ఐడియా పుట్టింది.

గిన్నె మీద పెట్టిన మూత ఆవిరికి ఎగిరెగిరిపడుతున్నప్పుడు జేమ్స్‌వాట్‌ ఆలోచనల్లో రైలింజను ఐడియా పట్టాలకెక్కింది.

విజ్ఞాన సర్వస్వాలు తిరగేస్తే, జిజ్ఞాసుల జీవిత చరిత్రలు చదివితే ఐడియా పవరేంటో అర్థమవుతుంది. కాలంకంటే రెండడుగులు ముందేస్తూ ఒకట్రెండు శతాబ్దాలు ముందే ఆలోచించిన ఆ మహానుభావుల తపన ఏపాటిదో అర్థమవుతుంది. ఆ రోజులు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఐడియాకు విలువే లేదు. కొత్త ఆలోచనలకెవరూ బ్రహ్మరథం పట్టలేదు. వీరతాళ్లు వేయలేదు. చాలదన్నట్టు, గేలిచేశారు. గోలచేశారు. పాతనమ్మకాలకు పాతరేసినందుకు కొరడాలతో కొట్టారు. ఏనుగులతో తొక్కించారు. దేశ బహిష్కారాలు విధించారు.

గేలిచేసిన అజ్ఞానులు, గోలచేసిన మిడిమిడి జ్ఞానులు, శిక్షలు విధించిన ప్రభువులు, సలహాలిచ్చిన సచివులు... అంతా నాశనమైపోయారు. సర్వనాశనమైపోయారు.

కానీ ఐజాక్‌ న్యూటన్‌ బతికున్నాడు, ఆర్క్‌మెడిస్‌ బతికున్నాడు, బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ బతికున్నాడు, జేమ్స్‌వాట్‌ బతికున్నాడు - ఆవిష్కరణల రూపంలో.

ఐడియా చిరంజీవి!
* * *
ఐడియా ఆధునిక జీవితపు నిత్యావసర వస్తువు. పోటీ ప్రపంచపు ప్రాణవాయువు. డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతం ప్రకారం మనుగడ పోరాటంలో బలవంతులే బతికి బట్టకట్టినట్టు... ఆధునిక ప్రపంచంలో ఐడియా ఉన్నవాళ్లే మనగలుగుతారు. మూసలో మునిగితేలేవాళ్లంతా మూకుమ్మడిగా కొట్టుకుపోతారు. ఒక్కసారి ఆలోచించండి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, విప్రో... అచ్చంగా ఐడియాలే పెట్టుబడిగా పుట్టుకొచ్చిన కంపెనీలే అద్భుతాలు సాధిస్తున్నాయి.

మహాత్ముని అహింసామార్గం ఓ ఐడియా. టిమ్‌బర్నర్స్‌లీ వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ ఓ ఐడియా. రతన్‌టాటా లక్షరూపాయలకే కారు ఓ ఐడియా. ఏ ఉద్యమమైనా ఏ వ్యాపారమైనా ఏ ఆవిష్కరణైనా... ముందు ఐడియాగానే వెుదలవుతుంది.

ఎలా? ఎలా?
కొంతమందికే అద్భుతమైన ఐడియాలొస్తాయి ఎందుకు? కొంతమంది ఎంత బుర్రపాడుచేసుకున్నా ఒక్కటంటే ఒక్క ఐడియా కూడా వెలిగి చావదెందుకు? అసలు ఐడియాల్ని ఎలా సృష్టించాలి? ఎలా విస్తరించాలి? ఎలా మార్కెట్‌ చేసుకోవాలి?... ఐడియాకి సంబంధించి ఏ ప్రశ్నకైనా విజేతల జీవితాలే సమాధానాలు.

ఐడియా రావాలంటే ముందు మనమీద మనకు నమ్మకం ఉండాలి. తమకో రూపం ఇవ్వగల సత్తా మనకుందని ఐడియాలకు నమ్మకం కలగాలి. ఆత్మవిశ్వాసం లేనివాళ్లంటే వాటికి అసహ్యం. ఓరకంగా మనం ఐడియాతో పీకలోతు ప్రేమలో పడాలి. ఎదుటివాళ్లు నవ్వనివ్వండి. ఏడ్వనివ్వండి. వాళ్ల ఖర్మ. మన ఐడియాలే మనకు రంభ, ఊర్వశి, ఐశ్వర్యారాయ్‌, జెన్నిఫర్‌ లోపేజ్‌. 'హాట్‌ మెయిల్‌' సబీర్‌ భాటియా ఉచిత ఇ-మెయిల్‌ ఐడియా గురించి చెప్పినప్పుడు అంతా పగలబడి నవ్వారు. శేఖర్‌ కమ్ముల 'ఆనంద్‌' ప్రాజెక్టు తీసుకెళ్లినప్పుడు నిర్మాతలు వెుహంమీదే తలుపేసుకున్నారు. ఆ ఇద్దరికీ తమ మీదా తమ ఐడియాల మీదా బోలెడంత నమ్మకముంది కాబట్టి సరిపోయింది. లేదంటే, ఆ యువకుల సృజన సమాధి అయిపోయేది.

'పాజిటివ్‌ థింకింగ్‌' మరో అర్హత. పాజిటివ్‌ థింకింగ్‌లోంచి పాజిటివ్‌ ఐడియాలొస్తాయి. నెగెటివ్‌ థింకింగ్‌లోంచి నెగెటివ్‌ ఐడియాలొస్తాయి. ధీరూబాయ్‌ అంబానీనే తీసుకోండి. ఆయన కూడా మిగతా వ్యాపారవేత్తల లాగానే లాభాలు గడించాలనుకున్నారు.
కానీ తానొక్కడే అంతా పోగేసుకోవాలనుకోలేదు. నలుగురితో పంచుకోవాలనుకునే తత్వం. కాబట్టే 'పోస్టుకార్డు ధరకే సెల్‌ఫోన్‌ సేవలు అందించాలి' అన్న వందశాతం పాజిటివ్‌ ఐడియా వచ్చింది. ఇంకేదైనా ప్రాజెక్టు చేపట్టివుంటే రతన్‌టాటా ఇంకొన్ని వందల కోట్లు సంపాదించేవారేవో. కానీ 'లక్ష రూపాయలకే కారు' అన్న ఐడియానే ఎందుకొచ్చింది? దాని మూలాలూ పాజిటివ్‌ థింకింగ్‌లోనే ఉన్నాయి.

లెక్కలు మార్చేసి, వ్యాపారాన్ని కొండంతలు చూపించాలన్న 'సత్యం' రామలింగరాజు ఆలోచన పక్కా నెగెటివ్‌ ఐడియా. పోటీ తట్టుకోలేనేవో అన్న నెగెటివ్‌ ధోరణిలోంచి అది పుట్టుకొచ్చింది. ఆ తప్పును కప్పిపుచ్చుకోడానికి ఇంకొన్ని నెగెటివ్‌ ఐడియాల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఫలితం మనం చూస్తున్నాం.

'హౌ టు గెట్‌ ఐడియాస్‌' పుస్తక రచయిత జాక్‌ఫోస్టర్‌ ఓ రహస్యం చెబుతారు. 'చాలామంది బాగా ఆలోచిస్తేనే ఐడియాలు వస్తాయనుకుంటారు. ఒట్టి అబద్ధం. ఏమీ ఆలోచించకుండా ఉన్నప్పుడే అవి ఎగదన్నుకొస్తాయి. బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడో షేవింగ్‌ చేసుకుంటున్నప్పుడో మంచిమంచి ఐడియాలు రావడానికి కారణం అదే' అంటారు. ఆ సమయంలో మనసు ఒత్తిళ్లకు దూరంగా ఉంటుంది కాబట్టి, బుర్ర చురుగ్గా పనిచేస్తుంది కాబోలు. నందన్‌ నీలేకని 'ఇమాజినింగ్‌ ఇండియా- ఐడియాస్‌ ఫర్‌ న్యూసెంచరీ' పుస్తకం రాసుకోడానికి వారాంతాల్లో కూనూరు వేసవి విడిది కేంద్రానికి వెళ్లేవారట. ఓ పారిశ్రామికవేత్త కొత్త ఆలోచనల కోసం తనింట్లో ప్రత్యేకంగా 'ఐడియా రూమ్‌' ఏర్పాటు చేసుకున్నారట. అయినా, ఐడియాకి సంబంధించి 'సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి...' అన్నంత కచ్చితమైన సిద్ధాంతమేం లేదు. ఒకటిమాత్రం నిజం... ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలాంటి ఐడియా వస్తుందో కచ్చితంగా చెప్పలేం. దాన్ని సద్వినియోగం చేసుకోవడమే మన పని!

మంచి ఐడియాలకు కొన్ని లక్షణాలుంటాయి. వాటిలో స్పష్టత ఉంటుంది. ఎక్కడా గందరగోళం కనిపించదు. మామూలు మనిషికి కూడా సులభంగా అర్థమైపోతాయి. 'ఇంటర్నెట్‌ద్వారా వీడియోలు పంపుకునే అవకాశం ఉంటే?' అన్నది చాలా చిన్న ఐడియా. అందులోంచే యూట్యూబు పుట్టింది. గొప్ప సక్సెస్‌. 'నిమిషం పల్స్‌రేట్‌ స్థానంలో... సెకెను పల్స్‌రేటు పెడితే?'... డొకోవో ఆలోచన చిన్నదే. మార్కెట్‌ మీద మాత్రం పెద్ద ప్రభావం చూపింది.

ఆ క్షణానికి మన బుర్రలో మెరిసే ఐడియా అంతిమ ఉత్పత్తి కానేకాదు. అదింకా ముడిసరుకే. సానబెట్టుకోవాలి. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించుకోవాలి. నిధులు సమకూర్చుకోవాలి. టెక్నాలజీ, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌... అన్ని దశలూ దాటాలి. అప్పటికి కానీ దానికో రూపం రాదు. 'విజయానికి మూడు కోణాలు... ఐడియా, నైపుణ్యం, శ్రమ' అంటారు 'కౌంట్‌ యువర్‌ చికెన్స్‌ బిఫోర్‌ దె హ్యాచ్‌' రచయిత అరిందమ్‌. మిగతా రెండూ తోడైతేనే అద్భుతమైన ఐడియాకి సార్థకత. లేదంటే, ఐడియా ఐడియాగానే మిగిలిపోతుంది. మనం నిలబడ్డ దగ్గరే ఉండిపోతాం. అసలు మనమూ మన ఐడియాలూ వేరువేరు కానేకాదు. ఐడియాలు మన ఆలోచనలకు నీడల్లాంటివి. అందుకే వివేకానందుడు 'నీ ఆలోచనలెప్పుడూ ఉన్నతంగా ఉండాలి' అంటాడు. 'యద్భావ-తద్భవతి' అని మన పెద్దలెప్పుడో చెప్పారు.

సందేహమే లేదు, ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. కానీ, ముందు మనం ఐడియాకి జీవితాన్నివ్వాలి.

ఆఫీసులో ఐడియా...
కావలెను

మా ఐడియా ఫ్యాక్టరీలో పనిచేయడానికి పాతికమంది 'బుద్ధి'మంతులు కావలెను.

అర్హతలు:

కత్తిలాంటి ఐడియాలు ఇవ్వాలి. కొత్తగా ఆలోచించాలి. మెత్తగా దూసుకుపోవాలి.

అనర్హులు:

గానుగెద్దులు, మూసరాయుళ్లు.

...ఈమధ్య ఓ కార్పొరేట్‌ కంపెనీ 'వాంటెడ్‌ కాలమ్‌'లో ఇచ్చిన ప్రకటన అటూఇటుగా ఇలానే ఉంది. తమకెలాంటి ఉద్యోగులు కావాలో చమత్కారంగానే అయినా సూటిగా చెప్పారు. నిజంగానే 'ఐడియా' జాబ్‌మార్కెట్‌ను ఏలేస్తోంది. కార్పొరేట్‌ జగత్తు కొత్త ఐడియాలకు వెుహంవాచిపోయింది. 'ఐడియాకో వీరతాడు', 'ఐడియా చెప్పండి... ప్రవోషన్‌ కొట్టండి', 'ఐడియా మీది... ఆచరణ మాది' తరహా పథకాలతో పదును బుర్రలకు పతకాలు వేస్తోంది. కొటక్‌ మహీంద్రా బ్యాంకులో 'యురేకా!-ఇన్నొవేషన్‌ ఎట్‌ కొటక్‌' పేరుతో ఓ స్కీము ప్రారంభించారు. కస్టమర్లను మరింత సంతృప్తిపరచడం ఎలా, దుబారా తగ్గించడం ఎలా, వ్యాపారం పెంచుకోవడం ఎలా... వగైరావగైరా విషయాల మీద ఉద్యోగులు ఐడియాలివ్వాలి. 'అవైవా'లోనూ ఇలాంటి స్కీమే ఉంది. పేరు 'ఐడియాస్‌ ఫర్‌ అవైవా'. అయితే ఒక నిబంధన. చెత్త ఆలోచనలతో ఐడియా బాక్సు నింపకూడదు. కొత్తగా ఉండాలి. సంస్థ మీదా వ్యాపారం మీదా ప్రజల మీదా సానుకూల ప్రభావం చూపాలి. ఆచరణకు వీలుగా ఉండాలి. కొన్ని సంస్థలైతే ఏడాదికోసారి 'ఇన్నొవేషన్‌ డే' జరుపుకుంటున్నాయి. ఐడియా జీవులంతా ఆరోజు తమ ఆలోచనల్ని యాజమాన్యం ముందు పెట్టాలి. నచ్చితే మెచ్చుకోళ్లూ నజరానాలూ! కొన్ని సంస్థలైతే ఇంకాస్త ముందుకెళ్లి బహుమతి పొందిన ఐడియాల్ని అమలు చేయడానికి నిపుణుల కమిటీలు నియమిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కంపెనీలకు ఉద్యోగుల ఆలోచనల విలువ మరింత తెలిసొచ్చింది. సిబ్బంది ఐడియాల కోసం ఇన్ఫోసిస్‌ ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ ప్రారంభించింది. కరెంటు ఖర్చులు తగ్గించుకోవడం వెుదలు కొత్త క్త్లెంట్లను ఆకట్టుకోవడం దాకా... అనేకానేక సమస్యల పరిష్కారానికి అమూల్యమైన ఐడియాలు ఇవ్వండంటూ ఇ-విన్నపాలు పంపుతోంది.

అలా అని, ఐడియా వెలిగిపోతోందని మురిసిపోడానికీ వీల్లేదు. ఇంకా చాలా లోపాలున్నాయి. 'ఐఐటీ విద్యార్థి అశోక్‌ వైర్‌లెస్‌ లోకల్‌లూప్‌ టెక్నాలజీని రూపొందించాడు. కానీ అది ఎక్కడో మడగాస్కర్‌లో అంగోలాలో ముందుగా విడుదలైంది. చౌకరకం వెుబైల్‌ పీసీని మనవాడు... వినయ్‌ దేశ్‌పాండే తయారుచేశాడు. సరిగ్గా అలాంటి పీసీ బ్రెజిల్‌లో ముందుగా మార్కెట్‌లోకి వస్తోంది. మన భారతీయ కంపెనీ సోరియాసిస్‌కు మందు కనిపెడితే, అది ఇంకెక్కడో పేటెంట్‌ సాధించింది. ఇదంతా మన ఐడియాల లోపం కాదు. వ్యవస్థలో లోపమే' అని ఆవేదన వ్యక్తంచేస్తారు కాలమిస్టు, గ్లోబల్‌ రిసెర్చ్‌ అలయెున్స్‌ అధ్యక్షుడు మషేల్కర్‌ ఓ వ్యాసంలో.

క్యాంపస్‌లోనూ...
ఐడియా తాజాగా ఉండాలి. నలుగురికీ పనికొస్తుందనిపించాలి. పర్యావరణాన్ని కాపాడాలి. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేదైతే ఇంకా సంతోషం. నిధులిప్పించి ఆదుకోడానికీ మార్గదర్శకుల్ని పరిచయం చేసి పుణ్యంకట్టుకోడానికీ ఐఐఎమ్‌లూ ఐఐటీలూ సిద్ధంగా ఉన్నాయి. ఆ పని చేసిపెట్టడానికి ప్రత్యేకంగా అనుబంధ సంస్థల్ని స్థాపిస్తున్నారు. ఐఐటీ అహ్మదాబాద్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఇన్నొవేషన్‌, ఇన్‌ిక్యుబేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌... ఐడియా బ్యాంకులా పనిచేస్తోంది. కొత్త ఆలోచనలకు ప్రాణంపోయగల సృజనాత్మకజీవుల కోసం 'అన్వేష' పేరుతో ఐడియాల వేట సాగిస్తోంది. ఐఐఎమ్‌ కోల్‌కతా ఐ2ఐ (ఐడియాస్‌ టు ఇంప్లిమెంటేషన్‌) పేరుతో బిజినెస్‌ ప్లాన్‌ పోటీలు నిర్వహిస్తోంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌ ఇంకాస్త ముందుకెళ్లి దమ్మున్న ఐడియాలకు పదిహేను నుంచి యాభై లక్షల దాకా... ఆర్థికసాయం అందిస్తోంది. ఐఐటీ ముంబయి 'యురేకా' బిజినెస్‌ ప్లాన్‌ పోటీల్లో గెలిచామా, బూరెల బుట్టలో పడ్డట్టే. దాదాపు అరకోటి రూపాయలు అక్కడికక్కడే ఇచ్చేస్తారు. వెంచర్‌ క్యాపిటలిస్టులు వెతుక్కుంటూ వస్తారు. గత ఏడాది నుంచి విదేశీ విద్యార్థులు కూడా కొత్త ఆలోచనలతో వరుసలు కడుతున్నారు. పోటీలు అంతర్జాతీయం అవుతున్నాయి. 'వీడియోగేమ్‌లో కాస్త వ్యాయామాన్నీ జోడిస్తే ఎలా ఉంటుంది' అన్న ఐడియాకు గత ఏడాది 'యురేకా' పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది. ఇప్పటిదాకా వీడియో గేమ్స్‌లో భౌతిక శ్రమకు అవకాశమే లేదు. దీనివల్ల ముఖ్యంగా పిల్లల్లో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. ఐఐటీలూ ఐఐఎమ్‌లే కాదు... దేశంలోని ప్రతి క్యాంపస్‌ ఓ ఆలోచనా నిధిగా రూపొందుతోంది. 'బిజినెస్‌ ప్లాన్‌ పోటీల్లో విద్యార్థుల ఆలోచనలు తెలుసుకోడానికి కార్పొరేట్‌ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి' అంటారు ఇండియన్‌ి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ హైదరాబాద్‌ శాఖ అసోసియేట్‌ డీన్‌ చైతన్య.

'సామాన్య' ఐడియాలు
చిన్నదో పెద్దదో, సంక్లిష్టమైందో సరళమైందో, ఇరానీ కేఫ్‌లో కూర్చుని వరుసబెట్టి ఛాయ్‌ కప్పులు ఖాళీచేస్తున్నప్పుడు బలవంతంగా బుర్రలోంచి బయటికొచ్చిందో బాత్‌రూమ్‌లో 'బహారోఁ పూల్‌బర్సావో...' పాడుకుంటూ స్నానం చేస్తుంటే 'మేరా మెహబూబ్‌ ఆయాహై...' అన్నట్టు హఠాత్తుగా మెరిసిందో... ఎలాంటిదైతేనేం, ఓ ఐడియా జీవితాల్నే మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా అని వాళ్లేం ఐన్‌స్టీన్‌లూ మేడమ్‌ క్యూరీలూ కాదు. ఇంజినీరింగ్‌ చదువుకోలేదు. జీవితమే విశ్వవిద్యాలయం. అనుభవాలే పాఠాలు. కర్ణాటకకు చెందిన రాఘవగౌడ విద్యావంతుడేం కాదు. కానీ సాంకేతిక విషయాలంటే ఆసక్తి. పాడీపంటా పుష్కలంగా ఉన్నాయి. సమస్యంతా పాలుపితకడం దగ్గర వచ్చేది. పనిచేయడానికి కూలీల సమస్య. మెషీన్‌తో పితుకుదామంటే, పశువులు సహకరించవు. అందుకే పాడి ఆవుకు అచ్చంగా దూడ కుడుస్తున్నట్టే అనిపించే యంత్రమేదైనా ఉంటే బావుండు అనిపించింది. వెంటనే రంగంలో దిగాడు. ఐడియాకు రూపం ఇచ్చాడు. అదే రాష్ట్రానికి చెందిన అన్నా సాహెబ్‌ శిల్పి. బౌద్ధశిల్పాలకు మరమ్మతులు చేయడానికి జపాన్‌ వెళ్లాడు. అక్కడ, చుట్టూ గుండ్రంగా తిరుగుతూ నీళ్లు చిమ్మే ఓ పరికరాన్ని చూశాడు. 'ఇలాంటి యంత్రమే నా దగ్గరుంటే, చెరుకు పంటకు బోలెడంత ఉపయోగం!' అనుకున్నాడు. అంతే, సొంతూరికి రాగానే... అచ్చంగా అలాంటి యంత్రాన్ని తయారు చేశాడు. గుజరాత్‌ రైతు గణేష్‌భాయ్‌ని కూడా కూలీల సమస్యే వేధించేది. చివరికి చిడపీడలొచ్చినా పిచికారీ చేయడానికి మనుషులు దొరకని పరిస్థితి. అప్పుడే... వోటార్‌ సైకిల్‌ విడుదల చేసే శక్తితో పనిచేసే పిచికారీ యంత్రాన్ని డిజైన్‌ చేశాడు. నాన్‌జీ భాయ్‌ అయితే ఏకంగా చౌకరకం ట్రాక్టరునే తయారుచేశాడు. ఇలాంటి సామాన్య శాస్త్రవేత్తలు దేశమంతా ఉన్నారు. వాళ్లకు ఇంజినీరింగ్‌ తెలియదు. టెక్నాలజీ తెలియదు. డిజైనింగ్‌ తెలియదు. తెలిసిందల్లా ఒకటే... ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా బుర్రలో మెరిసిన ఐడియాకు ఓ రూపం ఇవ్వడం.

ఇంకా ఇంకా...
మన దగ్గర ఐడియాలకు కొదవలేదు. వాటికి ప్రాణంపోయాలని తపిస్తున్న యువతీయువకులకూ కొదవలేదు. ఒక్క 'బిజినెస్‌ టైమ్స్‌ - పవర్‌ ఆఫ్‌ ఐడియాస్‌' పోటీలకే దాదాపు పన్నెండువేల దరఖాస్తులొచ్చాయి. 'టాటా స్టార్టప్‌' పోటీలకెళ్లిన సృజనాత్మక వ్యాపారవేత్తల సంఖ్యా వేలలోనే ఉంది. దేశంలోని క్యాంపస్‌లన్నీ లెక్కలోకి తీసుకుంటే... బిజినెస్‌ ప్లాన్‌ పోటీలు, ప్రాజెక్టు రిపోర్టులు... ఏదో ఒక రూపంలో ఏటా కనీసం ఆరు లక్షల కొత్త ఐడియాలు పుట్టుకొస్తున్నాయని అంచనా. ఇంకాస్త ప్రోత్సహిస్తే, ఇంకొన్ని నిధులు సమకూరిస్తే, ఆ ఐడియాలన్నీ ప్రాణంపోసుకుంటే, ఆ లక్ష్యాలన్నీ నెరవేరితే...
ఐడియా...
భారతదేశాన్నే మార్చేస్తుంది!
భలే ఐడియా
మీ ఐడియాలో దమ్ముందా, మార్కెట్‌ను ఊపేసే సరుకుందా? అయితే, మీలాంటి వారి కోసమే కార్పొరేట్‌ దిగ్గజాలు ఎదురుచూస్తున్నాయి. భారత ప్రభుత్వ సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. వెళ్లండి. మాట్లాడండి. ఒప్పించండి. పెట్టుబడి పెట్టించండి. విజయాలు సాధించండి.

ఇదిగిదిగో ఇక్రిశాట్‌!

మన తాతలూ ముత్తాతలూ వ్యవసాయాన్ని వ్యవసాయంగానే చూశారు. దాన్లోని వ్యాపార కోణం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తరం మారింది. ఆలోచనలు మారుతున్నాయి. 'అగ్రి బిజినెస్‌' గొప్ప వ్యాపార అవకాశమైంది. కొత్త ప్రయోగాలకూ కొత్త ఆలోచనలకూ వేదికైంది. వాణిజ్య వ్యవసాయంలో కొత్త ఐడియాలున్నవారికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్రిశాట్‌ హైదరాబాద్‌లో శిబిరాలు నిర్వహిస్తోంది. పదిహేను లక్షల వరకూ నిధులు అందిస్తోంది (ఫోన్‌: 9290837666).

'ఎకనమిక్‌ టైమ్స్‌' బాసట

మీ దగ్గర 'ఐడియా' ఉందా? అయితే, మిమ్మల్నో వ్యాపారవేత్తగా మలిచే బాధ్యత మాది... అని భుజంతట్టి భరోసా ఇస్తోంది ఎకనమిక్‌ టైమ్స్‌. కొత్త ఆలోచనలకు గండపెండేరం తొడగడానికి ఆ పత్రిక ఏటా 'ద పవర్‌ ఆఫ్‌ ఐడియాస్‌' పోటీలు నిర్వహిస్తోంది (వ్వ్వ్.ఇదేస్.ఎచొనొమిచ్తిమెస్.చొం). మేలుమేలు దిగ్గజాలంతా మీ ముందు కూర్చుంటారు. మీ ఐడియాలు వింటారు. లాభసాటిగా ఉంటే లక్షణంగా నిధులు సమకూరుస్తారు. మీరు గృహిణి కావచ్చు. విద్యార్థి కావచ్చు. ఉద్యోగి కావచ్చు. ఎవరైతేనేం. ఐడియా ఉందా, లేదా?

మీకోసమే... నాబార్డ్‌

అసలైన భారతదేశం పల్లెల్లోనే ఉంది. అసలైన సమస్యలన్నీ పల్లెల్లోనే ఉన్నాయి. వాటిని పరిష్కరించండి. పల్లెలకు అండగా నిలబడండి. అదెలా అన్నదీ మీరే నిర్ణయించుకోండి. పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం... వందల కొద్దీ సమస్యల్లో ఒక్కటి పరిష్కరించడానికి సరిపడా 'ఐడియా' ఉన్నా చాలు. వ్యవసాయం, వ్యవసాయేతర రంగం, సూక్ష్మ రుణాలు... మార్గం ఏదైనా కావచ్చు. వెంటనే, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రతినిధుల్ని సంప్రదించండి. ముప్ఫై లక్షలదాకా ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు (ఫోన్‌: 9490746068).

టాటాల భరోసా

'టాటా నెన్‌ హాటెస్ట్‌ స్టార్టప్స్‌' నినాదమే... 'డేర్‌ టు ట్రై'. కొత్తగా ఆలోచించడం ఒక ఎత్తు. దానికో రూపం ఇవ్వడం ఇంకో ఎత్తు. అదో సవాలు. ప్రయత్నించాలంటే దమ్ముండాలి, దన్నుండాలి. ఈ దశలోనే టాటాలు అండగా నిలబడతారు. మీ వ్యాపార ఆలోచనల్ని నిపుణులతో బేరీజు వేయిస్తారు. అవసరమైన సూచనలిస్తారు. వేలమంది ఔత్సాహికులు పాల్గొనే ఈ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బోలెడంత ప్రచారం. సీడ్‌ఫండ్‌ డాట్‌కామ్‌ లాంటి వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు నిధులు సమకూరుస్తాయి. కానీ పోటీలో పాల్గొనాలంటే ఒక షరతు. 'ఐడియా' మాత్రమే ఉంటే సరిపోదు. దానికో రూపం ఇచ్చే ప్రయత్నం వెుదలుపెట్టి ఉండాలి. ఆ ఆలోచనతో ఇప్పటికే ఓ కంపెనీని రిజిస్టరు చేసి ఉండాలి (వివరాలకువ్వ్వ్.హొత్తెస్త్స్తర్తుప్.ఇన్).

సామాన్య శాస్త్రం

ఓ రంగయ్య తాతముత్తాతల కాలం నుంచి వాడుతున్న నాగలికి ఏవో మార్పులు చేసి, ఎద్దులకు బరువులేకుండా చేస్తాడు. ఓ రామయ్య ఊరవతల చెరువులో చేపల్ని పట్టడానికి కొత్త వల తయారు చేస్తాడు. ఓ సీతమ్మ పోషకవిలువలకు నెలవైన ఓ కమ్మని వంట వండుతుంది. ఆ ఐడియా వాళ్లకెలా వచ్చిందో ఎవరు అడుగుతారు? ఎవరు గుర్తిస్తారు? ఎవరు ప్రశంసిస్తారు? ఎవరు పేటెంటు ఇప్పిస్తారు? నేషనల్‌ ఇన్నొవేషన్‌ ఫౌండేషన్‌ ఆ బాధ్యత తీసుకుంటుంది. దీని ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్‌లో ఉంది (ఫోన్‌: 079-26732095).

బుల్లి ఐడియా!
గొప్ప ఐడియాలంటే కొరుకుడుపడనంత గందరగోళంగా ఉండాలనేం లేదు. సరళంగా ఉండవచ్చు. తేలిగ్గా ఉండవచ్చు. అలా ఉండాలి కూడా.అమెరికా రష్యాలు పోటీపడి అంతరిక్ష యాత్రలు చేయాలనుకుంటున్న రోజుల్లో ఓ సమస్య వచ్చిపడింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు రాసుకోడానికి ఓ కలమంటూ ఉండాలిగా! కానీ... భూమ్యాకర్షణ శక్తి అసలేమాత్రం లేనిచోట మామూలు పెన్నులు పనిచేయవు. దీంతో అంతరిక్ష కలాలు తయారుచేయడానికి అమెరికా లక్షల డాలర్లు ఖర్చుపెట్టింది. రష్యా అంతరిక్ష యాత్రికులు మాత్రం అదో సమస్యే కాదన్నట్టు వ్యవహరించారు. ఎందుకంటే వాళ్లు పెన్సిల్‌ వాడారు.బుల్లి ఐడియా... భలే ఐడియా!
- కె.జనార్దనరావు
(ఈనాడు, ౦౧:౦౯:౨౦౦౯, ఆదివారం)
____________________________

Labels: ,